-
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఆ కంటెయినర్ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్లో కనిపించిన సీన్కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి
ఇండియా–మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దు గుండా ఈశాన్య రాష్ట్రాల్లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అఫ్గానిస్తాన్ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆ సాగుకు కావాల్సిన నీరు, ఎరువులు, మూలధన పెట్టుబడులు, కొనుగోలుదారులు, మార్కెటింగ్, హవాలా లాంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యవస్థీకృత నెట్వర్క్గా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేస్తే తప్ప ఈ ప్రమాదాన్ని అరికట్టలేం. కాలాడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్లో భాగంగా మయన్మార్లోని సీత్త్వే పోర్ట్ను మిజోరం రాజధాని ఐజ్వాల్తో కలిపే ప్రణాళికలో ముఖ్యమైన పాలేత్వా పట్టణాన్ని సాయుధ తిరుగుబాటు గెరిల్లా గ్రూపు ఆరగాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు... ఇండియా –మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తాం అన్న కేంద్ర హోంమంత్రి ప్రకటన... ఈ రెండు కూడా భారతదేశ భద్రతతో ముడిపడిన అంశాలు. అలాగే ఇటీవల మణిపుర్లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణతో కూడా కొంత సంబంధం ఉన్న విషయాలు. 2003 డిసెంబర్లో వెలువడిన ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది. అఫ్గానిస్తాన్లో నల్లమందు సాగుపై తాలిబన్ ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యల ఫలితంగా అక్కడి ఉత్పత్తిలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుండగా, మయన్మార్లో పెరుగుతోందన్న వార్తలు సరిహద్దు పంచుకుంటున్న భారత్ లాంటి దేశాలకు కలవరం కలిగించేదే. దశాబ్దాలపాటు మయాన్మార్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సాయుధ తిరుగుబాటు... నల్లమందు (ఓపియం) ఉత్పత్తి పెరగడా నికి కారణమయ్యాయి. పేదరికంతో బాధపడుతున్న రైతులకు నల్ల మందు సాగు పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఒకే ఒకమార్గంగా అవతరించింది. కిలోకు సుమారు 23 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక కోటి పదిలక్షల హెక్టార్ల సాగు చేయదగిన భూమి ఉన్న మయన్మార్లో దాదాపు 47,000 హెక్టార్లు అంటే 0.5 శాతం భూమిలో నల్లమందు పండుతోంది. దీనివల్ల గతేడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 2022లో ఆ దేశం ఉత్పత్తి చేసిన నల్లమందు కన్నా సుమారు 36 శాతంఅధికం. ఇదే సమయంలో ఎకరానికి సగటు ఉత్పత్తి 19 నుండి 22 కిలోలకు పెరిగింది. సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా రనీ, ఆయా ప్రాంతాలను నియంత్రిస్తున్నవారి సహాయం లేకుండా ఇది సాధ్యపడదనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యాపారం విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు. ఈ నల్లమందు ద్వారా ఉత్పత్పయ్యే హెరాయిన్, మార్ఫీన్, కోడెయిన్ వంటి మత్తు పదార్థాల ద్వారా సుమారు పది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది మయన్మార్ స్థూల జాతీయోత్పత్తిలో 2–4 శాతం. మయన్మార్లో ముఖ్యంగా మూడు రాష్ట్రాలైన షాన్, చిన్, కాచి న్లలో నల్లమందు సాగు నిరాటంకంగా జరుగుతోంది. థాయిలాండ్, లావోస్ దేశాలను ఆనుకుని ఉండే షాన్లో 1750ల లోనే నల్లమందు సాగు మొదలైంది. క్రమంగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి, ఇర వయ్యో శతాబ్దం నాటికి గోల్డెన్ ట్రయాంగిల్ రూపంలో అవతరించడమే గాక, ప్రపంచంలో సగం నల్లమందు ఆధారిత మత్తుపదార్థాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 80 శాతం ఉత్పత్తి జరుగుతుంటే, భారత్ను ఆనుకొని ఉండే చిన్, కాచిన్ రాష్ట్రాలు మిగిలిన ఇరవై శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలోని టాహం, ఫాలం, తుఎంసెంగ్ ప్రాంతాల మీదుగా మయన్మార్తో సుమారు 510 కిలోమీటర్ల కంచె లేని సరిహద్దు కలిగి వున్న మిజోరంలోని ఛాంఫై, మణిపుర్లోని మొరెహ్, టాము ప్రాంతాల ద్వారా నల్లమందు భారత్లోకి చేరుతోంది. మయన్మార్తో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్పై, ముఖ్యంగా మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. వివిధ జాతులకు చెందిన సాయుధ పోరాట సంస్థలతో పాటు కొన్ని మిలిటరీ విభాగాలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ఆయుధాల కొనుగోలు కోసం ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం పంచుకుంటున్నారు. కాచిన్ ప్రాంతంలోని కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, ఆరగాన్ ఆర్మీ, యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ వాటిలో కొన్ని మాత్రమే. అలాగే చిన్ రాష్ట్రం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చిన్ నేషనల్ ఆర్మీ, చిన్ నేషనల్ డెమోక్రాటిక్ ఫోర్స్, చిన్ ల్యాండ్ డిఫెన్స్ ఫోర్స్ లాంటి కొన్ని సాయుధ సంస్థలతో పాటు, సరిహ ద్దులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న కుకీ నేషనల్ ఆర్మీ కూడా ఈ వ్యవహారాల్లో భాగం కావడం ఆందోళన కలిగించేదే. సరి హద్దు దేశాలపై తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవ డానికి మయన్మార్ మిలిటరీ జుంటా కూడా ఈ నల్లమందు అక్రమ రవాణాలో భాగం పంచుకుంటోందని ఆ దేశానికి చెందిన ‘నేషనల్ యూనిటీ కన్సల్టేటివ్ కౌన్సిల్’ సభ్యుడు యు మయూన్గ్ మయూన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నెట్వర్క్లో చైనీస్ డ్రగ్ కార్టెల్స్ పాత్ర చెప్పుకో దగినది. డ్రగ్స్ను అటు ఆగ్నేయాసియా మార్కెట్లలోకి తరలిస్తూ, ఇటు థాయిలాండ్ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన సాయుధ వేర్పాటు దళాలుఇంతకు ముందు నిధుల సేకరణకు బ్యాంకు దోపిడీలు, టీ గార్డెన్లు, వ్యాపార సముదాయాల నుండి అక్రమ వసూళ్లు, ప్రజల వద్ద పన్నులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుండి డబ్బు గుంజడాలు లాంటివి చేస్తుండేవి. ఈ నిధులను మయన్మార్లోని కాచిన్ వేర్పాటు వాద వర్గాల నుండి ఆయుధాలు కొనుగోలు కోసం వెచ్చిస్తుండేవి. అవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకునేవి కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో మార్పువస్తోంది. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే, నాలుగు విషయాలు గోచరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ, మారుమూల ప్రాంతాల్లో నల్లమందు, గంజాయి సాగు పెరుగుతోంది. హెరాయిన్, యాంఫేట మిన్ లాంటి మత్తు పదార్థాలు చిన్న పరిమాణాల్లో ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి. కొన్ని రకాల ఫార్మాస్యూటికల్స్ ఈశాన్య రాష్ట్రాల నుండి మయన్మార్లోకి రవాణా అవుతున్నాయి. యాంఫేటమిన్ లాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఫెడ్రిన్, సూడోపె డ్రిన్ లాంటివి మయన్మార్కు ఈశాన్య రాష్ట్రాల నుండి వెళ్తున్నాయి. అంటే సరిహద్దులకు ఇరు వైపులా సాగుతున్న వ్యవహారం ఇది! పశ్చిమాన అఫ్గానిస్తాన్, వాయవ్య పాకిస్తాన్, మధ్య ఆసియాతో కూడిన ‘గోల్డెన్ క్రెసెంట్’కూ... తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’కూ మధ్యలో ఉన్న భారత్ మాదక ద్రవ్యాలకు అతిపెద్ద ఆకర్షణీయమైన మార్కెట్. మత్తు పదా ర్థాలను ఏమాత్రం సహించని(జీరో టోలెరెన్స్) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్వీకరించింది. దీనిలో భాగంగా 2016లో నార్కో కోఆర్డి నేషన్ సెంటర్, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం2019లో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైనాయి. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్’ చట్టం 1985లో భాగంగా బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్కు డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించారు. ఇప్పటివరకూ సుమారు ఒకటిన్నర లక్షల కిలోల మత్తు మందులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తే, అందులో నలభై వేల కిలోలు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోవే. ప్రభుత్వాలే కాకుండా వివిధ రంగాల ప్రజలు కూడా సమాజాన్ని జాగృతం చేస్తేనే మత్తు మహమ్మారిని అరికట్టగలం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్న విధంగా డ్రగ్స్ సేవించడం, సైకోల్లా ప్రవర్తించడమే హీరోయిజంగా యువత భావిస్తే మనం కేవలం నిట్టూర్పు విడవాల్సి వస్తుంది. - వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, జేఎన్యూ ‘ 79089 33741 - డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
Telangana: ఇక డ్రగ్స్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవాళ్ల కట్టడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. కొత్త ఏడాది నుంచి ఇక తెల్లవారులూ ప్రధాన నగరాల్లో.. పట్టణాల్లో మందు బాబుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర పోలీస్ శాఖ. ఈ తరుణంలో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలోనే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిర్ణయించుకుంది. ఇందుకోసం కొత్త కిట్లను రప్పించుకుని పోలీస్ శాఖకు అప్పగించింది. ఇక శాంపిల్స్, ల్యాబ్ టెస్టులు పాత ముచ్చట. ఈ కొత్త కిట్ల ద్వారా మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల ద్వారా డ్రగ్స్ తీసుకున్న సంగతి బయపడుతుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలు అధికారులు చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అదుపు తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం నార్కోటిక్ బ్యూరో చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే కొత్త పరికరాలు ఒక్కో కమిషనరేట్కు పాతిక దాకా పంపించారు. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందిని అధికారులు తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెస్టులు ఇచ్చే ఫలితం ఆధారంగా.. వారాంతాల్లో రెగ్యులర్గా ఇలాంటి చెకింగ్లు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో తెలంగాణ కొత్త సర్కార్ సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కఠిన చర్యలు తప్పవు నయా సాల్ వేడుకల్లో మత్తులో ఊగితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. పబ్బు, రిసార్ట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై చర్యలు ఉంటాయి. పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం. పబ్బుల్లో.. రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్తులో వారికి లైసెన్స్ రాకుండా చేస్తాం. కొన్ని రంగాల వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడొద్దు అని హెచ్చరించారాయన. అలాగే.. కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తామని తెలిపారాయన. రాత్రి 10 గంటల నుంచి ‘పీవీ ఎక్స్ప్రెస్ వే’ను మూసివేస్తాం. అయితే.. ఎయిర్పోర్టుకు వెళ్లేవారు టికెట్ను చూసి పీవీ ఎక్స్ప్రెస్ మార్గంలో అనుమతిస్తాం. రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు.. మూసేయాల్సిందే. -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబు, ఐజీలు రమేశ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- 'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
Advertisement