‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్‌ భరోసా! | Sakshi
Sakshi News home page

Shivraj Singh Chouhan: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్‌ భరోసా!

Published Sat, Dec 16 2023 8:32 AM

Shivraj Singh Chouhan Told his Emotional Women Supporters - Sakshi

శివరాజ్ సింగ్ చౌహాన్..  మహిళల నుంచి ఎనలేని ఆదరణ పొందిన మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి. ఆయన సీఎం పదవికి దూరమైనా.. అభిమానుల నుంచి ఆయనకు దక్కుతున్న ప్రేమ, అభిమానంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు శివరాజ్‌ను ప్రేమగా అన్న, మామ అని పిలుచుకుంటారు. 

శివరాజ్ సింగ్ చౌహాన్‌తో అతని అభిమానులు, మద్దతుదారుల అనుబంధం విడదీయరానిది. ఇటీవల ఆయన విదిశలో తన మద్దతుదారులను, అభిమానులకు కలిసేందుకు వచ్చినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. వీరిలో మహిళలు అధికంగా ఉండటం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేయడం విశేషం. 

శివరాజ్ సింగ్ చౌహాన్ తన హయాంలో మహిళల కోసం పలు ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టారు. ఇవే అతనిని మహిళల ఆదరణకు పాత్రుడిని చేశాయి. ఆయన విదిశకు వచ్చినప్పుడు మద్దతుదారులు, అభిమానులు కురిపించిన ప్రేమను చూసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన దగ్గరకు వచ్చి, రోదిస్తున్న మహిళలతో శివరాజ్‌ సింగ్‌..‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మధ్యప్రదేశ్‌లో మీ మధ్యనే ఉంటున్నానని’ వారికి భరోసా ఇచ్చారు. 

దాదాపు రెండు దశాబ్దాల పాటు శివరాజ్‌సింగ్‌ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రజల ఆదరణ అందుకున్నారు. అయితే  డిసెంబర్ 11న నూతన సీఎంగా మోహన్ యాదవ్‌ నియమితులయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ జిల్లాలోని బుద్ని నుంచి లక్షకు పైగా ఓట్ల తేడాతో రికార్డు స్థాయి విజయం సాధించారు. 
ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..

Advertisement
Advertisement