Shiva Rajkumar Gets Emotional About Superstar Rajinikanth. Here Is Why - Sakshi
Sakshi News home page

Shiva Rajkumar: మా తండ్రిని వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసినప్పుడు రజనీకాంత్‌ ఎంతో సాయం చేశాడు

Published Fri, Aug 18 2023 6:09 PM

Shiva Rajkumar Gets Emotional About Superstar Rajinikanth - Sakshi

కన్నడ సూపర్‌ స్టార్స్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, శివ రాజ్‌కుమార్‌లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌ కిడ్నాప్‌ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు.

రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా..
తండ్రి రాజ్‌ కుమార్‌ను కిడ్నాప్‌ చేసిన సమయంలో రజనీకాంత్‌ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్‌కుమార్‌. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్‌ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు.

అసలేం జరిగిందంటే..
2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్‌ గాజనూరు ఫాంహౌస్‌ నుంచి రాజ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్‌రాజ్‌, బంధువు నగేష్‌, అసిస్టెంట్‌ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్‌ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రభుత్వంపై ఒత్తిడి
వీరప్పన్‌.. రాజ్‌కుమార్‌ను టార్గెట్‌ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్‌ కుమార్‌ కిడ్నాప్‌ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్‌తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్‌.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లైఫ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ వీరప్పన్‌ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్‌ 15న రాజ్‌కుమార్‌ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్‌ 18న వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్‌ కామెంట్‌.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్‌

Advertisement
Advertisement