-
చదువుకున్నవాళ్ల మేధావితనం
‘‘అంతా వచ్చారా? ఏం, మగ్గాల చప్పుడు కావడం లేదే’’ అంటూ అధికార ధ్వనిలో డఫేదారు తిరుపతయ్య నేతశాలలో ప్రవేశించి లోపలనున్న ఖైదీలను లెక్కించసాగాడు. అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఆనాడు ఉదయం ఉరి తీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ స్థానాలలోకి వెళ్లి కూర్చున్నారు. ‘‘గండయ్య రానట్టుందే?’’ తిరుపతయ్య ప్రశ్నించాడు. ‘‘రాలేదు సార్’’ ఒక ఖైదీ జవాబిచ్చాడు. ‘‘ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు; ఎప్పుడూ ఎక్కడో తిరుగుతుంటాడు. ఎక్కువ శిక్షవాడని నేను కొంచెం చనువుగా మెదులుతుంటుంటే అధికారులతో నాకు మాట తెచ్చే లాగున్నాడు,’’ అంటూ నేతశాల వదిలి ‘‘మగ్గాలు ఆడనివ్వండి’’ అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయలుదేరాడు తిరుపతయ్య. తిరుపతయ్య అటుపోగానే ఖైదీలు మళ్లీ మాటల్లో పడ్డారు. ‘‘చూచావుర! తిరుపతయ్య ముఖంలో ఇంతన్నా విచారముందో!’’ ‘‘విచార మెందుకుర? వాడెవడు, వీడెవడు?’’ ‘‘పాపము! ఉరితీసిన సంగతి అతని వాండ్లకు తెలుపుతారో, లేదో’’ ‘‘తెలిసికొని మాత్రము ఎవరు ఏం చేస్తారు? వచ్చిన దగ్గరకు చేరుకున్నాడు.’’ ‘‘అది కాదు కాని, ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరిపెట్టి వేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్లకెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడ మనసొప్పలేదురా!’’ ‘‘ఏమి వగలమారి మొగోడివిరా. రేపు నీకు జవాను కొలువిచ్చి ఉరి తీయమంటె తీయక ఏం చేస్తావు? ఖానూను ప్రకారం ఎవరైనా చేయాల్సి వస్తుందోయ్. ఖానూనంటే ఏం పిలకాయలాటనుకున్నావా?’’ ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటుండగా తిరుపతయ్య గండయ్యను వెంటబెట్టుకొని నేతశాలకు వచ్చి, మగ్గాల పని ఆగి ఉండుటను చూచి ‘‘మీకేమైంది ఈరోజు పని బొత్తిగా చేయడం లేదు. చెప్తున్నాను బాగా వినండి, మీ అందరిని దొర దగ్గరకు తీసికెళ్లి నిలబెడ్త,’’ హెచ్చరించాడు తిరుపతయ్య. తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసివున్న గండయ్య ‘‘దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్లరాదు?’’ అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు. గండయ్య కంటినీరు చూడగానే తిరుపతయ్య చలించిపోయాడు. ‘‘ఈవాళ గండయ్య నాటక మాడుతున్నాడే. ఆడదానిలాగ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఒకసారైనా వాడి ముఖం చూచావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావెందుకు?’’ తిరుపతయ్య టోపీ కిందబెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు. ‘‘మా ఖైదీలకు చుట్టాలము మేము కాకపోతే నీవవుతావా? తిరుపతయ్య, పిల్లలు గలవాడివి, సంసారం చేస్తున్నావు కూడా. 25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలె పట్టుకెళ్లి స్తంభాని కేలాడదీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమొస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అని గండయ్య గంభీరంగా అన్నాడు. ‘‘పిచ్చోడా, నేను కాకపోతే ఇంకోడు తయారవుతాడు ఈ పనికి. ఉరితీయడానికి మనుషులు లేక ఉరితీయడం ఆగిపోతుందనుకున్నావా?’’ తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతూ. ‘‘నీ సంగతే కాదు నేను అనేది, ఉరితీసే వాండ్ల గురించే అడుగుతున్నాననుకో. ఎవడు తీశాడో ఈ పద్ధతిగాని ఉరి తీసిందానికంటే 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచింది మంచిది,’’ గండయ్య అన్నాడు. ‘‘లేకుంటే నీ పద్ధతి అంటే, నీ గ్యాంగు పద్ధతితో చేస్తే యింకా బాగుంటుందిరా?’’ అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య. ‘‘తిరుపతయ్య సార్! మాకంటే నీవు మెరుగని సంతోషిస్తున్నావ్. నీవేమైనా అనుకో, మనసు మండి అనేస్తున్నాను. మేము తప్పు చేస్తే జైలుశిక్ష వేసిన వాండ్లు ఒక మనిషిని ఉరి తీసినవాడికి కూడా కఠినశిక్ష వేస్తే బాగుంటుంది’’ గండయ్య కోపంతో అన్నాడు. ‘‘నేను ఖానూను ప్రకారము ప్రభుత్వ ఆజ్ఞతో ఉరితీశాను తెలుసా! నన్నెవరు శిక్షిస్తారు? సరే కాని, మాటలు చాలా అయినవి. యిక పోయి మగ్గము మీద కూర్చోపో. దొర వచ్చే వేళైంది,’’ అంటూ తిరుపతయ్య డ్రెస్ సదురుకొంటూ గేటు వద్ద నిలుచున్నాడు. ‘‘నేను ఇవాళ దొరను కూడా అడుగుతా, ఏమైనాగాని ఇంత అన్యాయంగా ఉరి తీయడం బాగాలేదని,’’ అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిలుచున్నాడు. తిరుపతయ్య కోపంగా నటిస్తూ ‘‘ఒరే! నీకు సిగ్గెందుకు లేదు? నీవు, మీ గ్యాంగువాళ్లు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారురా? ఎంతమంది పెండ్లిండ్లను ఎత్తగొట్టారురా? ఎన్ని కొంపల్ను నాశనం చేశారురా? అటువంటి నీవు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు? ఏమేమో వాదిస్తున్నావా? పైగా దొరను అడుగుతాడట దొరను. ఎప్పుడైతివి పత్తిత్తువు’’ అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య. గండయ్య కడుపులోని దుఃఖము ఇప్పుడు రౌద్ర రూపము దాల్చింది. తానొక ఖైదీనని, అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మరిచిపోయాడు. ఉగ్రుడై ‘‘మాటిమాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప తాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు ముండలతో కాలము గడిపే మేము ఒళ్లు మరిచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం, ఇండ్లలో జొరబడి దోచుకున్నాం, మత్తు దిగిం తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాప పడ్తాం. మేము చదువురాని మొద్దులం, మాలో చదివినోడుగాని, మంచి చెడ్డ తెలిసినోడుగాని ఒకడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం, వాండ్లలో తిరిగాం, అవే బుద్ధులు, అదే బతుకు. ఇప్పటికైనా మమ్ముల ఈ పనినుండి మాన్పించి, మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడానికెవరైనా ముందుకొస్తే మా గ్యాంగు మాటేమోగాని నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగు చేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది? తిరుపతయ్య సార్!’’ గండయ్య గుడ్లెర్రజేసి గట్టిగా అడిగాడు. తిరుపతయ్య వింతగా గండయ్య వైపు చూస్తూ, ‘‘ఒరే! నీకు పిచ్చి లేసేటట్టున్నదిరా పో! లోపలికి పో! దొర వస్తున్నాడు’’ అంటూ తిరుపతయ్య క్రమశిక్షణతో నించున్నాడు. గండయ్య కూడా దూరంగా నిలుచొని జేలరు వచ్చే వైపు చూస్తున్నాడు. జేలర్, జేలర్ వెంట జమేదార్ గేటు లోపలికి ప్రవేశించగానే జమేదారు రౌద్రముతో గండయ్య నుద్దేశించి, ‘‘ఏమిరా? నీవు ఈ రోజు గంజి తీసుకోలేదేం?’’ గండయ్య జేలరుకు దండం పెట్టి ‘‘అయ్యా! ఉరితీసినప్పటి నుండి నాకు కడుపులో ఎట్లాగో వుంది. నాకెటు తోచడం లేదు. మీరు చదువుకున్నోరు కూడా ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరు అడుగాలె’’ అని గండయ్య ప్రశ్నించాడు. జమేదారు అధికార ధ్వనితో ‘‘నీవు గంజి త్రాగుతావా లేదా?’’ అని గర్జించుచూ ఓరకంటితో జేలరు వైపు చూచాడు. జేలర్ అయోమయ స్థితిలో కపట బింకంతో తలనాడించాడు. ‘‘తాగను సార్!’’ గండయ్య నిర్భయంగా జవాబిచ్చాడు. ‘‘ఒంటిగదిలో మూసేసి తర్వాత నా వద్దకు తీసుకొని రండి. వాడికి మంచి బుద్ధి చెప్పితే రోగం కుదురుతుంది. గంజి తాగుతాడు. చదువుకున్నోళ్ల సంగతి తెలుస్తుంది’’ అంటూ వెళ్లిపోయాడు జేలరు. వట్టికోట ఆళ్వారు స్వామి వట్టికోట ఆళ్వారు స్వామి (1915–1960) కథ ‘పతితుని హృదయం’ ఇది. 1952 నాటి ఆయన జైలు కథల్లో సంకలనమైంది. ఉరితీసే శిక్షాస్మృతి స్వభావాన్ని ప్రశ్నించే కథ. తెలంగాణ వైతాళికుడు వట్టికోట. నైజాం పాలనను వ్యతిరేకించి జైలు జీవితం గడిపినవారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రజల మనిషి, గంగు ఆయన ప్రసిద్ధ నవలలు. -
గట్టికోట వట్టికోట
నిజాం రాచరిక పాలనను అంతమొందించేందుకు తన రచనలతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన ధీశాలీ, కమ్యూనిస్టు నేత, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, గ్రంథాలయోద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్నింటికీ మించి తెలుగులో రాజకీయ నవలకు ఆద్యుడు, గట్టికోట మన వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట ఆళ్వార్ స్వామి నవంబర్ 1, 1915న పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లా నకిరేకల్ దగ్గర చెరువు మాదారంలోని ఒక పేద వైష్ణవ కుటుంబంలో సింహాద్రమ్మ,రామచంద్రాచార్యులకు జన్మించాడు. తన పదకొండేళ్లకే తండ్రి మరణంతో కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయాడు వట్టికోట. అప్పటి నుంచి ఒక ఉపాధ్యాయుడ్ని ఆశ్రయించి అతనికి వండి పెడుతూ అతని వద్దే విజ్ఞానాన్ని సముపార్జించి తన సాహిత్య ప్రస్థానం ప్రారంభించాడు. ఇండ్లల్లో వండిపెడుతూ విజయవాడలోని హోటల్లో సర్వర్గా పనిచేస్తూనే ఇంగ్లీష్, ఉర్దూ భాషలపై పట్టు సాధించాడు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున సాగుతున్న భారత స్వాతంత్య్ర సంగ్రామానికి వట్టికోట ఆకర్షితుడై జైలుకెళ్లాడు. ఆ తర్వాత 1933లో హైదరాబాద్ రావడం గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభకు తొలిసారిగా హాజరై 1944లో కమ్యూనిస్టు ఉద్యమంవైపు పయనం సాగిస్తూనే తెలంగాణ రైతాంగ పోరా టంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1938లో హైదరాబాద్లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి సుమారు 800 మందిని సభ్యులుగా చేర్పించారు. దీని ద్వారా దాదాపు 35 పుస్తకాలను ప్రచురించారు. ప్రజల భాషను తన సాహిత్యంలో రుచి చూపించి, తెలంగాణ నుడికారాలతో ఎన్నో రచనలకు వట్టికోట పెద్దపీట వేశారు. ఆయన రచనల్లో నిబద్ధత, వాస్తవికత దాగి ఉంటుంది. ఆ కోవకి చెందిన ప్రముఖ తెలంగాణ రాజకీయ తొలి నవల ప్రజల మనిషి. ఆనాటి తెలంగాణలో రాచరిక వ్యవస్థ కారణంగా జాగీర్దార్, జమిందార్లు కష్టజీవులను ఏవిధంగా అణగదొక్కారో ఆ నవలలో వట్టికోట అక్షరాలతో బొమ్మకట్టారు. మరో మేటి నవల గంగులో 1940 తర్వాత తెలంగాణలో పరిస్థితులు ప్రత్యక్షమవుతాయి. తను అనుభవించిన జైలు జీవితాన్ని ఆధారంగా చేసుకొని జైలు లోపల కథలు రాశారు. 1948లో నిజామాబాద్ జైలులో దాశరథికి పోరాట పాఠాలు నేర్పుతూ,దాశరథి పద్యాలను జైలు గోడలపై రాసి జైలు అధికారితో దెబ్బలు తిన్నాడు. చివరగా ఫిబ్రవరి 5, 1961లో 46 ఏళ్ల ప్రాయంలోనే తుది శ్వాసవిడిచి తెలంగాణ సమాజానికి తీవ్ర శోకాన్ని మిగిల్చిపోయారు. ఆయన సాహిత్య కృషిని స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పిద్దాం. -బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా (నేడు వట్టికోట అళ్వార్ స్వామి వర్ధంతి) -
అణగారిన ‘ప్రజల మనిషి’
పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి బాల్యం లోనే భిక్షాటనతో బతుకు కష్టాలను వడపోసి తెలుగు నేల గర్వించదగిన రచయితగా ఉన్నత శిఖ రాలకు చేరుకున్న వట్టికోట ఆళ్వారు స్వామి 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా, సూర్యాపేట సమీ పంలోని చెరువు మాధవరం అనే కుగ్రామంలో నిరు పేద కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే వంట పని, ఇంటి పని చేస్తూ తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే విజయవాడ చేరి హోటల్ కార్మికునిగా పనిచేస్తూ సమీపంలోని గ్రంథాలయాల ద్వారా ఎనలేని విజ్ఞానాన్ని సంపా దించారు. అదీ ఎక్కువ రోజులు సాగక పొట్ట చేతబ ట్టుకుని 1933లో హైదరాబాద్లో అడుగుపెట్టారు. అక్కడ గోల్కొండ పత్రికలో చేరడం ఆయన జీవి తంలో అనుకోని మలుపు. ఆ పత్రికలో ప్రూఫ్ రీడ ర్గా పనిచేస్తున్నప్పుడే బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప రెడ్డి వంటి ఎందరో ఉద్దండులతో పరిచయాలు కలిగి వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై ఇష్టా గోష్టులతో గడపటం సాధ్యమైంది. ప్రూఫ్ రీడర్ నుంచి పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, కథ, నవలా రచయితగా, గ్రంథాల యోద్యమ నిర్మాతగా తెలుగు భాష, సాంస్కృతికో ద్యమాల విస్తృతికి ఊపిరులూదారు. అన్ని వాదా లను తన సాహిత్యంలో ఇముడ్చుకుని మానవతా వాద రచయితగా బహిరంగంగా హెచ్చరించిన ప్రథమ వ్యక్తి ఆళ్వార్ స్వామి. ఆ రోజుల్లో నిజాం నవాబు అకారణంగా రిక్షాలను నిషేధించడంతో, రిక్షా కార్మికోద్యమాన్ని నిర్మించి సమస్యను సామర స్యంగా పరిష్కరించారు. కుటుంబంలో స్త్రీ అను భవించే కష్టాలపై వట్టికోటకు స్పష్టమైన అవగాహన ఉందనడానికి ఆయన రచించిన ‘ఆలు కూలి’ అన్న కథ అద్దం పడుతుంది. జంట నగరాల్లో ఎలాంటి వసతులు లేకుండా నెలకు ఒక్కరోజు సెలవుతో అష్ట కష్టాలు పడుతున్న గుమాస్తాలను సమైక్యపరచి సం ఘాన్ని స్థాపించడమే కాక వారికోరోజు సెలవును కూడా సాధించిన ఘనత ఆళ్వారు స్వామికే దక్కు తుంది. అదేకాలంలో ‘గుమాస్తా’ అన్న పత్రికను కూడా నడిపారు. తెలంగాణలో దోపిడీకి గురవుతు న్న ప్రజలను చైతన్యపరచడానికి ‘ప్రజల మనిషి’ అన్న నవల రాశారు. తెలంగాణ పోరాటంపై ఈ నవల ప్రభావం ఎనలేనిది. 1942లో కాంగ్రెస్ కార్య కర్తగా జైలుకెళ్ళిన వట్టికోట, 1946 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా జైలు జీవితం అనుభవించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం. జైలు అనుభవాన్ని అనేక కథలుగా మలచి, ఒక సం పుటాన్ని ప్రచురించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య హత్యోదం తంపై ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పరిశోధనాత్మక నివేదికను వెలువరించారు. గద్వాల్ దర్బార్లో మహారాణి సమక్షంలో ప్రజల ఇక్కట్లను, పాలకుల దురాగతాలను కళ్లకు కట్టేలా వివరించారు. మీజాన్ పత్రిక ద్వారా విసునూరు దేశ్ముఖ్ను తూర్పార పట్టారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మీయతానురాగా లతో నవసమాజ నిర్మాణానికై తపించిన విప్లవ వైతాళికుడు వట్టికోట 1961 ఫిబ్రవరి 5న కన్ను మూశారు. అణగారిన జనం సంక్షేమానికి జీవితాన్ని అర్పించిన మానవతావాది ఆయన. హైదరాబాద్ లో సెంట్రల్ లైబ్రరీకి, కృష్ణా ఎక్స్ప్రెస్కు ఆళ్వారు స్వామి పేరుపెట్టడం సమంజసం, ప్రభుత్వం ఆయ న పేరిట ఫ్రీలాన్స్ జర్నలిస్టు అవార్డును ఏర్పాటు చేయాలి. నేటి ఆళ్వారుస్వామి శత జయంతి ఉత్సవ సభలను తెలుగు రాష్ట్రాలలో అన్ని మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలి. తద్వారా నేటి యువతలో దేశభక్తి, జాతీయభావం వెల్లివిరు స్తుంది. (నేడు వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి) డా॥శ్రీనివాస్ కంకటపాలెం, బాపట్ల Email: drsskkp@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement