ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్ | Rahul Gandhi Dials Nitish Kumar After Sulk Over Kharge For PM Call, See Details Inside - Sakshi
Sakshi News home page

ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్

Published Fri, Dec 22 2023 12:50 PM

Rahul Gandhi Dials Nitish Kumar After Sulk Over Kharge For PM Call  - Sakshi

ఢిల్లీ: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్‌ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని పీఎంగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు. 

ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్, నితీష్ కుమార్ చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే క్రమంలో బిహార్‌ కేబినెట్‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ హామీ ఇచ్చారు. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. 

ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0(తూర్పు-పశ్చిమం) చేయాలని ఈ సమావేశంలోనే నేతలు కోరారు. ఈ భేటీలో పాల్గొన్న 76 మంది నేతలు దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై చర్చించారు.    

ఇదీ చదవండి:  ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు

Advertisement
Advertisement