రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై

Published Thu, Apr 25 2024 5:06 PM

Pakistans Bismah Maroof retires from international cricket

పాకిస్తాన్‌ మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మా మ‌రూఫ్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు  బిస్మా మ‌రూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. త‌న నిర్ణ‌యాన్ని మ‌రూఫ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా  గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్‌) నుంచి  తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.

నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో  సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది.  నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నాపై  నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా  పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మ‌రూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు త‌న సేవ‌లు అందించింది. పాకిస్తాన్ మ‌హిళ క్రికెట్ జ‌ట్టు త‌ర‌పున వ‌న్డేలు, టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు ఇప్ప‌టికి మ‌రూఫ్ పేరునే ఉంది.  ఆమె పాక్‌ తరపున 136 వన్డేల్లో  3369  పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.

96 మ్యాచ్‌ల్లో పాక్‌ జట్టుకు కెప్టెన్‌గా మ‌రూఫ్ వ్యవహరించింది. మరూఫ్‌ చివరగా స్వదేశంలో వెస్టిండీస్‌ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్‌ జట్టు తరపున ఆడింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్‌ భాగమైంది. కానీ ఈ సిరీస్‌లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

Advertisement
Advertisement