-
ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స సౌకర్యం
-
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
పగలు తిప్పండి.. రాత్రి ఆపండి
సాక్షి, అమరావతి: అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా.. యాక్సిడెంట్ అయినా.. వెంటనే 108కు ఫోన్ చేయడం ప్రజలకు అలవాటు. ఇకపై రాత్రి పూట ఫోన్ చేస్తే 108 రాదు. ఎందుకంటే ఉన్న వాహనాలను పగలు మాత్రమే తిప్పండి, రాత్రి నిలిపివేయండి అంటూ 108 అంబులెన్సుల నిర్వహణా సంస్థ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేయడమే కారణం. రాష్ట్రంలో 439 వాహనాలుండగా 422 వాహనాలు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కోర్డాష్ బోర్డులో సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం 342 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని నిర్వాహణ సంస్థ జీవీజీ ఉద్యోగులు చెబుతున్నారు. వాహనాలను పగలు మాత్రమే తిప్పాలని, ఐదు కిలోమీటర్ల దూరం అయితేనే వెళ్లాలని, అంతకుమించి దూరంలో సంఘటన స్థలం ఉంటే బిజీగా ఉన్నామని చెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదానికో, ఇతరత్రా ఆపదలో ఉన్న పేదలు 108కు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని జవాబు వస్తోంది. వాహనాలు తిరగడం లేదని ఉద్యోగులెవరైనా మీడియాకు చెబితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంస్థ బెదిరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని వాహనాల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేవు, 90 శాతం వాహనాల్లో మందులు లేవు, మెజార్టీ వాహనాలకు టైర్లు అరిగిపోయి తిరగడం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. అయితే తాము ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేమని, ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని ఉద్యోగులు హెచ్చరించారు. 108 వాహనాల సమస్యలు ఇవీ.. - సకాలంలో ఇంజన్ ఆయిల్ మార్చకపోవడంతో ఇంజన్లు సీజ్ అవుతున్నాయి - హెడ్లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి - సైరన్, బార్లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్ పనిచేయడంలేదు. టైర్లు పూర్తిగా అరిగిపోయి వందల వాహనాలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి - బ్రేకులు, బ్యాటరీలు పనిచేయడం లేదు - వైఫర్స్ పనిచేయకపోవడంతో వర్షంలో తిరగడం కష్టంగా ఉంటోంది. వాహనాల్లో మల్టీచానల్ మానిటర్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్, పల్సాక్సీ మీటర్లు లేవు - కనీసం బీపీ ఆపరేటర్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్లు కూడా లేవు - చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు - క్షతగాత్రులకు అవసరమైన కాటన్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, సెరిలైజ్డ్ దూది, అయోడిన్, స్ట్రెచర్ కూడా లేవు - పాముకాటు సమయంలో ఇవ్వాల్సిన ఏఎస్వీ,టీటీ ఇంజక్షన్లు లేవు ఉద్యోగుల సమస్యలు.. - ప్రతినెలా ఉద్యోగుల వేతనాల్లో కారణం లేకుండా కోత వేస్తున్నారు - రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయిస్తున్నారు - వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెంచలేదు - గత 6 నెలలుకు సంబంధించిన రిలీవింగ్ బిల్లులు చెల్లించలేదు - వాహనాలకు మైనరు రిపేర్లు, పంక్చర్స్, ఎయిర్, హెడ్లైట్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల మీద వేస్తున్నారు. - వాహనాలు ఆగిపోతే ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపించకపోగా వేతనాలు కూడా ఇవ్వడంలేదు. సిబ్బంది ప్రమాదానికి గురైతే ఎలాంటి వైద్య బీమా లేదు -
అవుట్ పేషెంట్ కవరేజీ తీసుకుంటే మేలా...?
ఆరోగ్యపరంగా ధీమాగా ఉండాలంటే నేడు వైద్య బీమా ఉండాల్సిందే. ఆస్పత్రి పాలైతే చికిత్స వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మరి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా అవుట్ పేషెంట్గా తీసుకునే చికిత్సల వ్యయాల సంగతేంటి? ఎప్పుడైన ఆలోచించారా...? ఆస్పత్రిలో వైద్యుల కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల కొనుగోలు వ్యయాలు వీటికి ఎవరికి వారు విడిగా చెల్లించుకోవాలా..? లేక బీమా పాలసీలో కవరేజీ కావాలా? వైద్య బీమా పాలసీలో ఇది కూడా ముఖ్యమైన అంశమే. చాలా కంపెనీలు రెగ్యులర్ హెల్త్ పాలసీలతోపాటు అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) నుంచి పొందే చికిత్సలకు కూడా కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఓపీడీ కవరేజీని ఎంచుకునే ముందు వేటికి కవరేజీ లభిస్తుంది? ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్కు అనుమతిస్తారు? తదితర అంశాలను తప్పక తెలుసుకోవాలి. వీటికి ప్రీమియం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఓపీడీ కవరేజీని విడిగా పాలసీ రూపంలో కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. సాధారణ హెల్త్ పాలసీకి అనుబంధంగానే ఓపీడీ కవరేజీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, మ్యాక్స్ బూపా ఈ కవరేజీతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఓపీడీ కవరేజీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, వైద్యులు రాసిన మందులకు అయ్యే వ్యయాలు, వైద్య పరీక్షల వ్యయాలకు కవరేజీ ఉంటుంది. వీటికి క్లెయిమ్ను ఆస్పత్రి ద్వారా క్యాష్లెస్ రూపంలో పొందొచ్చు. లేదా రీయింబర్స్మెంట్ విధానంలోనూ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం బీమాలో ఓపీడీ కవరేజీ ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్ చేసుకోవచ్చన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఓపీడీ కవరేజీ చాలా పరిమితంగానే ఉండొచ్చు. వైద్య బీమా రూ.10 లక్షల కవరేజీకి తీసుకుంటే అందులో ఓపీడీ కవరేజీ గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.10,000కే పరిమితం అవుతుంది. దీనికి మించి ఎంత ఖర్చు చేసినా కంపెనీ ఇవ్వదు. ఇక కొన్ని కన్సల్టేషన్లకు, మందుల కొనుగోలుకు మళ్లీ పరిమితులను కంపెనీలు విధిస్తుంటాయి. ఉదాహరణకు మ్యాక్స్ బూపా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజుకు గరిష్టంగా రూ.600వరకే ఇస్తోంది. రూ.10 లక్షల పాలసీలో ఒక ఏడాదికి ఇలా గరిష్టంగా 10 డాక్టర్ కన్సల్టేషన్లకు అయిన వ్యయాలను చెల్లిస్తోంది. ఇతర ఓపీడీ ప్రయోజనాలు కూడా ఈ పాలసీలో ఉన్నాయి. అదే రూ.4 లక్షలకు పాలసీ తీసుకుంటే కన్సల్టేషన్లు నాలుగింటికే పరిమితం. డయాగ్నోస్టిక్ టెస్ట్లకు పరిమితి రూ.1,500. ప్రీమియం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లడం సర్వ సాధారణం. అయితే, బీమా కంపెనీలు మాత్రం ఓపీడీ కవరేజీకి అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ఓపీడీ కవరేజీ అన్నది వసూలు చేసే ప్రీమియానికి కాస్తంత ఎక్కువగా ఉండటాన్ని చాలా కంపెనీల్లో గమనించొచ్చు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ ప్రయోజనాలతో కూడిన రూ.4 లక్షల వైద్య బీమా పాలసీని 35 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని జీవిత భాగస్వామి, ఒక చిన్నారి (మొత్తం ముగ్గురు)కి కలిపి వార్షికంగా రూ.15,000 ప్రీమియంను వసూలు చేస్తోంది. ఇందులో ఓపీడీ క్లెయిమ్ బెనిఫిట్ పరిమితి ఏడాదికి ముగ్గురికీ కలిపి రూ.3,280 మాత్రమే. ఇదే కుటుంబం రూ.5 లక్షల హెల్త్ పాలసీని ఓపీడీ లేకుండా తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.11,915. అంటే రూ.3,280 ఓపీడీ కవరేజీ కోసం కంపెనీ రూ.3,085ను ప్రీమియంగా వసూలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. మ్యాక్స్బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. రూ.10 లక్షల వైద్య బీమా పాలసీని ఓపీడీ కవరేజీతో తీసుకుంటే ప్రీమియం రూ.4,000–7,000 వరకు అదనంగా (ఓపీడీ లేని పాలసీ ప్రీమియంతో పోలిస్తే) ఉంది. ప్రత్యామ్నాయాలూ ఆలోచించాలి..! ఓపీడీ కవరేజీ తీసుకుంటే అదనంగా చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఓపీడీ కవరేజీ కింద కంపెనీల నుంచి పొందే రీయింబర్స్మెంట్కు పన్ను లేదు. అయితే, పన్ను ఆదా ఒక్కటే ఓపీడీ కవరేజీ తీసుకోవడానికి కారణం కారాదు. ఉదాహరణకు మధుమేహ సమస్యతో ఉన్న వారు, హైబీపీతో బాధపడుతున్న వారు తరచూ వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరపడుతుంది. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ తరహా వ్యక్తులకు బీమా కంపెనీల నుంచి తగినంత కవరేజీ లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా ప్రీమియం అధికంగా ఉంటుంది. అందుకని ఓపీడీ కవరేజీ తీసుకోవడం కంటే అందుకు అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు విడిగా ఆదా చేసుకోవడం మంచిది. ఇందుకోసం వేతనంలో కొంత మేర పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే షార్ట్టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి అవుట్ పేషెంట్ చికిత్సల రూపంలో ఎదురయ్యే అకస్మిక ఖర్చులను తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement