-
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన వరుస భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హాజరు కానున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సత్తా చాటేలా.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. హడావుడి ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేడర్ను సమాయత్తం చేసేలా సన్నాహక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యాన నేతలు, కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్కు అండగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచిన సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని గెలుపు సాధించింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఒకటి, రెండు సీట్లు మినహా.. కాంగ్రెస్, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి. అదే తరహాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేణుకా చౌదరి.. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెంలో పొత్తుతో సీపీఐ విజయం సాధించడంతో.. లోక్సభ స్థానంలోనూ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావిస్తోంది. సన్నద్ధం! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలను రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయనతో పాటు మంత్రులు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న తీరు.. మిగతా హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే అంశాలపై ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను కేడర్కు అవగాహన కల్పిస్తారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా బలాబలాలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేకం.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలోనే బలీయమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలతో మరింత పట్టు సాధించినట్లయింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరగా పార్టీకి సంస్థాగతంగా ఉన్న పట్టుకు వారి బలం కూడా తోడు కావడంతో తిరుగులేని విజయాన్ని కై వసం చేసుకుంది. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క ప్రభావం చూపించడంతో కాంగ్రెస్కు తిరుగులేకుండా పోయింది. ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ముగ్గురు మంత్రులపై పడింది. ఇవి చదవండి: అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. -
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యాంటీలు అమలు అవుతాయి: మంత్రి ఉత్తమ్
నల్లగొండ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగనున్న ప్రజాపాలన కార్యక్రమ సన్నాహకాల్లో భాగంగా నల్లగొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో మంగళవారం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. దరఖాస్తులు నింపేందుకు.. స్వీకరణకు హెల్ప్ డెస్క్లు, ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే బృందాల సంఖ్య పెంచాలన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడతామన్నారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారంటీల అమలు అవుతాయని చెప్పారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో జిల్లాకు అన్యాయం జరిగిందని పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందలేదన్నారు. ఈ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుందన్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కఠినంగా శిక్షిస్తామన్నారు. రేషన్ సరఫరాను ప్రక్షాళన చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలను పేదలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ప్రజాపాలన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యం, కుర్చీలు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్పాటిల్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో 151 బృందాలను ఏర్పాటు చేశామని, సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సీహెచ్.ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో 58 టీమ్లు ఏర్పాటు చేసామని, దరఖాస్తుల స్వీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జెండగే మాట్లాడుతూ జిల్లాలో పక్కా ఏర్పాట్లతో ప్రజా పాలన విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని, మొత్తం 51 టీమ్లతో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, మందుల సామేల్, నలమాద పద్మావతి, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, యాదాద్రి డీసీపీ రాజేష్చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, భాస్కర్రావు, వెంకట్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తుమ్మల.. 30 లేఖల సంగతి మర్చిపోతే ఎలా?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొద్ది రోజుల క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఖమ్మంలో తన గెలుపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కూడా మలుపు అవుతుందని ఆయన అంటున్నారు. ఖమ్మం సరిహద్దు గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన టీడీపీ అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కూడా ఆయన టీడీపీ ఖమ్మం ఆఫీస్కు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి తన రాజకీయ ప్రస్తానం గురించి మాట్లాడారు. తనకు ఎన్టీ రామారావే మంత్రి పదవి ఇచ్చారని, కేసీఆర్కు కూడా తానే చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇప్పించానని ఆయన అన్నారు. కేసీఆర్ తనకు పదవి ఇచ్చేదేమిటి? అని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తన సేవల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన మెడలో వేసుకున్న పచ్చ కండువాను చూపుతూ, దీనివల్లే తాను పైకి వచ్చానని చెప్పారు. ఈ విషయాలు ఎన్ని చెప్పినా ఫర్వాలేదు. కానీ, ఆయన గెలిస్తే ఏపీ రాజకీయాలపై ఎందుకు ప్రభావం పడుతుంది? అక్కడ ఎందుకు మలుపు వస్తుంది? అన్నదాని గురించి వివరించి ఉంటే బాగుండేది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీచేయకుండా దూరంగా ఉంది. దీంతో, ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కోసమే అలా చేశారని ఆయన రహస్యం చెప్పేశారు. దానిని నిజం చేస్తూ తుమ్మల మరికొందరు ప్రకటనలు చేయడం, టీడీపీ జెండాలు కూడా మెడలో వేసుకుని సభలలో పాల్గొనడం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, చంద్రబాబుకు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీవారు మద్దతు ఇస్తే స్వాగతిస్తామని అన్నారు. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్నిసార్లు పొగుడుతూ తన స్వామి భక్తి చూపుతున్నారు. కోదాడలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఇలా ఆయా చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీడీపీవారు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన ఓపెన్గానే కాంగ్రెస్కు సపోర్టు ఇచ్చి ఉండవచ్చు. గతసారి కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయినా జనం ఆదరించకపోవడంతో ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ను గాలికి వదలివేశారు. 2023 తెలంగాణ ఎన్నికలలో కొత్త స్ట్రాటజీతో ఆయన ఎన్నికలలో పోటీచేయకుండా కాంగ్రెస్కు పరోక్షంగా సహకరిస్తున్నారు. నేరుగా కాంగ్రెస్కు అండగా ఉన్నానని చెబితే బీజేపీ ఎక్కడ కన్నెర్ర చేస్తుందో అన్న భయం కావచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ చక్రం తిప్పి, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆయన ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడో, లేక వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నట్లు ఆయన దత్తపుత్రుడో కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే అటు బీజేపీతో కూడా రాయబారం జరపడానికి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ విన్యాసాలు ఎన్ని చేసినా ఆయన ఇష్టం. కానీ, తుమ్మల చేసిన ప్రకటనను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక, ఏపీలో టీడీపీకి ఉపయోగపడతామని చెబుతున్నట్లు అనుకోవాలా?. రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టీడీపీలో ఓటమి చెంది రాజకీయంగా వెనుకబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అభ్యర్ధిని చేసి గెలిపించారు. కానీ, సాధారణ ఎన్నికలలో తుమ్మల ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన హవా తగ్గింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. పదవులపై ఆసక్తి లేదంటూనే ఆయన తనను ఆదరించిన టీఆర్ఎస్ను కాదని ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ఒకటి తప్ప అన్ని స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది. దానిని కూడా దృష్టిలో ఉంచుకునే తుమ్మల కాంగ్రెస్లోకి జంప్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసినప్పుడు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించిన వీడియో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణను పచ్చని బంగారు రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని అని గంభీరంగా ప్రసంగించారు. ఇప్పుడు అదే తుమ్మల.. కేసీఆర్ పాలన అంత దరిద్రపు పాలన చూడలేదని అంటున్నారు. అంతేకాదు.. 2018లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీల కూటమిని మాయ కూటమిగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రత్యేకించి ఖమ్మం అభివృద్దిని అడ్డుకుంటున్న పార్టీగా తెలుగుదేశంను, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడును విమర్శిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలను అన్యాయంగా లాక్కున్న పార్టీ టీడీపీ అని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆ రోజున ఆరోపించారు. ఈ రోజేమో టీడీపీ వల్లే తాను అది సాధించాను.. ఇది సాధించాను అంటూ స్పీచ్ ఇస్తున్నారు. అదేదో చెప్పుకుంటే సరే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా తన గెలుపు ఏపీ రాజకీయాలకు మలుపు అవుతుందని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం?. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తామంతా కలిసి ఇబ్బంది పెడతామని చెబుతున్నారా?. గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను పదవీచర్యుతుడిని చేసి చంద్రబాబుతో కలిసి అందలం ఎక్కిన అనుభవాన్ని గుర్తు చేసుకుని అలా ఏపీలో మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారా?. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో తెలియక ముందే తుమ్మల వంటి సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా విశ్లేషించాలి?. కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ, భవిష్యత్తు ఏపీ ఎన్నికల్లో ఆయనకు సహకరించాలని, అక్కడి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాగానే, బాధ్యతలు కొన్ని అప్పగించి చివరికి ఆయన తన కొంప తానే ముంచుకున్నారు. కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ అంటేనే తుమ్మలకు పడేది కాదు. వారితో ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ పోరాటాలు చేశారు. చివరికి తానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన తన సొంత రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ, ఇతర రాష్ట్రాల రాజకీయాలలో కూడా వేలుపెడతామని చెబితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిన సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్కు నష్టం జరుగుతుందో, లాభం జరుగుతుందో కానీ.. ఇప్పటికైతే తుమ్మల చేసిన ప్రకటన ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్రమత్తం అవ్వవలసిన అవసరం తెలియచేసింది. ఎన్టీ రామారావు మాదిరి సీఎం వైఎస్ జగన్ అమాయకపు రాజకీయ నేత కాదు. ఆయన ఇప్పటికే అనేక డక్కా, మక్కీలు తిన్న నేత. చంద్రబాబు వేసిన అనేక కుట్రలను చేధించిన నాయకుడు. తిరుగులేని ఆధిక్యంతో 151 సీట్లను గెలిచి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన శూరుడు. చంద్రబాబో, తుమ్మలో, మరొకరో వేసే ఎత్తుగడలను సీఎం జగన్ తేలికగానే తిప్పికొట్టగలరని వేరే చెప్పనవసరం లేదు. - కొమ్మినేని శ్రీనివాసరావు -
హాట్ సీట్.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్!
వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి. అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్కుమార్ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement