-
జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీగా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే. ఈ మొత్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీబాబు ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జైళ్లశాఖ ఐజీగా పనిచేస్తున్న రాజేశ్కుమార్, పదోన్నతిపై ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్ అధికారులు. సీనియారిటీ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు ఎస్పీ సంపత్కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్తోపాటు సంపత్ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం. -
పోలీసు శాఖపై సీపీ మార్క్
సాక్షి, వరంగల్ : వరంగల్ రేంజ్ ఐజీ, పోలీసు కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్కుమార్ కమిషనరేట్పై పట్టు బిగిస్తున్నారు. కమిషనర్గా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న ఆయన పరిపాలనాపరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తే శాఖాపరమైన విచారణ చేపట్టడం, ఆ తర్వాత చర్యలు తీసుకుంటుండడంతో పలువురు అధికారుల్లో టెన్షన్ నెలకొంది. కమిషనరేట్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వస్తున్న సివిల్ కేసులకే స్టేషన్ హౌస్ అధికారులు కొందరు ప్రా«ధాన్య త ఇవ్వడం, ఆ తర్వాత కేసులు వివాదాస్పదమైన అవి అధికారుల తలకు చుట్టుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో సీపీ ప్రమోద్కుమార్ హంగు, ఆర్భాటాలు లే కుండా పోలీసుశాఖను గాడిన పెట్టే పనిలో పడ్డారు. దందా లు, వసూళ్లకు పాల్పడే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తుండడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నారు. బదిలీలు, మందలింపులు, అంతర్గత చర్యలు ఇటీవల ఊపందుకోగా, బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా... అక్రమాలు, సెటిల్మెంట్ దందాలు సాగిస్తున్న కొందరు పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుండటం కలకలం రేపుతోంది. కొందరు భూవివాదాలకే ప్రాధాన్యత ఇస్తూ సెటిల్మెంట్లు చేస్తుండటం ఇటీవల వివాదాస్పదమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భూముల పంచాయితీలు ఎక్కువగా జరిగే పోలీసుస్టేషన్లపై దృష్టి సారించిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు అక్కడ జరిగే అంశాలపై ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఇన్స్పెక్టర్లపై విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఈ ఇన్స్పెక్టర్లు ఎవరనేది శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుండగా, కొందరు సెలవులో వెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదులు, వివాదాల్లో కొన్ని.. ⇔ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్ ఎస్హెచ్ఓ(ఇన్స్పెక్టర్) పట్టుబడిన గుట్కాలను అమ్ముకోవడం వివాదస్పదమైంది. ఆ ఇన్స్పెక్టర్పై ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో పాటు ఆ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల భూముల విషయంలో జరిగిన సెటిల్మెంట్లపై కూడా విచారణ సాగుతోంది. ⇔ ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదులు స్వీకరించేది లేదు, రశీదులు ఇచ్చేది అంతకన్నా లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు వేదికైంది. పోస్టు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. దీనికి గాను నెలవారీ మామూళ్ల బదులు రోజువారీ మామూళ్లకు తెరలేపి దండుకుంటున్నారన్న ఫిర్యాదులు గతంలో కమిషనరేట్ వరకు కూడా వచ్చాయి. లాక్డౌన్ సమయంలో హర్వెస్టర్ల యాజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈయన కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారి నుంచి సైతం ‘పెనాల్టీ’ వసూలు చేసి రికార్డు సృష్టించారు. ⇔ కమిషనరేట్కు కూత వేటు దూరంలో ఉన్న ఆ పోలీసు స్టేషన్కు వచ్చే వారిలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. బాధితులతో పాటు వారి వ్యతిరేక వర్గాల వారి నుంచి ఆ ఇన్స్పెక్టర్ ముందుస్తుగా డబ్బు తీసుకోవడం, రెండు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడం ఆయన రోజువారి దినచర్యగా విమర్శలు ఉన్నాయి. ⇔ హన్మకొండ, హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ విషయంలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటికే భూముల విషయంలో పలుసార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన భూమి సెటిల్మెంట్ల విషయంలో పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై డీజీపీ వరకు ఫిర్యాదులు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ⇔ ఓ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ స్టయిలే వేరు. ఎన్ని ఆరోపణలు వచ్చిన ఆయన పట్టించుకోడు. ఆయనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అంది వాటిపై ఆరా తీస్తే ఉల్టా ఉన్నతాధికారులను బెదిరిస్తుంటాడు. అవసరమైతే ప్రజాప్రతినిధితో ఫోన్ చేయిస్తాడు. డబ్బు వచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. స్టేషన్లో ఎవరికైనా టీ ఆఫర్ చేస్తే వారు ఆ అధికారికి డబ్బులు ఇచ్చినట్లు లెక్క. ఇది ఆ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. ⇔ వరంగల్ సబ్ డివిజన్లో ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ తక్కువ కాలంలో ఆ ప్రజాప్రతిని«ధితో సంబంధాలు చెడిపోయాయి. దీంతో ఉన్నన్ని రోజులో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసిన సంఘటనల్లోనూ ఈయన డబ్బు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై పోలీసు స్టేషన్ సిబ్బందే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ⇔ ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్నఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వరంగల్ క్రైం: అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని మట్టెవాడ పోలీసు స్టేషన్లో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో, దొంగిలించిన వారి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద కానిస్టేబుళ్లు జి.మహేందర్, ఓ.రాజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీపీ విచారణ చేయించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన తొర్రూరు మండలం గట్టికల్లుకు చెందిన వారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బెదిరించిన, అక్రమ వసూళ్లకు పాల్పడిన సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
అవినీతి, అక్రమాలకు పాల్పడితే ‘ఖాకీ’కి ఊస్టింగే!
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.. ప్రజలతో నిత్యం మమేకం కావాలి.. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.. ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగించి శాంతిభద్రతలను కాపాడాలి. ఇదీ పోలీసు కర్తవ్యం. పోలీసులది ఉద్యోగం కాదు బాధ్యత. అలాంటి వృత్తిలో ఉంటూ అడ్డదారులు తొక్కే ఖాకీలూ కొందరు ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేయని అరాచకాలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు లేవు. వీటన్నింటికీ కొందరు పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మామూళ్లు దిగమింగి నోళ్లు మూసుకున్నారు. మరో వైపు కొందరు మహిళలను మోసగించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడారు. ఇలా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఖాకీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఐజీ బ్రిజ్లాల్ దృష్టి సారించారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయించి.. నేరం రుజువైన ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ సహా ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు కొమ్ముకాసిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, గుంటూరు: విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడటం, ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఖాకీ యూనిఫామ్ వదిలేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు రానున్నాయి. పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారి పట్ల రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ సీరియస్గా ఉన్నారు. ఆరోపణలపై పక్కా సాక్ష్యాధారాలతో నేరం రుజువైతే ఊస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడుగురిని ఇంటికి పంపండి.. జిల్లాలో అవినీతి ఆరోపణలు, పెళ్లి, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసిన, రెండో పెళ్లి చేసుకున్న, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలు సహా ఏడుగురిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ ఆఫీస్కు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఐజీ బ్రిజ్లాల్ ఇచ్చిన లిస్టులో పేరున్న సీఐ గతంలో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడి మావోయిస్టుల హిట్ లిస్టులో ఉండి, వారి దాడిలో త్రుటిలో తప్పించుకున్నారని పోలీస్ శాఖలో ప్రచారం ఉంది. ఈయనపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే టీడీపీ నాయకుల అండదండలు మెండుగా ఉండటంతో ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. మరో ఇద్దరు ఎస్ఐలు గతంలో పల్నాడు ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ కనుసన్నల్లో క్రికెట్ బెట్టింగ్కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఆరోపణల మేరకు కొనసాగిన శాఖపరమైన విచారణలో ఎస్ఐలు క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సహకరించి భారీగా సంపాదించినట్టు సమాచారం. ఐజీ సిఫార్సు చేసిన మిగిలిన నలుగురిలో ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు తెలిసింది. వీరు కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సహకరించడం, అవినీతికి పాల్పడటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా ఇతరత్రా నేరాలకు పాల్పడినట్టు రుజువు కావడంతో ఐజీ వీరందరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీ ఆఫీస్కు నివేదించినట్టు తెలిసింది. కొనసాగుతున్న విచారణ పల్నాడు ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కొందరు పోలీస్ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీరిపై విచారణ కొనసాగుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారిలో గురజాల టౌన్ సీఐగా పని చేసిన రామారావు, పిడుగురాళ్ల టౌన్ సీఐగా పని చేసిన వీరేంద్రబాబు ఉన్నారు. విచారణలో సదరు పోలీస్ అధికారులు తప్పు చేసినట్టు రుజువైతే వీరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ ఆఫీస్కు ఐజీ నివేదిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
సీవీ ఆనంద్కు ఎయిర్పోర్టుల రక్షణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా.. ఇదివరకు ఎయిర్పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్ఎఫ్లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్కు అప్పగించింది. ఆయన హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement