-
కౌంటింగ్కు విధివిధానాలు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) జూన్ 4వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపునకు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్లు క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు పర్యవేక్షక అధికారులుగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపునకు నియమించిన అధికారులు, లెక్కింపు సిబ్బంది ఆరోజు తెల్లవారుజామున 4 గంటలకు హాజరవుతారు. ర్యాండమైజేషన్ పూర్తయిన తరువాత సిబ్బంది తమకు కేటాయించిన కౌంటింగ్ హాల్లోకి ప్రవేశిస్తారు. అనంతరం అక్కడి ఆర్ఓ, ఏఆర్ఓ సూచనలను స్వీకరిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఆయా టేబుళ్ల వద్ద సామగ్రి ఉందా లేదా అనేది సూపర్వైజర్లు పరిశీలిస్తారు. సందేహాలు వస్తే నివృత్తి చేసుకుంటారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అంశంపై జాగ్రత్తలు తీసుకుంటూ ప్రక్రియ సజావుగా జరిగేలా ఆర్ఓలకు సూపర్వైజర్లు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. ఈ విధానాలు పాటించాలి.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సూపర్వైజర్లు నిర్వహించాల్సిన విధులు, పాటించాల్సిన విధానాల గురించి ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసింది. ● ఓట్ల లెక్కింపు వద్ద కౌంటింగ్ ఏజెంట్లతో పిచ్చాపాటిగా మాట్లాడకూడదు. ● స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చిన ఈవీఎం పెట్టెలకు సీల్ పరిశీలించిన తరువాతే వాటిని టేబుళ్లవారీగా దించాలి. ● 17సీ ఫారం–1, కంట్రోల్ యూనిట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్లు సరిపోల్చుకోవాలి. ● ఆ తరువాత కంట్రోల్ యూనిట్ను బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ● సిస్టమ్ డిస్ప్లే అయేంత వరకు వేచి చూడాలి. ఆ తరువాత టోటల్ బటన్ను ప్రెస్ చేసి 17సీ ఫారం–1తో సరిపోలిందా లేదా చూడాలి. ● ఆ తరువాత కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ తొలగించాలి. పై కవర్ తీసి, వేసిన సీళ్లను తొలగించిన తరువాత ‘రిజల్ట్ బటన్’ ప్రెస్ చేయాలి. ● అందులో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను 17సీ ఫారం–2లో నమోదు చేయాలి. ఆ ఫారాన్ని కార్బన్ పేపర్ ద్వారా రెండు కాపీలు ఉండేలా చూడాలి. ● ఓట్ల నమోదు అనంతరం అందులో ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని, అసలు ప్రతిని 17సీ ఫారం–1కు పిన్ చేసి రో–ఇన్చార్జ్కు అందజేయాలి. వీవీప్యాట్లు ఇలా లెక్కించాలి ● నియోజకవర్గంలో ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు చెందిన వీవీ ప్యాట్లను ఒకదాని తరువాత ఒకటిగా లెక్కించాలి. ● వీవీ ప్యాట్ స్లిప్లను సంబంధిత ట్రేలో ఉంచాలి. పూర్తయిన తరువాత 25 చొప్పున కట్టగా కట్టాలి. స్లిప్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ● వీవీ ప్యాట్ కౌంటింగ్ అనంతరం ఆర్ఓ పరిశీలిస్తారు. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ సంతృప్తి చెందిన తరువాత స్లిప్లను సంబంధిత బాక్స్లో ఉంచి, విధుల్లో ఉన్న ఏఆర్ఓకు అప్పగించాలి. మార్గదర్శకాలు నిర్దేశించిన ఎన్నికల సంఘం కేంద్రాల్లో సూపర్వైజర్లది క్రియాశీలక పాత్ర ఆర్ఓలు, ఏఆర్ఓల పర్యవేక్షణలో ప్రక్రియ జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు -
అది ఎన్డీయే కమిషన్
అనంతపురం కార్పొరేషన్: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కాస్తా ఎన్డీయే కమిషన్గా మారిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విమర్శించారు. పోలీసుల వైఫల్యం కారణంగానే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ అనంతపురం, ఉరవకొండ, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థులు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, వీరాంజనేయులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను ముక్తకంఠంతో తప్పుపట్టారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన అధికారం చేజిక్కించుకోవాలని ఎత్తగడతో ముందుకెళ్లాయన్నారు. కూటమిగా ఏర్పడ్డాక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ను ఎన్డీయే తన గుప్పిట్లోకి తీసుకుందని ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో అరాచకశక్తులు చెలరేగిపోయాయన్నారు. తాడిపత్రిలో 274 పోలింగ్ కేంద్రాలకు గాను 134 సమస్యాత్మకమైనవని గుర్తించినా.. ఆ కేంద్రాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అల్లర్లు చోటు చేసుకున్నాయన్నారు. సాక్షాత్తు నూతన ఎస్పీ పర్యవేక్షణలో పోలింగ్ రోజునే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగిందన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏ బూత్ వద్దకు వెళ్లినా.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి, ఏఎస్పీ రామకృష్ణ తారసపడ్డారని, దీన్నిబట్టి చూస్తే ఎన్నికలు పక్కా పథకం ప్రకారం నిర్వహించినట్లు తెలుస్తోందన్నారు. ట్రాక్టర్లో రాళ్లు తీసుకొచ్చి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, పట్టణ సీఐ మురళీకృష్ణలను బాధ్యులను చేసి సస్పెన్షన్ విధించిందన్నారు. తాడిపత్రి అల్లర్లు, అరెస్టులపై లోతుగా విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. పథకం ప్రకారమే కూటమి అడ్డదారులు.. ఎలాగైనా గెలవాలని ఎన్నికల కమిషన్ అండతో కూటమి నేతలు అడ్డదారులు తొక్కారని ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అల్లర్లు జరిగాయన్నారు. కూటమి డైరెక్షన్లో అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయని, ఇందుకు ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా మాట్లాడుతూ తాడిపత్రిలో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడిపత్రి ఘటనపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మేయర్ వసీం, పార్టీ అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురాం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైఫుల్లాబేగ్, సీపీ వీరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, నాయకులు ధనుంజయ యాదవ్, కార్పొరేటర్ గురుశేఖర్ బాబు పాల్గొన్నారు. తాడిపత్రి ఘటనలో పోలీసుల వైఫల్యం ఎన్నికల కమిషన్ చర్యలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు -
24 నుంచి విత్తన వేరుశనగ పంపిణీ
అనంతపురం అర్బన్: ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనకాయల పంపిణీ ఈ నెల 24 నుంచి చేపట్టనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. శనివారం నుంచే విత్తన కాయల కోసం రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విత్తన పంపిణీ అంశంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మతో కలిసి ఏడీఏ, ఏఓ, బ్యాంకర్లు, తదితర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 24వ తేదీ నుంచి విత్తనకాయల పంపిణీ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకూ విత్తనకాయలు అందించాలన్నారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా, అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పంపిణీ రోజుకు అందుబాటులో ఉండేలా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఆర్బీకేలకు విత్తనకాయను ముందస్తుగానే తరలించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏపీ సీడ్స్ డీఎం వ్యక్తిగతంగా ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని ఏపీ సీడ్స్ డీఎంను, జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతు కోరిన రకం విత్తనాలే ఇవ్వాలి.. రైతు కోరిన రకం విత్తనకాయలనే ఇవ్వాలని కలెక్టర్ కచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఆర్బీకేల్లో ఏడీఏలు, వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతుకు ఏ రకమైన విత్తనకాయలు కావాలో తెలుసుకుని 19లోగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. వానలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్బీకేల్లో విత్తనకాయలను జాగ్రత్తగా నిల్వ చేయాలని సూచించారు. సీసీఆర్పీ కార్డులు మరింతమంది రైతులకు అందించేలా చూడాలని చెప్పారు. వారికి బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహులు, ఏపీ సీడ్స్ డీఎం సుబ్బయ్య, ఏఓ రాకేష్, ఏడీఏలు,ఏఓలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో మానిటరింగ్ సెల్.. సబ్సిడీ విత్తనకాయల పంపిణీ పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో సీడ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విత్తన పంపిణీలో రైతులకు ఏవేని సమస్యలు ఉంటే కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ 08554– 232922, 08554–231922కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. రైతులకు పంపిణీ ఇలా.. ● అర ఎకరం వరకు 30 కిలోల సంచి ఒకటి. ● అర ఎకరం నుంచి ఎకరా వరకు 2 సంచులు. ● ఎకరం.. అంతకు మించి ఉంటే 3 సంచులు . విత్తనకాయ రకాలు, ధర.. ● కె–6, టీసీజీఎస్–1694 విత్తన వేరుశనగ కాయల 30 కిలోల సంచి పూర్తి ధర రూ.2,850. ఇందులో సబ్సిడీ రూ.1,140 పోగా రూ.1,710 చెల్లించాలి. ● కదిరి లేపాక్షి (కె–1812) రకం విత్తన వేరుశనగకాయల 30 కిలోల సంచి పూర్తి ధర రూ.2,610. ఇందులో సబ్సిడీ రూ.1,044 పోగా రూ.1,566 చెల్లించాలి. 81,832 క్వింటాళ్ల విత్తనాల కేటాయింపు.. అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2024లో రైతులు పంటలు సాగు చేసేందుకు సబ్సిడీపై అందజేసే విత్తనం సిద్ధమవుతోంది. జిల్లాకు వివిధ రకాల పంటలకు సంబంధించి 81,832 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. ఇందులో వేరుశనగకు అగ్రస్థానం దక్కింది. వేరుశనగ 76,710 క్వింటాళ్లు, కందులు 2,300 క్వింటాళ్లు, విత్తన వరి 1,600 క్వింటాళ్లు, ఉలవలు 700 క్వింటాళ్లు, జీలుగ 200 క్వింటాళ్లు, పిల్లిపెసర 25 క్వింటాళ్లు, జనుము 7 క్వింటాళ్లు, అలసంద 106 క్వింటాళ్లు, పెసర 85 క్వింటాళ్లు, మినుములు 46 క్వింటాళ్లు, కొర్రలు 50 క్వింటాళ్లు, రాగులు 4 క్వింటాళ్లు కేటాయించారు. వేరుశనగకు 40 శాతం, జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. విత్తన వేరుశనగ సేకరణ వేగవంతం శింగనమల: విత్తన వేరుశనగ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని లోలూరు వద్దనున్న సాయి సీడ్స్ ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో విత్తన వేరుశనగ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. నిర్దేశిత గడువులోపు విత్తన సేకరణ పూర్తి చేయాలన్నారు. సబ్సిడీ విత్తన బ్యాగులు పెంచాలి పామిడి: సన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తన వేరుశనగ బ్యాగుల సంఖ్య పెంచాలని ఎద్దులపల్లి రైతులు కలెక్టర్ వినోద్కుమార్ను కోరారు. శుక్రవారం ఎద్దులపల్లిలో ట్రైనీ కలెక్టర్ వినూత్నతో కలిసి కలెక్టర్ పర్యటించారు. తొలుత రైతు భరోసా కేంద్రంలో నిల్వ చేసిన విత్తన వేరుశనగను పరిశీలించారు. మండలానికి కే–6 రకం విత్తన వేరుశనగ 1,600 క్వింటాళ్లు కేటాయించినట్లు ఏఓ డీ లీనా వసుంధర కలెక్టర్కు వివరించారు. అనంతరం రైతు పవన్కుమార్ సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు వీరాంజనేయులు, ప్రతాప్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తిప్పారెడ్డి, ఆదినారాయణ తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సన్నకారు రైతులకు ఎకరాకు 3 చొప్పున ఐదు ఎకరాలకు 15 ప్యాకెట్ల విత్తన వేరుశనగ కేటాయించాలని కోరారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరంలో పంపిణీ చేసేందుకు జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులకు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో వెనుకడుగు వేసేవారు. పంపినా అరకొర ఖర్చులు కూడా భరించలేక చాలామంది పిల్లలు డ్రాపౌట్స్గా మారేవారు. అప్పట్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాంను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది. 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఇక మిగిలిన నోట్ పుస్తకాలు, ఇతరత్ర వాటిని కొనుగోలు చేయాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టంగా ఉండేది. విద్యకు జగన్ ఎనలేని ప్రాధాన్యత.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. 9 రకాల వస్తువులతో కిట్.. తల్లిదండ్రులపై పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. ఒక కిట్కు ప్రభుత్వం రూ.1650 ఖర్చు చేస్తోంది. ఈ కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ ఉంటాయి. ఇప్పటికే నాలుగేళ్లు ఈ కిట్లను ఇచ్చారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో విడత జేవీకే కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,68,254 మంది ఉన్నారు. వీరికోసం రూ. 44.26 కోట్లు ఖర్చు చేసి జేవీకే కిట్లు అందజేస్తోంది. మొత్తంగా ఈ ఐదేళ్లలో విద్యాకానుక కిట్ల కోసం ప్రభుత్వం రూ.183 కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్కు దీటుగా ‘ప్రభుత్వ’ విద్యార్థులు.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి ఈ నాలుగేళ్లూ వెళ్లారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ఏడు మండలాలకు చేరిన నోట్బుక్స్.. జగనన్న విద్యా కానుక కిట్లలోని అన్ని వస్తువులు రాష్ట్ర కార్యాలయం నుంచి నేరుగా మండల కేంద్రాల్లోని గోడౌన్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఏడు మండలాలకు నోట్ బుక్స్ చేరాయి. తక్కిన వస్తువులన్నీ రెండుమూడు రోజుల తర్వాత నుంచి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1–10వ తరగతి విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు వరుసగా ఐదో ఏడాది ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు ఇప్పటిదాకా ఏడు మండలాలకు చేరిన నోట్బుక్స్ బడి తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో విద్యా కానుక కిట్లు జిల్లాలో 2,68,254 మంది విద్యార్థుల కోసం రూ. 44.26 కోట్ల ఖర్చు -
ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడిగా రామానాయక్
● ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసనాయక్ అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఫెడరేషన్ జిల్లా నూతన కౌన్సిల్ సమావేశం జరిగింది. నిబంధనల మేరకు అధికారుల అనుమతితో జిల్లా అధ్యక్షుడు ఎ.రవీంద్ర అధ్యక్షతన, ఎన్నికల పరిశీలకుడు ఎ. విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పీవీ ప్రసాద్, అధ్యక్షుడిగా రామా నాయక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసనాయక్, ఉపాధ్యక్షుడిగా ఎస్.రామాంజనేయులు, అసోసియేట్ ప్రెసిడెంట్గా సి. పోతలయ్య, అదనపు కార్యదర్శిగా డి.ఆంజనేయులునాయక్, జిల్లా సబ్ కమిటీ సభ్యులుగా వజీర్బాషా, సాయినాథ్ రెడ్డి, బహేశ్వర, రామకృష్ణ, రమేష్ రెడ్డి, మద్దిలేటప్ప, అశోక్నాయక్, నాగార్జున, నారాయణరెడ్డి నరసింహులును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కులశేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టి దిబ్బలు పడి కూలీ మృతి గుమ్మఘట్ట: మండలంలోని గలగల గ్రామానికి చెందిన గాజుల రాజశేఖర్ (41) అనే వ్యక్తిపై మట్టి దిబ్బలు పడి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజశేఖర్ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆర్.కొత్తపల్లి చెరువులోని ఇసుకను ఎద్దుల బండిలో తరలించేందుకు వెళ్లాడు. అడుగున ఉన్న ఇసుకను తవ్వుతుండగా పైన్నున్న మట్టిదిబ్బలు ఒక్కసారిగా మీద పడడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు మట్టిదిబ్బలను తొలగించేలోగా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టుగోవిందరెడ్డి మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. -
రక్తపోటును నిర్లక్ష్యం చేయొద్దు
అనంతపురం మెడికల్: రక్తపోటును నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ జరిగింది. బీపీని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారన్నారు. హైబీపీతో గుండె ఆరోగ్యం, స్ట్రోక్స్, మూత్రపిండాల వైఫల్యం వంటి వాటిని ప్రభావం చూపుతాయన్నారు. రక్తనాళాల్లో పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (140/90 లేదా అంతకంటే ఎక్కువ) అధిక రక్తపోటు కింద పరిగణిస్తారన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మద్యం, పొగాకు మానేసి, ఒత్తిడి లేకుండా జీవించాలన్నారు. అనంతరం అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి బీపీ లక్షణాల గురించి విపులంగా తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ మహీంద్ర, ఓబులు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, పరిపాలనాధికారి గిరిజా మనోహర్, డెమో ఉమాపతి, త్యాగరాజు, గంగాధర్, ఎస్ఓ మహమ్మద్ రఫి, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, ఎన్సీడీ సిబ్బంది శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి అనంతపురం మెడికల్: మాతా, శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గత నెలలో జిల్లాలో చోటు చేసుకున్న మాతా, శిశు మరణాలపై సంబంధిత వైద్యులు, సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గర్భిణీని 12 వారాల్లోపు రిజిస్ట్రేషన్ చేయించి, ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలను అందించాలన్నారు. ఏ తల్లి ప్రసవం అనంతరం అధిక రక్తస్రావంతో మరణించకూడదన్నారు. ప్రతి గర్భిణీని పరీక్షించాలని, ప్రమాదకర లక్షణాలున్న వారిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం జరిగేలా, 108ను వినియోగించుకునేలా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా అధిక సంఖ్యలో ప్రసవాలు చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ అరుణలత, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శంకర్నారాయణ, ఎంపీహెచ్ఈఓ లక్ష్మణ్ణ, ఎంపీహెచ్ఎస్ హేమలత, తదితరులు పాల్గొన్నారు. సిజేరియన్లు తగ్గించాలి అనంతపురం మెడికల్: ‘నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేయకూడదు. సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి’ అని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులతో డీఎంహెచ్ఓ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసిన వైద్యులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణీ సీ్త్రల ప్రసవ సమయంలో సిజేరియన్ ద్వారా 30 నుంచి 40 శాతం మాత్రమే చేయాల్సి ఉందన్నారు. సిజేరియన్ చేయడానికి గల కారణాలు వైద్యశాఖకు పంపాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ సాధారణ ప్రసవానికి పూర్తీ ఇబ్బంది ఉన్నటువంటి గర్భిణులకు మాత్రమే సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే నోటీసులు జారీ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫి, డెమో ఉమాపతి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఉప డెమో త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి -
బాధ్యుడిని వదిలేసి ఇతరులపై వేటు
తాడిపత్రిరూరల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. శాంతిభద్రతలు అదుపుతప్పడానికి ఏఎస్పీ రామకృష్ణ బాధ్యుడని ఆరోపణలు పెల్లుబికిన నేపథ్యంలో ఆయన్ను కాకుండా డీఎస్పీ గంగయ్య, పట్టణ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. తాడిపత్రి డీఎస్పీగా గంగయ్య 2023 మే5న బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో రాజకీయ వివాదాలు, శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదు. పోలింగ్ అనంతరం అల్లర్లను నియంత్రించేందుకు డీఎస్పీ గంగయ్య తన వంతు కృషి చేశారు. సిబ్బంది తక్కువగా ఉండటం టీడీపీ మద్దతుదారులు భారీగా ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి. పట్టణ సీఐగా ఉన్న మురళీకృష్ణ తాడిపత్రికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన కూడా వివాదాలకు దూరంగా ఉండేవారు. అల్లర్లను నియంత్రించడానికి సీఐ మురళికృష్ణ ప్రయత్నించి రాళ్ల దాడిలో గాయపడ్డారు. వీరిద్దరూ ఎస్పీతో పాటు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న ఏఎస్పీ రామకృష్ణ పరిధిలో ఉండటంతో సొంత నిర్ణయాలు తీసుకొని అల్లర్లను నియంత్రించలేని పరిస్థితి. అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐలు సస్పెండ్ చేశారు. అయితే ఏఎస్పీ రామకృష్ణ తప్పించుకోవడం బట్టి చూస్తే ఆయనకు చంద్రబాబుతో డైరెక్టు లింకు ఉందని, ఆ మేరకే తాడిపత్రికి ఎన్నికల ఇన్చార్జ్గా వేయించుకున్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓడించడానికి స్థానిక టీడీపీ నాయకులతో చేతులు కలిపారని , ఆ సంబంధాల ద్వారానే సస్పెండ్ను తప్పించుకొని ఉండవచ్చని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. తాడిపత్రి ఘటనలో బాధ్యుడైన ఏఎస్పీ సేఫ్జోన్ డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్ వేటు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం -
కళాఖండాలకు నిలయం
అనంతపురం కల్చరల్: మ్యూజియంలు అకడమిక్ విలువతో కూడిన వినోదానికి మూలంగా పనిచేయడమే కాదు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కళాఖండాల సంరక్షణను ప్రోత్సహించడంలో ఎంతో సహాయపడతాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని (ఐఎండీ) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్కృతిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్కృతిక మార్పిడి, సంస్కృతుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం, శాంతి అభివృద్ధికి ముఖ్యమైన సాధనాలు. అందమైన కట్టడాలలో ఒకటి.. ఆదిమానవుడు ఉపయోగించిన రాతి పనిముట్లు, మట్టిబొమ్మలు బౌద్ధ, జైన రాతి కాంస్య ప్రతిమలు, వివిధ రాజవంశాలకు చెందిన అపురూప వస్తువులతో ‘అనంత’ చరిత్ర వెరసి విజ్ఞానం .. వినోదం ఆవిష్కరించేలా జిల్లా కేంద్రంలో సర్వాంగ సుందర కట్టడం ఏర్పాటైంది. పురాతన వస్తువులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ రాష్ట్రంలోనే అందమైన కట్టడాలలో ఒకటిగా నిలచిన ఈ మ్యూజియం భవంతి అందరిని ఆకర్షిస్తోంది. చరిత్రకు దర్పణంగా నిలిచే అధునాతన భవంతి విశేషాలు జిల్లా వాసుల ముంగిటకు రెండు నెలల కిందట మంత్రి ఆర్కే రోజా పురావస్తు శాఖాధికారులతో కలిసి ప్రారంభించారు. ‘మ్యూజియం డే’ లో నేపథ్యంలో అనంతపురంలోని మ్యూజియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. అనంత మ్యూజియం ప్రత్యేకతలివే... జిల్లా కేంద్రంలోని ఆదిమూర్తినగర్లో రూ.7.5 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యంత అద్భుతంగా పురావస్తుశాఖ వారు నిర్మించారు. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మ్యూజియం పేరిట రూపుదిద్దుకున్న ఈ భవంతిలో జిల్లా సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రను చాటేలా వినూత్నమైన రీతిలో విజ్ఞాన వినోదాల మేళవింపుగా అధునాతన మ్యూజియం తయారైంది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ ద్వారా జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల విశేషాలు, చారిత్రాత్మక స్థలాలు, జైన, బౌద్ధ అవశేషాలను తిలకించే ఏర్పాటుతో పాటు దాదాపు 1000 వస్తువులను పొందుపరిచారు. ముఖ్యంగా మూడు అంతస్తుల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సముదాయంలో వేల ఏళ్ల నాటి పనిముట్లు, మట్టి బొమ్మలు, అజంతా, చుగ్తాయ్, డెక్కన్, రాజస్థానీల ఆధునిక చిత్రలేఖనాలు, బంగారు, వెండి నాణేలు, కవచాలు, పిస్టల్స్, కత్తులు, డాళ్లు, ఫిరంగులు చూసే అవకాశం కల్పించారు. వేడుకల్లో పాల్గొనండి నూతనంగా నిర్మించిన మ్యూజియం హాలులో శనివారం ఉదయం మ్యూజియం డే వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ అద్భుతమైన కట్టడాన్ని తిలకించేందుకు చిన్నారులకు ఉచిత ప్రవేశం ఏర్పాటు చేశాము. కేంద్ర గ్రంథాలయం, ఇంటాక్ వారి సహకారంతో సాగే కార్యక్రమంలో చరిత్ర ప్రేమికులు, కవులు, రచయితలందరూ భాగస్వాములు కావాలి. ఘనమైన చరిత్ర కల్గిన ‘అనంత’ ప్రత్యేకతను చాటే విధంగా ఏర్పాటైన మ్యూజియంను విద్యార్థులు సందర్శించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – రజిత, సహాయ సంచాలకులు, జిల్లా పురావస్తుశాఖ ‘అనంత’లో రూ.7.5 కోట్లతో మ్యూజియం ఏర్పాటు ఆకర్షించే విగ్రహాలు, ఆదిమానవుని కాలం నాటి పనిముట్లు -
రైళ్లపై రాళ్ల దాడి కేసులో ఇద్దరి అరెస్టు
అనంతపురం సిటీ: కాచిగూడ – బెంగళూరు మధ్య తిరిగే వందేభారత్ రైలుతో పాటు ముంబై – కోయంబత్తూరు మధ్య తిరిగే కుర్లా ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేశారు. మార్చి నెల 28న కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ముంబై – కోయంబత్తూరు మధ్య నడిచే కుర్లా ఎక్స్ప్రెస్పై కల్లూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన విషయం విధితమే. ఈ రెండు కేసుల్లో అనంతపురం ఆర్పీఎఫ్–జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పురోగతి సాధించారు. పామిడి కల్లూరుకు చెందిన షేక్ దూద్వలి, షేక్ జిలానీ రాళ్ల దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆర్పీఎఫ్ సీఐ రవిప్రకాశ్, ఎస్ఐ మధుకర్ చారి తమ సిబ్బందితో వలపన్ని వారిని అరెస్టు చేశారు. -
అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
అనంతపురం, సాక్షి: జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉండడం గమనార్హం. పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘోరం జరిగింది.అనంతపురం రాణినగర్కు చెందిన షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్బాషా(28) మహ్మద్ అయాన్(6), అమాన్(4), రెహనాబేగం(40)గా గుర్తించారు. -
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.చంద్రబాబు డైరెక్షన్లోనే..: విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులుటీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. -
No Headline
పామిడి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారని, అలాగే గుంతకల్లులో తన గెలుపు ఖాయమని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పామిడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్యజరిగిన ఎన్నికల యుద్ధంలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయన్నారు. ప్రజల ఆశీస్సులతో జగన్ మరోసారి తప్పక సీఎం అవుతారన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ మండల ఇన్చార్జ్ సీబీ జానకీరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్రెడ్డి, పట్టణ కన్వీనర్ జోయిజోడే కుమార్, కిసాన్సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.మధుసూదన్రెడ్డి, గుత్తి మార్కెట్యార్డు మాజీ చైర్మన్ పెమ్మక చెన్నకేశవరెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దత్తు, రాజశేఖరరావు, సునీల్కుమార్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో పంట సాగుకు వీలుగా రైతులకు పంపిణీ చేయనున్న విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ ప్రకటిస్తూ వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విత్తన సేకరణ, ప్రాసెసింగ్, సరఫరాకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)ను గుర్తించింది. ఈ సారి కే–6 రకంతో పాటు కొత్తగా టీసీజీఎస్–1694, అలాగే కదిరి–లేపాక్షి (కే–1812) విత్తన రకాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో నారాయణి రకాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు. కే–6, టీసీజీఎస్–1694 రకాలు క్వింటా పూర్తి ధర రూ.9,500 కాగా అందులో 40 శాతం రూ.3,800 సబ్సిడీ పోను రైతులు తమ వాటా కింద రూ.5,700 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నారాయణి రకం క్వింటా పూర్తి ధర రూ.9,700 కాగా, అందులో 40 శాతం రూ.3,880 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,820 ప్రకారం చెల్లించాలి. ఇక కదిరి–లేపాక్షి 1812 రకం పూర్తి ధర క్వింటా రూ.8,700 కాగా 40 శాతం రాయితీ రూ.3,480 పోను రైతులు తమ వాటా కింద రూ.5,220 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని నిర్ధారించారు. ఒక్కో రైతుకు భూ విస్తీర్ణం బట్టి గరిష్టంగా 90 కిలోలు (30 కిలోలు కలిగినవి మూడు బస్తాలు) పంపిణీ చేయనున్నారు. గిరిజన ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో విత్తన వేరుశనగ పై రైతులకు 90 శాతం రాయితీ వర్తింపజేశారు. త్వరలో రిజిస్ట్రేషన్లు.. ఆర్బీకే వేదికగా విత్తన పంపిణీ చేస్తుండగా ఒకట్రెండు రోజుల్లోనే రైతుల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక్యాప్ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విత్తన పంపిణీలో ఎస్సీ ఎస్టీ, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆర్బీకే అసిస్టెంట్లు వెంటనే తమ పరిధిలో విత్తన అవసరాలు, రైతుల రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించాలని నిర్దేశించారు. కాగా ఈ ఖరీఫ్లో జిల్లాకు 76 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 98 వేల క్వింటాళ్లు.. మొత్తం 1.74 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపులు చేశారు. రెండు మూడు రోజుల్లోనే జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు కేటాయింపులు, ధరలు, సబ్సిడీ వివరాలు, అలాగే కందులు, ఇతర చిరుధాన్యాల విత్తనాల పంపిణీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విత్తన పంపిణీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపంలో మార్గదర్శకాలు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాకు రానున్న 1.74 లక్షల క్వింటాళ్లు కే–6, టీసీజీఎస్–1694, కే–1812 రకాల కేటాయింపు విత్తు కోసం రంగంలోకి వ్యవసాయ శాఖ అనంతపురం అగ్రికల్చర్: విత్తన వేరుశనగ పంపిణీ సన్నాహక చర్యలను వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. ‘విత్తుపై దృష్టి సారించని వ్యవసాయశాఖ’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయశాఖ వెంటనే స్పందించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణం రంగంలోకి దిగారు. అలాగే ఎన్నికల కమిషనర్, వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి కూడా విత్తన పంపిణీ మార్గదర్శకాలు, కేటాయింపులు, ధరలు, సబ్సిడీ వివరాలు కూడా వెల్లడి కావడంతో విత్తన సేకరణ, విత్తన శుద్ధిపై దృష్టి సారించారు. డీఏఓ ఆదేశాల మేరకు అనంతపురం ఏడీఏ ఎం.రవి, ఏఓ శ్రీనాథ్రెడ్డి తదితరులు స్థానికంగా ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించి అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధిని పరిశీలించారు. తేమశాతం, ఫిజికల్ ప్యూరిటీ తదితర నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆదేశించారు. -
No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి ఐటీఐలు. యువతకు భరోసానిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెళుకువలపై పట్టు సాధిస్తుండడంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వల్పకాలిక వ్యవధిలోనే జీవితాల్లో స్థిరపడుతూ కుటుంబాలకు దన్నుగా నిలుస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు.. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రతి ఐటీఐలోనూ ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, మెషినిస్ట్ గ్రైండర్ కోర్సులు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలు బీహెచ్ఈఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, బీఈఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఇస్రో తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. కోర్సు మధ్యలోనే ఆన్ జాబ్ ట్రైనింగ్ విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుతుండగానే మధ్యలో ఈ ఓజేటీకి పంపుతున్నారు. విద్యార్థులను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లోని వివిధ సంస్థల్లో మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో సంబంధిత అంశాల్లో నైపుణ్యం పెంపొందిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఆయా సంస్థలు స్టయిఫండ్గా కొంత మొత్తం చెల్లిస్తుండడం గమనార్హం. కోర్సు పూర్తయిన తర్వాత అవే సంస్థల్లో ఉద్యోగులుగా స్థిరపడాలనే సంకల్పంతో ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు తెలిసింది. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 246 మంది విద్యార్థులు ఓజేటీకి వెళ్లారు. కోర్సులివే... కోపా (ఏడాది కోర్సు), డి/మాన్ సివిల్ (రెండేళ్లు), ఎలక్ట్రీషియన్ (రెండేళ్లు), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (రెండేళ్లు), ఫిట్టర్ (రెండేళ్లు), మెచినిస్ట్ గ్రైండర్ (రెండేళ్లు), మెకానిక్ మోటార్ వెహికల్ (రెండేళ్లు), మెకానిక్ డీజిల్ (ఏడాది), టర్నర్ (రెండేళ్లు), వైర్మెన్ (రెండేళ్లు), వెల్డర్ (ఏడాది), రిప్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ టెక్నీషియన్ (రెండేళ్లు), డ్రెస్ మేకింగ్ (ఏడాది),ఫ్లంబర్ (ఏడాది), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (రెండేళ్లు), ఐసీటీఎస్ఎం (రెండేళ్లు), మెచినిస్ట్ (రెండేళ్లు). దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్కు అర్హత కల్గిన విద్యార్థులు జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యానికి పెద్దపీట కోర్సు పూర్తి కాగానే మెండుగా ఉపాధి అవకాశాలు స్వల్పకాలిక వ్యవధిలోనే స్థిరపడుతున్న విద్యార్థులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల -
వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దు
రాయదుర్గం: ఖరీప్ సీజన్ ఆరంభంలో పంటలకు పొలాలను సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలు నాగలికి అడ్డు తగలకుండా రైతులు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. అయితే ఈ చర్యతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. రాయదుర్గం డివిజన్లోని ఐదు మండలాల్లో హెచ్చెల్సీతో పాటు బీటీపీ ఆయకట్టు కింద రబీలో 2,130 హెక్టార్లలో వరి పంటలు కోతకొచ్చాయి. వరికొయ్యలకు నిప్పు పెట్టకుండా వాటిని నేలలో కలియదున్నడం వల్ల భూమి సారవంతమవుతుందని రాయదుర్గం ఏడీఏ లక్ష్మానాయక్ అంటున్నారు. దుక్కి దున్నే సమయంలో సూపర్ఫాస్ఫెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఫలితంగా డీఏపీ వాడకం తగ్గుతుందన్నారు. ఎకరా విస్తీర్ణంలో వరి కొయ్యలను కలియదున్నితే దాదాపు టన్ను ఎరువు తయారవుతుందని సూచిస్తున్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల కాలుష్యం పెరగడంతో పాటు విపరీతమైన వేడి కారణంగా భూమి సారం కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషకాల శాతం పెరుగుతుందన్నారు. వరి కోతలు కోసిన వారంతా కొయ్యలకు నిప్పుపెట్టడం మాని, కలియ దున్నాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులు ఆపాలి
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులు ఆపాలని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డికి ఓట్లు అధికంగా పడతాయని గ్రహించే తాడిపత్రివాసులను టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచర గణంతో కలిసి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. వీరిని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళితే ఆయన కారుపై రాళ్లు రువ్వారని, దీన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. దీంతో వేలాది మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు గ్రామాలు విడిచి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు జేసీ కుటుంబానికి మద్దతుగా నిలవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కే సుధీంద్ర మాట్లాడుతూ టీడీపీ మనుగడకు ఈ ఎన్నికలు రెఫరండమ్లాంటివన్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ నాయకులు భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమైందన్నారు. తాడిపత్రిలో పోలీసుల ఏకపక్ష వ్యవహార శైలి చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అనాగరిక దేశంలో ఉన్నామా అన్న సందేహం కల్గుతోందన్నారు. ఈ ఘటనలపై లోతుగా విచారణ చేసి, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఎలెక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, తాడిపత్రి ఇన్చార్జ్ సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మికాంత్, తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి -
మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం
అనంతపురం అగ్రికల్చర్: పేద మహిళల స్వయం ఉపాధి, జీవనోపాధుల లక్ష్యంగా జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) వివిధ కార్యక్రమాలు చేపడుతోందని ఆ బ్యాంకు జిల్లా అధికారి (డీడీఎం) అనురాధ తెలిపారు. నాబార్డు ఆర్థిక సహకారంతో ‘కార్డు’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చంద్రబాబు కొట్టాలలో 30 మంది డ్వాక్రా మహిళలకు పట్టుదారాలతో ఆభరణాల తయారీపై 15 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం చంద్రబాబుకొట్టాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీడీఎం ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణలో వారు తయారు చేసిన వివిధ రకాల ఆభరణాలను తిలకించారు. ఇలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలతో ప్రతి మహిళ పేదరికాన్ని జయించి మెరుగైన జీవన ప్రమాణాలు పొందగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘రూడ్సెట్’ డైరెక్టర్ విజయలక్ష్మి, ఏడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మంజుల, మేఘన ఎన్జీవో పీడీ సుశీల, ట్రైనర్ తన్మయి, కార్డు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పలు రైళ్లకు అదనపు కోచ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యాప్తంగా దాదాపు 28 ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదనంగా స్లీపర్, 3 ఏసీ కోచ్లను జత చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గుత్తి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–ధర్మవరం (17247/48) ఎక్స్ప్రెస్ రైళ్లు, అదేవిధంగా గుంతకల్లు జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–హుబ్లీ (17225/26) అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 21 వరకూ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కళ్యాణదుర్గం రూరల్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్బంగా పట్టణంలోని ఇందరమ్మ కాలనీలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో డెంగీపై వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఇంట్లో ఎక్కువగా నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలన్నారు. డెంగీ జ్వరాన్ని ముందుగానే పసిగడితే చికిత్స తేలిక అవుతుందన్నారు. ఈ విషయంపై ప్రజలను చైతన్య పరచాలని ఆశ వర్కర్లు, వైద్య సిబ్బందికి సూచించారు. డెంగీ లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ రిహజైనం, మాస్ మీడియా అధికారి ఉమాపతి, త్యాగరాజు, గంగాధర్, సబ్యూనిట్ ఆఫీసర్ తిరుపాలయ్య, సూపర్వైజర్ కళావతి, ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఎంత పని‘జేస్తి’వయ్యా!
పెద్దపప్పూరు: ఎన్నికల ముందు వరకు వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెరగడం, మళ్లీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని తేలిపోవడంతో గ్రామాల్లో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, పెద్దపప్పూరు, చిన్నపప్పూరు తదితర గ్రామాల్లో పచ్చ మూకలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. అంతటితో ఆగకుండా ఈ నెల 14న తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లు, టపాసులతో వీరంతా దాడి చేశారు. ఈ అరాచక కాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోననే భయంతో అనారోగ్యం నాటకమాడి హైదరాబాద్లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు. దాడులకు తమను ఉసిగొల్పిన వ్యక్తి ఒక్కసారిగా మాయమవడంతో మండలంలోని ఆ పార్టీ గూండాలు నేడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కొండలు, గుట్టలు, పొలాల బాట పట్టి తమ బంధువుల ద్వారా అన్న పానీయాలను తెప్పించుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్డారెడ్డి ఇంటిపై దాడి ఘటనలో మండలంలోని ఏఏ గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు పాలుపంచుకున్నారనే విషయాన్ని ఇప్పటికే గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అరెస్టు భయంతో ఆస్పత్రిలో చేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన్ను నమ్ముకుని రెచ్చిపోయిన అనుచరులు అజ్ఞాతంలోకి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం -
ఎస్పీ అమిత్ బర్దర్ సస్పెన్షన్
● తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణపైనా వేటు ● పట్టణంలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం అనంతపురం/తాడిపత్రి: ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఎస్పీ అమిత్బర్దర్పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పాటు ఆయనపై శాఖాపరమైన విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణలను అదుపు చేయడంలో వీరు విఫలమైనట్లు ఈసీ గుర్తించింది. ఘర్షణలను ముందే పసిగట్టి అరికట్టలేదనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అలాగే,తాడిపత్రి లో జరిగిన ఘటనలపై నమోదైన ప్రతి కేసుపై విచారించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడిన తొలి ఎస్పీ.. జిల్లా పోలీసు చరిత్రలో గతంలో ఎన్నడూ ఓ ఎస్పీ సస్పెండ్ కాలేదు. తొలిసారిగా అలా వేటు పడిన ఎస్పీ అమిత్ బర్దర్ కావడం గమనార్హం. ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ అన్బురాజన్ను ఈసీ బదిలీ చేసింది. అనంతరం అమిత్ బర్దర్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అనతి కాలంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఫలితాల ప్రకటన తర్వాత భద్రత కల్పించండి కాగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లావ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈసీ దిశానిర్దేశం చేసింది. జూన్ 4న కౌంటింగ్ తరువాత తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా నియంత్రించడానికి కేంద్ర బలగాల కంపెనీలను అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ బలగాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. టీడీపీ నాయకుల వల్లే బలి.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగారు. పచ్చ మూకలతో కలిసి ప్రశాంత పట్టణంలో హింస రాజేశారు. ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైనే దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఎస్పీ సస్పెండ్కు గురి కావడం గమనార్హం. గత నెల 5న ఎస్పీగా అమిత్ బర్దర్ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నాయకుల హింసాత్మక వైఖరి కారణంగా కేవలం 40 రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది. అడిషనల్ ఎస్పీ రామకృష్ణపై చర్యలేవీ..? కాగా, తాడిపత్రిలో హింసాత్మక ఘటనలకు పరోక్షంగా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ కారణమయ్యారని ఏకంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన మద్దతుతోనే పచ్చ మూకలు రెచ్చిపోయారని కూడా విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఆధార సహితంగా లేఖ కూడా రాశారు. అలాంటి ఏఎస్పీ రామకృష్ణపై మాత్రం ఈసీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
కాయ్ రాజా కాయ్
● తాడిపత్రిలో వైఎస్సార్సీపీ గెలుపుపై రూ.కోట్లలో బెట్టింగ్ ● ఐపీఎల్ తరహాలో మూడు అంశాలపై భారీగా నగదు వెచ్చిస్తున్న వైనం తాడిపత్రి రూరల్: ‘అనంత’లో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలో ఎన్నికల ఫలితాలు, మెజార్టీ, సీఎం ఎవరు అనే మూడో కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా తాడిపత్రిపైనే అందరూ దృష్టి సారించారు. పెరిగిన ఓటింగ్ శాతంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి విజయ అవకాశాలపై అంచనాలు పెరిగాయి. మహిళలు, మైనార్టీలు, వృద్ధులు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో వైఎస్సార్సీపీ గెలుపుపై రూ.కోట్లలో బెట్టింగ్ కాస్తున్నారు. ఎవరి సర్వేలు వారికి... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తాడిపత్రిలో రెండో సారి ఆ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డి గెలుపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు బెట్టింగ్ రాయుళ్లు సైతం వ్యక్తిగతంగా వారికి వారే అంచనాలు వేసుకుని పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారు. చిన్నపాటి టీ స్టాళ్లలోనూ బెట్టింగ్లపైనే చర్చ సాగుతోంది. ఈ సారి ఐపీఎల్ తరహాలో మూడు కోణాల్లో బెట్టింగ్ కడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? మెజార్టీ ఎంత వస్తుంది? సీఎంగా ఎవరుంటారు? అనే మూడు అంశాలపై బెట్టింగ్లను ఆహ్వానిస్తున్నారు. ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ కడుతున్నారు. తొలుత రూ.లక్షల్లో మొదలైన బెట్టింగ్ ఈ రెండు రోజుల్లో రూ.కోట్లలోకి చేరుకుంది. అల్లర్లతో పెరిగిన ఉత్కంఠ ఎన్నికల పోలింగ్ రోజుల తాడిపత్రిలో జరిగిన అల్లర్లతో బెట్టింగ్రాయుళ్లలో ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచే భారీగా బెట్టింగ్లు మొదలయ్యాయి. యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిలో అల్లర్లు జరగడంతో తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపుపై ఎవరి అంచనాల మేరకు వారు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4న కౌంటింగ్ రోజు నాటికి బెట్టింగ్ల స్థాయి మరింత అవకాశముందని అంటున్నారు. రౌండ్ల వారీగా మెజా ర్టీపై బెట్టింగ్ కాసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికల్లో పక్కగా కోడ్ అమలు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16వ తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ– మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్)ని జిల్లా ఎన్నికల యంత్రాంగం పక్కాగా అమలు చేసింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఫ్లయ్యింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్పోస్టుల వద్ద తనిఖీ కోసం నియమించిన స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసు బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వర్తించి నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేశాయి. జిల్లాలో కోడ్ అమలు తీరును కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సరిహద్దు చెక్పోస్టుల వద్ద పనితీరునూ తనిఖీ చేస్తూ వచ్చారు. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యహరించారు. నగదు, మద్యం సీజ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 13న పోలింగ్ పూర్తయ్యే వరకూ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్ఎస్టీ), పోలీసు బృందాలు చేపట్టిన తనఖీల్లో రూ.6,11,73,123 నగదు పట్టుబడింది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎస్ఎంఎస్) ద్వారా రూ.27,23,072 విలువ చేసే 11,346.9 లీటర్ల మద్యం సీజ్ అయింది. 159 ఉద్యోగుల సస్పెండ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై జిల్లా ఎన్నికల అధికారి కఠినంగా వ్యవహరించారు. షెడ్యూల్ విడుదలైన మార్చి 16వ తేదీ నుంచి పోలింగ్ జరిగిన 13వ తేదీ వరకు నియమావళి ఉల్లంఘించిన 159 మందిని సస్పెండ్ చేశారు. వలంటీర్లు 97 మంది, డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్లు, గోపాలమిత్రలు 14 మంది, కాంట్రాక్టు ఉద్యోగులు 42 మంది, రెగ్యులర్ ఉద్యోగులు ఆరుగురు సస్పెన్షన్కు గురయ్యారు. రూ.6.11 కోట్ల నగదు స్వాధీనం రూ.27.23 లక్షల విలువైన మద్యం సీజ్ -
20 నుంచి ‘దుర్గం’లో బ్రహ్మోత్సవాలు
●చకచకా సాగుతున్న ఏర్పాట్లు రాయదుర్గం: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ నరసింహారెడ్డి గురువారం తెలిపారు. 20న కలశ స్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 21 న సింహ వాహనోత్సవం, 22న సూర్యప్రభ, 23న శేష వాహనం, 24న హనుమద్ వాహనం, 25న శ్రీవారి కల్యాణోత్సవం, 26న గజ వాహనం, 27న ఉదయం మడుగు తేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం, 28న అశ్వవాహనం, 29న వసంతోత్సవం, 30న శయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. వ్యక్తి ఆత్మహత్య బ్రహ్మసముద్రం: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామానికి చెందిన వన్నూరుస్వామి (32) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు... విషయాన్ని గమనించి వెంటనే వన్నూరుస్వామిని కాపాడి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ పరుశురాముడు గురువారం ఉదయం ఎరడికెర గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి : డీపీఎంఓ యాడికి/పెద్దవడుగూరు: చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందికి డీపీఎంఓ డాక్టర్ రవిశంకర్ సూచించారు. యాడికి మండలం రాయలచెరువు పీహెచ్సీతో పాటు పెద్దవడుగూరు పీహెచ్సీని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. అత్యవసర సమయాల్లో రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు చేపట్టాలన్నారు. యాడికిలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దేవరాజన్, సిబ్బంది, పెద్దవడుగూరులో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
No Headline
గుర్తు తెలియని వ్యక్తి మృతి హిందూపురం అర్బన్: మండలంలోని కొటిపి గ్రామ సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న హిందూపురం అప్గ్రేడ్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి పార్రిశామిక వాడలో ఉన్న కియా అనుబంధ ఎస్ఎల్ఏపీ పరిశ్రమంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గురువారం కంపెనీ ముఖ్య ప్రతినిధులు ఎస్ఎల్ఏపీ పరిశ్రమకు చేరుకుని పరిశీలించారు. కియా కార్లకు సంబంధించిన హెడ్ లైట్లు, గ్లాసులు ఈ పరిశ్రమలో తయారవుతాయి. వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఘటనలో విలువైన యంత్రాలు కాలి బూడిదయ్యాయి. దీంతో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేశారు. కాగా, పరిశ్రమను ఆగమేఘాలపై పునరుద్ధరించి గురువారం నుంచి యథావిధిగా పనులు చేపట్టారు. -
రాచరిక దర్పం.. టిప్పు కట్టడం
అనంతపురం: సుల్తాన్ ఫతే అలీ సాహెబ్ టిప్పు... ఈ పేరు కంటే టిప్పు సుల్తాన్ అంటే అందరికీ సుపరిచయమే. ఆయన జెండాపైనే కాదు... తన ప్రవర్తనలోనూ పులి (టైగర్)ని మరిపించేలా మనుగడ సాగించిన టిప్పుసుల్తాన్ రాచరిక దర్పానికి నిదర్శనంగా నేటికీ ఆయన భవంతులు చెక్కుచెదరకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి సెలవుల్లో కుటుంబసభ్యులతో కలసి ఏదేని చారిత్రక ప్రదేశాన్ని చుట్టి వద్దామనుకునేవారికి బెంగళూరులోని టిప్పు సుల్తాన్ వేసవి విడిది భవంతి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. అబ్బుర పరిచే 487 ఏళ్ల నాటి కట్టడం మైసూరు పులిగా ఖ్యాతిగ్యాంచిన టిప్పు సుల్తాన్ 1537లో బెంగళూరులోని చామరాజపేటలో వేసవి విడిది భవంతిని నిర్మించారు. 487 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం నేటికీ చెక్కుచెదరలేదు. మొత్తం టేకుతో నిర్మితమైన ఈ భవంతిలో స్తంభాలు, ఆర్చీలు, బాల్కనీలు చూపరులను అబ్బుర పరుస్తుంటాయి. పై అంతస్తులో ఉన్న బాల్కనీలో టిప్పు సుల్తాన్ దర్బారు నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్యాలెస్ మొదటి అంతస్తు మూలాల్లోని చిన్నచిన్న గదుల్లో అద్భుతమైన డిజైన్లు నేటి ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కింది అంతస్తులో ఉన్న గదులను మ్యూజియంగా మార్చారు. అక్కడ టిప్పు సుల్తాన్ వినియోగించిన కొన్ని వస్తువులు, దుస్తులు, శిరస్త్రాణం, వెండి, బంగారుపీఠాలు ప్రదర్శనకు ఉంచారు. ఉర్దూలో చెక్కిన పలు శాసనాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. సిటీ రైల్వే స్టేషన్కు 3 కి.మీ దూరంలో టిప్పు వేసవి విడిది భవంతి సమీపంలోనే ఓ కోటను నిర్మించారు. ప్రస్తుతం బెంగళూరు కోటలో విక్టోరియా ఆస్పత్రి, కోటే వేంకటరమణస్వామి ఆలయం, మక్కళకూట పార్కు ఏర్పాటయ్యాయి. టిప్పు ఆయుధశాల ఉన్న ప్రాంతంలో బెంగళూరు మెడికల్ కళాశాల క్యాంపస్, పోర్టు హైస్కూల్, పోర్టు చర్చి, మింటో ఆప్తాల్మిక్ హాస్పిటల్, కిమ్స్ ఆస్పత్రి చేరాయి. ఈ ప్రాంతాలన్నీ బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో నిత్యమూ పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement