IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యా వైపు మొగ్గు!? | Gavaskar Explains Reasons Behind Why MI Replaced Hardik Pandya In The Place Of Rohit Sharma As Captain - Sakshi
Sakshi News home page

IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యావైపు మొగ్గు!? గావస్కర్‌ చెప్పిందిదే..

Published Mon, Dec 18 2023 5:46 PM

Gavaskar Explains Reasons That Prompted MI To Replace Captain Rohit - Sakshi

IPL 2024- Mumbai indians- Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పు విషయంలో తప్పొప్పులు ఎంచుతూ రచ్చ చేయాల్సిన పనిలేదని టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా రోహిత్‌ శర్మ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్న గావస్కర్‌.. బహుశా అందుకే ముంబై హార్దిక్‌ పాండ్యా వైపు చూసి ఉంటుందని పేర్కొన్నాడు.

ఇటు ఐపీఎల్‌, అటు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మపై పనిభారం ఎక్కువైన క్రమంలో ముంబై అతడిని తప్పించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు భారీ మొత్తానికి ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కెప్టెన్‌గా తమకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్‌ శర్మను తప్పించి.. పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, కెప్టెన్‌ మార్పు విషయంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ ఫైర్‌ అవుతున్నారు. పాండ్యా నియామకానికి సంబంధించి ముంబై ప్రకటన చేయగానే.. ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ.. సోషల్‌ మీడియాలో ఆగ్రహం వెళ్లగక్కారు.

ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఈ అంశం గురించి సునిల్‌ గావస్కర్‌ స్పందించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ తప్పు ఒప్పులు ఎంచాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసమే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

గత రెండేళ్లుగా రోహిత్‌ శర్మ బ్యాటర్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. 2021, 2022లో ముంబై ఇండియన్స్‌ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఈసారి మాత్రం ప్లే ఆఫ్స్‌ చేరగలిగింది.

అయితే, రోహిత్‌ మాత్రం పూర్తిస్థాయిలో తన సేవలు అందించలేదు. టీమిండియా కెప్టెన్‌గా, ఫ్రాంఛైజీ జట్టు సారథిగా వరుస మ్యాచ్‌లు ఆడినందు వల్ల బహుశా అతడు అలసిపోయి ఉంటాడు. 

అందుకే ముంబై అతడికి విశ్రాంతినివ్వాలని భావించి ఉంటుంది. మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా రూపంలో వాళ్లకు యువ కెప్టెన్‌ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే అతడు గుజరాత్‌ టైటాన్స్‌ను రెండుసార్లు ఫైనల్‌కు తీసుకువెళ్లి.. ఓసారి టైటిల్‌ కూడా అందించాడు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది’’ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్‌ వేసేశాడు! పాపం రుతురాజ్‌.. వీడియో వైరల్‌

Advertisement
Advertisement