చైన్‌స్నాచర్ల ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్ల ముఠా అరెస్ట్

Published Fri, Mar 6 2015 7:28 PM

chain snatcher gang arrested in east godavari distirict

ఏలూరు: నిమిషాల వ్యవధిలో మహిళల మెడల్లో ఆభరణాలు అపహరిస్తున్న చైన్‌స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్‌నగర్‌లో నివాసం ఉండే వల్లూరి కిషోర్‌కుమార్(బన్ను), ప్రత్తిపాటి విజయ్, ఏలూరుకు చెందిన కాకరపర్తి వెంకన్నలు పాత నేరస్థులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరంతా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో గత ఏడాది డిశెంబరు 25వ తేదీన స్థానిక మార్కండేయస్వామి గుడిదగ్గర విజయ్, బన్నులు మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకుపోయారు. వెంటనే దొంగిలించిన బంగారంతో రాజమండ్రి వెళ్తూ మార్గమధ్యలో ఏడు గోరీల సెంటర్‌లో మరో మహిళ మెడలోని గొలుసును కాజేశారు.

ఏలూరులో ఉంటోన్న కాకరపర్తి వెంకన్న ఈ ఏడాది ఫిబ్రవరి 14 న ముత్తమ్మగుడి సెంటర్‌లో ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దరాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులంతా కలిసి స్మశానంలో దొంగతనానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ పోలీసులకు దొరికారు.

Advertisement
Advertisement