-
శత్రుత్వం కన్నా మిత్రత్వం మిన్న..
శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజకీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారిత్రక సత్యాలు ఎంతో విలువైనవి. చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. చరిత్ర, హిమాలయన్ అనుసంధానం రీత్యా భారత్, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు నేడు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటివాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సి ఉంది. అతిపెద్ద పొరుగుదేశాల్లోని దాదాపు 300 కోట్ల మంది ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నేతలకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం ప్రశ్నించాల్సిన విషయమే. చైనా ప్రెసిడెంట్ షి జిన్పింగ్ ఇటీవల టిబెట్ లోని నింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని లాసాకు బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించడం రెండు అంశాలపై ఆసక్తి కలిగించింది. ఒకటి, పాక్షికంగా పూర్తిచేసిన ప్రమాదకరమైన 1,629 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్టు. ఇది చైనాలో అతిపెద్ద ఇన్నర్ సిటీ అయిన చెంగ్డును పశ్చిమాన ఉన్న లాసాతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలోని చాలా భాగం అతిపెళుసైన, ఎల్తైన, భూకంపాలు చెలరేగే, పర్యావరణపరంగా ప్రమాదకరమైన భూభాగంనుంచి వెళుతుంది. ఈ ప్రాజెక్టులో తొలి భాగమైన చెంగ్డు నుంచి యాన్ మార్గం దాదాపుగా పూర్తయింది. నింగ్చి నుంచి లాసా మార్గం కూడా పూర్తయింది. అయితే యాన్ నుంచి నింగ్చి మార్గంలోనే అత్యంత పొడవైన మధ్య భాగం నిర్మాణం పూర్తి కావడానికి మరొక పదేళ్ల సమయం పట్టవచ్చు. రెండోది, దక్షిణ టిబెట్కి షీ జిన్పింగ్ యాత్ర... భారత్తో సరి హద్దు ఘర్షణకు చైనా జాతీయ ఎజెండాలో ఆయన అత్యంత కీలక స్థానం ఇస్తున్నట్లు సూచించింది. టిబెట్ పరిణామాలను అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ స్కాలర్ రాబర్ట్ బర్నెట్ దీన్నే నొక్కి చెబుతున్నారు. చైనా ప్రభుత్వ మీడియా ఇప్పుడు భారత్కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బర్నెట్ అంచనా మరోసారి నిజమైంది. 1980లలో రాజీవ్గాంధీ నుంచి 2014లో నరేంద్ర మోదీ వరకు భారత ప్రధానుల హయాంలో భారత్ సైనిక సామగ్రి పరంగా సాధించిన విజయాలను విస్తృతంగా గుర్తిస్తూ చైనా మీడియా ఇప్పుడు స్పందిస్తోంది. భారత్, చైనా మధ్య శత్రుత్వం కొనసాగే అవకాశముందని, ఘర్షణలకు సన్నద్ధమయ్యే ఆవశ్యకత కూడా ఉంటుందని వాస్తవికవాదులు తప్పక గుర్తించాల్సి ఉంది. అదేసమయంలో పవిత్రమైన హిమాలయాలను ఒక భారీ శ్మశాన వాటికగా మార్చిన ఆ విషాద ఉన్మాదాన్ని, యుద్ధం అనే ప్రమాదకరమైన ప్రయోగం ద్వారా హిమాలయా పర్వతాలకు, నదులకు నష్టం కలిగించే పర్యవసానాలను కూడా వీరు మనసులో ఉంచుకోవాల్సి ఉంది. శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజ కీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారి త్రక సత్యాలను లెక్కించడం కూడా విలువైనదేనని చెప్పాలి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) అంచనా ప్రకారం లద్దాఖ్ ఘర్షణలు చెలరేగిన 2020 సంవత్సరం నాటికి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ఇది 5.6 శాతానికి పడిపోయింది. చైనా నుంచి భారత్కు దిగుమతులు 66.7 శాతంగా నమోదయ్యాయి. 2016 నుంచి చూస్తే ఇది అతితక్కువ శాతం అన్నమాట. దాదాపు 10.8 శాతం పతనమైందన్నమాట. కానీ చైనాకు భారత్ ఎగుమతులు 2020లో 16 శాతం పెరిగి 20.86 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. వీటిలో ఇనుప ఖనిజం ఎగుమతులు అత్యధికంగా పెరిగాయి. భారత వాణిజ్య లోటు అయిదేళ్ల స్వల్పానికి అంటే 45.8 శాతానికి పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ చైనా’ జీఏసీ నివేదికనుంచి పేర్కొన్నట్లుగా గత సంవత్సరంలో డాలర్ల రూపంలో పోలిస్తే, భారత్తో చైనా వాణిజ్యం 2021 జనవరి నుంచి జూన్ నెలలో 62.7 శాతానికి పెరిగింది. అంటే చైనా–భారత్ వాణిజ్యం వృద్ధి మొత్తం చైనా వాణిజ్యంలో రెండో స్థానం ఆక్రమించింది. దక్షిణా ఫ్రికా తొలి స్థానంలో ఉంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేం దుకు అవసరమైన చైనా సరఫరాలు భారత్కు దిగుమతి కావడం బాగా పెరగడం దీంట్లో భాగమేనని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో చైనా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 23 వేలమంది భారతీయ విద్యార్థులు విభిన్న కోర్సులలో చేరి అధ్యయనం సాగించారు. వీరిలో 21 వేలమంది డాక్టర్లు అయ్యేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. 2021లో కూడా ఈ సంఖ్య మారలేదు. పైగా, చైనాలోని భారత్ లేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న బారతీయుల సంఖ్య కూడా తక్కువగా లేదు. చైనాలో మొత్తం 36 వేలమందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఎర్రచైనా పెట్టుబడిదారీ విధానాన్ని పరిధికి మించి అధికంగా అనుమతించినట్లయితే, మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలకు సంబంధించిన వాస్తవాలను కూడా అది ఆమోదిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూసియనిజంను గౌరవించి, చైనా ప్రభుత్వం స్వీకరించగా, మావో కాలంలో బౌద్ధమతం పట్ల సర్వసాధారణంగా అవలంబించిన సైద్ధాంతిక అవహేళనను నేటి చైనాలో అనుసరిస్తున్న సూచనలు లేవు. ఇప్పుడు టిబెట్లోనే కాకుండా చైనాలో ప్రతి చోటా బుద్ధిజం చొచ్చుకుపోయిందని పలువురు భారతీయులు గుర్తించడంలేదు. సంఖ్యలకు ప్రాధాన్యం ఉందంటే, చైనాలో పెరుగుతున్న లక్షలాది బౌద్ధమతానుయాయులు భారత్లో కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రభావం చూపగలరన్నది వాస్తవం. బౌద్ధమత గ్రంథాలను పొందడం కోసం శతాబ్దాల క్రితం అత్యంత కష్టభూయిష్టమైన ప్రయాణాలు సాగించి భారత్కు చేరుకున్న చైనా పండితులు... అదృశ్యమయ్యే అవకాశమున్న భారతీయ చరిత్రను తమ రచనల్లో నమోదు చేశారు. ఇలాంటి పండితుల్లో సుప్రసిద్ధుడైన హుయాన్త్సాంగ్ భారతదేశంలో అత్యంత గౌరవం పొందాడు. చైనాలో అత్యంత జనాదరణ పొందిన 16వ శతాబ్దం నాటి చారిత్రక గాథ ‘గ్జియుజి లేదా పశ్చిమానికి పయనం’ అనే కథ... హుయాన్త్సాంగ్ 7వ శతాబ్దిలో భారత్కి సాగించిన తీర్థయాత్రను అత్యంత ఉత్కంఠతో, సరదాతో కూడిన సాహస యాత్రకు కాల్పనిక రూపమిచ్చిందని బహుశా చాలామంది భారతీయులకు తెలీకపోవచ్చు. 2015లో మరణించిన ఆంథోనీ సి. యు అనే అమెరికన్ పండితుడు ‘ఎ జర్నీ టు ది వెస్ట్’ అనే ఈ పుస్తకానికి చేసిన నాలుగు సంపుటాల అనువాదం ఇంగ్లిష్ అనువాదాల్లో అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. బుద్ధుడికి, జర్నీ టు ది వెస్ట్ గ్రంథానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర రీత్యా, హిమాలయన్ వారధి రీత్యా భారత ప్రజలు, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపున భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాలమిస్టులకు అందుబాటులో ఉండవు. కాబట్టి వీటి నుంచి విశాల దృష్టితో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అతిపెద్ద పొరుగు దేశాల్లోని దాదాపు 300 కోట్ల ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నాయకులకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం అన్నది ఆలోచించదగిన కీలక విషయం. రెండు.. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమిలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఒకటి అమెరికా నేతృత్వంలో, మరొకటి చైనా నేతృత్వంలో ఉండే రెండు శిబిరాల మధ్య ఆసియా, ప్రపంచ ప్రజలను విడదీసే ప్రయత్నాలు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. కాబూల్ ప్రభుత్వం తెలుసుకున్నట్లుగా అగ్రరాజ్యాలు శాశ్వతమైన రక్షణ ఛత్రాలను అందించవు. అందుకే, క్వాడ్ కూటమి కంటే ఎక్కువగా, భారతీయ స్వతంత్ర పౌరుల స్వేచ్ఛ, రాజకీయ నేతలను ఓటు వేసి సాగనంపే భారత పౌరుల సామర్థ్యం అనేవి చైనా ప్రజలకు అత్యంత ప్రభావం కలిగించే సందేశాన్ని ఇస్తాయి. చైనా ప్రజలు ఈర‡్ష్య పడేవిధంగా, భారత్లో ఉన్న మనం మన నేతలను పరిహాసం చేయవచ్చు, అవహేళన చేయవచ్చు లేదా ఇంటికి సాగనంపవచ్చు కూడా. మనం ఈ ప్రయోజనాన్ని కూడా కోల్పోయామంటే ఇక ఆట ముగిసినట్లే. -రాజ్మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రస్తుతం ఇలినాయ్ యూనివర్సిటీలో బోధకుడుగా ఉన్నారు -
అసంపూర్ణ చర్చలు
భారత–చైనాల మధ్య కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన ఆరో దఫా చర్చలు యధావిధిగా అసంపూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎప్పటిలాగే అది కూడా అస్పష్టంగానే వుంది. చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటుకు దిగడానికి ముందున్న యధాపూర్వ స్థితి పునరుద్ధరణకు రెండు పక్షాలూ ఏం చర్యలు తీసుకో బోతున్నాయో, ప్రతిష్టంభన తొలగింపు కోసం తిరిగి చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తాయో అందులో చెప్పలేదు. సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో మొదలైన చర్చలు రాత్రి 10.30 వరకూ సాగాయంటే చాలా అంశాల విషయంలో ప్రతినిధి బృందాల మధ్య వాదోపవాదాలు జోరుగానే సాగివుంటాయనుకోవాలి. నెలన్నర వ్యవధి తర్వాత ఈ చర్చలు చోటుచేసుకున్నాయి. ఈసారి చర్చల్లో మన విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి హోదా స్థాయి అధికారి పాల్గొనడమే విశేషం. ఎల్ఏసీలో ప్రస్తుతం ఎలాంటి ఘటనా జరగటంలేదన్న మాటేగానీ.. ఉద్రిక్తతలు ఎక్కువే. ఎందుకంటే ఇరుపక్కలా చెరో 40,000మంది సైనికులు సర్వసన్నద్ధంగా వున్నారు. వారి వద్ద శతఘ్నులు, తుపాకులు, క్షిపణులు వున్నాయి. ఏ పక్షంనుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ఘర్షణలకు దారితీసే ప్రమాదం వుంది. కనుకనే చర్చలు త్వరగా కొలిక్కి వచ్చి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎల్ఏసీ వద్ద రెండు దేశాల మధ్యా ఖచ్చితమైన, పరస్పర ఆమోదయోగ్యమైన సరిహద్దు లేనిమాట వాస్తవమే అయినా... దశాబ్దాలుగా ఇరు సైన్యాలు గస్తీ కాస్తున్న ప్రాంతాలు స్పష్టంగానే వున్నాయి. సైన్యం కదలికలు పూర్తిగా భౌగోళిక మ్యాప్లపై ఆధారపడి వుంటాయి గనుక పొరబడే అవకాశం లేనేలేదు. అందువల్లే మన దేశం చైనా సైన్యం తమ పాత ప్రాంతానికే పరిమితమై వుండాలని పట్టుబడుతోంది. ప్యాంగాంగ్ సో, చుశాల్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, డెస్పాంగ్ ప్రాంతాలనుంచి చైనా వైదొలగాలని కోరుతోంది. అలా వైదొలగడానికి సంబంధించిన పథకమేమిటో చెప్పాలంటోంది. మిగిలిన ప్రాంతాల్లోకన్నా డెస్పాంగ్ వద్ద చైనా సైన్యం బాగా లోపలికి చొచ్చుకొచ్చింది. అది దాదాపు 15 కిలోమీటర్ల వరకూ వుంటుందంటున్నారు. అయితే మీరే ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలోని ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాల నుంచి వైదొలగాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఆ తర్వాతే తాము ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామంటోంది. ఉమ్మడి ప్రకటనలో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. చైనా వెనక్కు తగ్గడానికి నిరాకరించడాన్ని చూశాక మన సైన్యం గత నెలాఖరున ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద వున్న కైలాష్ రేంజ్ శిఖరాల్లో భాగమైన ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాలపై పట్టు సాధించింది. వ్యూహాత్మకంగా మన సైన్యం పైచేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. చైనా సైన్యం కదలికలు, వారు చేరేసుకుంటున్న ఆయుధాలు వగైరా సులభంగా తెలుస్తాయి. పశ్చిమంవైపు విస్తరించకుండా అడ్డుకునేందుకు అది దోహదపడుతుంది. కనుకనే ఇక్కడినుంచి వెనక్కు వెళ్లాలని చైనా పట్టుబడుతోంది. ఉద్రిక్తతలు, ఘర్షణలు ఇరు దేశాలకూ ఏమాత్రం మేలు చేయబోవన్న అంశంలో రెండు దేశాలదీ ఒకే మాట. ఈ నెల 10న ఉభయ దేశాల విదేశాంగమంత్రులూ మాస్కోలో సమావేశమైనప్పుడు దీన్ని అంగీకరించారు. కనుకనే ఈసారి జరిగే కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో పురోగతి వుంటుందనుకున్నారు. అయితే ఈ స్థాయి చర్చలు ఎక్కువ సందర్భాల్లో దేశాధినేతలు వాస్తవ పరిస్థితిపై లోతైన అవగాహన పెంచుకోవడానికి, సరిహద్దు వివాదంలో అవతలి పక్షం ఉద్దేశాలేమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తుది పరిష్కారం లభించాలంటే అది అధినేతల మధ్య జరిగే చర్చల్లో మాత్రమే సాధ్యం. అధినేతలు కేవలం సైనిక కోణంలో మాత్రమే సమస్యను చూడరు. మొత్తంగా అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు చూసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దేశానికి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందో తేల్చుకుంటారు. ఆ మేరకు తమ తమ సైన్యాలకు సూచనలిస్తారు. ఇప్పుడున్న సైనిక దళాల సంఖ్యను రెండు దేశాలూ పెంచకూడదన్న అంశంలో కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ఉమ్మడి ప్రకటన చెబుతోంది. అయితే ఇప్పటికే అక్కడ చైనా అవసరమైనమేర సైన్యాన్ని పెంచుకుందనేది మరిచిపోకూడదు. అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ విభేదాలను తగ్గించుకోవాలని, వివాదాలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈమధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలనుద్దేశించి పంపిన వీడియో ప్రసంగంలో చెప్పారు. ఆ మాటల్లో చిత్తశుద్ధి ఎంతవుందో మన దేశమే కాదు... ప్రపంచమంతా గమనిస్తుంది. రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగమంత్రులు చర్చించుకున్నా కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో మెరుగైన పురోగతి లేకపోవడం అందరూ చూస్తున్నారు. తూర్పు లద్దాఖ్లో చైనా దూకుడుకు కారణాలేమిటో తెలియనివారెవరూ లేరు. జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటినుంచీ చైనా, పాకిస్తాన్లకు అది కంటగింపుగా వుంది. చైనా లద్దాఖ్లో చొచ్చుకొస్తే, పాకిస్తాన్ గిల్గిత్–బాల్టిస్తాన్కు సంబంధించిన కొత్త మ్యాప్ విడుదల చేసి వివాదం రేపాలని చూసింది. వారి ఉమ్మడి ఎజెండా సుస్పష్టం. 1979లో ఆనాటి చైనా అధినేత డెంగ్ జియావో పెంగ్ ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఉదారవాద విధానాలు ప్రారంభించినప్పుడు చైనాలో ఏకస్వామ్య వ్యవస్థ బద్దలు కావడానికి అవి దోహదపడతాయని పాశ్చాత్య దేశాలు భావించాయి. కానీ తూర్పు చైనా సముద్రంలోనైనా, తూర్పు లద్దాఖ్లోనైనా చైనా తీరు చూస్తుంటే ఆ ఆర్థికాభివృద్ధి ఆంతర్యం ప్రపంచంపై పట్టు సాధించడానికేనన్న సంశయాలు కలుగుతున్నాయి. తమకా ఉద్దేశం లేదని నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు చైనాదే. -
ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం
భారత సైన్యం సరిహద్దుల్లో ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించడం మొదలెట్టింది. ఇది ప్రచార యుద్ధంలో సరికొత్త తంత్రం. పైగా భారత సైన్యం పీఏల్ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందని బెదిరింపులకు దిగుతోంది. వాస్తవానికి పర్వత ప్రాంత యుద్ధంలో రాటుదేలిపోయిన భారత సైన్యాన్ని గత కొన్ని దశాబ్దాలుగా యుద్ధానుభవం లేని పీఎల్ఏ బలగాలు నిలువరించలేవన్నది వాస్తవం. చైనా ప్రచారయుద్ధాన్ని చైనా భూభాగంలోనే భారత్ తిప్పికొట్టగలిగితే చైనా ప్రజల, చైనా సైనిక కుటుంబాల నైతిక ధృతిని చెల్లాచెదురు చేయవచ్చు. వాస్తవాధీన రేఖ పొడవునా భారత సైన్యం ఇప్పుడు ఆధిపత్య స్థానాన్ని స్థిరపర్చుకున్న తర్వాత, యుద్ధం తప్పదంటూ భారత్ని హెచ్చరించే తీవ్రమైన ప్రచార యుద్ధతంత్రాన్ని చైనా పునరుద్ధరిం చింది. రోజు తర్వాత రోజు ఈ ప్రచార స్థాయి పెరుగుతూండటం గమనార్హం. ముందుగా కాల్పులు ప్రారంభించింది భారతదేశమే అంటూ ఆరోపించిన చైనా పత్రిక ది గ్లోబల్ టైమ్స్ సెప్టెంబర్ 8న దూకుడు ప్రకటన చేసింది. ‘చర్చలకు సిద్ధమవుతున్న చైనా గస్తీ దళాలపైకి భారత బలగాలు రెచ్చగొట్టే ధోరణితో కాల్పులు ప్రారంభించాయి. ఇది సైనికపరంగా తీవ్రంగా రెచ్చగొట్టే అంశమే తప్ప మరొకటి కాదు.’ ప్రజా విముక్తి సైన్యానికి చెందిన పశ్చిమరంగ కమాండ్ ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలి ఈ అంశంపై మరింతగా మాట్లాడారు. ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపివేయాలని, సరిహద్దులు దాటి మరీ లోపలికి వచ్చిన సైనిక బలగాలను తక్షణమే ఉపసంహరించాలని, సరిహద్దుల్లో ఫ్రంట్ లైన్లో ఉన్న భారత బలగాలను అదుపులో పెట్టాలని మేం అభ్యర్థిస్తున్నాం, అలాగే ముందుగా చైనా బలగాలపైకి కాల్పులు ప్రారంభించిన భారత బలగాలపై తీవ్ర స్థాయిలో విచారించాలని చైనా ప్రతినిధి ప్రకటన చేశారు. అయితే భారత సైన్యం చైనా ప్రకటనను తోసిపుచ్చింది. ‘వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న మా సైనిక దళాలపైకి ముందుగా చైనా దళాలే కాల్పులు జరిపిన తర్వాతే మా దళాలు వారిని అడ్డుకున్నాయి. మా బలగాలను బెదిరించే లక్ష్యంతో పీఎల్ఏ దళాలు కొన్ని రౌండ్ల కాల్పులు జరిపాయి’. దీంతో ప్రకటనలు దాని ఖండన ప్రకటనల ఆట మొదలైపోయింది. భారత సైన్యాలు ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిం చడం మొదలెట్టింది. చైనా మీడియా చాలావరకు ప్రస్తుత దృశ్యాన్ని 1962 నాటి దృశ్యంతో పోల్చి చూస్తోంది. సెప్టెంబర్ 8న ది గ్లోబల్ టైమ్స్ పత్రిక స్పష్టంగా దీన్ని ఎత్తిచూపింది. ‘చైనా 1962 యుద్ధంలో విజయం సాధించింది. ఇది భారత్కు గుణపాఠం కావాలి. పైగా, దశాబ్దాల క్రితం పీఎల్ఏ ఉపయోగించిన సైనిక సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుత చైనా సైనిక సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉంది. సమాచార సమర్థత, వ్యవస్థీకృత పోరాట సామర్థ్యం, సంయుక్త పోరాట సామర్థ్యంతో కూడిన పీఎల్ఏ ఇప్పుడు ఒక అత్యాధునిక సైన్యం’. అదే రోజు వచ్చిన మరొక కథనం కూడా ఇదే రీతిలో సాగింది. ‘పీఎల్ఏ మొట్టమొదటగా కాల్పులు మొదలెట్టలేదు. కానీ భారత సైన్యం పీఎల్ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలుకు దారితీస్తుంది. ప్రస్తుత సంఘర్షణను పెంచాలని భారత సైన్యం సాహసించినట్లయితే మరిన్ని భారత బలగాల నిర్మూలన జరగడం ఖాయం’. అయితే చైనా పత్రిక చేసిన ఈ వ్యాఖ్యలు భారత ప్రజానీకాన్ని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను, శాంతికాముకులను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో కనిపించాయి. చైనా సైనిక స్థానాలకు ప్రమాదకరంగా తయారైన భారత సైనిక స్థానాల నుంచి వెనక్కు తగ్గి, ఉపసంహరించుకునేలా భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశం. వాస్తవానికి ఇప్పుడు చైనా ముందున్న ఏకైక ఎంపిక ఏదంటే మరిన్ని తీవ్ర దాడులను ప్రారంభించి తన సైనికులను భారీగా నష్టపోవడమే. అయితే తన ప్రచార కార్యక్రమాలు మొత్తంగా బూటకం అని నిరూపించే అనేక అంశాలను చైనా మీడియా అస్సలు పేర్కొనడం లేదు. 1962లో కూడా భారత బలగాలు మందుగుండు సామగ్రి, శీతాకాల దుస్తులు, ఆర్టిలరీ, గగనతల మద్దతు ఏమాత్రం లేనప్పటికీ చివరి మనిషి బతికి ఉన్నంతవరకు, చిట్టచివర తూటా పేల్చేంతవరకు విడివిడి స్థానాల్లో పోరాడుతూ చివరకు చైనా సైన్యమే దిగ్భ్రాంతికి గురయ్యేంత నష్టాలను పీఎల్ఏకు కలిగించాయి. అయితే ఆనాడు సైనిక చర్యలను ముందుకు తీసుకుపోగల వనరులు భారత సైన్యం వద్ద లోపించాయి. అయితే ఆనాటి ఆ లోటుపాట్లు ఇప్పుడు భారత సైన్యానికి అస్సలు లేవు. అలాగే తన బలగాలకు తీవ్ర నష్టం కలిగిన 1967 నాటి నాథూలా, చో లా ప్రాంతాల్లోని ఘర్షణల గురించి చైనా ఎన్నడూ పేర్కొనలేదు. భారత బలగాల ప్రతిదాడికి తట్టుకోలేక చైనా సైన్యం పలాయనం చిత్తగించింది. అదేవిధంగా ఇప్పుడు గల్వాన్ ప్రాంతంలో తమకు కలిగిన నష్టాల గురించి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కూడా చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అలాగే పాకిస్తాన్తో యుద్ధ కాలంలో కార్గిల్, సియాచిన్ ఎల్తైన పర్వతప్రాంతాల్లో భారత బలగాలు చేసిన భీకర దాడికి సంబంధించిన తీవ్రత, దాని అనుభవాలను కూడా చైనా ఎన్నడూ కనీసంగా కూడా పేర్కొనలేదు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా హాన్ జాతి సైనికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అననుకూలతను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోనే చైనా మీడియా దాచి ఉంచుతోంది. చైనా సైన్యంలోని 60 శాతం మంది గ్రామీణ చైనా నుంచి నియమితులైనవారితో కూడిందే. భవి ష్యత్తు ఉద్యోగం కోసమే వీరు సైన్యంలో చేరారు తప్పితే యుద్ధాల్లో పాల్గొనాలనే కాంక్షతో కాదు. వీరు టిబెట్, లద్దాఖ్ ప్రాంతాల్లోని గడ్డకట్టించే శీతాకాల పరిస్థితుల్లో బతికి బట్టకట్టలేరు. చారిత్రకంగా చూస్తే కూడా పీఎల్ఏ ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు సరిహద్దుల్లోని తన బలగాలను చైనా మైదాన ప్రాంతాలకు వెనక్కు పంపుతూ స్థానికంగా రిక్రూట్ చేసుకున్న సరిహద్దు రక్షణ రెజిమెంట్లను, మిలీషియాను వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకోసం ఉంచుతోంది. చైనాలో హాన్ జాతి సైనికులు శీతాకాలంలో కూడా తట్టుకుని సరిహద్దుల్లోనే మనగలిగి ఉంటే వారిని అడ్డుకోవడం భారత సైన్యానికి కాస్త కష్టమయ్యేది. చైనా హాన్ జాతి సైనికులు అలాంటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. ఈ కారణం వల్లే చైనా ప్రస్తుత ఘర్షణాత్మక స్థితిని శీతాకాలం పొడవునా కొనసాగించాలని భావించడం లేదు. అదే సమయంలో ప్రస్తుత ఘర్షణను నిలిపివేయాలని భారత్ తొందరపడటం లేదు. ఇప్పటికే మన సైన్యం దీర్ఘకాలిక పోరాటానికి సన్నాహాలు ప్రారంభించింది. మరొక వాస్తవమేమిటంటే 1962లో పీఎల్ఏ తనకు జరిగిన నష్టాలను అంగీకరించి ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో చైనాలో కుటుంబానికి ఒక్కరే సంతానం అనే విధానం అమలులో ఉండి 1979 వరకు అది కొనసాగింది. పైగా చైనాకు జరిగిన భారీ నష్టాలను చెప్పేందుకు అప్పట్లో బహుముఖ మీడియా నెట్వర్క్ లేదు. ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ప్రతి చైనా సైనికుడూ బ్రహ్మచారి అయినట్లయితే కనీసం తల్లిదండ్రులు, అవ్వాతాతలు కలిపి ఆరుగురు కుటుంబ సభ్యులను పోషించాల్సి ఉంది. ఇప్పుడు చైనా సైనికుడు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది శరాఘాతమే అవుతుంది. చైనా సైనికుడికి పెళ్లి కూడా అయి ఉంటే, అతడిపై ఆధారపడేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందుకే 1960లలోలాగా తనవైవు ఎంతమంది సైని కులు చనిపోయారు అని లెక్క ప్రకటించే స్థితిలో చైనా ఇప్పుడు లేదు. పైగా చైనా 1979లో వియత్నాంలో తన చివరి యుద్ధాన్ని ముగిం చింది. అప్పుడు సైతం అది అవమానకరంగా వెనుదిరగాల్సి వచ్చింది. బలహీనమైన, అనుభవ లేమితో కూడిన, తమపై కుటుంబాలు ఆధారపడి ఉన్న చైనా సైనికులు యుద్ధాల్లో రాటుదేలిన సుశిక్షితులైన భారత సైనికులతో తలపడటం అంటే చందమామను తెచ్చివ్వమని కోరినట్లే కాగలదు. కార్గిల్, సియాచిన్ యుద్ధ దృశ్యాలతో కూడిన వీడియోలను కౌంటర్ ప్రాపగాండా యుద్ధ తంత్రంలో భాగంగా భారత్ విడుదల చేస్తే, ప్రస్తుత భారత సైన్యం సమర్థత ఏంటో చైనాకు అర్థమవుతుంది. పాకిస్తాన్ బలగాలతో అతిఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారత సైనికులు కార్గిల్లో యుద్ధం చేసిన అనుభవంతో పోల్చితే కేవలం తుపాకీ కాల్పుల శిక్షణకు పరిమితమైన చైనా ప్రాపగాండా వీడియోలు ఎంత పేలవంగా ఉంటాయో ఎవరైనా పోల్చుకోవచ్చు. ప్రస్తుత ప్రచారయుద్ధంలో సమస్య ఏమిటంటే ప్రపంచ సోషల్ మీడియా సైట్లను చైనాలో నిషేధించారు. ఇక చైనా సొంత సోషల్ మీడియా బయటి ప్రపంచంలోకి జొరబడే అవకాశం తక్కువ. ఈ చైనా సోషల్ మీడియాలోకి జొరబడి భారత సైనిక బలగాల సామర్థ్యాన్ని ప్రదర్శించిగలిగితే చైనా ప్రజలు, చైనా బలగాల నైతిక ధృతిని చెదర గొట్టవచ్చు. అందుకే భారత ప్రచార యుద్ధ తంత్రం చైనాలోకి చొచ్చుకెళ్లాలి. సంవత్సరాలుగా చైనా బలగాలను ఎదుర్కొంటూ అనుభవం సాధించిన భారత సైన్యం.. చైనా సైన్యం గుట్టుమట్ల గురించి పూర్తి అవగాహనతో ఉంది. కాబట్టే అత్యంత కఠిన పరిస్థితుల్లో భారత్ సైన్యానిదే పైచేయిగా ఉంటోంది. ఇక భారత సైన్యం తన సమర్థతల గురించి చక్కటి అవగాహనతో ఉన్నందున చైనా సైనిక దాడులను చక్కగా నిలువరించే స్థానంలో ఉంది. (ది స్టేట్స్మన్ సౌజన్యంతో) హర్ష కకార్, రిటైర్డ్ మేజర్ జనరల్, భారత సైన్యం -
దృఢ వైఖరితోనే దారికి...
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఏం జరుగుతున్నదో వెల్లడించాలంటూ కొన్నాళ్లుగా విపక్షాలు నిల దీస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం లోక్సభలో అందుకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. చైనా భారీగా సైన్యాన్ని మోహరించడంతో లద్దాఖ్ ప్రాంతంలో మనం పెను సవాల్ని ఎదుర్కొంటున్నామని ఆయన అంగీకరించారు. దీన్ని దీటుగా ఎదుర్కొంటామని ప్రకటిం చారు. చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందా, మన భూభాగాన్ని ఆక్రమించిందా అన్న విషయంలో ఇందులో వివరణ లేదు. సరిగ్గా ఈ అంశంపైనే విపక్షాలు ఆదినుంచీ నిలదీస్తున్నాయి. ఎల్ఏసీ వద్ద చైనా సైన్యం చొచ్చుకురావడం, కల్నల్ సంతోష్బాబుతోసహా మన జవాన్లు 21 మందిని కొట్టిచంపడం వంటి ఘటనలు జరిగాక చైనా సైనికులు ప్యాంగాంగ్ సో తదితర ప్రాంతాల్లో మన భూభాగాన్ని దురాక్రమించారన్న వార్తలొచ్చాయి. ‘ఎవరూ మన భూభాగంలోకి రాలేదు... దేన్నీ స్వాధీనం చేసుకోలేద’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశాక కూడా ఎవరికీ సంతృప్తి కలగ లేదు. అటు తర్వాత ఎల్ఏసీలో కాల్పుల ఘటన కూడా చోటుచేసుకుంది. గత నెలాఖరున మన దళాలు చైనా సైన్యంపై పైచేయి సాధించాయన్న కథనాలు కూడా వచ్చాయి. ఇలా వివిధ సంద ర్భాల్లో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు. రాజ్నాథ్సింగ్ తాజా ప్రకటన కొంతమేరకు వివరణ ఇచ్చిందనే అనాలి. ఎందుకంటే మన ‘లోపలి ప్రాంతాల్లోకి’ వారు చొచ్చు కొచ్చారన్న మాట ఆయన ఉపయోగించారు. అలాగే ఎల్ఏసీని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రయ త్నించిందని ఆరోపించారు. అయితే ఆ సందర్భంగా తాత్కాలికంగానైనా వారి స్వాధీనంలోకి ఏ ప్రాంతమైనా వెళ్లిందా లేదా అనిగానీ... ఆగస్టు నెలాఖరున మన దళాలు కూడా దూకుడు ప్రదర్శించి ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాయా అన్నదిగానీ వివరించలేదు. మన జవాన్ల మరణానికి దారికి తీసిన ఘర్షణల స్వభావం ఎటువంటిదో, ఏ క్రమంలో అవి చోటు చేసుకున్నాయో కూడా ఆ ప్రకటన వివరించలేదు. రాజ్నాథ్ ప్రకటనపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇలాంటి అంశాలు తెలిసే అవకాశం లేదు. కేంద్రం చెబుతున్నట్టు ఇది సున్నితమైన సమస్యే కావొచ్చు... కానీ కనీసం మన జవాన్ల ప్రాణం తీసిన ఉదంతంలో ఏం జరిగిందో స్పష్టతనిచ్చివుంటే బాగుండేది. భారత–చైనాల మధ్య సైన్యం స్థాయిలో చర్చలు జరగడంతోపాటు ఈ నెల మొదట్లో రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఆ భేటీల్లో అవగాహన కుదిరింది. సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ రెండు మూడు రోజులుగా తీరుమారింది. కోర్ కమాండర్ల స్థాయి చర్చలపై చైనా మౌనం వహిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఇది కలవరపరుస్తుంది. తొలుత అనుకున్న ప్రకారం ఈ వారం మొదట్లో కోర్ కమాండర్ల మధ్య చర్చలుండాలి. ప్యాంగాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలోని పర్వత ప్రాంతం మన దళాల నియంత్రణలోకొచ్చిందని, అక్కడినుంచి వారిని పంపేయడానికి చైనా పథకాలు పన్ను తోందని చెబుతున్నారు. రెండు పక్కలా సైన్యాల మోహరింపు, వాటికి అవసరమైన సైనిక సామగ్రి, యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణులు, ఆహారం వగైరాలు లద్దాఖ్ ప్రాంతంలోకి చేర డంతో అక్కడ ఏమైనా జరగొచ్చునన్న అనుమానాలున్నాయి. బహుశా కేంద్రం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే లోక్సభలో చర్చకు అంగీకరించకపోయి వుండొచ్చు. సాధారణంగా సైన్యం మోహరింపు దానికదే ఘర్షణలకు దారితీయదు. ఆత్మరక్షణ కోసం, తాము సంసిద్ధంగా వున్నామని అవతలి పక్షానికి చెప్పడం కోసం ఎక్కువ సందర్భాల్లో సైన్యం మోహరింపు వుంటుంది. సరిహద్దులపై జరిగే చర్చల్లో బేరసారాలు జరపడానికి అది ఉపయోగపడుతుంది. కానీ సుదీర్ఘకాలం ఎదురుబొదురుగా సైన్యాలుంటే ఏ చిన్నపాటి వివాదమైనా సాయుధ ఘర్షణలకు దారితీసే ప్రమాదం కూడా వుంటుంది. లద్దాఖ్లోనూ, అక్కడికి సమీపంలోని మరికొన్ని సెక్టార్లలోనూ ఎల్ఏసీ ఎక్కడన్న అంశంలో భారత, చైనాల మధ్య మొదటినుంచీ విభేదాలున్నాయి. సిక్కిం సెక్టార్లో అక్కడక్కడ కొన్నిచోట్ల కొన్ని మీటర్ల తేడా మాత్రమే వుంది. కానీ మరికొన్నిచోట్ల 20, 30 కిలోమీటర్ల ప్రాంతం మాదంటే మాదన్న పోటీ వుంది. ఇరు దేశాల విదేశాంగమంత్రులు మాస్కోలో సమావేశమైనప్పుడు కోర్ కమాండర్ల స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఘర్షణలు మరింత ముదరకుండా వుండాలంటే సత్వరం పరిష్కారం కుదరాలి. అయితే కమాండర్లు వారంతట వారే ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించలేరు. ప్రభుత్వాధినేతల నుంచి స్పష్టమైన ఆదేశాలొస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సొంతంగా నిర్ణయం తీసుకునేది వుండదు. ఇరు దేశాధినేతల భేటీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. మన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దృఢంగా కాపాడుకుంటూనే శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తామని రాజ్నాథ్ తాజా ప్రకటన చెబుతోంది. అది సాకారమై ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరలో సడలాలని అందరూ ఆశిస్తారు. -
రెచ్చగొడితే తిప్పికొడతాం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా నిర్వాకం వల్లనే ఉద్రిక్తత నెలకొందని, దీనిపై ముందుకెళ్లాలంటే చర్చలే మార్గమని భారత్ తేల్చిచెప్పింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందువల్లనే లద్దాఖ్లో నాలుగు నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీన్ని పరిష్కరించడానికి ఉన్న ఏకైక మార్గం చర్చలేనని చెప్పింది. ఒకవైపు విదేశాంగ శాఖ చర్చల కోసం భారత్ సిద్ధంగా ఉందని చెబుతుండగా, మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలను తిప్పిగొట్టే సామర్థ్యం తమ త్రివిధ బలగాలకు ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. తగిన రీతిలో డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద అలజడి నేపథ్యంలో గురువారం ఆర్మీ చీఫ్ నరవాణే, వాయుసేనాధిపతి భదౌరియా తమ బలగాల యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. చైనా కవ్వింపు చర్యలతో సైనిక బలగాల మోహరింపులో భారత్ మార్పులు చేసింది. వాయుసేన బలగాలు రాత్రిపూట తూర్పు లద్దాఖ్లోని గగనతలంలో పెట్రోలింగ్ చేపడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. ఒప్పందాలను గౌరవించాలి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చైనా ఆగడాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. ద్వైపాక్షిక ఒప్పందాలను, ప్రొటోకాల్ను చైనా ఉల్లంఘించడం వల్లనే సరిహద్దులో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉద్రిక్తత నెలకొందన్నారు. ఒప్పందాలను గౌరవించి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని చైనాను కోరారు. శాంతియుత చర్చలతో అన్ని అంశాలను పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలకు రావాలని చైనాను కోరారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు సరిహద్దులో బాధ్యతాయుతంగా మెలగాలని, ఏ ఒక్కరు కూడా ఉద్రిక్తత నెలకొనేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ఆయన పేర్కొన్నారు. సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా వ్యహరించిందని మండిపడ్డారు. ఈనెల 10న మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) నిర్వహించే సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎనిమిది దేశాలుండే ఎస్సీఓలో చైనా కూడా భాగస్వామిగా ఉంది. వాయుసేన సన్నద్ధత సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోని కీలకమైన ప్రాంతాలను సందర్శించారు. గురువారం అరుణాచల్ప్రదేశ్, సిక్కింలోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి వాయుసేన సన్నద్ధతపై సమీక్షించారు. వాయుసేన చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని అధికారులు చెప్పారు. షిల్లాంగ్లో ఉండే ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ కేంద్ర కార్యాలయం అరుణాచల్, సిక్కింలోని ఎల్ ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాల గగనతలంపై పహారా కాస్తుంది. భదౌరియా ఈస్ట్రన్ కమాండ్ పరిధిలోని కీలక స్థావరాలను సందర్శించారని వాయుసేన తెలిపింది. లద్దాఖ్లో ఆర్మీ చీఫ్ పాంగాంగ్లో చైనా దుస్సాహసం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే లద్దాఖ్లో పర్యటిస్తున్నారు. అక్కడి భద్రతా పరిస్థితిపై గురువారం సమీక్ష చేపట్టారు. ఆయన శుక్రవారం కూడా అక్కడే పర్యటిస్తారు. బలగాల సన్నద్ధత, మోహరింపు గురించి టాప్ ఆర్మీ కమాండర్లు నరవాణేకు వివరించారు. సరిహద్దుకు సమీపంలోని భారత ఆర్మీ శిబిరాన్ని నరవాణే సందర్శించి సైనికులతో మాట్లాడారు. 3,400 కిలోమీటర్ల సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో ఆర్మీ, వాయుసేన బలగాలను చాలా అప్రమత్తంగా ఉంచారు. సర్వ సన్నద్ధతతో...పూర్తి నియంత్రణలో లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం సర్వ సన్నద్ధతతో పహారా కాస్తోంది. అదనపు సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించి... పాంగాంగ్ దక్షిణ తీరంలో కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించిన భారత్...డెప్సాంగ్ ప్లెయిన్స్, చుమర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని ఇక్కడకు భారీగా తరలించింది. అంగుళం భూమిని కూడా వదులుకోబోమని, చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా సైన్యం)కి గట్టి సంకేతాలు పంపింది. పీఎల్ఏకు దీటుగా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. ఐదురోజుల కిందట పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా చొరబాటు యత్నాలను తిప్పికొట్టడంలో కూడా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ముఖ్య భూమిక పోషించింది. లద్దాఖ్ పరిధిలో 1,597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవునా భారత్ అత్యంత అప్రమత్తతను పాటిస్తోంది. డెమ్చోక్, చుమర్ల్లో భారత్ ఎత్తైన పర్వత ప్రాంతాలను ఆక్రమించి ఉండటంతో చైనా ఆయుధ, సైనిక రవాణాకు కీలకమైన లాసాకస్గర్ హైవేపై ప్రత్యర్థి కదలికలపై స్పష్టంగా కన్నేయగలుగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement