వారంతే... మారరంతే! | Sakshi
Sakshi News home page

వారంతే... మారరంతే!

Published Thu, Sep 18 2014 3:03 PM

ఖైదీలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

 కోటగుమ్మం(రాజమండ్రి) : అనారోగ్యంతో ఉన్న ఖైదీలను ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో వ్యాన్‌లో తీసుకువెళ్లాలని నిబంధనలున్నా, జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఖైదీలు తప్పించుకున్న సందర్భాలూ అనేకం. తాజాగా ఈనెల 14వ తేదీ ఆదివారం అనారోగ్యంతో ఉన్న రిమాండ్ ఖైదీని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా హాస్పిటల్‌లో బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి పరారైన సంగతి తెలిసిందే.

సంఘటనలో ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు జైలు గార్డులు పి. సత్యనారాయణ, రమణలు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒకే సారి 12 మంది ఖైదీలను చేతులకు బేడీలు వేసి హాస్పిటల్‌కు తరలించారు. పకడ్బంధీగా పోలీసు వ్యాన్‌లో ఖైదీలనుతరలించవలసిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది.
**

Advertisement
Advertisement