-
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి
జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి. కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు. పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది. -
నిర్భయంగా కూర్చునే ధీమా
ఆ చిన్ననాటి రోజులు ఎంత మంచివి! ఒంటికి వెళ్లాల్సి వస్తే ఒక వేలు.. మరో అవసరం కోసం రెండు వేళ్లూ చూపించినంత చలాకీగా హాయిగా గడిచిపోయేది జీవితం. పెరిగి పెద్దవ్వడం, పెద్దయినందుకు గుర్తుగా సంస్కారం నేర్చుకోవడం ఎంత పెద్ద పనిష్మెంట్? అది అప్పుడర్థం కాదు. అర్థమయ్యేసరికి బాల్యం ఉండదు. బాల్యం నాటి ఆ సౌఖ్యం ఉండదు. మనిషై పుట్టాక ఎన్నో కష్టాలు. మరెన్నో సమస్యలు. గోడలే లేని జలాశయానికి సంస్కారపు లాకులూ, సంకల్పపు గేట్లను అడ్డుపెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పొత్తికడుపు వెనక అవయవాలెన్నో ముంపుగ్రామాల్లా మునిగిపోతున్న భావన. కడుపునొప్పి మూడో నెంబరు ప్రమాద సూచికను ఎగరేసిన ఫీలింగ్. ఇక సమస్య ఆ రెండోదైతే పదిమందీ పకపకలాడతారేమోనని పడే పడరాని మనోవేదన రెట్టింపవుతుంది. కాసేపట్లో తీరబోయే తాత్కాలిక సమస్యే అయినా తీరం దాటబోయే ముందు తుఫాను సృష్టించే కలవరం కలిగిస్తుంది. బరువు దించుకునేంత వరకు బండ మోస్తున్న భావన. అదే శాశ్వతమేమో అన్న యోచన. అంతులేనంత ఆందోళన. బ్రెయిన్ మీద ఒత్తిడిని ఎంతైనా భరించవచ్చు. కష్టమైనా సరే రోజులూ, నెలలు అవసరాన్ని బట్టి ఏళ్లూ పూళ్లూ ఓపిక పట్టవచ్చు. కానీ బ్లాడర్ మీద ప్రెషర్నీ, స్ఫింక్టర్ మీద స్ట్రెస్నీ భరించడం ఎంత కష్టం. ఎంతగా ఓపిక పట్టినా ఒక్కోసారి నలుగురిలో నగుబాటు! ఎంతటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్!! బ్లాడర్లూ, బవెల్సూ మీద ఒత్తిడిలేని లోకం... ఆ స్ట్రెస్నూ, ఆ ప్రెషర్నూ ఎక్కడైనా నిస్సంకోచంగా దించుకునే ప్రపంచం ఎక్కడుందో... అదే నిజమైన స్వర్గం. బరువు దించుకోవడమే సమస్య. కానీ ఆ బరువు పెంచే అంశాలెన్నో! ఆ అవసరాన్ని రగిలించే అనారోగ్యాలెన్నో. ఒకరికి డయాబెటిస్... మరొకరికి స్ట్రెస్... ఒక బంగారుతల్లికి యూరినరీ ఇన్కాంటినెన్స్. కారణమేదైనా మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంటుంది. వెళ్లడం తప్పనిసరి అవుతుంది. కొలీగ్స్ ముందు లేవాల్సిరావడం ఒక అన్విల్లింగ్నెస్. లేవకపోతే మరో రకం రిలక్టెన్స్. మీటింగ్లో ఉన్నప్పుడు బలంగా మనల్ని పిలిచిన ఓ నేచురల్ కాల్... మనకు మనం విధించుకున్న ఆంక్షతో మెలికలు తిప్పి కలకలం పుట్టిస్తుంది. ఆ కాంక్ష తాలూకు ఆకాంక్ష మన ఆంక్షతో పెద్దశిక్షగా పరిణమించి మన సహనానికి పరీక్ష పెడుతుంది. పురుషాధిక్య సమాజంలోని పురుషుల మనసుల్లోనే ఇంతటి వేదన ఉంది. కానీ దైన్యం కట్టలు తెంచుకొన్నప్పుడు ధైర్యం పుంజుకొనేందుకు తెచ్చిపెట్టుకున్న ఓ అనధికార లైసెన్స్ ఉంది. నాకేమనే తలంపు తలెత్తుతుంది. మగాడిననే భావన తలకెక్కుతుంది. అలా వాడికి నలుగురిలోనైనా గోడవారగా తిరిగే అవకాశం ఉంది. కానీ మహిళలకో? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే ప్రభుత్వాలు అంతకుముందే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది. గొప్ప గొప్ప వాగ్దానాలు చేసే నాయకులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. స్వచ్ఛ భారత్ల కోసం సెస్లు విధించడం కాదు... కాళ్ల దగ్గర నీళ్లచెంబుతో బెంగపడే స్త్రీలూ, రైలు పట్టాల దగ్గర ముఖాలు దాచుకునే మహిళలూ, తుమ్మచెట్ల డొంకదారుల్లో ఎవరో వస్తున్నారంటూ ముఖం ఆ వైపుకు తిప్పుకొని లేచి నిలబడే గ్రామీణులకు నిర్భయంగా కూర్చుండే ధీమా ఇవ్వగలిగితే... వీధుల్లో ఎవరెలా తిరిగినా తమదైన ప్రైవేటు స్థలంలో కూర్చుండిపోయేలా చేయగలిగితే... అదే కోటానుకోట్ల స్వచ్ఛభారత్ ప్రాజెక్టుల సమానం. ఆనాడే స్వాస్థ్య భారత్ ప్రాజెక్టు విజయవంతం. ఆనాడే మన పురుషులైనా, మహిళలైనా ముఖం దించుకుపోకుండా, మెడలు వంచుకుపోకుండా నిటారుగా ఠీవిగా నించోగలరు. తెల్లారితే ఎలాగో అనే ఆందోళన లేకుండా కంటికి నిండైన నిద్రతో పడుకోగలరు. – యాసీన్ -
అల్లా ఆశీర్వదించిన పావురాలు
తెల్లవారుజాము నుండే చేతినిండా ఉన్న పనులతో సతమతమవుతూ, వంటిల్లు అనబడే రణరంగంలో కత్తి పీట, చాకు, అప్పడాల కర్ర, పెనం, అట్లకాడ మొదలైన ఆయుధాలతో పోరాడే సరయూ గుండెలయ, పావు తక్కువ ఎనిమిదింటికి తను ఇంటి దగ్గర ఎక్కే సిటీ బస్సులో కూర్చున్న తరువాతే నియంత్రణలోకి వచ్చేది. ఆ వంటింటి నుండి తనకు విడుదల లేదేమో అనే ఆలోచన మనస్సులో మెదలి కోపం, అసహాయతతో ఉడికిపోతూ, చెమటలు కారుస్తూ బస్సెక్కే ఆమెకు కిటికీ పక్కన సీటు దొరికితే కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది. నింపాదిగా ఆమె చుట్టూ ఆవరించే చల్లని గాలికి ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంటుంది. తరువాత కళ్లు తెరచి బయటి దృశ్యాల చిత్రాలను మనస్సులోకి దింపుకున్నప్పుడల్లా లోపలి ఒత్తిడి తగ్గి, మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అప్పుడే హఠాత్తుగా ఎదురయ్యే మలుపు దగ్గర ఉన్న ఏకాకి వేపచెట్టును దాటి బస్సు తిరుగుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జి దాటి దిగువలో ఉన్న బారాకొట్రి అనే రహస్యలోకానికి చేరుకుంటుంది. శాహిదా ఇంటిపనికి వచ్చేదాకా బారాకొట్రి అనే ఒక లోకం ఉన్న సంగతే తెలియదు సరయూకి. ఉదయం తొమ్మిదిగంటలకు సరిగ్గా అల్లాహో అక్బర్ అని వినిపించే సమయానికి కాకతాళీయమేమో అనిపించేటట్టు బస్సు బారాకొట్రిని చుట్టుకుని వెళ్తుంది. చాలావరకు ముస్లిములు నివసించే ఈ ప్రదేశానికి బారాకొట్రి అనే పేరు ఎందుకు వచ్చిందో అని అప్పుడప్పుడూ సరయూ అనుకుంటుంది. రోడ్డుకు దగ్గరగా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు, స్పీకర్లు కట్టుకుని నుంచున్న మసీదు, ఉర్దూ ప్రైమరీ స్కూలు, కొన్ని గ్యారేజులు, వర్క్షాప్లు ఉన్న ఆ ప్రదేశం పాత ప్లాస్టిక్, ఇనుప సామానుల త్యాజ్యాలను పరచుకుని చెల్లాచెదురుగా ఉంటుంది. పొడుగు జుబ్బా, పొట్టి లుంగీ ధరించి తెల్లగడ్డాలలో మునిగిన ముసలివారు, నడుము నుండి జారిపోతుందా అనేట్టున్న జీన్స్ప్యాంట్ పైన సల్మాన్, షారూఖ్ల చిత్రాలున్న టీషర్ట్లు ధరించి ఛాతీ విరుచుకుని నుంచున్న నవయువకులు చాలా వరకు కనిపిస్తారు. ఎప్పుడైనా ఒకసారి బురఖాలు ధరించిన ఆడవాళ్లతో పాటు అన్ని వయసుల పిల్లలూ బిలబిలమని బస్సులోకి జొరబడతారు. రోడ్డుకు తెరచుకున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ వైపు సరయూ ఎప్పుడూ కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఇళ్ళ ముందు మెట్లు కాకుండా పెద్ద నాపరాయి ఏటవాలుగా కనిపిస్తుంది. ఆ రాయిని ఆనుకునే మురికి కాలువ ప్రవహిస్తుంది. కొన్నిసార్లు సర్రుమని తెరలు తొలగించి మెరుపు తీగల వలె దేవకన్యలు బయటకు తొంగిచూస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఇంటిముందు పరచిన నాపరాళ్ళ మీద బట్టలు ఉతుకుతూనో, సొట్టలు పడిన అల్యూమినియం పాత్రలు తోముతూనో, చిన్న పిల్లల తలలోని పేలు తీస్తూనో కనిపించే వీరు పాతాళం నుండి పైకొచ్చిన అప్సరసల మాదిరి కళ్ళు మిరుమిట్లుగొలుపుతారు. లేత అందాలతో పాటు చెప్పలేని అంతరంగ ప్రకాశమేదో కనిపిస్తున్నట్లుంటుంది వాళ్ళలో. అకస్మాత్తుగా వారేమైనా బస్సు వైపు చూస్తే, వారినే గమనిస్తున్న సరయూ గాభరా పడుతుంది. అలా వాళ్ళ కళ్ళు కలిసినప్పటి క్షణాలలో కలిగిన భావనలను అర్థం చేసుకోలేక చూపు తిప్పేస్తుంది. ఎప్పటికైనా తను వీళ్ళతోటి తనలో కలిగే ఈ భావనలను పంచుకోవచ్చా? అలాంటి అదను ఎప్పటికైనా వస్తుందా? అనిపించి తనపైన తనకే ఆశ్చర్యం కలుగుతుంది. ముందంతా ధారవాడ నగరానికి బయట, ఎవరూ పట్టించుకోకుండా తానేమో తనదేమో అన్నట్లున్న బారాకొట్రి అనే ఈ మురికి కాలనీ నగరానికి మధ్యకు రాగానే కళ్ళకు కొట్టొచ్చినట్లు మారింది. దానిని ఆనుకునే ఉన్న గౌళిగల్లి ఇప్పుడు బసవగిరిగా గణ్య వ్యక్తులు నివసించే ప్రదేశంగా మారి అక్కడి సైట్ల విలువ ఆకాశానికి చేరుకోవడం ప్రారంభమైనాక ఇప్పుడు ఇంకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా బారాకొట్రి రోడ్లలో మేయడానికి వెళ్తూ కనిపించే పశువులు మాయమై, వేగంగా రయ్మని దూసుకెళ్ళే పెద్ద పెద్ద కార్లు కనిపించసాగాయి. అలాగే కొంచెం ముందుకెళితే నిర్మలానగర్ ఉంది. తెల్లటి తెలుపురంగులతో ఆకాశంలోకి చొచ్చుకుపోయే చర్చిలు, కాన్వెంట్లు, శుభ్రంగా కనిపించే పార్కులు, ఆట మైదానాలు కనిపిస్తాయి. అలాగే ముందుకువెళితే విశ్వవిద్యాలయం మహాద్వారం ఎదురవుతుంది. విధానసభను తలపించే యూనివర్సిటీ భవనం కనిపించి బారాకొట్రి గుర్తులను చెరిపేస్తుంది. మెయిన్ బిల్డింగ్ దాటి ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్ల నుండి లోపలికీ బయటికీ ఫైలులను ఛాతీకి హుత్తుకుని ఎగురుతున్నట్లు నడిచే విద్యార్థీ విద్యార్థినులు అక్కడి గాలికి సుగంధాన్నలుముతారు. వైవిధ్యాలను జీర్ణించుకున్న విశ్వవిద్యాలయమనే ప్రపంచంలోకి బారాకొట్రికి చెందిన పొగచూరిన పరదాల చాటునుండి వచ్చిన శాహిదా అడుగు పెట్టిందే ఒక ఆశ్చర్యం! లారీ డ్రైవరైన మొగుడు యాసీన్ ఒక ప్రమాదంలో ఒక చేయి పోగొట్టుకున్నాక, తనపైనే ఆధారపడిన ఇద్దరు పిల్లల సంసారాన్ని పోషించడానికి తన రెక్కలు ముక్కలు చేసుకోక తప్పింది కాదు ఆమెకు. యూనివర్సిటీలో తోటపని చేసుకుంటున్న అబ్దుల్లా ద్వారా శాహిదా అక్కడి నేల ఊడ్చడం, తుడవడం చేసే గ్యాంగ్లో చేరుకుంది. మొదటిసారి అంత పెద్ద బిల్డింగ్లోకి అడుగుపెట్టినప్పుడు శాహిదా కాళ్లు వణికాయి. కుంకుమ, విభూతి ధరించి ఇంతెత్తు నిలుచున్న బీరువాలు, కంప్యూటర్లు, లేసులతో కట్టిన లావుపాటి ఫైళ్ళు, వాటి మధ్యన మునిగిపోయిన కళ్ళద్దాల అధికారులు, సీలు సైన్ అంటూ అటూ ఇటూ పరుగులు తీసే జవాన్లు...ఇవన్నీ చూస్తూ తికమక పడిన శాహిదా కొద్దిగా నిలదొక్కుకోగలిగింది తను పనిచేసే బయోకెమిస్ట్రీ డిపార్డ్మెంట్ ల్యాబుల్లో ధ్యానాసక్తుల వలె తెల్లకోటులు వేసుకున్న విద్యార్థినుల సాహచర్యంలో. వాళ్లను చూసినప్పుడల్లా ఆమెకు తన పిల్లలు సూఫియా, శిఫా గుర్తుకు వచ్చేవారు. కొట్టుమిట్టాడే కలలు మళ్లీ చిగురించేవి. కానీ వెలుగును వెన్నంటే వచ్చే చీకటిలా కలల వెనుకే వచ్చే తన పరిస్థితి యొక్క కలవరం ఆమెను వెక్కిరించేది. చేతకాని తండ్రి వద్ద వదలి వచ్చిన తన నాలుగు సంవత్సరాల సూఫియా, రెండు సంవత్సరాల శిఫాలను తలచుకుని కన్నీరుమున్నీరయ్యేది. అందుకే పొద్దున పదిగంటల నుండి సాయంత్రం ఐదుదాకా చేసే యూనివర్సిటీ పనికి వీడ్కోలు చెప్పేసి ఇంటి పనులు వెతుక్కుంటూ స్టెల్లా ఆంటీ ఇంటికి వచ్చింది. ఆమె కష్టాలు చూడలేక స్టెల్లా ఆంటీ, ఎదురింటి రెడ్డి ఆంటీ, పక్క ఇంటి శోభా ఆంటీ వాళ్ల ఇళ్లను కూడా ఇప్పించింది. స్టెల్లా ఆంటీ వాళ్ల మేడ మీదికి అద్దెకు వచ్చిన సరయూకు శాహిదా పరిచయం ఇలా జరిగింది. ఆరోజు శాహిదా ఇంట్లోకి వచ్చి నుంచున్నప్పుడు ఒక్క క్షణం సరయూ ఆశ్చర్యంగా నిలుచుండిపోయింది. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు ఒకటో రెండో మాత్రమే. స్టెల్లా ఆంటీ పూనుకొని సరయూ ఎదుర్కొంటున్న తిరగలిలాంటి పరిస్థితులని చెప్పి శాహిదాకు ఆమె బాధ్యతలను వివరించింది. సరయూ ఇంట్లోని రొట్టెలపైన శాహిదా వ్రేళ్ళ గీతలు పడినట్లల్లా ఆమె చేతి వెచ్చదనం అనుభవానికి వస్తూ వంటింట్లోనూ వెచ్చని అనుభూతిరాసాగింది. మెడనొప్పితో బాధపడే సరయూ భుజాల పైన శాహిదా వ్రేళ్ళు ఆప్యాయంగా తడిమి నొప్పి మూలాలను వెదకసాగాయి. లోతుకు దిగినకొద్దీ ఎక్కడో పెనవేసుకున్న లతల్లాంటి ఆడబతుకుల బాధలన్నిటికి మూలం ఒకటేనేమో అనిపిస్తూ, ఇద్దరు దగ్గరవుతూ పోయారు. అప్పుడే శాహిదా తన అనాథబాల్యం గురించి చెప్పింది. పెంచుకున్నవాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోవడం దగ్గర నుంచి ఆకలి, అవమానాల వరకు... చివరికి ఆమెకన్న ఒక అంగుళం పొట్టిగా ఉన్న యాసీన్ మెడకు ఆమెను కట్టి నిట్టూర్చేవరకు అన్నీ పంచుకుంది. తరువాత యాసీన్ ప్రేమలో తాను ఒక మనిషే అనే భావన మేలుకుని ఆమె బతుకు నిజంగానే స్వప్న సదృశమయింది. మెరుపుల టిక్లీలున్న చీరతో బురఖాలో దూరి సినిమా చూసిందీ, లారీలోని ఎల్తైన సీట్లో శెహజాదీలా కూర్చుని బయటి ప్రపంచాన్ని చూసింది, ఇలాంటి మురిపాల నడుమ సూఫియా, శిఫా తన ఒడిలో పడిందీ...అన్ని సినిమా రీళ్ళలా సాగిపోయాయి. తనదీ ఒక ముచ్చటైన సంసారం, ఆ సంసారానికి దీపాలుగా పుట్టిన ఈ పాపలు అల్లా ఆశీర్వదించి పంపిన పావురాలే అనిపించేది ఆమెకి. వారిద్దరికీ తను అనుభవించిన అనాథబ్రతుకు, అవమానాలను ఏ మాత్రం తగలకుండా పెంచాలి అనే పట్టుదల కళ్ళ ముందే కూలింది విధి ఆడిన నాటకంతోనే.రోడ్డు ప్రమాదంలో ఒక చెయ్యి పోగొట్టుకున్న యాíసీన్ తన మరో చేతిని కూడా పోగొట్టుకున్నాడు. పక్షవాతం వల్ల చెయ్యి చచ్చుపడిపోయింది. అప్పుడు శాహిదా కృంగిపోయింది. ఎవరూ ఆదుకోవడానికి రాకపోవడం చూసి తనే నడుము బిగించింది. కష్టాలు ఆమెకు కొత్తకావు. కానీ కల చెదిరిపోడమే దిగ్భ్రమ. భర్తకు, పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు ఉతికి, వండి, పిల్లలను భర్తకు అప్పగించి బయటపడే శాహిదాను భయం ఆవరిస్తుంది. దేనినీ ఎత్తలేని, సరిగ్గా నడవనూలేని భర్త నిస్సహాయత, పిల్లల్లో తొంగి చూసే అనాథ భావం ఆమె మనస్సును పిండివేసేది. నెమ్మదిగా తాను తిని, తండ్రికి తినిపించే స్థాయికి చేరుకుంది సూఫియా. ‘‘మనందరిలోనూ చాలా శక్తి ఉంటుందట అక్కా... మరి అది బయటికి రావాలంటే కష్టాలు రావాలికదా... అల్లా దాన్ని పరీక్షిస్తాడట’’ అంటూ సగం నవ్వు సగం ఏడ్పులతో చెప్తూ శాహిదా కళ్లనీళ్ల పర్యంతమయ్యేది. సరయూకు కూడా కళ్లలో నీళ్లు తిరిగేవి. ‘‘ఏమైనా కానీ పిల్లలను మాత్రం బాగా చదివించు శాహిదా. డబ్బుల అవసరం వస్తే అడుగు’’ అంటూ సరయూ చూపిన అభిమానానికి హృదయం నిండిరాగా ‘‘అంత చాలు అక్కా! ఆ మాట చాలు నాకు... కావలసి వస్తే తప్పకుండా అడుగుతాను’’ అంటూ మాట మార్చేది. రంజాన్ నెలలో మాత్రం పనికి రావడం కుదరదు అని కచ్చితంగా చెప్పేది శాహిదా. ఆ నెలలో శ్రీమంతులు దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు వారు యాసీన్ దీన పరిస్థితిని చూసి కొంచెం ఉదారంగా ఇచ్చేవారు.ఇవన్నీ ముందు ఆమెకు అలవాటు లేకపోయినప్పటికీ పరిస్థితులు తప్పనిసరిగా అలవాటు చేశాయి. ఒక సంవత్సరానికి సరిపడే ధాన్యాలు, దుస్తులు ఈ నెలలోనే వచ్చి పడేవి. అంతే కాక పండుగ రోజు వాళ్ల వీళ్ల ఇళ్లు శుభ్రం చేసి, వంట సాయం చేసి బక్షీసు తీసుకునేది. రంజాన్ రోజు వాళ్లు చేసే శీర్ కుర్మా మాత్రం తప్పకుండా తెచ్చేది. సరయూ కొడుకు రాఘవకు అదంటే ప్రాణం అని తెలుసు శాహిదాకు. అలాంటి ఒక రంజాన్ నెలలో సరయూ ఊరి నుండి ఆమె చెల్లెలు సుమ, గిరిజత్త వచ్చారు. వాళ్లు వచ్చేటప్పటికి శాహిదా పన్లోకి రావడం లేదు. గిరిజత్తకు శాహిదా చేసిన జొన్న రొట్టెలు, కూరలను ఎలా తినిపించడమా అనే వ్యథ కలిగింది సరయూకు. సుమా తమాషాకు ‘‘అయ్యో అక్కా! ఆమె పేరు ఏ లక్షో్మ, పార్వతి అనో చెప్పెయ్యరాదా. ఒక బింది ప్యాకెట్ శాహిదాకు ఇచ్చి మేము వెళ్లిపోయేదాకా పెట్టుకోమను.’’ అంటూ కన్నుకొట్టింది. శాహిదాకు బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనబడడాన్ని ఊహించుకున్న సరయూ కూడా నవ్వింది. ‘‘క్యాలెండర్లోని లక్ష్మిదేవిలా కనిపిస్తుంది శాహిదా’’ అంది. రంజాన్ రోజు సుమా సరయూ చెవిలో ‘‘ఈ రోజు మీ క్యాలెండర్ లక్ష్మి శీర్ కుర్మాతో ప్రత్యక్షమవుతుందా?’’ అంటూ హాస్యమాడింది. ‘‘ఏ లక్ష్మీనే’’ అని గిరిజత్త అడిగినదానికి ఇద్దరూ ముఖాలు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.సాయంత్రానికి శాహిదా శీర్ కుర్మాతో నిజంగానే ప్రత్యక్షమయింది. కానీ ఆ రోజు ఆమె బురఖా ధరించింది. సరయూ ఒక్క క్షణం అవాక్కయింది. ఇంతవరకు శాహిదా ఎప్పుడూ బురఖా ధరించలేదు. అలా చూస్తే వారిద్దరూ ఎప్పుడూ దేవుడి గురించి కానీ, మతం గురించి కానీ ఆచారాల గురించి కానీ మాట్లాడుకోలేదు. శాహిదా మాత్రం మామూలుగా ‘‘ఎల్లుండి నుండి పన్లోకి వస్తానక్కా! ఇది తీస్కుని డబ్బా ఖాళీ చేసిస్తే వెళ్లిపోతాను. చాలా పన్లున్నాయి. చీకటి పడుతోంది’’ అని తొందరపెట్టింది. రాఘవను ముద్దాడి ‘‘బాగా కిస్మిస్, జీడిపప్పు వేశాను. తినాలి నువ్వు సరేనా?’’ అంటూ గడప దాటింది. ‘‘ఇదేమిటి? వాళ్ల అల్లా ప్రసాదమా’’ అంటూ గిరిజత్త రాగం తీసింది. ‘‘మరి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ గుళ్లు తిరుగుతావు కదా. ఈ ప్రసాదాన్ని కూడా తీసుకో మరి’’ అంటూ సుమ తమాషా చేసింది గిరిజత్తను. గిరిజత్త మొహం తిప్పేసుకుంటూ ‘‘నాకు రేపటి నుండి రొట్టె, కూర వద్దమ్మా. ఎందుకో కొద్దిగా అజీర్ణమయినట్టనిపిస్తుంది. అన్నమయితే మెత్తగా ఉంటుంది. అది చాలు’’ అంటూ లేచి లోపలికి వెళ్లింది.ఊళ్లో అంతా గిరిజత్త అంటే చాలా మంచిపేరు. మహిళా మండలి, భజన మండలి అంటూ అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటుంది. ఆ రోజు రాత్రి ఆమె సరయు–సుమలకు క్లాసు తీసుకుంది. ‘‘మనవాళ్లు ఈ మధ్య చాలా చెడిపోతున్నారు.ఆచారాలను మంటగలుపుతున్నారు. దీనివలన మన సంస్కృతి చెడిపోతోంది. అందరూ వారి వారి దారిలో సరిగ్గానే నడుస్తున్నారు. మనం మాత్రం ‘మనది’ అన్నదాన్ని కాలరాచివేస్తున్నాం. నీ భర్తను, బాబును రోజూ సంధ్యావందనం చెయ్యమను. నువ్వు కూడా ఏదైనా నోమో వ్రతమో ప్రారంభించు. మనం మాత్రమే మన సంప్రదాయాలను నిలుపుకోవాలని మొన్న స్వామీజీ కూడా చెప్పారు’’ అని మరీ మరీ చెప్పింది. మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా అన్యమనస్కంగా కనిపించింది. సూఫియా, శిఫాల స్కూల్ గురించిన వివరాలడిగినప్పుడు ‘‘అక్కా! సూఫియాను గవర్నమెంట్ స్కూల్లో వేశాం కదా. శిఫానైనా మదరసాకు పంపాలనుకుంటున్నాము. మా రీతి నీతులు అన్నీ నేర్చుకోవాలి కదక్కా! మేమైతే అవేం తెలుసుకోకుండా పెరిగి కాఫిర్లమైనాము. అదైనా కురాన్, హదీస్ అన్నీ నేర్చుకోనీ అని...’’ అంటూ ఆపేసింది. నిన్ననే చాలా ఇబ్బందిగా తన గిరిజత్త నుండి విన్న ఈ ‘మనది’ అనే పదం, మనసును కలవర పెట్టినా మాటలను కొనసాగించకుండా గమ్మునయిపోయింది సరయూ.మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా యాంత్రికంగా రొట్టెలు తట్టుతోంది. గ్యాస్ పొయ్యి మీద పొంగుతున్న రొట్టెను తన చేతివేళ్లతో చాకచక్యంగా తిప్పుతున్నా చూపు ఎక్కడో ఉంది. అంతలో శాహిదా సన్నగా ఏడవడం వినిపించింది. ఆ రోజు ఆదివారం కావడం వలన సరయూ ఆమెను మాటల్లోకి దింపింది. ‘‘అక్కా! ఈ మధ్య మా ఇంటాయన నా పైన చాలా అనుమాన పడుతున్నాడు. బురఖా లేకుండా బయటికి వెళ్లకూడదు అని తాకీదు చేశాడు.నేను ఎవరెవరి ఇళ్లకు పనికి వెళ్లానో వాళ్ల ఇంటి ముందు వచ్చి నిలబడుతాడు. నువ్వేం నన్ను పోషించక్కర్లా అంటూ వడ్డించిన కంచాన్ని ముక్కూ మూతీ చూడకుండా విసిరేస్తాడు. చేతులు ఎత్తడానికి చేతకాదు కదా. అందుకే కూర్చున్న చోటునుంచే కాలితో తంతాడు. అలా కొట్టినప్పుడు పడబోతే మళ్లీ తన్నులు తిన్న నేనే పట్టుకోవాలి. ఆ మనిషిని చూస్తే ఒక్కోసారి చెడ్డ కోపం వస్తుంది. ఒక్కోసారి జాలి వేస్తుంది’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆశ్చర్యమేమంటే గిరిజత్తే శాహిదాను ఓదార్చింది. ‘‘ఈ మగవాళ్లంతా ఇంతేలే. ధైర్యంగా ఉండు’’ అంటూ గిరిజత్త శాహిదా చెయ్యి పట్టుకుని చెప్పింది. ఆ రోజు లలితా సహస్ర నామాలు చదివి ముగించిన తరువాత ‘‘ఆడతనాన్నే అఖండ శక్తి కేంద్రంగా భావిద్దాం. ఆ భావనలో సరయూ, శాహిదా, స్టెల్లా వేరువేరుగా కనిపించరు కదూ’’ అన్నది సుమ. ఆమె మాటలు పుస్తకాలలో ఉపయోగించే మాటల మాదిరిగా అనిపించినా అందులోని అర్థం మనసుకు తెలిసినటై్ట సరయూ, గిరిజత్త మౌనం వహించారు.సరయూకు ట్రాన్స్ఫర్ అయి ఆమె సంసారం ధారవాడ నుండి బయలుదేరినప్పుడు శాహిదా పావురాళ్లలాంటి తన ఇద్దరు కూతుళ్లనూ తన భర్తనూ తీసుకుని వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. ‘‘శాహిదా! నీ ఆరోగ్యం జాగ్రత్త. వీరిద్దరినీ బాగా చదివించు... ఏమయ్యా.. మా శాహిదాను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ సరయూ ఏమేమో అప్పగింతలు చదివింది. ‘‘ఆయనకు చెప్పండక్కా! నాకైతే వీళ్లిద్దరినీ యూనివర్సిటీలో చదివించాలని ఉంది’’ బిడియంగా అంది శాహిదా. ‘‘దానికి నా ఓటు కూడా ఉంది’’ అంటూ శాహిదా చెయి నొక్కింది సరయూ. సరయూ మనసులో ముద్రపడిన ఈ జ్ఞాపకాలను ఏమాత్రం చెదరకుండా మళ్లీ ఆమెను మేలుకొలిపింది మొన్న ఫేస్బుక్లో ఆమె యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వలన. శిఫా అనే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న ఆత్మవిశ్వాసమే మూర్తీభవించినట్టున్న అమ్మాయి రిక్వెస్ట్ అది. ఆ ప్రొఫైల్ చూస్తున్నప్పుడల్లా గుండె ఆత్మీయతతో కొట్టుకోసాగింది. అందులో ఐదారు గోల్డ్ మెడల్స్ ధరించిన అమ్మాయి ఫొటో, పక్కలో నించున్న శాహిదా, వెంట్రుకలు అక్కడక్కడా నెరిసినట్టు కనిపించడం తప్ప మిగతా అంతా తను అప్పుడు చూసిన శాహిదానే! ఇన్బాక్స్లో ఒక మెసేజ్ కనిపించడం ‘‘అమ్మ మిమ్మల్ని చాలా అనుకుంటుంది ఆంటీ. నేను అక్కా ఇద్దరూ యూనివర్సిటీ చదువులు ముగించాము. సూఫియా బయోకెమిస్ట్రీలో పి.హెచ్.డి చేసి ఇక్కడే యూనివర్సిటీలో పని చేస్తోంది. నాది మొన్న ఇంగ్లీష్ ఎమ్.ఏ అయింది. అమ్మ.. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది’’ అని ముగించింది. ఇంకో ఫొటోలో సూఫియా, శిఫా ఇద్దరూ దేవకన్యల మాదిరి నుంచుని కనిపించారు. బారాకొట్రిలో నాకు కనిపించిన లేత కన్యలు కొంత గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది. కానీ అప్పుడు అక్కడ కనిపించిన ఆంతర్యంలోని వెలుగు మాత్రం మాసిపోకుండా మొహాల్లో కనిపించింది. సమయాన్ని తమ రెక్కల్లో పొదువుకుని ఎగిరే అల్లా ఆశీర్వదించి పంపిన పావురాల్లాగా! కన్నడ మూలం : గీతా వసంత్ అనువాదం: చందకచర్ల రమేశ్బాబు -
గుండెపోటుతో ‘సాక్షి’ విలేకరి మృతి
వనపర్తి అర్బన్: వనపర్తి జిల్లా గోపాల్పేట ‘సాక్షి’ దినపత్రిక రిపోర్టర్ యాసిన్(38) హఠాన్మరణం చెందారు. యాసిన్ స్వస్థలం గోపాల్పేట మండ లం పొల్కెపాడు కాగా, వనపర్తిలోనే నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆయన భార్యాపిల్లలతో కలసి అత్తగారి ఊరైన పెద్దమం దడి మండలంలోని పామిరెడ్డిపల్లెకు వెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో వారు వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పొల్కెపాడుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. యాసిన్ కు భార్యతోపాటు ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సాక్షి ఉద్యోగులు, విలేకరులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘సాక్షి’ తరఫున తక్షణ సాయంగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. -
డాక్టర్ పంచతంత్రుడు...!
‘‘నాన్నా! ఏనుగులకు అంతంత ఒబెసిటీ ఉంటుంది కదా. వాటికి హార్ట్ ఎటాక్ రాదా?’’ అడిగాడు మా బుజ్జిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో వాళ్ల అమ్మ వచ్చింది. ‘‘మీరేమో వాణ్ణి డాక్టర్ను చేయాలంటారు. తొమ్మిదో క్లాసుకు వచ్చినా నాలెడ్జీ మాత్రం సున్న. వాడికి మొన్న బయాలజీ పరీక్షలో వచ్చిన పర్సెంటేజీ పద్నాలుగు. వాడి టీచరేమో మాటిమాటికీ పిలిచి మనల్ని తిడుతోంది. వాడు చదవడు... మీరు చదివించరు’’ అంటూ క్లాసు తీసుకుంటుంటే కాసేపు వాడికి బయాలజీ చెబుదామని నేను ట్రై చేశా. న్యూట్రిషన్ అనే లెసన్నుంచి వీడికి రకరకాల ప్రశ్నలిచ్చారు. రకరకాల టెక్నికల్ నేమ్స్తో ఆ లెసన్ సాగింది. ఆ పోషకాల పేర్లు గుర్తుపెట్టుకోవడం వీడికి సాధ్యపడలేదట. నాకున్న మిడిమిడి జ్ఞానం కొద్దీ వాడికేదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటే నాకూ ఆ టెక్నికల్ టర్మ్స్ అర్థం కాలేదు. దాంతో వాడికి కాస్త రిలాక్సేçషన్ ఇద్దామని అనుకున్నా. ‘‘ఒరేయ్ ఈ తిట్ల మూడ్లో నువ్వు లెసన్ చదువుకోలేవు. చదివినా అర్థం కాదు. కాబట్టి కాసేపు ఈ పుస్తకం చదువుకో’’ అంటూ వాడి చేతికి పంచతంత్రం ఇచ్చా. కథల పుస్తకం కావడంతో వాడూ దాన్ని శ్రద్ధగా చదువుతూ లీనమయ్యాడు. కొద్దిగా రిఫ్రెష్ అయ్యాక... బయాలజీ కూడా చదువుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం నిద్రలేవగానే నా దగ్గరికి వచ్చాడు. ‘‘పంచతంత్రం చదివాక బయాలజీ ఇంకా బాగా అర్థమైంది నాన్నా’’ అన్నాడు. ‘‘ఎలారా?’’ అడిగా. వాడు కథలు కథలుగా నాకు చెప్పిన విషయాలివి. మొదటి చాప్టర్ గ్రీన్లాభం అప్పట్లో గజేంద్రుడనే ఏనుగుల రాజు తన మందతో గడ్డి మైదానాలలో య«థేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఏనుగులు అన్ని రకాల పదార్థాలూ తినేవి. ఏదిబడితే అది నోట్లోకి కుక్కడం, మెక్కడం వల్ల వాటికి పెద్ద పెద్ద ఊబకాయాలు వచ్చాయి. ఆ ఒబేసిటీ కారణంగా హఠాత్తుగా హార్ట్ఎటాకులూ గట్రా వచ్చి చాలా ఏనుగులు హరీమనేవి. వాటి కళేబరాలు పడి ఉన్న ప్రాంతంలో అది పూర్తిగా కుళ్లి శిథిలమయ్యేవరకూ గడ్డి కూడా మొలిచేది కాదు. ఇది చూసిన హరితవర్ణిత అనే గడ్డిమొక్క తీవ్రమైన విచారంలో మునిగిపోయింది. ఒకనాడు గజేంద్రుడు అడవిలో సంచరిస్తుండగా హరితవర్ణిత ఆ ఏనుగుల రాజును తన దగ్గరికి పిలిచి ఇలా అన్నది. ‘‘ఓ ఏనుగోత్తమా! మీరు ఏది బడితే అది తిని ఎక్కడబడితే అక్కడ గుటుక్కుమంటున్నారు. దాంతో మీ కళేబరం పడి ఉన్న ప్రాంతంలో చాలాకాలం పాటు గడ్డిమొలవకుండా పోతోంది. పైగా ఇటీవల ఇక్కడ భూసారమూ బాగా తగ్గుతోంది. ఈ రెండు అంశాలూ మా మనుగడకు అడ్డమవుతున్నాయి. కాబట్టి ఓ భారీకాయమా! ఇకపై అనారోగ్యకరమైనవి తినకండి. కేవలం ఆకుపచ్చటివి మాత్రమే తినండి. అప్పుడు మీరు పుష్కలంగా పెంట వేస్తారు. దాంతో నేల సారవంతమవుతుంది. మరింత గడ్డి, పచ్చటి మొక్కలు మొలుస్తాయి. అది మీకూ మాకూ మంచిది’’ అంది. ‘‘అవును ఇది నిజం. ఇది నిజం. మమ్మల్ని తొక్కేయకుండా మాకూ ఇలా మేలు చేయండి’’ అంటూ తోటకూరడూ, పాలకూరడూ, గోరుచిక్కుడు, పచ్చఅరిటుడు అనే ఇతర మొక్కార్భకులు ప్రాధేయపడ్డాయి. అప్పట్నుంచి ఆకులు అలములు మాత్రమే తినడం మొదలుపెట్టాయి. వాటి ఒబేసిటీ ఏమాత్రం తగ్గకున్నా హార్ట్ ఎటాక్ రావడం మాత్రం ఆగిపోయింది. వాటి పెంటతో ఆ గడ్డిమొక్కలూ, ఇతర వృక్షజాతులూ ఏపుగా ఎదగడం మొదలుపెట్టాయి. ఇలా పరస్పర మైత్రితో ఇరువర్గాలూ మిత్ర లాభం పొందాయి. రెండో చాప్టర్ హెల్త్ భేదం అప్పట్లో హైదరాపురం అనే నగరంలో సైబరావనం అనే అరణ్యం ఉండేది. అక్కడ నిత్యానందం, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులు తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా జీవించేవారు. అయితే వారి పనుల్లో కష్టం చాలా ఎక్కువగా ఉండేది. ఒకనాడు సిస్టముడు, ల్యాపటాపుడు అనే ఇద్దరు సేవకులు వారి దగ్గరకు వచ్చారు. ‘‘మిత్రోత్తములారా... మీరెందుకు ఇంతగా కష్టపడుతూ మీ రెక్కల్లాగే మెదడునూ ముక్కలు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఉపయోగించుకుంటే మీ పనులు ఎంత సులువవుతాయో చూడండి’’ అన్నారు. అప్పట్నుంచి ఆ సేవకుల సాయంతో నిత్యానందుడూ, సత్యానందుడూ పనులు వేగంగా చేసేవారు. అయితే పనివేగం పెరగడంతో ఆవలి మెరక అనే ప్రాంతం నుంచి మరింతమంది మరిన్ని పనుల్ని వారికి అప్పగించడం మొదలుపెట్టారు. ఆవలి–మెరక అనే ఆ ప్రాంతం పేరు కాస్త పెద్దగా ఉండటంతో దాన్ని సూక్ష్మంగా ఆమెరక... ఆమెరక అని కూడా పిలిచేవాళ్లు. అక్కడి నుంచి వచ్చి పడే పనితో సైబరావనంలోని చాలామందికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో మన సత్యా– నిత్యానందులకు ఇద్దరు అపరిచితులు తారసపడి ఇలా అన్నారు. ‘‘ఓ మిత్రోత్తములారా... నా పేరు శ్వేతకాష్టుడు. ఇతడి పేరు స్వప్నచిత్తుడు. మాతో స్నేహం చేయండి. నన్ను పీల్చగానే చుట్టూ పొగలు కమ్మి అవి మబ్బుల్లా ఆవరిస్తాయి. మీరు ఆ మబ్బుల్లో తేలిపోయినంతగా తేలికవుతారు. ఇక స్వప్నచిత్తుడిని గ్రోలగానే ఒళ్లంతా తేలికై హాయిగా ఉంటుంది. తర్వాత కాసేపటికి మంచి నిద్రపడుతుంది. దాంతో మంచి మంచి స్వప్నాలు వచ్చేలా చేస్తాడు కాబట్టి మావాడికి స్వప్నచిత్తుడని పేరు. అయితే కాస్తంత మత్తునిస్తాడంటూ గిట్టనివాళ్లు వాణ్ని ఆడిపోసుకుంటారు. మత్తుతో చిత్తు చేస్తాడంటూ మత్తుచిత్తుడని దూషిస్తుంటారు. కానీ మేము ఎవరినీ చిత్తుచేయము. టెన్షనుడనే ఒక అసురుడి సంతతి అన్నిచోట్లా విస్తృతంగా విస్తరిస్తోంది. వారితోనే మాకు వైరం. మేము చిత్తుచేసేది టెన్షనాసురుడి సంతతివాళ్లను మాత్రమే’’ అంటూ తమ గొప్ప చెప్పుకున్నారు. సత్యానందుడు వారిని లెక్కచేయలేదు గానీ నిత్యానందుడు వారిని ఆదరించాడు. ‘‘వారు తమ దుష్టత్వం గురించి తామే చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పాక కూడా వారితో స్నేహం సరికాదు. అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే మేలు’’ అంటూ సత్యానందుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. అయితే నిత్యానందుడు ఆ సలహాను లెక్కచేయలేదు. వారితో స్నేహం మొదలుపెట్టాడు. ఒకరోజు నిత్యానందుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో తోటి మిత్రులు అతడిని డాక్టరుడనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. విషయం గ్రహించిన డాక్టరుడు నవ్వి ఇలా అన్నాడు. ‘‘ఓ నిత్యానందుడా... నీ తోటి మిత్రుడైన సత్యానందుడు నీలాగే పనిచేస్తున్నాడు కదా. అయినా అతడు అనారోగ్యానికి గురికాలేదు. అది ఎందుకో అర్థంచేసుకో. శ్వేతకాష్టుడు, మత్తచిత్తులతో నీ స్నేహం ఇలాగే కొనసాగితే నువ్వూ త్వరలోనే ఆ అకాలకిక్కరుడిలా ప్రాణాలు వదిలేస్తావు’’ అన్నాడు. అప్పుడు నిత్యానందం ‘‘ఎవరా కిక్కరుడూ... ఏమా కథ?’’ అని అడిగాడు. అప్పుడు డాక్టరుడు నవ్వి... ‘‘అప్పట్లో మాధవాపురానికి పడమటగా పదిక్రోసుల దూరంలో గచ్చిబౌళ్యం అనే ప్రాంతం ఉంది. అక్కడ కిక్కరుడు అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఒత్తిడిలో తనకు తెలియకుండానే కుర్చీలను తంతుండటం, పళ్లుకొరుక్కోవడం, జుట్టుపీక్కోవడం ఇత్యాది పనులు చేస్తుండేవాడు. టెన్షన్లో చూసుకోకుండా దేన్ని పడితే దాన్ని తన్నుతూ ఉండటం వల్ల కొందరతణ్ణి ఎగతాళిగా టెన్షన్ కిక్కరుడు అని కూడా పిలిచేవాళ్లు. నీకంటే ముందు అతడు ఈ శ్వేతకాష్టుడూ, మత్తచిత్తులతో స్నేహం చేశాడు. శ్వేతకాష్టుడు తెల్లగా నిలువెత్తు రూపంలో అందంగానూ, మత్తచిత్తుడు బంగారువర్ణంతో మిలమిలలాడుతూ ద్రవరూపంలో కనిపించేవారు. అంత అందమైన రూపురేఖలున్నాయి గానీ నిజానికి వారు దుష్టులు. తమ వద్ద రహస్యంగా ఉన్న నికోటినుడు, కొలెస్టరుడు అనే రాక్షసుల సాయంతో ఇతరులను కబళిస్తుంటారు. ఆ దుష్టజనసాన్నిహిత్యంతోనే కిక్కరుడు చనిపోయాడు. కాలం తీరకముందే పోవడం వల్ల ఆ దురదృష్టవంతుణ్ణి అందరూ ‘అకాల బకెట్ కిక్కరుడు’ అని కూడా పిలుస్తున్నారు’’ అని డాక్టరుడు కథ ముగించాడు. దాంతో ఆరోగ్యంలో భేదం తెచ్చే దుష్టసాంగత్యాలకు దూరంగా ఉండి నిత్యానందుడు నూరేళ్లు ఆరోగ్యంగా బతికాడు. సంధి... అప్పట్లో మొక్కలూ – జంతువులు పరస్పరం విపరీతమైన ద్వేషంతో రగిలిపోయేవి. కోపంతో జంతువులు మొక్కలను విచ్చలవిడిగా తినేస్తుండేవి. ప్రతీకారంతో మొక్కలు తమ వద్ద ఉన్న కంటకాలు అనే ఆయుధాలతో జంతువులను బాధించేవి. ఈ పోరు ఇరువురికీ నష్టం చేస్తుందని తెలుసుకున్న మొక్కలు ఒకరోజు జంతువులను తమ దగ్గరికి పిలిచాయి. ‘‘ఓ పిచ్చి జంతువులారా! విచ్చలవిడిగా మమ్మల్ని మేయడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. నేడు మేము అంతరించిపోతే, రేపు ఆకలితో నకనకలాడుతూ మీరూ అంతరిస్తారు. ఒకప్పుడు మాకూ రవికిరణాలకు మధ్య తీవ్రమైన వైరం ఉండేది. వాటితో సంధి చేసుకొని మేం బాగుపడ్డాం. అదే దారిలో మీరూ–మేమూ సంధి చేసుకుందాం రండి’’ అని జంతువులకు సూచించాయి. ‘‘ఎవరా రవికిరణాలూ – ఏమా కథ’’ అడిగాయి జంతువులు. అప్పుడు రవికిరణాల వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాయి మొక్కలు. ‘‘అప్పట్లో మేం ఇలా పచ్చగా ఆకులతో ఉండేవాళ్లం కాదు. కింద ఉన్న కుళ్లు మీద పుట్టగొడుగుల్లా పెరిగేవాళ్లం. అంతరిక్షంలోని అరుణపురం అనే చోటి నుంచి రవికిరణాలు... కాంతిపుంజాలనే వాహనాలను ఎక్కి విహరించడానికి భూమ్మీదికి వచ్చేవి. మేం మా గొడుగులతో వాటిని అడ్డుకునేవాళ్లం. అవి తీక్షణత అనే ఆయుధాలను ధరించి మమ్మల్ని బాధిస్తుండేవి. ఆ ఆయుధాల తాకిడికి మేము కమిలి, ముడుచుకుపోయి మూర్ఛిల్లి మరణించేవాళ్లం. మేం మరణించాక కూడా కిరణాలు మమ్మల్ని వదిలేవి కావు. మమ్మల్ని పూర్తిగా ఎండేలా చేసేవి. ఒకనాడు మేమంతా కిరణాలతో చర్చలు జరిపాం. ‘‘అయ్యా... మీరు కారుణ్యాస్పదమైన కిరణోత్తములు. మమ్మల్ని ఎందుకిలా బాధిస్తున్నారు’’ అని అడిగాం. అప్పుడా కిరణాలు ‘ఓ మొక్కబాలకులారా! మేము అరుణపురం నుంచి ఏ గ్రహం మీదికి వెళ్లినా మాకెవరూ అడ్డురారు. కానీ భూగ్రహంలో మీరు గొడుగుల్లా విస్తరించి మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మా గమ్యమైన నేలను తాకకుండా చేస్తున్నారు. అందుకే మేము మిమ్మల్ని కమిలిపోయేలా కబళిస్తున్నాం’ అన్నాయి. అప్పుడు మేమికపై వారిని పూర్తిగా అడ్డగించబోమని చెప్పాం. దాంతో ఆ రవి కిరణాలు కూడా కరుణించి ‘ఇకనుంచి మా ఎండతో మీ కండ పెరిగేలా చేస్తాం’ అని మాటిచ్చాయి. అప్పట్నుంచి మేం ఆకులను అభివృద్ధి చేసుకున్నాం. ఆకుకూ ఆకుకూ గ్యాప్ ఇస్తూ అవి గమ్యం చేరేలా చూస్తున్నాం. దాంతో కిరణాలు కూడా మాకు తమ శక్తిని ప్రసాదిస్తుంటాయి. ఆ శక్తిలోని వేడిమి సాయంతో మేం స్వయంపాకం చేసుకొని మా పాయసం మేమే వండుకు తింటుంటాం. అలా మా ఆహారం మేమే తయారు చేసుకుంటూ ఎండ సాయంతో కండపట్టడం మొదలుపెట్టాం. ఇదీ మా సంధి కథ. ఇలా సంధి చేసుకుంటే ఇరువురమూ లాభపడతాం’’ అని చెప్పాయి మొక్కలు. అంతేకాదు... జంతువుల గౌరవార్థం ఆమ్లజన్యం అనే శంఖాన్ని తీసి ‘ఇకపై దీన్ని మీరు ఊదుకోండి’ అని చెప్పాయి. అప్పుడు జంతువులు కూడా నిశ్చింతగా ఊపిరివదిలి అందులోంచి బొగ్గుపులుసు అనే రుచికరమైన పులుసు వంటకాన్ని మొక్కలకు ఇచ్చాయి. ఇచ్చి... ఇకపై మీ కిరణాహారంతో పాటు ఈ పులుసునూ కలుపుకొని ఫుల్మీల్స్ తినమని చెప్పాయి. ఆ ఆమ్లజన్యం శంఖాన్ని ఊదుకోవడం, ఈ బొగ్గుపులుసును జుర్రుకోవడం కష్టం కావడంతో అవి రెండూ వాయురూపంలోకి మారాయి. సంధి తర్వాత అటు మొక్కలూ, ఇటు జంతువులూ వాయురూపంలోని ఆ పదార్థాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని విందు చేసుకుంటూ ఇప్పటికీ సుఖంగా జీవిస్తున్నాయి. ‘‘ఇప్పటివరకూ బాగానే లాగించావు. సంధి తర్వాత విగ్రహం. ఇక్కడ సైన్సులోని న్యూట్రిషన్ పాఠం ఎలా చెబుతావురా? కష్టం కదా?’’ నేనడిగాను. ‘‘అందుకే నాన్నా! విగ్రహం బదులుగా ఈ చాప్టర్ పేరు ‘నిగ్రహం’ అని పెడతా’’ అన్నాడు. ‘‘నిగ్రహమా? అంటే? అందులో ఏం చెబుతావు?’’ ‘‘హెల్త్ బాగుండాలంటే ఏమేమి తినకుండా నిగ్రహం పాటించాలో ఈ చాప్టర్లో డీల్ చేస్తామన్నమాట. ఉదాహరణకు తెల్లరంగులో ఉండే శ్వేతభూతాలైన ఉప్పు, పంచదార ఇక్కడి పాత్రధారులు. ఇక అలాగే కొవ్వాసురులు, మాంసాసురులు అనే అసురుల పాత్రలు ప్రవేశపెట్టి... అవి చాలా రుచికరమైన కామరూపం ధరించి మార్కెటవనంలో, కిచెనాలయంలో, భోజనంబల్ల పరిసరాల్లో తిరుగుతూ ఆహ్వానిస్తుంటాయని చెపుతాం. వాటిని చూసి కూడా నిగ్రహించుకున్నవాడు అన్ని విధాలా బాగుపడతాడన్న విషయాన్ని ‘నిగ్రహం’ చాప్టర్లో వివరిస్తాం అన్నమాట’’ ఎక్స్ప్లెయిన్ చేశాడు మా బుజ్జిగాడు. ఒక్క విషయం నాకు నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది. పంచతంత్రం కేవలం కథలు జీవితాన్ని నేర్పించడానికే పరిమితం కాదు. సరిగ్గా అన్వయించుకోవాలేగానీ... ఎవ్వరికైనా చదువు నేర్పించగలవవి. అలనాటి రాజు కొడుకులకేనా? విష్ణుశర్మ కల్లోకి వచ్చి అపరమొద్దు అయిన మా బుజ్జిగాడికి బయాలజీ, హెల్త్, న్యూట్రిషన్, మెడికల్ సైన్స్ ఇలా ఏదైనా చెబుతాడు. పంచతంత్రం శ్రద్ధగా చదివితే... రేపు మావాడు డాక్టర్ కావడం ఖాయమని నిశ్చయంగా తేలిపోయింది. – యాసీన్
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement