-
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
అరచేతిలో అడిక్షన్
అర్ధరాత్రి.. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచారు. ఈ టైంలో ఫోనా?! ఎవరికి ఏమైందోనన్న ఆందోళనతో మంచం పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కంగారుగా స్క్రీన్ వైపు చూశారు. అంతే, ఆశ్చర్యం, కాసింత గందరగోళం.. ఎందుకంటే మీకు అస్సలు ఫోనే రాలేదు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతం.. అక్కడ మీరూ ఉన్నారు. అంతలో ఎవరిదో ఫోన్ రింగవుతోంది. ఆ వెంటనే మీ చేయి కూడా మీ జేబులో ఉన్న ఫోన్ మీదికి వెళ్లింది. మీ పక్కనే ఉన్న వ్యక్తి ‘హలో..’ అనడంతో మీకు అర్థమైంది.. రింగైంది మీ ఫోన్ కాదని. అసలు ఆ రింగ్ టోన్ కూడా మీ ఫోన్ది కాదు. ఆ విషయం మీకూ తెలుసు.. అయినా రింగ్ వినపడగానే మీ చేయి అలా మీ ఫోన్ మీదికి వెళ్లిపోయింది. ఫుల్ ట్రాఫిక్.. బైక్పై వెళుతున్నారు. జేబులో ఉన్న మీ ఫోన్ అప్పటికే రెండు మూడు సార్లు రింగైంది. కానీ ఫోన్ బయటకు తీసి మాట్లాడలేని పరిస్థితి. ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ.. వేగంగా ట్రాఫిక్ను దాటి వెళ్లి బైక్ను అలా రోడ్డు పక్కన నిలిపి ఫోన్ బయటకు తీసి చూసి షాకయ్యారు. అక్కడ ఎలాంటి కాల్ రాలేదు. మరి రెండు మూడు సార్లు మీరు విన్న ఆ రింగ్ ఎక్కడిది? ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు.. ఓ అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో మీరూ, మీ భార్య, ఇద్దరు పిల్లలు. మీరు బయటికి వెళ్లింది మొదలు.. ఇంట్లో ఎదురు చూపులు మొదలవుతాయి. ఉండబట్టలేక పిల్లలు అడిగేస్తారు.. నాన్న ఇంకెప్పుడొస్తారమ్మా? అని. ఆ నాన్న కోసమే ఎదురుచూస్తున్న అమ్మ.. ‘కాసేపట్లో వచ్చేస్తారులే’ అంటూ పిల్లలను సముదాయిస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఇక ఆ ఇంట్లో సందడే సందడి. పిల్లల అల్లరితో అది తార స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ ఇల్లు.. నందనవనాన్ని తలపిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని మరిపిస్తుంది. అలాకాకుండా, మీరు ఇంట్లోకి వచ్చీ రావడంతోనే జేబులోంచి మొబైల్ తీసి దానికి అంకితమైపోతే.. గంటల తరబడి దానికే దాసోహమైతే.. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేంతగా మీ ఫోనే మీకు ప్రపంచమైతే.. మీ ఇల్లాలి సంగతేంటి? నాన్నతో కలిసి అల్లరిచేయడం కోసం ఎదురుచూస్తున్న ఆ పసిబిడ్డల పరిస్థితేంటి? అటు మొబైల్తో మీరు.. ఇటు మీ పలకరింపు కోసం నిరీక్షిస్తూ మీ ఇల్లాలు, మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలని పరితపిస్తూ మీ పిల్లలు. ఇంట్లో నలుగురు ఉన్నా.. అంతా నిశ్శబ్ధం! మీకు, మీ భార్యాపిల్లలకు మధ్య అంతులేని అగాథం! కుటుంబానికి టైం కేటాయించడానికి, మొబైల్తో టైంపాస్ చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి.. మనల్ని మనకు కాకుండా చేస్తుంది.. మన చేతిలో స్మార్ట్ఫోన్ ఉందంటే యావత్ ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. అవసరం మేరకు దానిని వినియోగించుకుంటే.. అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా దానితో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఇలా అతిగా ఫోన్ వాడేవారు దానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు, యువత పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనం చాలా ప్రమాదకరం. మన జీవితంపై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. మన వారిని మనకు దూరం చేస్తుంది. సెల్ఫోనే మనకు జీవితమైనప్పుడు.. ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాం. స్నేహితులకు, బంధువులకు దూరమవుతాం. భార్యాబిడ్డలతోనే ఉంటున్నా.. వారికి అందనంత దూరంలో సెల్ఫోన్తో సేదదీరుతాం. నిద్ర రాదు.. ఆకలి వేయదు. కళ్లకు తప్ప మెదడుకు పని లేకపోవడంతో మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గడమేగాక.. పలు మానసిక రుగ్మతలకు ద్వారాలు తెరుస్తుంది. ఇలా అయితే బానిస అయినట్టే! మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా? ఎలాంటి కాల్ రాకుండానే.. వ చ్చినట్టు, ఏ నోటిఫికేషన్ రాకుండానే ఏదో మెసేజ్ వ చ్చినట్టు భ్రమపడుతున్నారా? మీకు ఎలాంటి కాల్ వచ్చే పరిస్థితి లేకున్నా.. ఎవరైనా కాల్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా? ఫోన్కు మెసేజ్ రావడమే ఆలస్యం.. చేస్తున్న పనిని ఉన్నఫళంగా వదిలేసి క్షణాల్లోనే వాటిని చూసేస్తున్నారా? సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారా? అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ లక్షణాలు, లేదా వీటిలో కొన్ని అయినా మీలో కనిపిస్తే.. మీరు స్మార్ట్ఫోన్కు బానిస అయినట్టే లెక్క. ఒక్కసారి పరీక్షించుకుందాం.. మనం బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఓ సారి మొబైల్ను ఇంట్లోనే ఉంచుదాం. ఆ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గమనిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు.. దేని మీదా ధ్యాస లేనట్టు.. చేసే పనిమీద ఏకాగ్రత కుదరనట్టు.. ఫోన్లో మునిగిఉన్న వాళ్లను చూస్తే ఉక్రోషం తన్నుకొస్తున్నట్టు.. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ధికానట్టు.. చికాకు.. చిరాకు.. పిచ్చెక్కుతున్నట్టు.. వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నట్టు.. ఇలా మనలో మెదులుతున్న ఆలోచనల స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు.. మనం ఏ స్థాయిలో మొబైల్కు బానిసయ్యామో. ఫోన్కు బానిసవ్వడం అన్నది తీవ్రంగా ఉందనిపించినప్పుడు వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం ప్రతి దానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటం ఎక్కువైంది. ఈ అడిక్షన్ అనేది.. సెల్ఫోన్ లేకుంటే రోజు గడవదేమో అన్న స్థితికి చేరుకుంది. కొద్దిసేపు మొబైల్ కనపడకపోయినా, చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోయినా ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్ రింగ్ కాకున్నా రింగ్ టోన్ వినిపిస్తున్నట్టు అనిపించడాన్ని రింగ్సైటీ అంటారు. అదేపనిగా ఫోన్ వినియోగించడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. ఈ సమస్యకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. – ఎం.లహరి, సైకాలజిస్ట్ నోటిఫికేషన్లు ఆపేద్దాం.. మన పనిలో మనం తలమునకలై ఉన్నప్పుడు ఫోన్కు వచ్చే అనవసర నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వాటి ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. ఫోన్కు నోటిఫికేషన్ రాగానే ఏదైనా ముఖ్యమైన మెస్సేజ్ వ చ్చిందేమోనని తెగ ఆరాటపడిపోతాం. అందుకే సోషల్ మీడియా యాప్లకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను ఆఫ్లో పెట్టుకోవడం ఉత్తమం. అంతకు మించి సమయం ఇవ్వొద్దు.. రోజుకు ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం.. ఏయే యాప్లలో ఎక్కువసేపు గడుపుతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందుకోసం మన మొబైల్లోనే ఆప్షన్లుంటాయి. మొబైల్ స్క్రీన్పై మనం గడుపుతున్న సమయాన్ని వాటి సాయంతో అంచనా వేస్తూ.. మన అవసరం మేర మాత్రమే ఫోన్ను వినియోగిస్తూ.. ఫోన్ వాడకం సమయాన్ని క్రమంగా తగ్గించుకుందాం. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.. సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అలాగే వీకెండ్లలో వీడియోలు చూస్తూనో, గేమ్లు ఆడుతూనో లేదా ఫ్రెండ్స్తో చాటింగ్లు చేస్తూనో గంటల తరబడి గడిపేస్తాం. అలా కాకుండా ఖాళీ వేళల్లో,సెలవులు, వీకెండ్లలో విశ్రాంతి తీసుకోవడం, స్నేహితులను కలవడం, లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతి సమాచారానికి ఫోన్ల మీదే ఆధారపడకుండా.. పుస్తకాల నుంచీ పొందుతుండాలి. బెడ్కు దూరంగా.. మొబైల్ మనకు పక్కనే ఉంటే దానిని వాడాలనిపిస్తుంది. నిద్రపట్టకపోయినా, మెలకువ వచ్చినా.. పక్కన ఫోన్ ఉంటే ఇట్టే అందుకుంటాం. ఈ అలవాటును అధిగమించాలంటే మన బెడ్కు దూరంగా.. మన చేతికి అందనంత దూరంలో ఫోన్ పెట్టుకోవడం ఉత్తమం. అసలు స్విచ్ఛాఫ్ చేసుకుంటే మరీ మేలు. – తమనంపల్లి రాజేశ్వరరావు,ఏపీ సెంట్రల్ డెస్క్ -
విమర్శ లేదా తిరస్కరణను హ్యాండిల్ చేయలేకపోతున్నారా?
విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్కు, ఫ్రెండ్స్కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి. బాల్యానుభవాల నుంచే.. ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు. బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. అసమర్థత భావాలే ప్రధాన లక్షణం.. అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి. తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం. అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు. గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు. ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం. నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది · ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?) -
బాల్యంలో స్మార్ట్ ఫోన్తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మనసు కడలిలో ఒత్తిడి ఉప్పెన
విజయవాడ పటమటకు చెందిన 45 ఏళ్ల రమేష్ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, దీర్ఘ ఆలోచనలు చేయడంతో పలు రోగాల బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమీ లేదని తిప్పి పంపేవారు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తేల్చారు. లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి గానీ నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీసుకు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): తల తిరుగుతుంది.. కడుపులో తిప్పుతుంది.. గుండె పట్టుకుంటుంది.. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుంది..! అదే డిప్రెషన్. ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిరంతరం ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుందని, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా గుర్తించండి.. నిద్రలేమి, ఎల్లప్పుడూ దిగులుగా ఉండటం.. ఏకాగ్రతా లోపించడం వంటి సమస్యలు ఉంటే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాట పడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. కొరవడిన మానసికోల్లాసం నగరంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో వారిలోని సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువుల్లో రోబోలుగా మారుతున్నారు. వారిలో సామాజిక, నైతిక విలువులు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. ఒత్తిడితో దుష్ప్రభావాలు ♦ నిద్ర పట్టక పోవడం ♦ ఆకలి లేక పోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం ♦ఎక్కువ తినేవారు ఒబెసిటీకి గురవడం ♦ హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు ♦ మధుమేహం, రక్తపోటు అదుపులోలేకపోవడం ♦ తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు ♦ వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్ఫెక్షన్స్ సోకడం జరుగుతుంది. ఇలా జయించొచ్చు ♦ రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, ఒకే సమయానికి రోజూ పడుకోవాలి. ♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ♦ యోగ, మెడిటేషన్పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి ♦ సెల్ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. ♦ భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. ♦ అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఒత్తిళ్లతో రుగ్మతలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతుంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నిద్రలేక పోవడం, ఎక్కువ ఆహారం తినడం కారణంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ విజయలక్ష్మి, మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ యువతలో తీవ్రమైన ఒత్తిడి ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారాలు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement