-
కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే
సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లుతున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగునీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యకతను వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో భూపేంద్రయాదవ్తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావరణ అనుమతులతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ఏకపక్షంగా నీటి విడుదల.. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆపరేషనల్ ప్రొటోకాల్స్, ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022–23లో సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవసరం లేనప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు. నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథకాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్యపడదన్నారు. ఈ పరిస్థితుల నేప«థ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఎస్) అమలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సరఫరా చేయగలుగుతామన్నారు. నిబంధనలు, ప్రొటోకాల్స్ను పూర్తిగా విస్మరించి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నారు. ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి.. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని సీఎంజగన్ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తికి అనువైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్సహించేందుకు పాలసీ కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు) పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 3 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్ కేంద్రమంత్రికి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అనుమతులిచ్చి సహకారం అందించాలని కోరారు. -
ఆంధ్రరాష్ట్రానికి పోలవరం.. మణిహారం
సత్తెనపల్లి(పల్నాడు): ఆంధ్రరాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్తెనపల్లి నియోజవకవర్గానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన రాజుపాలెం మండలం దేవరంపాడులోని నేతి వెంకన్నస్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణానికి చేరుకోగా మున్సిపల్ చైర్పర్సన్ చలంచర్ల లక్ష్మీతులసి హారతి పట్టి ఆహ్వానించారు. నరసరావుపేట రోడ్డులోని చెక్పోస్టు వద్ద నుంచి అశేషజనవాహినితో ర్యాలీగా అమరావతి బస్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్దకు వచ్చారు. హరిమిత్ర మండలి ఏర్పాటు చేసిన భారీ గజమాలను ధరించారు. ఆర్యవైశ్యనాయకులు వెలుగూరి శరత్ వెండికిరీటాన్ని మంత్రికి అందించారు. అచ్యుత శివప్రసాద్ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని పదవిలా కాకుండా కీలకమైన బాధ్యతగా భావిస్తానన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోల వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మెహన్రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు. జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంస్కరణలతో, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా కోట్లరూపాయలు లబ్ధిదారుల ఖాతాలో చేర్చుతున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వేదికపై వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి నిమ్మకాయల రాజానారాయణ, పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి, మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ రాయపాటి ఫురుషోత్తమరావు, జిల్లా రైతు సలహామండలి సభ్యులు కళ్లం విజయభాస్కరరెడ్డి, వైస్ చైర్మన్ షేక్ నాగూర్మీరా, యువజన నాయకులు అచ్యుత శివప్రసాద్ తదితరులున్నారు. గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో కలిసి అభినందించారు. -
సర్కార్పై ‘రాజకీయ చార్జిషీట్లు’
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. వాగ్దానాలు, హామీల్లో వైఫల్యాలతోపాటు అవి నీతిని వెలికితీసి ప్రజాకోర్టులో పొలిటికల్ చార్జిషీట్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లో అవినీతి, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఇచ్చిన వాగ్దానాలు, నేతలు స్థానికంగా ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలపై వివరాలు సేకరించనుంది. నీటిపారుదల ప్రాజెక్ట్లు, ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయేందుకు అవకాశమున్న అంశాలు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు మొదలు వివిధ స్థాయిల నేతలు పాల్పడే అవినీతి, దందాలపై బీజేపీ దృష్టి పెట్టింది. వీటితో ముడిపడిన వివిధ అంశాలపై ప్రత్యేకంగా పనిచేసేందుకు త్వరలోనే ముఖ్యనేతలతో సబ్ కమిటీలను నియమించనున్నట్టు సమాచారం. ఈ కమిటీలకు కన్వీ నర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమించడం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై సమాచార సేకరణ, లోతైన విశ్లేషణ జరిపి అధికారపార్టీ తీరును ఎండగట్టాలని నాయకత్వం భావిస్తోంది. గత ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, వాటి నిర్మాణానికి చేసిన వ్యయం, వాటి వల్ల ప్రజలకు ఒనగూరిన అదనపు ప్రయోజనాలు, అవినీతి, అక్రమాలు, కమిషన్లు పొందేందుకు ఉన్న ఆస్కారాలు, సంబంధిత విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. ముఖ్య నేతలతో కమిటీల నియమాకం సీఎం కేసీఆర్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఏ మేరకు అమలయ్యాయి, వాటిలో ప్రధానంగా అమలుకానివి ఏవేవీ అన్న అంశాన్ని కూడా మరో కమిటీ ద్వారా వెలికితీయనున్నారు. వివిధ స్థాయిల్లోని టీఆర్ఎస్ నేతలపై వచ్చిన, వస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టేందుకు ఇంకొక కమిటీని నియమిస్తున్నారు. త్వరలోనే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్వహణ, లోటుపాట్లు తదితర అంశాల పరిశీలనకు ఓ మాజీ ఎంపీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీలకు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్ వెంకటస్వామి, తీన్మార్ మల్లన్న, ఇతర ముఖ్య నేతలను కన్వీనర్లు, కో కన్వీనర్లుగా నియమించేందుకు నియమించనున్నట్లు సమాచారం. ఈ కమిటీల్లో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు తెలుస్తోంది. వీటికి సమాంతరంగా వివిధ సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, దందాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా మొత్తంగా అధికార పార్టీపై వివిధ మార్గాల ద్వారా రాజకీయపరంగా ముప్పేట దాడిని కొనసాగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. -
పోలవరం బకాయిల విడుదలకు సిఫార్సు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ఉన్న రూ.2,087 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని కోరగా రూ.711 కోట్ల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బిల్లుల స్క్రూటినీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరాల్సి రావడం, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి కారణాలవల్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుందని, వాటిని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపుతారని తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు అనుమతి లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి సేకరిస్తుందని పేర్కొన్నారు. ఆ నిధులు నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి, అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయని చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.11,600.16 కోట్లు తిరిగి చెల్లించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019 మే నుంచి ఇప్పటివరకు రూ.4,836 కోట్లు చెల్లించినట్లు టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఏపీలో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులు ఏపీలోని 13 జిల్లాల్లో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించామని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వీధి వ్యాపారుల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం దేశంలో ఎంపిక చేసిన 125 మునిసిపాలిటీల్లో ప్రధానమంత్రి స్వానిధి సే సమృద్ధి పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా పీఎం స్వానిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు చెప్పారు. ఎగుమతుల విషయంలో దేశంలోని చిన్న, మధ్యతరగతి సంస్థల నుంచి ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు అందలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నారాయణ రాణే చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు పనులు ప్రారంభం గెజిట్ నోటిఫికేషన్ను అమలుచేసే పనిని గోదావరి, కృష్ణా బోర్డులు ఇప్పటికే ప్రారంభించాయని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకంగా నీటి విడుదలను నిలిపేయాలని తాజాగా ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అభ్యర్థించిందని టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధామిచ్చారు. విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు త్వరలో విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయని పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్వేస్ మంత్రిత్వశాఖ చేపడుతోందని, ఈ మేరకు ఈ ఏడాది జూన్ 15న ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ డిమాండ్–సరఫరా ఎలా ఉందో ఎయిర్లైన్స్ సంస్థలు అధ్యయనం చేసిన అనంతరం ఆయా రూట్లలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్లైన్స్ ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్ అనంతరం విజయవాడ–హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసుల నిర్వహణకు వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ను గుర్తించినట్లు తెలిపారు. వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్లైన్స్ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. -
ఇబ్బందుల్లోనూ పనుల యుద్ధం!
‘‘రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకే ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ ప్రాజెక్టు పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముందుగా నిధులిస్తున్నాం. పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలి’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై జలవనరులశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల ప్రగతిని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు 91 శాతం పూర్తయ్యాయని, జూన్ 15 నాటికి మిగిలినవి పూర్తి చేస్తామన్నారు. స్పిల్ వేకు 42 రేడియల్ గేట్లను బిగించామని, మరో 6 గేట్లు అమర్చాల్సి ఉందని, వాటిని కూడా వేగంగా బిగిస్తామని వివరించారు. జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు త్వరలోనే పోలవరానికి చేరుకుంటాయన్నారు. ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేసి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నెలాఖరుకు స్పిల్ చానల్ పనులు రక్షిత స్థాయి (సేఫ్ స్టేజ్)కి చేరుకుంటాయన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్లో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు సంక్లిష్టమైనవి కూడా పూర్తి చేశామని వెల్లడించారు. కాఫర్ డ్యామ్లోని అన్ని రీచ్లను జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని తెలిపారు. వేగంగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు.. నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకు పోలవరం పనులు జరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యామ్కు సంబంధించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టండి.. పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తేవడంతో.. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్లో ఉండడం సరి కాదన్నారు. ఢిల్లీ వెళ్లి ఆ నిధులు రీయింబర్స్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనులకు వచ్చే మూడు నెలల్లో కనీసం రూ.1,470 కోట్లు అవసరమవుతాయని అధికారులు వివరించడంతో ఆ మేరకు నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాధాన్యతగా నేరడి బ్యారేజీ.. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. బ్యారేజీ ముంపు ప్రాంతంపై చర్చల కోసం ఇప్పటికే ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాసి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఒడిశా అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు కూడా 84 శాతం పూర్తయ్యాయని, జూలై 31 నాటికి మిగిలినవి పూర్తవుతాయని వివరించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను ఇరువైపుల నుంచి చేస్తున్నామని, 116 మీటర్ల పని మిగిలి ఉందని, ఫాల్ట్ జోన్ను పాలి యూథిరేన్ ఫోమ్ (పీయూఎం) రసాయన మిశ్రమం ద్వారా ఫోర్ ఫిల్లింగ్ ప్రక్రియ ద్వారా చేస్తున్నామని, మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలి.. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తయిందని అధికారులు వివరించారు. టన్నెల్ –2 హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. టన్నెల్–2లో ఇంకా 7,335 మీటర్ల పని మిగిలి ఉందని తెలిపారు. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని, తదుపరి సమావేశం నాటికి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం నిర్దేశించారు. సత్వరమే వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పూర్తి.. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వీటన్నింటినీ ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టామని, వీటి పనుల్లో ఏమాత్రం ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులకు సంబంధించి భూసేకరణ ఇబ్బందులు తొలగినందున వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. భూసేకరణ సమస్యలను కొలిక్కి తెస్తున్నామని, గడువులోగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లారని, న్యాయపరమైన చిక్కులను తొలగించి ముందడుగు వేస్తున్నామని వివరించారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేశామన్నారు. బ్రహ్మంసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. బ్రహ్మంసాగర్లో సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నిల్వ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు సమీకరించి పక్కాగా పనులు.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులు, గోదావరి కృష్ణా సెలైనటీ మిటిగేషన్, జలభద్రత ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల పనుల సన్నద్ధత, ఆర్థిక వనరుల సేకరణను పరిశీలించారు. ఇప్పటికే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశామని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఈ ప్రాజెక్టుకు రూ.12,056 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పనులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) రూ.2,750 కోట్ల రుణం మంజూరు చేసిందని, అందులో రూ.850 కోట్లు మార్చిలోనే విడుదలైనట్లు చెప్పారు. నిధులను సమీకరించి ప్రణాళిక ప్రకారం పనులను చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన బిల్లులన్నీ మంజూరు చేయాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి పి.అనిల్కుమార్యాదవ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement