నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ | Sakshi
Sakshi News home page

నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Published Tue, Jan 23 2024 9:19 AM

Chandrababu Skill Development Case Hearing In Acb Court - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. దీనిపై పిటీషన్ దాఖలు చేయాలని కోర్టు అదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్‌ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ.. ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటిషన్‌ వేశారు. బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు స్వాహా చేశారని చంద్రకాంత్ షా కోర్టుకి ఆధారాలు సమర్పించారు.

స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తాను నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా.. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లు ఇవ్వాలని వారు కోరినట్లు పిటీషన్  పేర్కొన్నారు.

ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్ టెక్‌కి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా.. బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా తెలిపారు. ఆ 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది.

Advertisement
Advertisement