-
'పైసా' చిక ప్రేమ
మనసు దొంగిలించేవాళ్లు అనుకుంటే బీరువా తాళాలు అప్పగించినవాళ్లవుతారు.ఎక్కడ కాపు కాస్తున్నారో తెలీదు. ఎవరి మీద కన్నేశారో తెలీదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దొంగలు మనింటికే రావచ్చు. అరుణ్ హైదరాబాద్లో ఆటోవాలా. వయసు 24. అక్కడే ఉంటున్న సౌమ్య (పేరు మార్చాం) ఇంటర్ చదువుతోంది. వయసు 16. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. కాలేజీకి వెళ్లొస్తుండే దారిలో అరుణ్ పరిచయం అయ్యాడు. ముందు ఫోన్లలోనే మాట్లాడుకునే ఇద్దరు ఆ తర్వాత ఫేస్ బుక్, చాటింగ్ వరకు వెళ్లారు. ఆ పరిచయం... కలిసి తిరిగేంతవరకు వెళ్లింది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం’ అని సడెన్గా అన్నాడు అరుణ్ ఒకరోజు. అంతే కాదు, మాయ మాటలతో సౌమ్య మనసు దోచుకున్నాడు. అరుణ్ తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉంది సౌమ్యకు. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి. ఓ రోజు అరుణ్ (మూడు నెలల క్రితం) సౌమ్య దగ్గరకు వచ్చి, ‘నాకు కడుపులో అల్సర్ ఉందట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంట. లేకపోతే బతకను. ఆరేడు లక్షలు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వే ఎలాగైనా సర్దాలి’ అన్నాడు. సౌమ్య ప్రాణం విల్లవిల్లాడింది. కానీ అంత డబ్బు! ఎలా..? సౌమ్యకు దిక్కు తోచలేదు. రెండు మూడు రోజులుగా అరుణ్ అడగడం, సౌమ్య ఏమీ సమాధానం ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంది. నాల్గవరోజు అరుణ్ ఫోన్ చేశాడు. ‘డబ్బు ఇవ్వకపోతే మనిద్దరికీ సంబంధం ఉందని అందరికీ చెబుతాను. మనం దిగిన ఫొటోలు అందరికీ పంచుతాను! నీ పరువు, మీ అమ్మనాన్నల పరువు పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చాడు. సౌమ్య హతాశురాలైంది. నిజంగానే ఆ ఫొటోలు బయటపెడితే తన పరిస్థితి ఏంటి?! ఈ కష్టం నుంచి బయటపడటం ఎలా?’ అని ఆలోచించింది. ఒంట్లో బాగోలేదని ఆ రోజు ఇంట్లోనే ఉంది. అమ్మానాన్నలు ఆఫీస్లకెళ్లిపోయారు. బీరువా తాళాలు తీసి చూసింది. బంగారం, ఆ పక్కనే డబ్బు కనిపించాయి. నాన్నకు తెలియకండా ఆయన పర్సులోంచి ఎ.టి.ఎమ్ కార్డు కూడా తీసింది. అరుణ్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వచ్చాక దాదాపు 30 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు ఇచ్చింది. ఎ.టి.ఎమ్ కార్డ్ తీసుకెళ్లి మరికొంత డబ్బు తీసి ఇచ్చింది. డబ్బు తీసుకుని అరుణ్ ఉడాయించాడు. సౌమ్య మళ్లీ ఆలోచనలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఊరుకోరు.. ఎలా? తనను తానే కట్టేసుకుని, దొంగలు పడి, దోచుకెళ్లినట్టుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేసి ఈ నెల 9న అరుణ్ని అరెస్ట్ చేసి, అసలు విషయం బయటపెట్టారు. ఇప్పుడీ విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలంటే.. మన ఇంట్లోనూ ఈ వయసు పిల్లలుంటారు. ఏది తప్పో, ఏది ఓప్పో తెలియని స్థితిలో కష్టాల ఊబిలో వారు పడిపోకూడదు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వంచకుల చేతికి చిక్కకూడదు. అందుకు మనమేం చేయాలి? ► కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు మాత్రమే అసలైన ప్రేమ అని అమ్మాయికి తెలియజెప్పాలి. ► ఎంతసేపూ పుస్తకాలు, మార్కులు, ర్యాంకుల గొడవలతో కాకుండా అమ్మాయి మానసిక వికాసానికి కావల్సిన పెద్దల అనుభవాలను జాగ్రత్తలుగా షేర్ చేసుకోవాలి. ► ఏ బాధ్యతా లేకుండా రోడ్లమీద తిరిగేవారే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. అదికూడా అమాయకమైన అమ్మాయిలనే టార్గెట్ చేస్తుంటారు. తమ ట్రాప్లో పడేందుకు కావల్సిన అన్ని శక్తులనూ ఉపయోగిస్తుంటారు. ఆ విషయాన్ని అమ్మాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి. ► పిల్లల చిన్న చిన్న సమస్యలను, అవసరాలను వాయిదా వేయకూడదు. చిన్న అవసరాలే కదా అని కొట్టిపారేయకుండా సాధ్యమైనంతవరకు తీర్చాలి. సమస్యను పూర్తిగా విని సానుకూలంగా స్పందించాలి. ► పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి. ► సమాచారం వేగవంతంగా మారిన ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా రెట్టింపు వేగంతో జరిగిపోతున్నాయి. అందుకని, పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనవైపు గమనింపు తప్పనిసరి. ► బోర్ కొడుతోందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కాబట్టి పిల్లలకి బోర్ అనిపించకుండా చదువుతో పాటు నృత్యం, సంగీతం, క్రీడలు, పుస్తకపఠనం... హాబీస్వైపుగా వారి దృష్టి మళ్లేలా చూడాలి. ► ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సెలింగ్కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం’ అని కౌన్సెలర్లు చెబుతున్నారు. జాగ్రత్త అవసరం. - నిర్మలారెడ్డి ఇన్పుట్స్: యాదగిరి, సాక్షి, తుర్కయంజాల్ ఆకర్షణలు... లక్ష్యాలు ఒక బకెట్ను ముందు ఇసుకతో నింపాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు రాళ్లు వేసి, తర్వాత అంతే ఇసుకతో అదే బకెట్ నింపవచ్చు. పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు ఇసుకతో సమానం అని, ఆ ఆకర్షణలో పడితే లక్ష్యాలను సాధించలేమని పిల్లలకు తెలియ చెప్పాలి. - డా. గీతాచల్లా, సైకాలజిస్ట్ మోసాలు పెరుగుతున్నాయి ప్రేమ పేరుతో నమ్మించి మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియెట్ అమ్మాయిలే ప్రేమ అనే ఆకర్షణలో పడుతున్నారు. తర్వాత మోసపోయి, బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టి వారిని సరిదిద్దాలి. - భాస్కర్గౌడ్, ఏసీపీ, వనస్థలిపురం -
70ల ఫ్యాషన్...ఆపాత అందాలు...
