విరాట్‌ కోహ్లి షాకింగ్‌ నిర్ణయం?! | Are Virat Kohli-Anushka Sharma Leaving Mumbai Forever, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Virat Kohli-Anushka Sharma: విరాట్‌ కోహ్లి షాకింగ్‌ నిర్ణయం?!

Published Tue, Mar 19 2024 11:38 AM | Last Updated on Tue, Mar 19 2024 12:51 PM

Are Virat Kohli Anushka Sharma leaving Mumbai Forever Rumours Goes Viral - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్‌ను వీడనున్నారా? ముంబైకి గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ కింగ్‌డంలో సెటిల్‌ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్‌ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది.

భారత క్రికెట్‌ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్‌ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్‌ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు.

నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్‌మెషీన్‌ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్‌ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్‌ను రివీల్‌ చేయలేదు విరుష్క.

ఇక ఇటీవలే లండన్‌లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్‌ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్‌ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు.

ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్‌ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్‌లో.. ‘‘విరాట్‌ ఐపీఎల్‌ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్‌కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్‌ అవుతారనిపిస్తోంది. 

అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు.

నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది.

ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్‌ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్‌కు వెళ్లివస్తారే తప్ప విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్‌-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement