● సీఎం వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం
● ఎన్నికల ప్రచారంలో మంత్రి మేరుగు నాగార్జున
నాగులుప్పలపాడు: ఎల్లప్పుడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఎంత వరకు మేలు చేయగులుగుతామా అని తపనపడే నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనకు అందరూ అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున కోరారు. గడపగడపకు మన నాగార్జున కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు, ఒబన్నపాలెం, మాచవరం, రాపర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి ఏదో మంచి చేసిన నాయకుడిగా జగనన్న నిలిచారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనుకబడి ఉన్న ప్రజలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ తాపత్రయపడుతుండటం చూస్తే నిజంగా ఇలాంటి నాయకుడు ప్రజలకు కావాలనిపిస్తుందన్నారు. 2019–24 మధ్య కాలంలో లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించారన్నారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు ఏ ఒక్కరికీ పథకాలుగా అందించకుండా ఏం చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అవన్నీ గమనించి జగన్ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు ఎమ్మెల్యేగా తనను, బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ను వైఎస్సార్ సీసీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ముందుగా నాగులుప్పలపాడులో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. అనంతరం నాగులుప్పలపాడు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, లిడ్ క్యాప్ స్టేట్ డైరెక్టర్ కాకుమాను రాజశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారుబాబు, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ దంపతులు యాదాల అశోక్బాబు, రత్నకుమారి, పార్టీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, తుమ్మల బ్రహ్మానందరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ మారెళ్ల మహాలక్ష్మి, కోటమ్మ, శాలివాహన, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు పేరాల చెన్నకేశవులు, కొలకలూరి విజయ్కుమార్, సర్పంచ్ మందా హెప్సీరాణి, ఇనగంటి సీతారావమ్మ రమణారెడ్డి, డాకా అనసూర్యమ్మ రమణారెడ్డి, మాదాసు రాంబాబు, కొంజేటి సురేష్, ప్రసన్న, వజ్రంబాబు పాల్గొన్నారు.