ముస్తాబు ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడల్లా ఫ్యాషన్ ఒక్కసారి ‘కమ్ బ్యాక్’ అంటూ రీల్ని వెనక్కి తిప్పి చూపిస్తుంది. సంప్రదాయాన్ని, ఆధునికతను వేళవించి కాంటెంపరరీ దుస్తులను క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్గా, లవబుల్గా 1970ల కాలం నాటి ఫ్యాషన్ని ఈ చలికాలానికి సరికొత్తగా కళ్లముందుంచుతోంది ఫ్యాషన్ ప్రపంచం. ఇప్పుడంతా 70ల కాలం నాటి దుస్తులు కనువిందు చేయబోతున్నాయి. నిజం! అతివలు ఆధునికతకు బ్రేక్ ఇచ్చి పాత కాలాన్ని లాక్కొచ్చి మరీ ముందు నిలుపుతున్నారు. ఎందుకంటే కాలం ఇప్పుడు ‘రెట్రో (అనుకరణ) స్టైల్’ వెంబడి పరుగులు తీస్తోంది. వేషధారణల్లో కాస్త ఫన్ ఉండేలా, జియోమెట్రికల్ ప్రింట్స్ అబ్బురపరిచేలా డ్రెస్ డిజైనర్స్ వీటిని మరింత అందంగా కళ్ల ముందు నిలుపుతున్నారు. ‘బాంబర్ జాకెట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్, క్రాప్ టాప్స్పైన నాడు పువ్వులు, లతల హవా నడిస్తే నేడు జియోమెట్రికల్ ప్రింట్లు సందడి చేస్తున్నాయి’ అంటున్నారు ముంబై ఫ్యాషన్ డిజైనర్ అనితా డొంగ్రే. ఇటీవల ఇండియన్ లాక్మె ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న అనితాడోంగ్రే, పూర్వి దోషి, పరిణీతా సలూజ ఫ్యాషన్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలియజేస్తూ జియోమెట్రికల్ లైన్స్ 2014 వింటర్ని ఓ కొత్త కళతో చూపనున్నాయ’ని తెలిపారు. ఈ సందర్భంగా డెబ్భైల నాటి కాలపు స్టైల్స్ హైలైట్స్ జాబితాను వీరు విడుదల చేశారు. ఫన్గా, అందంగా..! ‘ఫ్యాషన్ ఎప్పుడూ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక ప్పుడు అకస్మాత్తుగా వెనకటి కాలమే మన ముందు నిలబడకమానదు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. అలనాటి స్టైల్ ఇప్పుడు కొత్తగా, మరింత ఫన్గా, మరింత అందంగా రూపుకడుతుంది. ప్రస్తుతం కనువిందు చేస్తున్న ఈ స్టైల్స్ నాటి ట్రెండ్కు కొనసాగింపు’ అంటూ ఫ్యాషన్ డిజైనర్ పరిణీతా సలూజా వివరించారు. అంతేకాదు ఇప్పటి ట్రెండ్ ఇదేనంటున్నారు పరిణీత! నాడు, నేడు మేళవింపు... ‘ఫ్యాషన్లో ఎన్ని పోకడలు వచ్చినా రెట్రో వైపు దృష్టి ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది’ అని తెలిపారు హైదరాబాద్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్ట్యూట్ డిజైనర్ అయేషా! అయితే 70ల కాలం నాటి డ్రెస్సులు, పూర్తి కాపీ అనడానికి వీల్లేదు అంటారీమె! ‘గుడ్డిగా వాటిని అనురించాలనీ లేదు. పాత కథకు కొత్త ముగింపు ఇచ్చినట్టుగా నాటి వేషధారణలోనే సరికొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు’ అంటూ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ‘లూప్ స్లీవ్లెస్’ 70ల కాలంలోనూ ఉన్నాయి. కానీ, దీంట్లోనే కొన్ని స్టైలిష్ కట్స్తో ఇప్పుడు పూర్తి కొత్తదనాన్ని తీసుకురావచ్చు’అని వివరించారు. బెల్ బాటమ్స్ నాటి గొప్ప ట్రెండ్. ఇప్పుడు ఇవే కొద్ది పాటి మార్పులతో పలాజో ప్యాంట్స్గా అలరిస్తున్నాయి. వాటికి ఫిటెడ్ షర్ట్స్, హిప్పీ షర్ట్స్ జత చేస్తే.. మగువలు, మగవారూ హ్యాపీగా ధరింవచ్చు’ అంటూ తెలిపారు ఆమె. పలాజో ప్యాంట్స్ చూస్తే అప్పటి స్టైలిస్ట్ ఐకాన్స్గా పేరొందిన ఫరా, జీనత్ అమన్లు గుర్తుకువస్తారు. వారు అప్పట్లో వేషధారణలో కొత్త పోకడలు సృష్టించి, స్టైలిస్ట్లుగా పేరొందారు. ఇప్పుడూ వారినే అనుసరించడానికి కారణం ఈ లుక్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండటమే! పలాజో ప్యాంట్స్... ఫ్యాషన్ డిజైనర్ పూర్వి దోషి మాట్లాడుతూ- ‘నాటి, నేటి స్టైల్స్ను సూచించే పలాజో ప్యాంట్స్ జంప్సూట్స్కి ఒక దారి చూపాయి. జంప్సూట్లో బాటమ్ (ప్యాంట్ అడుగు భాగాన) కొద్దిగా విచ్చు కున్నట్టు ఫ్లెయిర్గా ఉండటంతో బెల్బాటమ్ను తలపిస్తుంది. దీని పైన న్యారో కట్ ట్రౌజర్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. ఇది యువతల శరీరసౌష్టవానికి చక్కగా సరిపోయే ఎంపిక’ అని తెలిపారు ఆమె. రంగులు, ప్రింట్లు... డెబ్భైల కాలమంతా రంగు రంగుల పువ్వుల ప్రింట్లు, మరీ కొట్టొచ్చినట్టు కన బడే ఎరుపు, గులాబీ.. మొదలైన కాంతిమంతమైన రంగులతో ఉండేవి. ‘అందుకే నాటి నేటి సమ్మేళనమైన కట్స్, కాంతిమంతమైన రంగులు, ప్రస్తుత పువ్వుల ప్రింట్లు.. ఇవన్నీ కలుపుతూనే 70ల నాటి కథనాన్ని ఇప్పుడూ సరికొత్తగా చూపించవచ్చు’ అంటారు అయేషా! అయితే రెట్రో లుక్తో అలరించాలంటే దుస్తులే కాదు వాటికి తగిన ఆభరణాలను, ఇతర ఆలంకారాలన్నీ సరిపోలాలి అని కూడా సూచిస్తున్నారు ఈ డిజైనర్లు. తలకట్టు, తలకు వాడే క్లిప్పులు, రబ్బర్బ్యాండ్లు, బ్యాగులు, బెల్టులు, చెప్పులు... వంటివన్నీ కూడా 70ల కాలం నాటి స్టైల్ను పోలినవాటినే ఎంచుకోవాలి’ అని చెబుతున్నారు. డిజైనర్ల సూచనలు తీసుకుంటూ నాటి అలంకరణతో ఈ వింటర్ని సరికొత్తగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమవండి. - నిర్మలారెడ్డి -
కెమేరా కన్ను... చేతిలో పెన్ను... పిన్నవయసు ధ్రువ తారక
ప్రకృతి దృశ్యాలు చూస్తే అతని కళ్లు విశాలమవుతాయి. అతని కెమెరా కన్ను ఆ అద్భుతాలను ‘క్లిక్’మనిపిస్తుంది. వన్యప్రాణుల జీవనశైలిని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. జాతీయ ఉద్యానాల్లో అతనితో పాటే అతని కెమెరా పరుగులు పెడుతుంది. కెమెరాతో జాతీయ ఉద్యానాల చరిత్రను కళ్లకు కడుతున్న అతని పేరు ధ్రువ్ వాడ్కర్! వయసు పధ్నాలుగేళ్లు. జాతీయస్థాయిలో అత్యంత పిన్నవయస్కుడైన ఫొటోగ్రాఫర్గా పేరు సంపాదించుకున్న ఈ టీనేజర్ సింగపూర్ పార్క్లలో ఫొటోలు తీసి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీటేబుల్ బుక్ను రూపొందించాడు. చిన్ననాటి నుంచి ధ్రువ్ చేసిన ‘గ్రీన్ జర్నీ’ పెద్దవారికీ ఓ పాఠంలా ఉపయోగపడుతోంది. పధ్నాలుగేళ్ల ధ్రువ్ వాడ్కర్ హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. మూడేళ్ల క్రితం వరకు ఇక్కడే చదువుకున్నాడు. తల్లిదండ్రులు సింగపూర్లో స్థిరపడడంతో ధ్రువ్ కూడా అక్కడే కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. సింగపూర్లోని 20 ఉద్యానాలను సందర్శించిన ధ్రువ్ ఇప్పటి వరకు దాదాపు 3000 ఫొటోగ్రాఫ్లు తీశాడు. అంతేకాదు పార్క్లకు వచ్చే వారిని కలిసి, వారితో మాట్లాడాడు. శ్రద్ధగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. మన ఉద్యానాలకూ, సింగపూర్ ఉద్యానాలకూ ఉన్న తేడా తెలుసుకున్నాడు. వాటన్నింటినీ ఒక చోట పొందుపరచి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీ టేబుల్ బుక్ను తయారుచేశాడు. అతను చేసిన ‘గ్రీన్ జర్నీ’లో చాలా ఆసక్తికర అంశాలే ఉన్నాయి. ఆకుపచ్చని ప్రయాణం... ‘‘ఏడేళ్లుగా వీలు చిక్కితే మన దేశంతో పాటు సింగపూర్ జాతీయ ఉద్యానాలను సందర్శిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉద్యానాల చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫొటోలతో పాటు, సందర్శకుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నాను. రికార్డులను శోధిస్తున్నాను. అలా అన్నింటినీ సమకూర్చి ఒక పుస్తకంలో వాటిని పొందుపరిచాను. ఇదంతా ఉద్యానాల అద్భుతాలను, అక్కడి స్థితిగతులను తెలియజేయడానికి. సింగపూర్ పార్కులలో పచ్చదనం చాలా గొప్పగా ఉంటుంది. చుట్టుపక్కల పట్టణ వాతావరణం ఉన్నప్పటికీ విశాలమైన మైదానాలు అబ్బురపరుస్తాయి. ఏ పార్క్ చూసినా శుభ్రంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా పార్క్లను తమ నేస్తాలుగా చూస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మన దేశంలోనూ ఎన్నో పార్కులను చూశాను. అక్కడి పార్కులకూ, ఇక్కడి పార్కులకూ ఎంతో తేడా ఉంది. మన దేశంలో పార్కులను కేవలం ఉదయం, సాయంకాల వేళల్లో వాకింగ్కు మాత్రమే ఉపయోగిస్తారు’’ అని వ్యాఖ్యానించాడు ధ్రువ్! పన్నెండేళ్ల వయసులో... అత్యంత పిన్నవయసులోనే మన దేశంలోని రణథంబోర్, కన్హా జాతీయ ఉద్యానాల అధికారుల ఆహ్వానం మేరకు వాటిని సందర్శించి, ఫొటోలు తీసి ప్రసిద్ధుల చేత ప్రశంసలు పొందాడీ కుర్రాడు. పన్నెండేళ్ల వయసులో ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ సేవర్స్ సొసైటీ, ఎర్త్ మ్యాటర్ ఫౌండేషన్కు ధ్రువ్ వాడ్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. మన దేశంలో రణథంబోర్ జాతీయ ఉద్యానంలో ధ్రువ్ తీసిన 75 ఫొటోలతో హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్లోని నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదివే సమయంలో తాను తీసిన పులుల ఫొటోలను స్కూల్కు అందజేశాడు. ఢిల్లీలో ‘కాల్ ఆఫ్ ద టైగర్’ పేరుతో వన్యప్రాణుల సంరక్షణ సొసైటీ, ఎర్త్ మ్యాటర్స్ ఫౌండేషన్ ఒక పోటీని నిర్వహించింది. అందులో 32 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారందరిలో అత్యంత పిన్నవయస్కుడు ధ్రువ్! వారికి దీటుగా ధ్రువ్ తీసిన ఫొటోలు ఎంపికయ్యాయి. హాబీగా ఫొటోగ్రఫీ ధ్రువ్ చిన్నతనమంతా హైదరాబాద్లోనే గడిచింది. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి రోజూ దగ్గరలోని పార్క్కు వెళ్లేవాడు. అక్కడి పచ్చని గడ్డి మీద గంటలు గంటలు ఆడుకునేవాడు. అలా పార్క్లతో అనుబంధం ముడిపడిపోయింది అంటాడు ధ్రువ్. ‘‘ఫొటోగ్రఫీలో ధ్రువ్కు ఉన్న ఆసక్తి, అభిరుచిని గమనించిన మా ఆవిడ వాడికి ఏడేళ్ల వయసులో ఒక చిన్న కెమేరా కొనిచ్చింది. అప్పుడు మొదలైన హాబీతో ఇప్పటికీ వాడు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు’’ అంటూ ఆనందంగా వివరిస్తారు ధ్రువ్ తండ్రి అనంత్ వాడ్కర్. ‘‘నా అభిరుచిని గమనించి అమ్మా నాన్న కన్హా జాతీయ ఉద్యానం, సలీమ్ అలీ బర్డ్ శాంక్చ్యువరీ వంటివాట న్నింటికీ తీసుకెళ్లారు’’ అనే ధ్రువ్ మన దేశంలోనూ పార్కులు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తన కాఫీటేబుల్ బుక్లో పొందుపరిచాడు. ‘‘చిన్న ప్రయత్నం జగమంతా పచ్చదనం నిండడానికి దోహదం చేస్తుంది. ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉండాలి’’ అంటాడు ధ్రువ్. ఈ పిన్నవయస్కుడి ఆలోచన ఎందరికో స్ఫూర్తి నిస్తుందని, ఆకుపచ్చని అందాలను కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ఆశిద్దాం. - నిర్మలారెడ్డి -
అష్టాదశ శక్తి పీఠాలు...
చూసొద్దాం శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించిన సమాచారం దసరా పండగ సందర్భంగా ఈ వారం... 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి. 2. కామాక్షీ కాంచికా పురే! కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’ ఇక్కడ పడినట్లు చెబుతారు. 3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి! నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో వెలసిందీ క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్ను నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం. భక్తుల సమస్యల సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని నమ్మకం. అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’ ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10 కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు. 4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి! కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది. ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని విగ్రముంది. అమ్మవారి ‘తలవెంట్రుకలు’ పడిన పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం. 5. అలంపురే జోగులాంబ:! తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వసం అయ్యి, ఆ తర్వాత పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’ ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. 6. శ్రీశైలే భ్రమరాంబికా! దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది. 7. కొల్హాపురే మహాలక్ష్మీ! మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు. 8. మాహుర్యే ఏకవీరికా! మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి. 9. ఉజ్జయిన్యాం మహాకాళి! సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు. మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది మహాకాళి. 10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా! ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు. 11. ఓఢ్యాయాం గిరిజా దేవి! ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా). నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం ఉన్నది. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు. 2. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం)! సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం. 13. హరిక్షేత్రే కామరూపా! అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు. 14. ప్రయాగే మాధవేశ్వరీ! ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ప్రయాగ క్షేత్రం ఉంది. సతీదేవి ‘హస్త అంగుళీయం’ పడిన ప్రాంతంగా చెబుతారు. యుమన, గంగా నదులు కలిసే ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అంటారు. పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ క్షేత్రం. 15. జ్వాలాయం వైష్ణవీ దేవి! సతీదేవి ‘పుర్రె’ పడిన ప్రదేశం. జ్ఞాన క్షేత్రం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది. 16. గయాయామ్ మాంగళ్య గౌరీ! బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి ఉంది. సతీదేవి ‘స్తనం’ పడిన ప్రదేశం. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు. 7. వారాణస్యాం విశాలాక్షీ! సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం. 18. కాశ్మీరేతు సరస్వతియనా! ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్లో ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. శక్తి పీఠాల సందర్శన భాగ్యం.. అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. అటువంటి 18 పీఠాలను స్వయంగా సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చాను. దసరా పండగ నాడు ఈ 18 క్షేత్రాలలో శక్తి పూజ కన్నుల పండగగా జరుగుతుంది. - ఎస్.వి.ఎస్.భగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు కూర్పు: నిర్మలారెడ్డి -
అహింసా సిల్క్పట్టుపురుగుకు పునర్జన్మ
పట్టువస్త్రం నేయడానికి పట్టుదారం కావాలి... పట్టుదారం పట్టుపురుగు నుంచే రావాలి. ప్రకృతి ఇచ్చిన ఆకులను తిని పెద్దదైన పట్టుపురుగు గూడు కట్టుకుంటే... బతికుండగానే ఆ గూడుతో సహా దాన్ని వేడి వేడి నీళ్లలో వేసి, మరిగించాలి... ఆ వేడికి పట్టుపురుగు చనిపోతేనేం..?! అంతచిన్ని ప్రాణంతో పనేంటి మనకు?! పదిహేనేళ్ల క్రితం వరకు ఇంచుమించు అందరి ఆలోచన ఇదే! కానీ పట్టుపురుగుకూ బతికే స్వేచ్ఛ ఉందని చాటుతూ వచ్చిన ‘అహింసా సిల్క్’ అందరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. పట్టుకు ప్రాణం ఉందని నిరూపించింది. ‘సృష్టిలో ప్రతి జీవికీ బతికే స్వేచ్ఛ ఉంది. పట్టుపురుగు ఆ స్వేచ్ఛకు మినహాయింపు కాదు కదా!’ అంటారు కుసుమరాజయ్య. పట్టుపురుగును చంపకుండా ‘పట్టుబట్టి’ పట్టువస్త్రాన్ని తయారుచేశారీయన. ఆ పట్టుకు ‘అహింసా సిల్క్’ అని పేరు పెట్టారు. ‘సృష్టిలో ప్రతి జీవికి బతికే స్వేచ్ఛ ఉంది’ అనే ఈ మాట ఎన్నో దేశీ విదేశీ వేదికలపై మరీ మరీ చెప్పారు. తాను రూపొందించిన అహింసా పట్టును చేత పట్టి చూపించారు. పాతికేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణానికి పదమూడేళ్లుగా ప్రశంసలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ నాణ్యత సదస్సు రాజయ్యను ఆహ్వానించి, అవార్డుతో సత్కరించింది. హైదరాబాద్లోని మాదాపూర్లో భార్యా బిడ్డలతో నివాసం ఉంటున్న రాజయ్య వరంగల్ జిల్లా, నాగారం గ్రామవాసి. హైదరాబాద్లోని ఆప్కో సంస్థలో ఉద్యోగం చేసి, ఇటీవలే పదవీ విరమణ పొందిన రాజయ్య ‘అహింసా పట్టు’ అనుభవాలను ఇలా పంచుకున్నారు. చేనేతకు చేయూత.. ‘చదువు పూర్తయ్యాక ఆప్కో సంస్థలో ఉద్యోగిగా చేరాను. అన్ని రకాల వస్త్ర తయారీలను పరిశీలించడంతో పాటు చేనేతకారుల కష్టాలూ గమనించేవాడిని. చేసే పనిలోనే ఏదైనా కొత్తదనం తీసుకువస్తే చేనేతకు మరింత పేరు తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. పట్టుపురుగుల పెంపకం కేంద్రాలకు వెళ్లాను. పట్టు వచ్చే పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కకూన్స్ (పట్టుపురుగు గూడు)ను వేడినీళ్లలో వేసి మరిగించే పద్ధతులు చూశాక ప్రాణం విలవిల్లాడింది. అన్ని వేల, లక్షల పురుగుల ప్రాణాలు మరిగిపోవడం... కొన్నేళ్ల పాటు ఆ బాధ నన్ను విపరీతంగా వేధించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గూడు నుంచి పట్టుపురుగు ఒకసారి బయటకు వస్తే ఆ దారం వస్త్రం నేయడానికి పనికి రాదు. పట్టుదారం కావాలి. కానీ, పట్టుపురుగు చావకూడదు. ఇవే ఆలోచనలతో కొన్నాళ్లు గడిచిపోయాయి. పట్టుపురుగును చంపి తయారుచేసే వస్త్రాన్ని ఆధ్యాత్మికవేత్తలు ధరించేవారు కాదు. పట్టును అహింసావాదు లూ ధరించేలా చేయాలి.. చేనేతకారుడికి సాయమవ్వాలి. ఈ తరహా ఆలోచనకు 1990లో ఒక రూపం వచ్చింది. పట్టుపురుగుకు స్వేచ్ఛ... ‘పట్టుపురుగును చంపకుండా ఎక్కడైనా పట్టు తీసే ప్రక్రియ జరుగుతుందా’ అని దేశమంతా తిరిగాను. అన్ని స్పిన్నింగ్ మిల్స్ వారిని సంప్రదించాను. అంతా ఒకటే పద్ధతి. అహింసా మార్గాన పట్టును తయారుచేసేవారు ఎక్కడా కనిపించలేదు. మన దగ్గర పట్టుదారాన్ని చేత్తోనే తీస్తారు. ఒకసారి పురుగు బయటకు వచ్చాక దారమంతా తెగిపోతుంది. దాంతో వస్త్రాన్ని నేయడం సాధ్యం కాదు. పనికిరాని దారాన్ని తీసేస్తూ, పనికొచ్చే దారాన్ని వేరుచేసే మిషనరీస్ కావాలి. ఇందుకు ఛత్తీస్గడ్లోని లోహియా గ్రాప్ కంపెనీ వారిని మూడు నెలల పాటు కోరితే, చివరకు దారం తీసివ్వడానికి ఒప్పుకున్నారు. వారికి చిన్న మొత్తంలో కకూన్స్ ఇస్తే సరిపోదు, కనీసం వంద కేజీలైనా ఇవ్వాలి. ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకే సరిపోయేది. అందుకని పి.ఎఫ్ డబ్బు 80 వేలు, స్నేహితుల దగ్గర మరో 50 వేల రూపాయలు తీసుకొని కకూన్స్ వంద కేజీలు కొన్నాను. మామూలుగా అయితే ఒక్కో కకూన్ నుంచి దాదాపు వెయ్యి గజాల దారం లభిస్తుంది. కకూన్ నుంచి పురుగు బయటకు వచ్చాక 150 గజాలకు మించదు. పనికిరానిది తీసేయగా వందకేజీలకు పదహారు కేజీల దారం వచ్చింది. దాంతోనే చేనేతకారులచేత మన జాతీయ జెండాను పోలిన మూడురంగుల పట్టువస్త్రాన్ని నేయించాను. అహింసా మార్గంలో జరిపే కృషికి గాంధీజీ మంత్రమైన ‘అహింస’ను ఈ పట్టుకు పేరు పెట్టాను. ఎల్లలు దాటిన కృషి... దేశంలోని పలురాష్ట్రాలలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో ‘అహింసా సిల్క్’ చోటుచేసుకుంది. రంగుల కలయిక, నాణ్యత, హింసలేని పట్టు... ఎంతోమంది దృష్టిని ఆకట్టుకుంది. కంచి కామాక్షి, పుట్టపర్తి సత్యసాయిబాబా .... దేశంలోని ప్రముఖ దేవాలయాలకు అహింసా పట్టు వెళ్లింది. విదేశాలలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రముఖంగా నిలిచింది. ఇండోనేషియా రాజకీయవేత్త మేఘావతి సుఖర్నోపుత్రి, అవతార్ డెరైక్టర్ కామరూన్ భార్యతో సహా గాంధీజీని తమ వాడు అనుకున్న ప్రతి ఒక్కరూ అహింసా సిల్క్ కావాలనుకున్నారు. మొదట ఇది అయ్యేపని కాదు అన్నవారే తర్వాత నా కృషిని మెచ్చుకున్నారు. అహింసాపట్టుతో ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే, మొదటిసారి అహింసా సిల్క్ మూడు రంగుల వస్త్రాన్ని మా అమ్మనాన్నలకు చూపినప్పుడు, వారి కళ్లలో మెరిసిన గర్వం ఈ జన్మకు సరిపడిన ఆనందాన్ని ఇచ్చింది’ అని చెబుతూ సుతిమెత్తగా ఉన్న అహింసా పట్టు వస్త్రాన్ని బిడ్డలా నిమురుతూ ఆ వస్త్రం తయారీ వెనక చోటుచేసుకున్న పరిణామాలను, అనుభవాలను పంచుకున్నారు కుసుమరాజయ్య. అందరూ పనులు చేస్తారు. కొత్తగా ఆలోచించనవారే విజేతలుగా నిలబడతారు. దాంట్లో సహప్రాణుల పట్ల కరుణ చూపేవారు ప్రత్యేకతను చాటుకుంటారు. వారిలో కుసుమరాజయ్య ముందుంటారు. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివమల్లాల
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement