-
పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో!
అహములు సన్నములయ్యె దహనము హితమయ్యే దీర్ఘదశలయ్యె నిశల్, బహు శీతోపేతంబై ‘యుహు హుహు’ అని వడకె లోకముర్వీనాథా! పద్యానవనం మల్టీ మీడియా లేని రోజుల్లోనూ భావ వ్యక్తీకరణకు భాషను అద్భుత సాధనంగా వాడుకున్నారు ఒకప్పటి కవులు. అది కూడా, చంధోబద్దమైన పద్య రూపంలో అరమరికలు లేకుండా అటువంటి వ్యక్తీకరణ జరపడం విశేషం. తెలుగు భాషపై వారి సాధికారతకదొక చిహ్నం. భాషను ఉపకరణంగా వాడిని కవులంతా అంతటి ప్రతిభావంతులని చెప్పలేమేమో కాని, కొందరు మాత్రం భాషతో ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. చంధస్సు, వ్యాకరణ నియమాలేవీ వారి వ్యక్తీకరణకు ప్రతిబంధకాలు కాలేదు. ఒక సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో దిట్ట బమ్మెర పోతన. అది కూడా అలతి అలతి పదాలతో, అతి తక్కువ మాటల్లో ఎంతో భావాన్ని నింపి పద్య విన్యాసం చేయించగలిగారాయన. శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై సాధికారతే కాకుండా భావంపైన పూర్తి నియంత్రణ సాధించిన మహాకవి పోతన. ‘పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా?’ అన్న పద్యం నుంచి మొదలెడితే, శ్రీమద్భాగవతంలో ఆయన చెక్కిన అద్భుత పద్యశిల్పాలెన్నో! అయిదు వందల సంవత్సరాల తర్వాత నేటికి కూడా చెవుల్లో రింగుమనే, కంగుమనిపించే, గిలిగింతలు పెట్టే అత్యద్భుత పద్యరత్నాలకు లెక్కేలేదు. భక్తి, ఆధ్యాత్మిక భావనల్ని ప్రేరేపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా! ఆబాలగోపాలాన్నీ రంజింపజేసిన యశోదకృష్ణం, రుక్మిణీకళ్యాణం, గజేంద్రమోక్షం, భక్తప్రహ్లాదం... ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతమంతా చెప్పాల్సిందే! అతిశయోక్తులు కూడా అతికినట్టు నిజమని భ్రమ కల్పించేంతటి సహజకవి పోతన. పోతన కావ్య సౌందర్య గొప్పదనాన్ని వర్ణిస్తూ డా.సి.నారాయణరెడ్డి ఒక అతిశయోక్తి చెప్పినా ‘నిజమా!’ అన్న భ్రాంతి కలుగుతుందే తప్ప శంకించబుద్ధికాదు. సినారె రాసిన ‘మందారమకరందాలు’ విమర్శ వ్యాసంలో, పోతనకు ఇంగ్లిష్ వచ్చేమో? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. గజేంద్ర మోక్ష ఘట్టంలో, ఎన్నో జన్మలనుంచి పూజిస్తున్న తాను, కష్టకాలమొచ్చి ఎంత మొరపెట్టుకున్నా విష్ణువు రాకపోతే, ‘లా(ఔఅగి)ఒక్కింతయు లేదు...’ అని గజేంద్రుడు విష్ణుమూర్తిని నిలదీశాడని పోతన రాశాడేమో? అన్న చమత్కార అన్వయం చెప్పారు. ఇప్పుడంటే మల్టీమీడియా వచ్చింది. శబ్దం, దృశ్యం కలగలిసి ఏకకాలంలో వినగలిగి, చూడగలిగే అంటే చూపగలిగే మాద్యమాలొచ్చాయి. అప్పుడు లేవు. ఏం చెప్పినా, ఏం చూపించినా, ఏం వినిపించినా.... అన్నీ అక్షరాల్లోనే, ఆ తాటాకులపైనే! చెప్పదలచుకున్న వాడెవడూ వినదలచుకున్న, చదువదలచుకున్న వాడి దగ్గర అన్ని వేళలా ఉండడు, అదొక అసౌకర్యం. ఒకోసారి అది తరాల అంతరాల వ్యవహారం. దాన్ని అధిగమించడానికి పద్యంలోనే వర్ణచిత్రాల్ని శబ్దాలతో సహా ఆవిష్కరించాలి. పోతన అదే చేశాడు. చలి కాలాన్ని ముచ్చటగా చెప్పాడు. పగటి సమయాలు నిడివి తగ్గి పొట్టిగా అయ్యాయట. రాత్రి సమయాలు సుదీర్ఘంగా సాగాయట. మంట కాచుకోవడం జనాలకి చాలా ప్రీతిపాత్రమయిందట. చలి చాలా తీవ్రమైపోయి లోకమంతా వణుకుతోందట. ఎలా వణుకుతోంది? గజగజమని చెప్పటం సహజం. కానీ ఇక్కడ పోతన, ఓ రాజా, లోకమంతా ‘యుహు హుహు’ అని వణుకుతోందని చెబుతాడు. చలికాలం రాగానే, వయసులతో నిమిత్తం లేకుండా దవడలు కదిలిస్తూ, యుహు హుహు అని శబ్దం చేస్తూ వణకని వారుండరేమో? మనం కొంచెం విశ్లేషిస్తే నాటి కవుల గొప్పదనం తేటతెల్లమవుతుంది. లోతుగా పరిశీలిస్తే మన తెలుగు గొప్పతనమది. తెలుగు భాషామతల్లీ! పది కాలాలు వర్ధిల్లు! - దిలీప్రెడ్డి -
తల్లీ ! నీ త్యాగం నేర్పిన పాఠాలు...
పద్యానవనం చీపురు నొక్క చేత, ఒక చేతను చింపిరి గంప బూని, యీ పాపపు గుప్పలూడ్చెదవు బాలిక! చీదర లేదె సుంత? నీ యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్నుగొల్కులన్ తేవకు తేవకున్ బయలు దేఱు నవే నులివెచ్చ బాష్పముల్! అసహ్యమని చీదరించుకోకుండా ఓపిగ్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాకీపిల్ల (స్కావెంజర్)ను సంభోదిస్తూ చెబుతున్నాడు కవి! ‘ఎంత ఓపిక తల్లీ! ఓ చేత చీపురు మరో చేత చిరిగిన గంప/బుట్ట ధరించి ఈ భూమ్మీద సాటి మనుషులు వదిలిన మలినాల చెత్త కుప్పలనూడ్చే పనిలో నిమగ్నమయ్యావు’ అని! తర్వాత్తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనిషి విసర్జించే మాలిన్యాల్ని మనుషులు ఎత్తిపోసే పారిశుధ్యపు పనుల్ని అధికారికంగా నిషేధించాయి. యాంత్రిక నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, భూగర్భమురుగు కాల్వల వ్యవస్థ వంటివి పూర్తిస్థాయిలో తీసుకువచ్చే కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. కానీ, అక్కడక్కడ ఇప్పటికీ ఆ పనిని మనుషులే నిర్వర్తించడం మన వ్యవస్థలో కొనసాగుతున్న దురవస్థ. కడు పేదరికం వల్ల, పొట్టపోసుకునే ఇతర పనులు దొరక్క, వృత్తి ధర్మాన్నే నమ్ముకొని, తరతరాలుగా ఈ పనిలో నిమగ్నమైన వారున్నారు. చీదరించుకోకుండా ఈ మాలిన్యాల్ని తొలగించే పాకీ వృత్తిలో ఉన్నవారి సేవల్ని చూసి, సృష్టికర్తయే చలించిపోతున్నాడనీ, తడవ తడవకు కంటతడి పెడుతున్నాడనీ కవి భావన! కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘ఉదయశ్రీ’లో పాకీపిల్ల శీర్షికన రాసిన ఖండిక లోనిదీ పద్యం. ఈ రోజున ‘స్వచ్ఛ భారత్’ పేరిట స్పృహను రగిల్చే రకరకాల కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఉద్దేశం మంచిదే! పని కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విచారకరం. ఎవరి పనులు వారు చేసుకోవడాన్నే గొప్పకార్యంగా భావించే పరిస్థితులు దాపురించాయి. మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం విశాల సమాజహితంలో జరిపే కార్యక్రమాల విషయంలో ఇంకా ఎంతో పరిణతి సాధించాల్సి ఉంది. ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించడానికి ముందు మనం కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశుధ్యం విషయంలో ఎవరి పనులు వారు చేసుకోవడంలోనే గొప్పతనం ఉందని ప్రపంచమంతా గ్రహించింది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకున్నా, ఆయా దేశాల్లో ఎన్ని అభివృద్ధి చెందిన కుటుంబాల్ని తీసుకున్నా శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత ఆశ్చర్యం కలిగిస్తుంది. మన సమాజంలో అది లేకపోగా, విధి లేక అటువంటి విధుల్లో ఉన్నవారి పట్ల చిన్న చూపు, తూష్ణీభావం నెలకొని ఉన్నాయి. శ్రమను గౌరవించే సంస్కృతి మన దగ్గర మరుగున పడి, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో ఆదరణ పొందడాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు, ఎటునుంచి ఎటు పయనిస్తున్నారో శ్రద్ధగా గ్రహించాలి. అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మనం పారిశుధ్యం విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలిస్తే గుండె జారిపోతుంది. పొరుగునున్న అభివృద్ధి చెందని దేశం బంగ్లాదేశ్ కంటే కూడా మనమీ విషయంలో వెనుకబడి ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేటికీ పెద్ద సంఖ్యలో కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేక బహిర్భూమినే నమ్ముకోవాల్సిన దురవస్థ నెలకొని ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరింత దయనీయ స్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన యత్నాలు తక్కువ. ఇప్పటికైనా ఏలినవారు నిర్దిష్ట ప్రణాళికలు రచించి ‘స్వచ్ఛ భారత్’ను ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు, దేశంలోని ప్రతి మనిషి కూడా, మహాత్ముడు బాపూజీ చెప్పినట్టు తానాశించిన మార్పు తన నుంచే మొదలుకావాలనే స్ఫూర్తిని అందుకోవాలి. ‘‘ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న తేలిపోవును మా పట్టణాల సొగసు: బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్ల ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప’’ అన్న కరుణశ్రీ మాటలు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ... ఎవరికి వారం ‘స్వచ్ఛ భారత్’ ఆవిష్కరణలో ఆచరణాత్మక పాత్ర పోషించడమే మనందరి ముందున్న కర్తవ్యం! -
రైతు చెమటకు కన్నీరు తోడై నేల తడపరాదు!
పద్యానవనం నీ జాతివారలు రాజులై యుండియు కనజాలరైరి నీ కష్టమెల్ల నీ కొలమందు జన్మించిన యాజమిం దారులు గనరు నీ తాపమెల్ల నీ శాఖలో ధననిలయులౌ కొందరు పరికింపలేరు నీ బాధలెల్ల నీ తెగలో విద్యనేర్చిన బియ్యేలు లిఖించరైరి నీ లేములెల్ల గీ॥న్యాయవాదులు నీవార లడుగరైరి న్యాయమూర్తులు నీవార లరయరైరి ఇంక పెఱవారి ముచ్చట లెందుకయ్య కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవరు? అందరూ నీ వారే అయినా, ఎవరికి పట్టాయి నీ కష్టాలు రైతుబిడ్డా! అంటున్నాడు ఓ కవి. ఇది సుమారు వంద సంవత్సరాల కిందటి మాట! ఈ నూరేళ్లలో పరిస్థితి పెద్దగా మారలేదు సరికదా, రైతు స్థితి మరింత దిగజారింది. దేశానికి రైతే వెన్నెముక అని చెబుతారు తప్ప, రైతును ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రారు. రైతు ఏయే కష్ట-నష్టాల్ని ఎదుర్కొంటున్నాడు? ఏ విపత్కర పరిస్థితులకు ఎదురీదుతున్నాడు? ఏం చేస్తే ఆతని ఈతి బాధలు తగ్గించవచ్చు? ఆహారోత్పత్తికి మూలకణం, గ్రామీణ ఆర్థిక వికాసానికి కేంద్రబిందువైన రైతాంగం దేశంలో, రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడో అట్టడుగునే ఉంటారు. దేశానికి అన్నం పెట్టే పనిలో నిమగ్నమై తన బతుకంతా ధారపోసే రైతు కనీస జీవనానికి నోచుకోక కడకు ఆత్మహత్యతో తనువు చాలిస్తున్నాడు. తిండిబెట్టే ఇంటి పెద్దదిక్కును కోల్పోయి, అప్పటిదాకా పరువుగా బతికిన రైతు కుటుంబాలు కకావికలై వీధిన పడుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ దుస్థితి కొనసాగుతున్నా, పరిస్థితిని మార్చే విప్లవాత్మకమైన చర్యలకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో కృషి చేయట్లేదు. ఏ రైతు కష్టాల్ని దగ్గరగా చూస్తున్నారో, ఆయా వర్గాలు కూడా సదరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని అదుకునే చొరవ చూపడం లేదు. ఇదే మాట చెబుతున్నాడీ పద్యంలో గంగుల శాయిరెడ్డి అనే గ్రామీణ కవి. రైతు కులానికే చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు, అయినా రైతాంగం ఇబ్బందుల్ని వారు పరిగణనలోకే తీసుకోరు. రైతు వర్గీయులే మహా ధనికులై ఉండి కూడా సాటి కర్షకులెదుర్కొనే బాధల్ని లెక్కచేయరు. రైతు కుటుంబాల నుంచే వచ్చి పెద్ద చదువులు చదివిన వారు కూడా రైతుల లోటుపాట్లేంటో తెలుసుకొని పై వారికి రాయరు. నీ వారే అయినా న్యాయవాదులు అడుగరు, నీ వారై కూడా న్యాయమూర్తులు తెలుసుకోరు. అయినవాళ్లే ఇలా ఉంటే, ఇక పరాయివారెలా ఉంటారో మాట్లాడటం అనవసరం. మరి రైతు కష్టాల్ని పట్టించుకునేదెవరు? అన్నది అంతిమంగా కవి ప్రశ్న. బమ్మెర పోతన స్వయంగా రైతు కాగా రైతాంగం శ్రమదమాదుల మీద, కష్టనష్టాల మీద ఎందరెందరో సాహితీ సృజన చేశారు. మంచన, శ్రీనాథుడు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, కరుణశ్రీ, శ్రీశ్రీ, దాశరథి, కుందుర్తి... ఎందరెందరో తమ కలంలో సిరాతోపాటు రైతు స్వేదాన్నీ మిళితం చేసి కవిత్వం పలికించారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన ఈ పద్యానికి సేద్యపు స్వేదమే కాకుండా వైవిధ్యపు నేపథ్యమూ ఉంది. ‘నిజాం రాజ్యంలో ఆంధ్ర కవులు పూజ్యం’ అని ముడుంబ వేంకట రాఘవాచార్య చేసిన ప్రకటనకు జవాబుగా వచ్చిన ‘గోలకొండ కవుల సంచిక’లో ‘కర్షకా!’ అన్న శీర్షికన ప్రచురితమైందీ పద్యం. ‘...ఇచటి పరిస్థితులు తెలియక, తెలుసుకొను తగు అవకాశములు లేక వెల్లడించినారు తప్ప ద్వేషబుద్ధిచే కాదనుట నిశ్చయము’ అంటూ గొప్ప సంయమనంతో అప్పటి గోలకొండ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి... నిజాం రాజ్యం పరిధిలోని 354 మంది కవుల కవితలతో ఈ ప్రత్యేక సంచికను వెలువరించారు. అందులోని ఈ పద్యం రైతు చెమటకు ప్రతిరూపం. దీని కవి గంగుల శాయిరెడ్డి అప్పటి నల్గొండ జిల్లా, జన్గాం తాలూకా, జీడికల్లు గ్రామానికి చెందిన నలభై ఏళ్ల రైతుబిడ్డ. మానవజాతి మనుగడకు జీవం పోసే రైతు అకాల మరణాలు ఏ ప్రమాణాలతోనూ క్షంతవ్యం కాదు. కర్షకుని చెమట బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఏ జాతికీ శ్రేయస్కరం కాదు. - దిలీప్రెడ్డి -
కాలం కత్తుల వంతెనపై త్యాగాల నడక
పద్యానవనం త్యాగము నిశ్చయముగ నొక యాగంబీ జగతియం దనాదిగ గానన్ త్యాగము కల్గిన జనులకు కాగలవు శుభంబులెల్ల కర్మల నార్యా! ‘కుచ్ పానేకే లియె కుచ్ కోనా జరూరీ!’ అనే మాట హిందీలో ఉంది. ఏదైనా పొందాలంటే, ఇంకేదైనా కోల్పోవాల్సిందే అని. వస్తువుకు మరొక వస్తువే అన్నట్టుగా ఇది వస్తుమార్పిడి విధానం కాకపోవచ్చు! ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో మనం లబ్ది పొందడానికి మరో రూపంలో ఏదైనా త్యజించడమో, త్యాగం చేయాల్సిన పరిస్థితో అన్న మాట! ‘ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడకుండా నాయకులు కాలేరు’ అంటారు. కొందరు ఐహిక సుఖాలను త్యజించమంటారు. ఇంకొందరు, కేవలం మిథ్య కనుక ఆముష్మిక సుఖాలపై ఆశను వదిలేయమంటారు. గౌతమ బుద్ధుడు కోర్కెలని త్యజిస్తే జీవితం అనందమయమన్నాడు. నిజమే, ఏదో త్యజించడం త్యాగం. త్యాగం అనేది లోకంలో ఒక యాగమే, అంటే యజ్ఞమే అంటాడు ఈ పద్యం రాసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. నూరుకు పైగా పుస్తకాలు రాసిన లింగమూర్తి నిరంతర పరిశోధకుడు. తెలుగువిశ్వవిద్యాలయం డాక్టరేట్తో సత్కరించిన ఆయనకు ఇటీవలే వట్టికోట ఆళ్వార్స్వామి పురస్కారం లభించింది. తేలికైన మాటలతో జీవన సత్యాల్ని వివరిస్తూ ఆర్యశతకం రాశారు. యజ్ఞంలో త్యాగం అంటే వితరణమే ప్రధానం. ఏదైనా ఇచ్చుకోవడం. వితరణలేని యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది ఫలాన్నివ్వదంటారు. త్యాగం అనే పదం పలికేప్పుడు కాస్త గంభీరంగా కనిపించినా, సౌమ్యంగా ఆలోచించి సరళంగా చూస్తే క్షమాగుణంలో ఉంటుంది. ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న సులభ సమీకరణంలోనూ ఉంటుంది అంతర్లీనంగా. ప్రపంచంలో ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చునంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎలా సాధ్యమౌతుంది? అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే. పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నపుడు ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు ఒకడుగు వెనక్కి తగ్గి అంగీకారానికి రావడం, అది చూసి అవతలి వాళ్లు కూడా అంతకన్నా ఎక్కువో, అంతేనో, అంతకు తక్కువో... తామూ వెనక్కి తగ్గడం, ఇలా సయోధ్యకు దారి ఏర్పడుతుంది. సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. ఇందులో త్యాగం ఇరువైపుల నుంచీ ఉన్నట్టే! త్యాగాలకు సిద్ధపడ్డవారి కర్మలకు సాఫల్యం ఉంటుంది. ఒకరి త్యాగాల వల్ల ఎదుటి వారికి తక్షణ ప్రయోజనం కనిపించినా, దీర్ఘకాలంలో అది త్యాగం చేసిన వారికిగానీ, విశాల సమాజ హితంలో గానీ కచ్చితమైన ప్రయోజనం కలిగిస్తుందని చరిత్ర నిరూపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు... ఇలా మన ప్రాచీన సాహిత్యమంతా త్యాగనిరతి ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా సదరు సత్ఫలితాలను సాపేక్షంగా, సోదాహరణంగా వివరించాయి. శిబి, బలి, దదీచుడు, కర్ణుడు, సోక్రటీస్, జీసస్, గాంధీ వంటి మహనీయుల త్యాగాలు మానవేతిహాస గమనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. మత్స్యగంధితో పెళ్లి జరిపి తండ్రి శంతనుడి ఇచ్ఛ తీర్చడానికి గాంగేయుడు (భీష్ముడు) పలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామమే, అంటే త్యాగాలతో కూడిన భీష్మ ప్రతిజ్ఞ, దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులే మహాభారత కథా గమనాన్ని మలుపులు తిప్పాయి. కైకేయి కోర్కెల ఫలితంగా తలెత్తిన పరిస్థితుల్లో దశరథుడు, కౌసల్య, రామ-సీత-లక్ష్మణుల త్యాగాలు రామాయణాన్నే రసవత్తరంగా నడిపాయి. కడకవి దుష్ట శిక్ష-శిష్ఠ రక్షణకు కారణమయ్యాయి. సమసమాజం కోసం, అస్తిత్వం కోసం, జాతుల మనుగడ కోసం... విశాల జనహితం కోరి జరిపే సాయుధపోరాటాల్లో ప్రాణాలర్పించే యోధుల త్యాగాలూ చరిత్ర పుటలే! కాలం కత్తుల వంతెనపై త్యాగాల నెత్తుటి నడకలెన్నో! సామ్రాజ్యవాదుల ఉక్కు సంకెలల నుంచి దేశాలకు విముక్తి లభించినా, వర్ణ-జాత్యాహంకారుల నుంచి విభిన్న జాతులకు స్వేచ్ఛావాయువులు దొరికినా... అది, ప్రాణాల్ని పణంగా పెట్టిన ఎందరెందరి త్యాగాల ఫలమో! పోరాటాలే కాదు క్షమలోనూ ఉంది ఔన్నత్యం. మనిషి లక్షణాల్లో అత్యంత ఉత్కృష్ఠమైనది క్షమాగుణం అంటారు. క్షమాగుణానికి త్యాగమే కన్నతల్లి. ప్రతి త్యాగాన్ని మనసారా ప్రశంసిద్దాం. మరిన్ని త్యాగాలకు మనమూ సిద్ధమౌదాం! - దిలీప్రెడ్డి -
పద్యానవనం: పాములూ, నిచ్చెనలూ!
పచ్చిగ పావులం గదిపి పందెములం దలక్రిందు చేసి యీ నిచ్చెన లెక్కినా ననుచు నిక్కకు; పక్కకు జూడు మల్లదే! విచ్చిన నోటితో బుసలు వెట్టెడు ఆ పెనుబాము నోటిలో జొచ్చిన-చచ్చినట్లు తొలిచోటుకు జఱ్ఱున జారకుందువే? మంచి జరిగితే అది తమ వల్లేననీ, చెడు జరిగితే మాత్రం ఇతరుల వల్ల అనీ బల్లగుద్ది చెప్పే వారుంటారు. అందుకోసం, వారు తొలి నుంచి పథకం ప్రకారమే వ్యవహరిస్తారు. అంటే, మాంచి ఫ్లాట్ గీస్తారన్న మాట. ఎందుకైనా మంచిదని కాస్త వ్యూహాత్మకంగా నడుచుకుంటూ అవసరానికి మించి నాలుగు ఎక్కువ మాటలు ముందుగానే చెప్పిపెడతారు. అలా చెప్పే మాటలు రెండు రకాలుగానూ ఉంటాయి. ఎటయినా అన్వయించడానికి వీలుగా, గోడమీద పిల్లి వాటంగా అన్నమాట! అంతా జరిగాక, ‘‘చూశారా! నే ముందే చెప్పాను, నాకెందుకో మొదట్నుంచీ తెలుస్తూనే ఉంది, నే గెలుస్తాను, గెలిచి తీరుతానని’’ అంటారు. ‘‘అబ్బో, ఇలా గెలవడానికి నేనెంతగా కష్టపడ్డానో, ఏమేం చేశానో.....!’’ అంటూ పెద్ద చాంతాడంత జాబితా మీ ముందు పెట్టినా ఆశ్చర్యం లేదు. అదే ఓడిపోతేనో? అమాంతం నింద ఇతరులపై వేసేయడమే! ‘‘నే మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను, నే గెలవడానికి ఇన్నేసి యత్నాలు చేస్తున్నప్పటికీ, వారంతా కలిసి దెబ్బ కొడతారనీ, నన్ను గెలవనీకుండా మాయోపాయం చేస్తారనీ తెలుసు, కడకు అదే జరిగింది’’ అంటూ, నిష్ఠూరాలాడుతారు. ఇదీ, ద్వంద్వ వైఖరి. నిజానికి అవే కారణాలు కావచ్చు, కాకా పోవచ్చు. జరిగిన పరిణామాల్లో తమ పాత్ర ఉన్నట్టో, లేనట్టో ఆపాదించేందుకు చేసే అనవసర ప్రయాస వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. మన ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి గర్వించే-గర్హించే వారి స్పందనలు కూడా, అచ్చు ఇలానే ఉంటాయి. అందుకే గీతాకారుడైన కృష్ణుడు చెబుతాడు, ‘గెలుపు నందు ఉప్పొంగక, ఓటముల యందు కృంగిపోక... గెలుపోటముల యందు సమస్థితి కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు’ అని. అంత బరువైన డైలాగుల సంగతెలా ఉన్నా, మనం కొంచెం, వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే ఎదురయ్యే ఇబ్బంది తక్కువ. గెలుపయితే మన వల్ల, ఓటమైతే ఇతరుల వల్ల అనే ముందస్తు భావన లేకుండా, నిజాయితీగా ఆ గెలుపోటములకు గల కారణాల్ని విశ్లేషించగలిగితే, అవసరానికి మించి ఉప్పొంగడమో, అనవసరంగా కృంగిపోవడమో ఉండదు. ఆ సృ్పహ ఉంటే చాలు, ఫలితమేదయినా మనసుకు హాయిగా ఉంటుంది. ఇది, చెప్పినంత తేలికేం కాదు, కానీ, అసాధ్యం కూడా కాదు. భగవద్గీతలో చెప్పినట్టు, ఫలితమాశించకుండా నిష్కామ కర్మ ఆచరించడం అంటే ఇదేనేమో! అందుకే, ఉమర్ ఖయ్యామ్ చెబుతున్నాడు, వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కి ఎంతో పైకి వచ్చానని నిక్కకు, నీల్గకు, నిగ్రహంతో ఉండూ అని. అది నీ ప్రతిభ వల్లా జరిగి ఉండవచ్చు, లేదా ఇంకోలా ఫక్తు యాదృచ్ఛికమైందీ కావచ్చు. నిజానికి ఈ పచ్చీసు ఆటలో ప్రతిభ కన్నా, అదృష్టంపై ఆధారపడి జరిగేదే ఎక్కువ. అదే ఆట క్రమంలో, అంతే యాదృచ్ఛికంగా ఏ పాము నోటనో పడితే.... మళ్లీ కిందకు దిగి రాక తప్పదు! నీ ప్రతిభాపాటవాలతో నిమిత్తం లేకుండానే అలా జరగొచ్చు! అదీ అట్టడుగున, ఆట ఆరంభించిన తొలి గడిలోకయినా జారవచ్చు! అలా జరిగినందుకు మనమే కారణమని చింతిస్తూ అక్కడే కూర్చుంటే ముందుకు సాగడం కూడా కష్టమౌతుంది. ఆటల్లోనూ, జీవితంలోనూ గెలుపోటములు శీతోష్ణములు. ఒకటి వెనుక ఒకటి. అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్, తన తనయుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన లేఖలో ఇదే విషయం చెబుతాడు, ‘...గెలుపే కాదు, ఓటమిని జీర్ణించుకోవడమెలాగో నేర్పండి నా కుమారునికి’. మన పాత్ర-ప్రమేయం ఉన్నా లేకున్నా ఓటమి ఎదురయినా, అయితే అవనిగాక! అది ఒక ఆటలోనే కాదు మరెక్కడయినా! ప్రతి ఓటమి, తదుపరి విజయానికి గుణపాఠం కావాలి. కనీసం ఓ చక్కని అనుభవమైనా కావాలి. ఆట మాత్రమే కాదు, జీవితం కూడా ఇంతే అన్న సారాన్ని దట్టించాడీ పద్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలతి అలతి పదాలతో అనంతార్థాన్ని విడమర్చే ఆయన సామర్థ్యానికి మచ్ఛుతునక ‘అమర్ ఖయామ్’ లోని ఈ పద్యం. - దిలీప్రెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
- పుష్కర కాలం తర్వాత...
Advertisement