-
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు..
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు తల్లులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి పబ్లిక్ టాయిలెట్లకు ఎందుకు వెళ్లాలి? సిగరెట్ తాగడం కోసం స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆకలితో ఉన్న పిల్లలకు పాలివ్వడానికి ప్రతిచోటా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్లు ఎందుకు లేవు? అందరి ముందు తమ బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రజల చెడు దృష్టిని ఎందుకు ఎదుర్కోవాలి? ఢిల్లీవాసి, న్యాయవాది నేహా రస్తోగి ఈ సమస్యల నుండి తల్లులను రక్షించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పింక్ టాయిలెట్లు, పిల్లలకు తల్లిపాలు ఇచ్చే గదులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆమె ఈ దిశగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంది. ఇంతకీ నేహా రస్తోగి తల్లిపాల ఆలయాలు ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా ఆమె ఏం సాధిస్తోంది. లాయర్గా ఆమె పోరాటం దేనికి? ముందుగా తను ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ.. ‘‘నేను 2017, అక్టోబరులో మొదటిసారి తల్లిని అయ్యాను. నా బాబుకి మూడు నెలల వయసున్నప్పుడు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయల్దేరాలి. గంటల గంటల ట్రాఫిక్ తాకిడిని తప్పించుకుంటూ విమానాశ్రయానికి చేరుకునేసరికి బాబు ఆకలితో ఏడుపు మొదలెట్టాడు. అక్కడ వాడికి పాలు ఎక్కడ ఇవ్వాలో తెలియలేదు. వాష్రూమ్లో తల్లి పాలు తల్లిపాలు పట్టేందుకు విమానాశ్రయంలోని వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్లో వాడికి మరోసారి ఆకలి వేసింది. పక్కన కూర్చున్న వ్యక్తిని ‘బిడ్డకు పాలు పట్టాలి, కొద్దిగా స్థలం ఇవ్వమని అడిగాను. కానీ, అతను కాదన్నాడు. ఎయిర్హోస్టెస్ను అడిగితే ‘టాయ్లెట్కి వెళ్లు’ అని చెప్పింది. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఎయిర్ హోస్టెస్ కూర్చున్న చోట కూర్చుని, పిల్లవాడికి పాలు పట్టాను. బెంగళూరు విమానాశ్రయంలోనూ బిడ్డకు తల్లి పాలు పట్టేందుకు చోటు లేదు. అలా బిడ్డతో నా మొదటి ప్రయాణం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా బాధకారంగా అనిపించింది. గంటల తరబడి నా కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటే, నేను నిస్సహాయంగా ఉండిపోయాను. విషయ సేకరణ ఈ సంఘటన తర్వాత నేను దేశవ్యాప్త సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాను. దేశంలో ఎక్కడా చంటి బిడ్డలకు తల్లిపాలు పట్టే గదులు లేవని తెలిసింది. ఈ విషయంపై చాలా మంది మహిళలతో మాట్లాడి, వారి బాధాకరమైన అనుభవాలను విన్నాను. నాలాంటి తల్లులకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే హక్కును కల్పించాలని, అందుకు ఎంతకాలం యుద్ధం చేసినా పర్వాలేదని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఓ ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో లక్షలాదిమంది చంటిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చే ఏర్పాటు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రైల్వేస్టేషన్, బస్టాప్, ఎయిర్పోర్ట్, మాల్స్తో సహా ప్రతి బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల బూత్లు ఏర్పాటు చేయాలని కోర్టును కోరాను. తల్లులు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నాను. లైంగిక వేధింపులు బిడ్డలకు చనుబాలివ్వడానికి గదులు అందుబాటులో లేకపోవడంతో తల్లులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ పిల్లలకు పాలివ్వాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లి గౌరవాన్ని దెబ్బతీసే వారు ఆమెను గౌరవంగా చూడరు. కంప్లైంట్ చేస్తే టాయ్లెట్లో కూర్చొని పాలు ఇవ్వమని సలహా ఇచ్చేవారున్నారు. కానీ, అటువంటి మురికి, దుర్వాసన ఉన్న ప్రదేశంలో కూర్చొని పాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ప్రమాదకరం. ఈ సమస్యకు సంబంధించి అన్ని శాఖలు, ఏజెన్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019లో నిర్ణయం తీసుకుని, ఫీడింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపారు. హైకోర్టు తీర్పు తర్వాత చైనా, అమెరికా, లండన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దానిని కవర్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు నిర్ణయం తర్వాత పింక్ టాయిలెట్, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ప్రారంభమైంది. ఇందులో తల్లులకు ప్రత్యేక భోజన గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తల్లి హాయిగా కూర్చొని బిడ్డకు పాలు పట్టచ్చు. స్నానం చేసి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్లోని పార్లమెంట్ స్ట్రీట్లో మొదటి ఫీడింగ్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సిఆర్లో 700కు పైగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఆలయాల నుంచీ.. షిర్డీలో సాయిబాబా ఆలయం నుండి తాజ్మహల్ వరకు తల్లిపాలు ఇచ్చే గదులు నిర్మించారు. బస్టాప్లు, రైల్వే స్టేషన్లలో తల్లిపాల క్యాబిన్లు ప్రారంభించారు. ఇప్పుడు రైల్వేస్టేషన్లలోనే కాదు రైళ్లలో కూడా ప్రత్యేక ఫీడింగ్ క్యాబిన్లను తయారుచేస్తున్నారు. ఈ విజయం ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. తల్లి పాల బ్యాంక్ దేశంలో ఏ ఒక్క తల్లీ బిడ్డ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ సమస్యను ఎదుర్కోకూడదు. ఈ ఆలోచనతో ‘మాతృ స్పర్ష్ ఇనిషియేటివ్ బై అవ్యన్ ఫౌండేషన్’ పేరుతో ఒక ఎన్జీవోని ప్రారంభించాను. దీని ద్వారా ఫీడింగ్ రూమ్, తల్లి పాల బ్యాంకు సౌకర్యాన్ని కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది తల్లి పాలు కావాలనే వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. దీంతో తల్లిపాలను దానం చేయాలనుకుంటున్న తల్లుల నుంచి పాలుతీసుకొని, అవసరమైన పిల్లలకు ఇస్తుంటాం. ఈ పనిలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే, ప్రతి బిడ్డ తల్లి పాలు సులభంగా పొందుతుంది. ఆ దిశగానే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. లండన్ యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనలో నేను వాదించిన తల్లిపాల కేసు చేర్చారు. కేవలం తొమ్మిది నెలల వయసులో పిల్ దాఖలు చేసినందుకు నా కొడుకు అవ్యన్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. రొమ్ము లైంగిక అవయవం కాదు. ఇది తల్లి–బిడ్డల మధ్య పవిత్ర సంబంధాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం అంత సులువు కాలేదు. మాది చిన్న కుటుంబం. నా కొడుకు సిజేరియన్ ద్వారా పుట్టాడు. ఈ పోరాటంలో నేను ఆపరేషన్ నుంచి చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఇంటి నుండి కోర్టు పనులు పూర్తయ్యేవరకు పిల్లాడిని పట్టుకొనేదాన్ని. సమాజంలో పాతకాలపు ఆలోచనలను మార్చడం పెద్ద సవాల్. ఎంతో మంది మహిళలు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా మాట్లాడలేకపోతున్నారు’’ అంటూ ఈ సమస్య గురించి సుధీర్గంగా తన గళం వినిపిస్తారు ఈ లాయర్. చదవండి: రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు! -
హాట్సాఫ్ రమ్య.. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించావు
తల్లికి దూరమైన పన్నెండు రోజుల పసిపాప ఆకలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎక్కువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ‘పాపకు ఏమైనా అవుతుందేమో’ అనే భయం ఆవరించింది. అలాంటి విపత్కర సమయంలో దేవుడు పంపిన మనిషిలా వచ్చింది కానిస్టేబుల్ రమ్య... ఒక మహిళ గట్టిగా ఏడుస్తూ పోలీస్స్టేషన్కు వచ్చింది. ‘ఏమైంది?’ అని అడిగే లోపే తన బిడ్డను భర్త ఎత్తుకెళ్లిపోయాడని గుండెలు బాదుకుంది. తనకూ, భర్తకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. అతడి కోసం వెదికితే జాడలేదు. ‘పాప ఎన్ని ఇబ్బందులు పడుతోందో!’ అనే ఆందోళన అందరిలో మొదలైంది. ప్రాథమిక దర్యాప్తులో అతడు బెంగళూరుకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకున్నారు. చెక్పోస్ట్ల దగ్గర నిఘా పెట్టారు. వయనాడ్ (కేరళ) సరిహద్దుల దగ్గర చెక్పోస్ట్లో బాధితురాలి భర్తను పట్టుకున్నారు పోలీసులు. అతడి చేతుల్లో పాప ఉంది. ఎప్పటి నుంచి ఏడుస్తుందో ఏడుస్తూనే ఉంది. పాపను తల్లి దగ్గరకు చేర్చాలంటే చాలా సమయం పట్టేట్లు ఉంది. ఈలోపు పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది, పాప బతకాలంటే పాలు పట్టాలి. తల్లి ఎక్కడో దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు పంపిన మనిషిలా ముందుకు వచ్చింది పోలీస్ కానిస్టేబుల్ ఎంఆర్ రమ్య. పాప పరిస్థితి చూసి చలించిపోయింది. ఇంటి దగ్గరున్న తన పిల్లలు గుర్తువచ్చారామెకు. ఈ పాప తన మూడో పాప అనుకుంది. అక్కున చేర్చుకుని అమ్మలా పాలు పట్టింది. దాంతో ప్రమాదం తప్పింది. ‘పాపను తల్లికి అప్పగించి ఊరికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. విపరీతమైన ఆకలి. ఏదైనా తిందామంటే ఒక్క దుకాణం కూడా తెరిచి లేదు. ఆ భయానకమైన ఆకలి కాస్తా ఈ రోజు నేను ఒక మంచిపని చేశాను అని గుర్తు తెచ్చుకోవడంతో మాయమైపోయింది’ అంటుంది రమ్య. రమ్య చేసిన మంచిపని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారామెను సత్కరించి ప్రశంసించారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ రమ్యను ప్రశంసిస్తూ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘నువ్వు చేసిన మంచి పని పోలీస్ డిపార్ట్మెంట్ మానవతా దృక్పథానికి అద్దం పడుతుంది. నిబద్ధత ఉన్న ఉద్యోగిగా, చల్లని మనసు ఉన్న తల్లిగా ఒకే సమయంలో రెండు విధులు నిజాయితీ గా నిర్వహించావు. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించేలా చేశావు...’ కోళికోద్కు చెందిన రమ్యకు ఇద్దరు పిల్లలు. భర్త స్కూలు టీచర్. ఒకప్పుడు రమ్య పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే పాపకు పాలు పట్టిన వార్తతో ఆమె పేరు అందరికీ సుపరిచితం అయింది. ఎక్కడికి వెళ్లినా ‘చల్లగా జీవించు తల్లీ’ అనే దీవెనలు లభిస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement