వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో? | Sakshi
Sakshi News home page

వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?

Published Sat, Mar 9 2024 11:51 AM

Ajit Pawar Wife Sunetra Pawar To Contest From Baramati - Sakshi

త‍్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో

ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్‌ పవర్‌..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్‌ ఎన్సీపీ అధినేత శరద్‌పవర్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 

మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్‌ వర్గం)ల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్‌ పవర్‌ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు.  

2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్‌సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్‌ పవర్‌ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్‌ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్‌.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! 

బాబాయితో మనస్పర్థలు ఎందుకు? 
అజిత్ పవార్‌ తండ్రి అనంతరావు పవార్​. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్​ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్‌ శరద్‌ పవార్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్‌ పవర్‌ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్‌ పవర్‌ రాజకీయం మొత్తం మారిపోయింది.

అంతా తానై 
శరద్‌ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్‌ పవార్​ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్‌ రాజకీయ వారసుడు అజిత్‌ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది.

బాబాయ్‌పై తిరుగుబాటు
అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై అజిత్‌ పవార్‌ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్‌ పవర్‌

Advertisement
Advertisement