రైల్వేలో ఇంటర్న్‌షిప్‌ చేశా.. జాబ్‌ కాదనుకుని యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి! | Sakshi
Sakshi News home page

రైల్వేలో ఇంటర్న్‌షిప్‌ చేశా.. జాబ్‌ కాదనుకుని యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి!

Published Thu, Apr 25 2024 5:22 PM

Maira Dharti Mehra Did Internship in Indian Railways Before Becoming an Actress

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను.. ఇంజనీర్‌ అవబోయి ఇలా సినిమాల్లో వచ్చి పడ్డాను.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కొందరైతే సినిమాల మీద ప్రేమతో ఉన్న ఉద్యోగాలు వదిలేసి మరీ సినీ ఇండస్ట్రీలో వాలిపోయారు. అలా బుల్లితెర నటి మైరా ధాత్రి మెహ్రా కూడా నటి కాకముందు ఇండియన్‌ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసిందట.

జాబ్‌ ఆఫర్‌ వదిలేశా
ఆమె మాట్లాడుతూ.. 'నాకు చదువంటే ఇష్టం. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక రైల్వేలో ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలీదు కానీ ఎలాగోలా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాను. ఆ సమయంలోనే.. రోజూ ఎనిమిది గంటల డ్యూటీ చేయడం నా వల్ల కాదని తెలుసుకున్నాను. అందుకే జాబ్‌ ఆఫర్‌ వచ్చినా వదిలేసుకున్నాను. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. ఇందుకోసం అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్టూడియోలో నెలపాటు శిక్షణ తీసుకున్నాను.

కాలేజీకి వెళ్తూనే..
పార్ట్‌ టైం కోర్సు కూడా పూర్తి చేశాను. ఓపక్క ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కోచింగ్‌ తీసుకుంటూ ఆ తర్వాత కాలేజీకి వెళ్లేదాన్ని. ఇందుకోసం ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పలేదు. అనుపమ్‌ సర్‌ అప్పట్లో కాస్టింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో కుంకుమ భాగ్య సీరియల్‌కు నా పేరు సూచించాడు. అలా ఫస్ట్‌ టైమ్‌ ఆ సీరియల్‌లో నటించాను.

అప్పుడలా.. తర్వాతిలా..
నిజానికి రైల్వే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూసేదాన్ని. యాక్టింగ్‌ ఇండస్ట్రీలో వరుసగా 12 నుంచి 13 గంటల దాకా పని చేస్తాం. కానీ ఎన్నడూ బోర్‌గా ఫీలవలేదు, టైం ఎప్పుడు అయిపోతుందా? అని గడియారం వంక చూసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'కుంకుమ భాగ్య'తో పాటు 'సాసురాల్‌ జెండా ఫూల్‌ 2', 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' వంటి సీరియల్స్‌లో మెరిసిన మైరా ధాత్రి చివరగా 'దాల్చిని' సీరియల్‌లో నటించింది.

Advertisement
Advertisement