కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం

Published Sat, Nov 1 2014 3:07 AM

కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం

 మోత్కూరు : మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయ్యారనే వార్త శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. మునగాలకు చెంది న డి.కవిత, కరీంనగర్ జిల్లాకు చెందిన బాలరాజు మండల కేం ద్రంలో అబ్బాస్ చిల్డ్రన్ హోంను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది చిన్నారులు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఇందులో కోశాధికారిగా ఎం.వెంకటేశ్వర్లు, ట్యూటర్‌గా ఓర్సు జ్యోతి, ఆయాగా గొలుసుల లక్ష్మమ్మ పనిచేస్తున్నారు. దీని నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి నిధులు వస్తున్నట్టు తెలిసింది. అవి దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ గుట్టు రట్టవుతుందనే నిర్వాహకులు చిల్డ్రన్ హోంను మూసివేసినట్టు తెలుస్తోంది.
 
 అప్రమత్తమైన అధికారులు
 చిల్డ్రన్ హోం నుంచి  27 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్‌రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తంచేశారు. రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య మూసివేసి ఉన్న చిల్డ్రన్‌హోం వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు.
 
 చిన్నారులు ఏమైనట్టు..?
 చిల్డ్రన్‌హోం ఈ నెల 18వ తేదీ రాత్రి నుంచి మూతబడినట్టు అందులో పనిచేస్తున్న ఆయా గొలుసుల లక్ష్మమ్మ పేర్కొంది. ఈ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్న సాయికుమార్, వేముల శివకృష్ణ, రవిశంకర్‌ను నిర్వహకులు బాలరాజు, కవిత గత జూన్ 24న మోత్కూరు పట్టణం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేయించినట్లు ఎంఈఓ విచారణలో తేలింది. దసరా సెలవుల వరకు ఈ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయినట్లు హాజరు రిజిస్టర్‌లో ఉంది. కాగా, అక్టోబర్ 17,18 తేదీల్లో చిల్డ్రన్‌హోంలో మీటింగ్‌లు నిర్వహించినట్లు సీఐ విచారణలో ఆయమ్మ గొలుసు ల లక్ష్మమ్మ తెలిపింది. నిధులు  దుర్వినియోగం అవుతున్నాయనే నేపథ్యంలో నిర్వహకులు చిల్డ్రన్‌హోం ను మూసివేశారా?, పిల్లలను ఇతర చోటుకు తరలించారా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా, 5 గురు పిల్లలతో కవిత తన తల్లిదండ్రులతో నకిరేకల్  పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన 22 మంది పిల్లలు ఏమయ్యారనే విషయం తేలాల్సి ఉంది.
 

Advertisement
Advertisement