‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ | Sakshi
Sakshi News home page

‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’

Published Sun, Mar 24 2024 2:24 PM

Supriya Sule says Leaders Going To BJP Because Of Income Tax CBI ED - Sakshi

ముంబై: బీజేపీలోకి చేరేవాళ్లంతా.. ఆ పార్టీ మీద ప్రేమతో చేరటం లేదని ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) పార్టీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, సీబీఐ, ఈడీ కారణంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. బారామతి నియోజకర్గంలో తనపై పోటీగా ఎవరు నిలబడతారనే విషయం ఇంకా తెలియదన్నారు. అధికారికంగా ప్రకటన వెలువడలేదని చెప్పారు. 

‘దేశంలో ప్రజాస్వాయ్యం హత్యకు గురువుతోంది. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, సీబీఐ, ఈడీ వల్ల చేరుతున్నారు. బీజేపీ ఆశోక్‌ చవాన్‌పై ఒత్తిడి తెచ్చి.. పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ.. పార్టీలను ఎలా ముక్కలు చేస్తోందో తెలుస్తోంది. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ అని సుప్రీయా సూలే మండిపడ్డారు.

ఇక గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలు ఉ‍న్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇక.. ఎన్సీపీని చీల్చిన అజిత్‌ పవార్‌.. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కీలకమైన బారామతి లోక్‌సభ స్థానంలో పవార్‌ వర్సెస్‌ పవార్‌గా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ సతీమణి పర్యావరణ కార్యకర్త సునేత్ర పవార్ బారామతి బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బారిమతిలో ఈసారి కూడా తానే విజయం సాధిస్తానని సుప్రీయా సూలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బారామతి నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన పనులు అందరికీ తెలుసు. నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు’ అని సుప్రీయా సూలే స్పష్టం చేశారు. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2009 నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. బారామతి పార్లమెంట్‌ స్థానం ఎన్సీపీ (శరత్‌ చంద్ర పవార్‌) చీఫ్‌ శరత్‌ పవార్‌ కుటుంబానికి కంచుకోట.

Advertisement
Advertisement