జగనే విజయసారథి : పేర్ని నాని | Sakshi
Sakshi News home page

జగనే విజయసారథి : పేర్ని నాని

Published Sat, Apr 19 2014 1:48 AM

Vijayasarathy consist of: the names of the movie

మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహనరెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, బందరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక చెమ్మనగిరిపేటలో టీడీపీకి చెందిన 60మంది నాయకులు, కార్యకర్తలు దాసరి లక్ష్మణరావు(బుడ్డా) ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ పేర్నినాని పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు.

ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా పాలించారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు నేటికీ అనేక కుటుంబాలకు ఆసరాగా మారాయన్నారు. అయితే ఈ పథకాలను గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడని విమర్శించారు.  ప్రజా రంజక పథకాలు ఇంకా సమర్థవంతంగా అన్ని వర్గాల ప్రజలకు అందాలంటే జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి  కావాలన్నారు.

జగన్‌మోహనరెడ్డి మేనిఫెస్టోలో విడుదల చేసిన పలు సంక్షేమ పథకాలు అమలైతే పేదల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని గమనించిన ప్రజలు ఆయనకు ఓట్లేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. బుడ్డాతో పాటు బాసా నాగేశ్వరరావు, వన్నెంరెడ్డి కృష్ణ, కరిసోటి రాంబాబు, చింతా శ్రీనివాసరావు, ముద్రగడ్డ రవి పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ పీచుపాటి మారుతీ సుధాకర్, 32వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తాడిబోయిన విజయలక్ష్మి, పార్టీ నాయకులు నాయుడు కాశీ, ఎంటీజీ నారాయణ, గోపిశెట్టి రాము, బోగాధుల సురేష్‌బాబు, పీవీ ఫణికుమార్ తదితరులున్నారు.
 

Advertisement
Advertisement