-
అక్కడికి బస్సు కోసం నెటిజన్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో ఎండీ సజ్జనార్ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్లో అక్కడికి ఆర్టీసీ బస్లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. ఈ ట్వీట్కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్డేట్ చేయండి’అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు. #TSRTC has arranged special buses to #muchinthal Statue of Equality from the important locations, Timings also furnished. Buses will be scaled up as per traffic demand. Choose #TSRTCBuses for your journeys pic.twitter.com/CEq36k0wzJ — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 31, 2022 -
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
కాలినడకన వెళ్తుంటే కాటేశారు
పాన్గల్: కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు అటకాయించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది. మల్లాయపల్లికి చెందిన విద్యార్థిని(14) పాన్గల్ మండలం చింతకుంటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూల్కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి రోజూ స్నేహితులతో కలసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లి వస్తోంది. రోజులాగే మంగళవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి పాఠశాలకు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన వివాహితులైన నాగరాజు, అనిల్ రెండు వేర్వేరు బైక్లపై వచ్చి స్కూల్ వద్ద వదిలేస్తామని వారిని నమ్మించారు. అనిల్ ఇద్దరు బాలికలను తన బైక్పై ఎక్కించుకుని ముందు వెళ్లగా, నాగరాజు మరో బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు బాలికలను స్కూల్ వద్ద వదిలిపెట్టి తిరిగి వచ్చిన అనిల్ సైతం బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని భయపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఏడుస్తూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, మల్లాయపల్లి సర్పంచ్ జయకళకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్, వనపర్తి డీఎస్పీ కిరణ్కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలను సేకరించారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు
సాక్షి, యాదాద్రి: ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, నాయకులు చేసే ఆర్భాటం, హడావుడి అంతాఇంతాకాదు, హామీల మీద హామీలు ఇస్తుంటారు. వాటిని వెంటనే నెరవేరుస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత అతీగతీ ఉండదనడానికి హాజీపూర్ ఉదంతమే చక్కని ఉదాహరణ. 2019లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో వెలుగు చూసిన బాలికలపై అత్యాచారం, హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. హాజీపూర్ నుంచి బాలికలు ప్రతిరోజూ కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్కు వెళ్లి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డి ట్రాప్ చేసి, ముగ్గురు బాలికలపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 26న వెలుగు చూసింది. నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారుణ సంఘటన అనంతరం హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం, గ్రామం పక్కన గల శామీర్పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు అప్పట్లో హామీలు ఇచ్చారు. ఇంతవరకు అవి అమలైన దాఖలా లేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు ప్రస్తుతం కాలినడకన బొమ్మలరామారం మోడల్ స్కూల్కు వెళ్లి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు కాలినడకన బయలుదేరి 9.30 వరకు పాఠశాలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి బయలుదేరి 6 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఆకతాయిలు అప్పుడప్పుడు వేధిస్తున్నారు. ఆ విద్యార్థినుల బాధలేమిటో వారి మాటల్లో.. ఆకతాయిలతో ఇబ్బంది స్కూల్ నుంచి ఇంటికి కాలినడకన వెళ్లే సమయంలో కొందరు యువకులు బైక్లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు తాకేలా దగ్గర నుంచి వేగంగా వెళ్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. వెకిలిచేష్టలు చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. – గొండ్రు అర్చన, 6 వ తరగతి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ముగ్గురు బాలికలను చంపిన బావులకు సమీపంగా నడిచేటప్పుడు భయం వేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రామం నుంచి మా బడి వరకు బస్సు నడపాలి. – సిరిమిల్ల శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్ 3 గంటలు నడుస్తున్నాం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పాఠ శాలకు గంటన్నర సమయంలో చేరుకుంటున్నాం. పుస్తకాలు, నోట్పుస్తకాల బరువుతో బ్యాగ్ మోయలేకపోతున్నాం. రోజూ మూడు గంటల సమయం కాలినడకకే సరిపోతుంది. – ధీరావత్ సరిత, ఇంటర్ సెకండియర్ -
హాజీపూర్ : వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: తాండూరు పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగైదు పల్లెల్లోని బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ ఆ ఊళ్లలో సర్కారు బడులు లేకపోవటంతో బషీరాబాద్ మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉన్న గొట్టిగ ఖుర్ద్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. సరే అంతదూరం వెళ్లయినా చదువుకుందామంటే.. అక్కడిదాకా వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. బడికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. దీంతో అంతంతదూరం నడుస్తూ వెళ్లి చదివించడం అవసరమా అని తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించేందుకు సందేహిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఈ కారణంతోనే బడులు మాన్పించారు కూడా. ఈ విషయాన్ని గుర్తించిన రోటరీ క్లబ్ సభ్యులు.. చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ గతేడాది 150 సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు వారు సైకిళ్లపై అంతా కలిసికట్టుగా బడికి వెళ్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. సరే.. మరి సైకిళ్లు కూడా లేని ఊళ్ల సంగతేంటనే సందేహానికి తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చే ఏకైక సమాధానం.. చదువు మాన్పించడమే. కొందరు నడుచుకుంటూనో, వాహనాలను లిఫ్ట్ అడిగో బడులకు వెళ్తున్నారు. ఇలాంటి ఊళ్లు వెయ్యికి పైగానే ఉన్నాయి. మరి ఆ గ్రామాల్లో పరిస్థితేంటి? హాజీపూర్ ఘటన పది రోజుల క్రితం.. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న, యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే కీచకుడి ఉదంతం వెలుగులోకి రావడంతో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో భయం పెరిగింది. చదువు కోసమో, ఇతర పనుల కోసమో వేరే ఊళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. ఇది ఒక గ్రామం సమస్యకాదు. వేయి గ్రామాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదన. ఎందుకంటే ఈ గ్రామాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. హాజీపూర్ గ్రామానికి నగరం నుంచి సిటీ బస్సు సౌకర్యం ఉన్నా, స్కూలుకెళ్లే సమయానికి బస్సులు లేకపోవటంతో పిల్లలు నడుచుకుంటూనో, ఆ దారిగుండా వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగో వెళ్తుంటారు. వీరి ఈ నిస్సహాయతను ఆసరా చేసుకుని శ్రీనివాస్ రెడ్డి ‘హత్యా’చారాలకు పాల్పడ్డ తీరు నివ్వెరపరిచింది. ఇదే ఇప్పుడు బస్సు సౌకర్యం లేని ఊళ్లలో ఆడపిల్లలను అలా పంపాలంటే తల్లిదండ్రులు ఆవేదన చెందేందుకు కారణమవుతోంది. ములుగు గణపురం సమీపంలోని బస్వరాజుపల్లెకు బస్సు వసతి లేక ప్రయాణికులు ఇలా వెళ్తున్నారు ఎందుకీ దుస్థితి? రాష్ట్రంలో 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు అంకెల్లో చూపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని సిబ్బందే పేర్కొంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకంగా 330 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. ఇందులో జనాభా పరంగా పెద్ద గ్రామాలు 66 ఉన్నాయి. అనుబంధ గ్రామాలు కలిపితే వాటి సంఖ్య 1300కుపైనే ఉంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా అవుతూ రికార్డు సృష్టిస్తున్న వేళ.. వెయ్యికి పైగా గ్రామాలు ఆర్టీసీ బస్సు మొహం చూడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బస్సులు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కనీసం డ్రైవింగ్ కూడా సరిగా రాని యువకులు ఆటోలు నడుపుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టమొచ్చినంత మందిని ఆటోల్లో కుక్కి తీసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజూ ఆటో చార్జీలు భరించలేని పేద విద్యార్థులకు నడిచి వెళ్లడమో, లిఫ్ట్ అడగడమో తప్ప వేరే మార్గమే లేదు. కానీ.. హాజీపూర్ ఉదంతంతో లిఫ్ట్ అడగాలంటేనే పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. బస్సులెందుకు నడవటం లేదు ప్రధాన రహదారులకు చేరువగా ఉన్నా.. కొన్ని ఊళ్లకు ఇప్పటికీ సరైన రోడ్డు వసతి లేదు. గతుకుల రోడ్డుపై ప్రయాణంతో బస్సులు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ఊళ్లకు బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో బస్సులు నడిచి, ఆ తర్వాత రోడ్డు బాగా పాడవటంతో సర్వీసులను ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీసీ చెబుతున్న లెక్కల ప్రకారం 844 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు సరిగా లేకపోవడాన్నే కారణంగా చూపుతుండటం విశేషం. కొన్ని ఊళ్లకు బస్సు పట్టేంత రోడ్డు లేదు. మలుపులు, వంకలు, పురాతన బావులను దాటుకుని వెళ్లటం అసాధ్యమంటున్నారు. ఈ గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్లను నిర్మించాల్సి ఉన్నా, అది జరగటం లేదు. ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్లను నిర్మిస్తున్నా.. గ్రామాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పటి వరకు రవాణాశాఖ – పంచాయతీరాజ్ శాఖల మధ్య అసలు సమన్వయమే కుదరలేదు. ఈ దిశగా చర్చలు జరగకపోవటమే అసలు ట్విస్టు. ప్రధాన రోడ్లకు చేరువగా ఉంటే శాపమే ఆర్టీసీ పరిభాషలో ‘టీ’ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ప్రధాన రోడ్డుకు నాలుగైదు కిలోమీటర్ల చేరువలో ఉన్న ఊళ్లకు బస్సులు వెళ్లవన్నమాట. ఆ మార్గంలో ఒకటి రెండు ఊళ్లు మాత్రమే ఉంటే, వాటి కోసం ప్రత్యేకంగా బస్సు తిప్పరు. ఆ ఊరి జనం ప్రధాన రోడ్డుమీదకు వచ్చి బస్సు ఎక్కాల్సిందే. ఆ మార్గంలో ఏడెనిమిది ఊళ్లుంటేనే ఓ సర్వీసు నడుపుతారు. అలా ప్రధాన రోడ్లకు చేరువగా ఉండి బస్సు తిరగని ఊళ్లు ఆర్టీసీ లెక్కల ప్రకారం 136 ఉన్నాయి. ఇతర ‘అక్రమ’ వాహనాలతో.. బస్సు లేనప్పుడు ప్రత్యామ్నాయ రవాణావైపు చూడాల్సిందే. పల్లెల్లో చాలాచోట్ల బస్సులు రాకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆటోలు, జీపులు, వ్యాన్లు, ఇతర వాహనాలు ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇప్పుడేమో అలాంటి వాహనాలు పెరిగినందువల్ల బస్సులు నడిపితే నష్టం వస్తుందంటూ ఆర్టీసీ కొన్ని గ్రామాలకు బస్సులు తిప్పటం లేదు. తన లెక్కల ప్రకారమే ఇలాంటి రూట్ల సంఖ్య 244. తీవ్ర నష్టాల్లో ఉన్నా... 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆర్టీసీ తేల్చిన నష్టాల లెక్క రూ.680 కోట్లు. మార్చితో అది దాదాపు రూ.750 కోట్లకు చేరి రికార్డు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి. వీలైనంత వరకు ప్రయాణికుల సంఖ్య పెంచుకుని ఆదాయాన్ని ఆర్జించాలి. కానీ కొత్త ప్రాంతాలకు తిప్పేందుకు ఆర్టీసీ వద్ద చాలినన్ని బస్సులు లేవు. ఒకవేళ తిప్పినా.. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉంటోందన్న పేరుతో రద్దు చేస్తున్నారు. డిపో మేనేజర్లపై నిరంతరం ఓఆర్ కత్తి వేళ్లాడుతుండటంతో.. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే ఊళ్లకు బస్సులు నడిపేందుకు వారు వెనకడుగువేస్తున్నారు. నష్టాలతో లింకెందుకు... ప్రతి ఊరుకు రవాణా వసతి హక్కు లాంటిదే. కానీ వివిధ కారణాలతో వెయ్యి గ్రామాలకు బస్సు వెళ్లకపోవటం బాధాకరమే. నష్టాలతో లింకు పెట్టకుండా అన్ని ఊళ్లకు బస్సు నడపాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఆ నష్టాలను ప్రభుత్వమే భరించి అన్ని గ్రామాలకు ప్రభుత్వ, సురక్షిత రవాణా వసతి కల్పించాలనే వాదన బలంగా ఉంది. కానీ అది అమలు కావటంలేదు. సామాజిక పింఛన్ల తరహాలో రవాణా వసతి లాంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ మేరకు ఆర్టీసీకి నిధులు కేటాయిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు. ప్రమాదాలూ తగ్గుముఖం చాలా రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా వరకు సురక్షితమే. నలుగురు ఎక్కాల్సిన ఆటోల్లో పదిహేను మంది వరకు ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి తప్పిపోతుంది. కొన్ని చోట్ల లారీల్లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సు ప్రయాణం బాలికలు, మహిళలకు కొంతవరకు రక్షణ ఇస్తుంది. ‘హాజీపూర్’లాంటి దురాగతాలకు బస్సు ద్వారా చెక్ చెప్పినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement