అవినీతి పుట్ట
బోధన్ స్కాంలో వెలుగుచూస్తున్న విస్మయకర అంశాలు
(ఐరెడ్డి శ్రీనివాస్రెడ్డి– సాక్షి ప్రతినిధి)
అతడో సాధారణ ట్యాక్స్ కన్సల్టెంట్.. అవినీతి అధికారులను అడ్డుపెట్టుకొని వందల కోట్లు కొల్లగొట్టాడు.. ఏకంగా వాణిజ్య పన్నుల విభాగాన్నే శాసించాడు..! బోధన్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాజు కొన్నేళ్లుగా నిర్మించిన అవినీతి పుట్ట పగులుతోంది. సీఐడీ విచారణలో అతడు సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు. తాను ప్రారంభించిన కుంభకోణాన్ని తనయుడికి అప్పగించి కోట్ల కొద్దీ సొమ్మును జేబులో వేసుకొన్నట్టు ఒప్పుకొన్నాడు.
2005 నుంచి మొదలైన స్కాం..
బోధన్ స్కాంకు 12 ఏళ్ల కిందటే బీజాలు పడ్డాయి. ట్యాక్స్ వసూలు చేసి వెబ్పోర్టల్ ద్వారా సంబంధిత చలాన్లను అప్లోడ్ చేసేలా 2005లో నాటి ప్రభుత్వం పారదర్శకత కోసం వ్యాటిస్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం చలాన్లు కట్టినట్టు ఓ కాపీని పోర్టల్లో అప్లోడ్ చేసేవారు. దీన్నే శివరాజు అవకాశంగా మల్చుకున్నాడు. నకిలీ చలాన్లు సృష్టించి, అప్పటి బోధన్ సీటీవోగా పనిచేసిన నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి ద్వారా వెబ్పోర్టల్లో అప్లోడ్ చేసినట్టు శివరాజు విచారణలో ఒప్పుకున్నాడు. ఇందుకు కృష్ణమాచారికి ప్రతీనెల రూ.లక్ష లంచం ఇచ్చినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అతడి కార్యాలయమే సర్కిల్ ఆఫీస్
శివరాజు నిజామాబాద్లోని ద్వారాకానగర్ మాత్రుచాయ అపార్ట్మెంట్లోని తన ఇంటినే కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంగా మార్చేశాడు. జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ప్రతీ ఒక్కరికి నెలనెలా లక్షల్లో లంచాలు ఇచ్చాడు. ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అందరి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను శివరాజు వాడుకున్నాడు. ఆడిటింగ్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్.. ఈ మూడు విభాగాల అధికారులకు లంచాలిచ్చి నకిలీ చలాన్లు, పోర్టల్లో ఎంట్రీ చేసిన తప్పుడు సమాచారం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అంతేకాదు బ్యాంకుకు సంబంధించిన స్టాంపు, సబ్ట్రెజరీ ఆఫీస్ స్టాంపు, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల స్టాంపులు కూడా నకిలీవి తయారుచేసి ఇంట్లోనే ఫేక్ చలాన్లు సృష్టించి ట్యాక్స్ క్లెయిమ్ చేశాడు.
అకౌంటింగ్ జనరల్ అధికారులకూ పాత్ర
శివరాజు చేసిన స్కాంలో అకౌంటింగ్ జనరల్ అధికారులు సైతం పాత్ర వహించినట్టు సీఐడీ గుర్తించింది. బోధన్ సర్కిల్ కార్యాలయంలో ఆడిటింగ్ను ఏమాత్రం పరిశీలించకుండా లంచాలకు అమ్ముడుపోయినట్టు రిమాండ్ రిపోర్ట్లో సీఐడీ స్పష్టం చేసింది. శివరాజుతో కుమ్మక్కవడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో మోసం జరుగుతున్నా పట్టించుకోలేదని సీఐడీ పేర్కొంది.
