-
మెగా వాటర్ గ్రిడ్కు లైన్ క్లియర్.. డెల్టా వాసుల కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
సాక్షి అమలాపురం: గోదావరి చెంతనే ఉన్నా.. గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు అందని వారెందరో. శివారు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు.. గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు సైతం స్వచ్ఛమైన తాగునీరందదు. గుక్కెడు నీటి కోసం అలమటించేవారెందరో.. ఒకవైపు గోదావరి కాలువల్లో రెట్టింపవుతున్న కాలుష్యం.. మరోవైపు వేసవిలో శివారుకు తాగునీరు అందని దుస్థితి.. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పటికే ‘జల్జీవన్ మిషన్’లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులు వేగంగా చేస్తోంది. దీంతోపాటు ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జల్జీవన్ మిషన్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో చేపట్టనున్న ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,650 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు.. 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనుంది. స్థల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండున్నరేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది. రెండు డెల్టాల పరిధిలో నిర్మాణం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో దీని నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమ జిల్లాకు అధికంగా మేలు జరగనుంది. జిల్లా పరిధిలోని మొత్తం 22 మండలాలకూ బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరందనుంది. ఇక తూర్పు డెల్టా పరిధిలో కాకినాడ జిల్లాలో సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలకు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు లబ్ధి చేకూరనుంది. ఐదుచోట్ల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ వాటర్ గ్రిడ్లో భాగంగా ఐదు ప్రాంతాల్లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల (ఆర్ఎస్ఎఫ్) నిర్మాణాలు చేయనున్నారు. గోదావరి నది నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. ఒక్కొక్క దానినీ 30 నుంచి 50 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్బీఆర్)లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలో వీటిని పది చోట్ల నిర్మిస్తారు. వీటిలో అంబాజీపేట మండలం ముక్కామల, పి.గన్నవరం మండలం బెల్లంపూడి, ఆలమూరు మండలం మడికి, మండపేట మండలం తాపేశ్వరం, ఎల్ఎన్ పురం వద్ద సంప్లతో కూడిన ఓహెచ్బీఆర్ల నిర్మించనున్నారు. ఈ ఓహెచ్బీఆర్ల ఎత్తు 200 మీటర్లు ఉంటుంది. వీటికి అనుబంధంగా మూడు జిల్లాల పరిధిలో మరో మూడు ఓహెచ్బీఆర్లు నిర్మించనున్నారు. వంద అడుగుల ఎత్తున లక్ష లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. నాలుగు ఇన్లెట్లు డెల్టా వాసులకు నేరుగా తాగునీరు తరలించేందుకు బ్యారేజీ ప్రాంతంలో నాలుగు ఇన్లెట్లు నిర్మించనున్నారు. మధ్య డెల్టాలోని 16 మండలాలకు (కోనసీమ జిల్లా) బొబ్బర్లంక వద్ద ఇన్లెట్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు డెల్టాలోని ధవళేశ్వరం వద్ద మూడు ఇన్లెట్లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం (కోనసీమ జిల్లా), సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు (కాకినాడ జిల్లా), రాజమహేంద్రవరం రూరల్, కడియం (తూర్పు గోదావరి జిల్లా)లకు నీరు అందుతుంది. ఇప్పుడున్న పథకాలకు అనుసంధానం తూర్పు, మధ్య డెల్టాల్లోని వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటికే పలు పథకాలున్నాయి. 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్ల ద్వారా తాగునీరు అందుతోంది. వీటిని వాటర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కొత్తగా మరికొన్ని పథకాలు రానున్నాయి. వీటితో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించనున్నారు. రెండున్నరేళ్లలో పూర్తి మంచినీటి పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే పనులు మొదలు కానున్నాయి. రెండు డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 20 ఏళ్ల తరువాత అవసరాలు కూడా తీర్చేలే పథకాన్ని రూపొందించాం. – సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, అమలాపురం -
ప్రతిష్టాత్మక పనులకు నిధుల కొరత రాకూడదు
రాయలసీమ కరువు నివారణ పనులు, స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ (పోలవరం నుంచి వరద జలాల తరలింపు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ – తాగునీటి వసతి కల్పన, కృష్ణా – కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చూసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల సమీకరణపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని, కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకు వేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పనులకు సంబంధించి నిధుల సమీకరణ విషయమై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి మిగిలిన నిధులివ్వాలి ► విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల గురించి సీఎం ఆరా తీశారు. ► మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందు కోసం దాదాపు రూ.3,600 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. ► మిగిలిన నిధులు విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. – పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్.. డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అ«ధికారులు సీఎంకు తెలిపారు. ఇందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ఖర్చు అంచనా ఇలా.. ► 16 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక సూపర్ స్పెషాల్టీ, ఒక క్యాన్సర్ ఆస్పత్రి, ఒక మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ.6,657 కోట్లు. ► ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం మరో రూ.6,099 కోట్లు. ► ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236 కోట్లు. ► పీహెచ్సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671 కోట్లు. ► విలేజ్ క్లినిక్స్లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ, కొత్త వాటి నిర్మాణం కోసం రూ.1,745 కోట్లు. ► ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోనూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ► రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం రూ.19,088 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి నిధుల అనుసంధానం గురించి సీఎంకు వివరించారు. నిధుల సమీకరణ టై అప్ జరిగిందని తెలిపారు. ► వీటితోపాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్ నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలో, అనంతపురం జిల్లాలోనూ వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలన్నారు. వీటికి డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► హైబ్రీడ్ యాన్యుటీ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులకు అక్టోబర్లో టెండర్లు ఖరారు చేస్తామని, ఆ వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ► ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘సీమ’ కరువు నివారణ పనులకు త్వరలో టెండర్లు ► రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. ► రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనులకు ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ► ఎట్టి పరిస్థితుల్లో అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. -
వాటర్ గ్రిడ్కు అధిక నిధులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్సభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్ గ్రిడ్ ఇన్చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్ మిషన్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ పథకం అమలుకు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. వాటర్ గ్రిడ్ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్ గ్రిడ్ను డిజైన్ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. -
ఇక ఇంటింటికీ గో‘దారి’
గోదారమ్మ... జిల్లాలోని ప్రతి ఇంటి తలుపూ తట్టనుంది. గోదారి ఇన్నాళ్లూ పుడమి తల్లి గర్భాన్ని తడిపి సస్యశ్యామలం చేయడమే కాకుండా జనం దాహార్తిని తీరుస్తూ వచ్చింది. ఇప్పుడు మరింత ముందుకు సాగి వైఎస్సార్ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇంటింటికీ కుళాయి నీళ్లతో గొంతు తడపనుంది. స్వచ్ఛమైన నీళ్లు తాగాలంటే టిన్ల రూపంలో రూ.10 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేయాల్సిందే. ఆ కష్టాలకు చెక్ పెడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట నీటి మూట కాదంటూ అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరూపించుకున్నారు జగన్. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాలువల్లో కలుషితమైన నీటిని వేడి చేసి వడగట్టి తాగాల్సిన అవసరం ఇక ఎదురుకాదు. ఆక్వా చెరువులతో తాగునీరు కాలుష్యమైపోయి గుక్కెడు శుద్ధి చేసిన నీరు దొరకడమే గగనమైపోతున్న పరిస్థితులకు ఇక చెల్లు చీటీ. ఎందుకంటే ఇక ఇంటింటికీ గోదావరి జలాలు రానున్నాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి దారిపొడవునా జనం తాగు నీటి ఇబ్బందులను తీసుకువెళ్లారు. ఒక మధ్య తరగతి కుటుంబం నెలకు తాగునీటి కోసం రూ.1000 నుంచి రూ.1200 ఖర్చుపెడుతున్న పరిస్థితిని తెలుసుకుని నాడు ఆయన చలించిపోయారు. ఆ సమయంలోనే ప్రతి ఇంటికీ నేరుగా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తానని మాట ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడు నెలలు తిరగకుండానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఇంటింటికీ గోదావరి జలాలు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఆ డిజైన్నే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా రూ.3,960 కోట్లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ప్రస్తుతం జిల్లాలో ఉన్న 52 (సీపీడబ్ల్యూ స్కీమ్స్) సమగ్ర రక్షిత మంచినీటి పథకం) ద్వారా మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 45 శాతం మందికి మాత్రమే మంచి నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. తలసరి 40 లీటర్లు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే ఒక గ్రామంలో 75 కుటుంబాలుంటే ఒక పబ్లిక్ ట్యాప్ (వీధి కుళాయి) ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ ఆ ఒక్క ట్యాప్ నుంచి తెచ్చుకోవాల్సిందే. అది కూడా వారానికి నాలుగైదు రోజులు మాత్రమే సరఫరా. జిల్లాలో ఏ మంచినీటి పథకమైనా పంట కాలువలే మూలాధారం. ప్రస్తుతం చెత్తా చెదారంతో, ఆక్వా మురుగు నీరు, వ్యర్థ జలాలతో పంట కాలువలలో నీరు కాలుష్య కారకంగా మారిపోయింది. చివరకు చూస్తూ, చూస్తూ ఆ నీటిని తాగలేక మార్కెట్లో మంచినీటి టిన్నులను కొనుక్కునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా అమలాపురం, రామచంద్రపురం, తుని తదితర పట్టణాల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం కుళాయి నీటిని తీసుకువెళుతుంటారు. ఈ పరిస్థితి మార్చేస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం ఊరూవాడా మంచినీటి పథకాలకు శంకుస్థాపనలతో హడావుడి చేసేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లని నమ్మించి మోసం చేసింది. జగన్ సర్కారు చిత్తశుద్ధితో... ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ సర్కారు ఓ అడుగు ముందుకు వేసి జిల్లా రక్షిత మంచినీటి పథకాల రూపురేఖలనే మార్చేసే వాటర్ గ్రిడ్కు ప్రణాళిక రూపొందించి. గత సెప్టెంబరులో ఆర్డబ్ల్యూ ఎస్ ఉభయ గోదావరి జిల్లాల అధికారులు రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో పవర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.గాయత్రీ దేవి పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ గ్రిడ్నే రోల్మోడల్గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. తొలి విడతలో ఎంపికైన జిల్లాల్లో మన జిల్లా ఉండటంతో ఇక్కడి ప్రజలకు భారీ ప్రయోజనం కలగనుంది. ఇక ముందు తలసరి 40 లీటర్లకు బదులు 100 లీటర్లు నీటిని సరఫరా చేయనున్నారు. ఒక గ్రామంలో 2,500 మంది ఉంటే అందులో 45 శాతం అంటే వెయ్యి మందికి మాత్రమే ప్రస్తుతం పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక ముందు 2,500 మందికి పూర్తిగా నీటిని అందించనున్నారు. అదీ కూడా గోదావరి నుంచి నేరుగానే సరఫరా చేస్తారు. ‘రాష్ట్రానికే రోల్మోడల్’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలవడం చాలా అనందంగా ఉంది. మన జిల్లా అధికారులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అమలుచేసేలా ఉపయోగపడింది. జిల్లా ప్రజలకు ఇది చాలా ప్రయోజనం కలుగుతుంది. రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే రూ.3,960 కోట్లకు ఆమోదం తెలియజేయడం జిల్లా ప్రజలకు వరమే. ప్రతి ఆవాసానికి నేరుగా గోదావరి జలాలు అందించే ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం 40 లీటర్లు మాత్రమే అందివ్వగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 లీటర్ల్ల నీటిని సరఫరా చేయగలుగుతాం. – డి.మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తలసరి 100 లీటర్లు శుద్ధిచేసిన నీరు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో ప్రతి ఆవాసానికి మంచినీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. జిల్లాలో 2051 వరకూ పెరిగే జనాభా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. పంట కాలువల ద్వారా నీటిని తీసుకుని శుద్ధిచేసి స్టోరేజీ ట్యాంకుల ద్వారా పబ్లిక్ కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా గోదావరి నీటిని తీసుకునే పాయింట్లోనే శుద్ధి చేసి నేరుగా స్కీమ్ల నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి నీటిని సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – టి.గాయత్రీదేవి,ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
రెండేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి..
సాక్షి, నరసాపురం: జిల్లాలో గోదావరి చెంత నుంచి శుద్ధి చేసిన జలాలను పైపులైన్ ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక ఆమోదం పొందిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 3,670 కోట్లతో ఈ పథకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రజల కల నిజం కాబోతుందని.. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతికి ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. వాటర్ సప్లైకి ప్రతి ఇంటికి మీటర్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement