పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన

Published Sat, May 18 2024 11:23 AM

Land Issue: Ex-Minister Mallareddy Argue With Police

హైదరాబాద్‌, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్‌ చల్‌ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

పోలీసుల అదుపులో మల్లారెడ్డి
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు.  పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు

స్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. 

అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement