సాక్షి,విజయనగరం: వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారయణపై పోటీకి తెలుగుదేశం సీనియర్ నేతలు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ అనగానే తమ్ముళ్లు జారుకుంటున్నారు. మమ్మల్ని విడిచిపెట్టండి.. మా దారి మేము చూసుకుంటాం అని పార్టీ అధినేత చంద్రబాబుకు నేతలు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చీపురుపల్లి నుంచి పోటీచేయాలని అధిష్టానం ఇచ్చిన ఆఫర్ను విశాఖపట్నంనకు చెందిన కీలక నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రిజెక్ట్ చేశారు. ఇక చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని విజయనగరానికే చెందిన పార్టీ ముఖ్య నేత, గతంలో మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావును కోరగా ఆయన కూడా ముఖం చాటేసినట్లు సమాచారం.
ఉత్తరాంధ్రలో పట్టున్న బడా నేతలే బొత్సపై పోటీ అనగానే సారీ చెబుతుండడంతో ఏం చేయాలో తోచక టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. చేసేది ఏమీ లేక మీసాల గీత పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బొత్సపై పోటీ చేసి పార్టీ పరువును కాపాడాలని మీసాల గీతని చంద్రబాబు బతిమిలాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి టీడీపీ తరపున పోటీలో ఎవరుంటారన్నదానిపై ఆసక్తిగా మారింది.
ఇదీ చదవండి.. ఏపీ బీజేపీ ఒంటరి పోరు.. పోటీకి భారీగా దరఖాస్తులు