‘భారత్‌ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

‘భారత్‌ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్‌ షాక్‌

Published Wed, Apr 10 2024 1:20 PM

Canada Inquiry says No India Interference 2021 Polls Won By Trudeau - Sakshi

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. తమ దేశ ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేయటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  కెనడా ఎ‍న్నికల్లో భారత్‌  జోక్యం చేసుకుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ సీనియర్‌ అధికారులతో కూడిన విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విచారణ కమిషన్‌ కీలక విషయాలు వెల్లడించింది.  కెనడా ఎన్నికల్లో భారత్‌ అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. 

‘2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలు మా దృష్టికి రాలేదు’ అని ఎ‍న్నికల అధికారి దర్యాప్తు కమిషన్‌కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్‌ ఎజెన్సీ కనుకున్నట్లు విచారణ కమిషన్‌ వెల్లడించింది.

ఇక.. 2019, 2121 కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సెర్వీసెస్‌(సీఎస్‌ఐఎస్‌) ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై ప్రతిపక్షాలు దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారంపై ప్రధాని జస్టిన్‌ ట్రూడో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రధాని ట్రూడో చేర్చారు. 

కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకుందని దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసినట్ల మీడియా ద్వారా తెలిసింది. ఆ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తుంది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదు’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ ఫిబ్రవరిలో స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం భారత్‌ విధానం కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు.

Advertisement
Advertisement