-
ఐఏఎఫ్సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
డల్లాస్ : ‘సామాజిక భద్రతా సమాచారం’ పై భారతీయ అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్సీ) డల్లాస్లో ఓ సదస్సు నిర్వహించింది. ఐఏఎఫ్సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ప్రజా వ్యవహారాల నిపుణుడు ఆంజీ హోక్వాంగ్ విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 100 మంది పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకు హోక్వాంగ్ సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ అవగాహన సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర పతినిధి పద్మ కుప్ప మాట్లాడుతూ.. సామాజిక భద్రత గురించి తప్పుడు సమాచారం, అపార్థాలను తొలగించడానికి ఇలాంటి సెమినార్లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్సీ బృంధాన్ని అభినందించారు. సెమినార్ అనంతరం అమె నగరంలోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళర్పించారు. ఈ కర్యాక్రమంలో ఐఏఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తైయాబ్ కుండవాలా, వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎఫ్సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్సీ)ఆధ్వర్యంలో ప్రవాస భారతీయోత్సవం ఘనంగా జరిగింది. డాలస్లో జరిగిన ఈ కార్యక్రమానికి 3000 మందికి పైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు. దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భారత సంగీత సాహిత్య అంశాల ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో వారు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీవిద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేశారు. అమెరికా గాట్ టాలెంట్లో స్థానం సంపాదించిన, స్పానిష్ గాట్ టాలెంట్లో సెమీఫైనలిస్ట్గా నిలిచిన హైదరాబాద్కు చెందిన యువకుడు క్రాంతి కుమార్ చేసిన చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఐఏఎఫ్సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతి కుమార్కు "సాహసవీర" అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్గా అందరినీ నవ్వించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రన్నా జానీ ఆధ్వర్యంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టెక్సస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా దేశం వివిధ సంస్కృతుల విభిన్న ఆచారాల ప్రవాసీయుల నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రగతిలో వివిధ రంగాలలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్ ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుండి ఒక ప్రశంసా పత్రాన్ని, అలాగే టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుండి ఒక ప్రత్యేక అభినందన పత్రాన్ని తీసుకువచ్చి చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్, మ్యాట్ షహీన్లు పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర సెనెటర్గా ఎన్నికైన భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులందరు ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అందరి సహకారంతో గెలవగలిగానని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి అర్హత ఉన్న వారందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ వాణిని ఐకమత్యంగా బలంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదు అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూఎస్ కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్, సెనెటర్ టెడ్ క్రూజ్ లు ఐఏఎఫ్సీ తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. తమ కార్యక్రమం చివరిలో రంగురంగుల కాంతులతో అత్యంత వైభవంగా జరిగిన ఫైర్ వర్క్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్- జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా.సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. -
మే4న డాలస్లో ప్రవాస భారతీయోత్సవం
డాలస్ : ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో డాలస్లో ప్రవాస భారతీయోత్సవ కార్యక్రమం జరగనుంది. “భారతీయులందరూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావాలి” అనే పిలుపునిస్తూ కాప్పెల్లోని సైప్రేస్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ ప్రకటన విడుదల చేశారు. మే4న మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, పార్కింగ్తో సహా ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల వినోదం కోసం ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’, ‘రంగు రంగుల బెలూన్స్ పంపకం’ మొదలైనవెన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్, ఇతర బిజినెస్ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 500 మందికిపైగా భారత సంతతికి చెందిన వారితో పాటు అమెరికన్ యువతీయువకులు కూడా అనేక సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. 80 మందితో కూడిన విద్యార్ధినీ విద్యార్ధులు “కాప్పెల్ స్కూల్ బ్యాండ్”లో అలరించనున్నారు. “అమెరికా గాట్ టాలెంట్” షో కు సెలెక్ట్ అయిన హైదరాబాద్కు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అనేక సాహస కృత్యాలను ప్రదర్శించనున్నారు. పాటలను రివర్స్లో పాడే ప్రక్రియతో కొన్ని వందల కార్యక్రమాలుచేసి ఎన్నో ప్రశంసలు పొందిన “రివర్స్ గేర్ గురుస్వామి” అందర్నీ అలరించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. భారత సంతతికి చెందిన యూ.ఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి, నార్త్ కరోలిన స్టేట్ సెనెటర్ జై చౌదరి, వాషింగ్టన్ స్టేట్ సెనెటర్ మాంకా డింగ్ర, ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ నీరజ్ అంటాని, మేరీలాండ్ స్టేట్ రిప్రెసెంటేటివ్ జై జలిసి, ఆరిజోనా స్టేట్ రిప్రెసెంటేటివ్ డా. అమిష్ షాతో పాటు టెక్సస్ స్టేట్ రిప్రెజెంటేటివ్స్ మిషల్ బెక్లీ, జూలీ జాక్సన్, టెర్రీ మిజా, మ్యాట్ షాహీన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, హ్యుస్టన్ నుండి కాన్సల్ రాకేష్ బనాటి, విప్రో సంస్థ సీఈఓ అబిద్ ఆలి నీముచ్వాలా, కాప్పెల్ నగర పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. అర్హత కల్గిన ప్రవాస భారతీయులందరూ అమెరికా దేశ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఈ ఉత్సవంలో అవకాశం కల్పిస్తున్నాము. రాత్రి 9 గంటలకు కనుల విందు కల్గించే అత్యంత వైభవంగా ఫైర్ వర్క్స్ ఉంటాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
జాతిపితకు తెలుగు రాష్ట్రాల నాయకుల ఘననివాళి
డల్లాస్, టెక్సాస్ : తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ప్రముఖులు అమెరికాలోనే అతి పెద్దదైన డల్లాస్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి జాతిపితకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గతంలో ఓసారి డల్లాస్లోని గాంధీ మెమోరియల్ను సందర్శించానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఏటా ఈ గాంధీ మెమోరియల్ ప్లాజా మెరుగులు దిద్దుకుంటూ అత్యంత సుందర ప్రదేశంగా వెలుగొందడం సంతోషదాయకమని తెలిపారు. ఖండాంతరాలల్లో జాతిపిత సిద్ధాంతాలను, ఆశయాలను సజీవంగా ఉట్టిపడేటట్లుగా ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడంలో కృషి చేసిన ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులకు, సిటీ అధికారులకు, స్థానిక ప్రజలకు అభినందలు తెలియజేశారు. తొలిసారిగా ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శిస్తున్నానని, ఇక్కడికి రాగానే శాంతిదూత గాంధీజీ ఆశయాలు, త్యాగ నిరతి, ప్రపంచంలో అనేకమంది యువకులకు స్ఫూర్తినిచ్చిన తీరు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి పేర్కొన్నారు. భావితరాలకు తప్పనిసరిగా ఇదొక స్ఫూర్తిదాయక ప్రాంతమౌతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ పార్కును అభివృద్ధి చేయడంలో సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, వారి బృంద సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. మహాత్మా గాంధీ మన భారతదేశంలో జన్మించినా, శాంతి స్నేహం, సుహృద్భావం, అహింస అనే అంశాలే ఆశయాలుగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి ప్రపంచంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచిపోయారని గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాత్తూరి నాగభూషణం అన్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ పచ్చని చెట్లతో, చక్కని నీటి వనరులతో శాంతికి ప్రతిరూపంగా ఈ గాంధీ మెమోరియల్ ను అత్యంత సుందర పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దిన తీరు ను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. తీరికలేని పనులతో బిజీ గా ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు నివాళులర్పించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలకు, స్థానిక ప్రముఖులైన వెంకట్ అబ్బూరు, మురళి వెన్నం, వినోద్ ఉప్పు తదితరులందరికీ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. -
నిక్కీ హేలీకి డల్లాస్లో ఘన సన్మానం
డల్లాస్ : ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విస్తాస్ప్ కర్భరి, టోమ్స్ ఆటో గ్రూప్ అధినేత బాబ్ టోమ్స్ లతో పాటూ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తమ సంస్థ ఆహ్వానం పై నిక్కీ హేలీ డల్లాస్కి విచ్చేయడం ఇది ఆరవ సారని గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర ప్రతినిధిగాను, గవర్నర్ అభ్యర్థి గాను, గవర్నర్ గాను, మహాత్మా గాంధీ మెమోరియల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగాను, ప్రస్థుతం అమెరికా రాయబారిగాను విచ్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిక్కీ హేలీ రాష్ట్ర ప్రతినిధి గాను, గవర్నర్ గాను, సౌత్ కరోలినా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీలకు అతీతంగా ఇరువర్గాలను కలుపుకుపోయే రాజకీయ నాయకులు అవసరమని, అందులోనూ ముఖ్యంగా నేర్పరితనంతో పాటు ధైర్యం, ఓర్పుతో ఉన్న దేశభక్తి, దయాగుణం ఉన్నా అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు కావాలని ఆ లక్షణాలన్నీ నిక్కీ హేలీ లో ఇమిడి ఉన్నాయని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. డా. ప్రసాద్ తోటకూర తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాభివృద్ధి లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ అధినేతలు అమెరికా దేశంలో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 బిలియన్ డాలర్లను పన్ను రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించారని, అంతేకాకుండా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలలో సుమారు రెండు లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులు అమెరికా విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రవాస భారతీయులందరూ కలిపి అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సమకూర్చారని, ప్రస్తుతం భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యం 140 బిల్లియన్ డాలర్లకు చేరుకుందన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ తాను అమెరికా దేశంలో పుట్టినా, తన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డారన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి తానూ ఎంతో గర్వపడతానన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఘనమైనదని, విద్యాధికులుగా, సాంకేతిక పరిజ్ఞాన రంగ నిపుణులుగా అన్ని రంగాలలోను ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ విభాగాలలో అనేక కీలక ఒప్పందాలు ఇరుదేశాల బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాలు ఉగ్రవాద దాడులను చవిచూసినవే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు కృషిని కలసి కొనసాగిస్తాయని తెలియజేశారు. దక్షిణ ఆసియా దేశాలలో శాంతి, సుహృద్భావ వాతావరణానికై అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. నిక్కీ హేలీ ప్రసంగానంతరం ప్రేక్షకులు అడిగిన - "అమెరికా నార్త్ కొరియా అధ్యక్షుల సమావేశం జరుగుతుందా?", "అమెరికా దేశ అభివృద్ధిలో దక్షిణ ఆసియా వాసుల పాత్ర?", "ప్రస్తుత అమెరికా ఇరాన్ దేశ సంబంధాలు?", "హెచ్-4 వీసాల రద్దు, హెచ్-1 బి వీసాల పై నియంత్రణ?", "జెరూసలేం లో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభించటంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు?" మొదలైన ప్రశ్నలకు అనర్గళంగా, చమత్కారంగా నిక్కి హేలీ సమాధానమిచ్చారు. చివరిగా మీరు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగపోతున్నారా? అని డాక్టర్ ప్రసాద్ తోటకూర అడిగినప్పుడు ఇప్పుడు తన ధ్యాసంతా ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల పైనే అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఎంతో తీరికలేని సమయంలో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు నిక్కీ హేలీకి, అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసిన అతిథులందరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ బోర్డు సభ్యులు రావు కల్వల, డా. సి.ఆర్. రావు, పీయూష్ పటేల్, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, డా. సత్ గుప్త, తాయబ్ కుండావాలాలు నిక్కీ హేలీకి పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించగా, డా. ప్రసాద్ తోటకూర ఆమెకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement