మరోసారి చంద్రబాబు మొండిచేయి.. రగిలిపోతున్న సీనియర్లు | Sakshi
Sakshi News home page

మరోసారి చంద్రబాబు మొండిచేయి.. రగిలిపోతున్న సీనియర్లు

Published Thu, Mar 14 2024 3:09 PM

Tdp Senior Leaders Angry On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: మరోసారి సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపారు. రెండో లిస్ట్‌లో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చంద్రబాబు వైఖరితో సీనియర్లు రగిలిపోతున్నారు. రెండో జాబితాలోనూ కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. ఎచ్చెర్ల సీటు కళా వెంకట్రావు, చీపురుపల్లి సీటు కిమిడి నాగార్జున కోరుతున్నారు. మరోవైపు, నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డికి షాక్‌ తగిలింది. వేమిరెడ్డి భార్యకు చంద్రబాబు సీటు ఇచ్చేశారు. రూ.కోట్లు పెడతామని చెప్పడంతో పార్టీ నేతలకు బాబు హ్యాండ్‌ ఇచ్చారు. నెల్లూరులో సోమిరెడ్డికి కూడా చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. రెండో జాబితాలోనూ సోమిరెడ్డికి చోటు దక్కలేదు.

చంద్రబాబు తీరుపై ఉమ్మడి విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్లు కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గంటాకు భీమిలి సీటు కుదరదంటున్న చంద్రబాబు.. బండారు సత్యనారాయణకు కూడా పెందుర్తి సీటు నిరాకరించారు. చంద్రబాబు తీరుపై అయ్యన్నపాత్రుడు అలకబూనారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం
విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గండి బాబ్జి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానం జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్.. కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసేందుకు కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన...
చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టిక్కెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ.. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలుకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించడంతో గత 30 ఏళ్లుగా వడ్డెరలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘గంటా’ రహస్య భేటీ
రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా.. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

మూకుమ్మడి రాజీనామాలు..
కృష్ణాజిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై  బోడే అనుచరులు,కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు,లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ,చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తామంటూ మండిపడ్డారు.

Advertisement
Advertisement