అధికారులకు కార్లు, విదేశీ టూర్లు
తన అక్రమాలకు సహకరించిన ప్రతి అధికారికి లంచాలివ్వడంతోపాటు కార్లు, విదేశీ ప్రయాణాలు గిఫ్టుగా ఇచ్చినట్టు శివరాజు తన వాంగ్మూలంలో తెలిపాడు. సీటీవో కృష్ణమాచారికి చెవ్రోలెట్ స్పార్క్ కారు గిఫ్ట్గా ఇచ్చాడు. డిప్యూటీ కమిషనర్ ధరణీ శ్రీనివాస్రావుకు హోండా అమేజ్ కారు బహుమానంగా ఇచ్చాడు. అలాగే అతడి ఇంటికి రూ.5 లక్షల విలువ చేసే ఫర్నీచర్ను, విదేశీ ప్రయాణాలను గిçఫ్టుగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. ఏసీటీవో సంజీవ్ గౌడ్కు టాటా ఇండికా కారు, ఇంటికి రూ.50 వేల విలువైన ఫర్నీచర్, అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచందర్రెడ్డికి మహీంద్రా జైలో కారు గిఫ్టుగా ఇచ్చాడు.
నెలనెలా ఏ అధికారికి ఎంత లంచం?
అధికారి లంచం
శ్రీనివాస్రావు(డిప్యూటీ కమిషనర్) రూ.5 లక్షలు
ఎన్.శ్రీనివాసులు(డిప్యూటీ కమిషనర్) రూ.5 లక్షలు
లక్ష్మయ్య(అసిస్టెంట్ కమిషనర్) రూ.1.5 లక్షలు
నాయర్(అసిస్టెంట్ కమిషనర్) రూ.1.10 లక్షలు
సంజీవ్ గౌడ్(సీటీవో) రూ.లక్ష
ఎన్.కృష్ణమాచారి(సీటీవో) రూ.లక్ష
ఆర్డీ విజయకృష్ణ(ఏసీటీవో) రూ.40 వేలు
వేణుగోపాలస్వామి(సీనియర్ అసిస్టెంట్) రూ.40 వేలు
హనుమంత్ సింద్(జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు
ఈశ్వర్(డీసీటీవో) రూ.50 వేలు
పూర్ణచందర్రెడ్డి(సీటీవో బోధన్) రూ.లక్ష
ఎన్.ఇందిరా(ఏసీటీవో–బోధన్) రూ.20 వేలు
రఘునాథ్బాబు (విజిలెన్స్ డీసీటీవో) రూ.1.10 లక్షలు(మూడు నెలలకు)
లక్ష్మీనారాయణ(ఏసీటీవో) రూ.లక్ష (ఆరు నెలలకు)
అరుణ్రెడ్డి(డీసీటీవో) రూ.లక్ష (మూడు నెలలకు)
లబ్ధి పొందిన సంస్థలు
తండ్రి వారసత్వంగా స్కాంను అందిపు చ్చుకున్న శివరాజు తనయుడు సునీల్ అవినీతి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అధికా రుల అండతో రెచ్చిపోయాడు. వ్యాపారస్తు లతో కుమ్మక్కై నకిలీ చలాన్ల ద్వారా నిజామా బాద్లోని ప్రముఖ వ్యాపారులకు కోట్ల రూపా యలు ఆదా చేశాడు. కొంతమంది వ్యాపారు లు ప్రతీ నెల ట్యాక్స్ చెల్లిస్తే.. వారి ట్యాక్స్ను ఇతర వ్యాపారులపైకి మళ్లించి క్లెయిమ్ చేశా డు. అలాగే మరికొందరు ఒక్కసారి చెల్లించిన ట్యాక్స్లను 3సార్లు చెల్లించినట్టు పోర్టల్లో ఎం ట్రీ చేశాడు. 2010 నుంచి తండ్రి శివరాజు రైస్ మిల్లర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కోట్లు గడించ గా.. ఆసొమ్మును సునీల్ రెండింతలు చేశాడు.
పన్నును మళ్లించాడిలా..
క్రమంగా పన్నులు కట్టేవారు ప్రతీనెల రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చెల్లించేవారు. వారు చెల్లించిన నగదు/చెక్లను.. తాను ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపార సంస్థల పేరిట సగం మళ్లించి ట్యాక్స్ చెల్లించినట్టు వెబ్పోర్టల్లో, అకౌంట్ పుస్తకాల్లో సునీల్ నమోదు చేశాడు. కంపెనీలు చెల్లించిన ట్యాక్స్లో కేవలం 30 శాతమే చెల్లించి మిగతా మొత్తాన్ని తన ఖాతాల్లోకి మళ్లించాడు. దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది.
సునీల్ ద్వారా లబ్ధి పొందిన సంస్థలివే
సిద్దిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ (కాలూర్), లక్ష్మీనర్సింహా ఇండస్ట్రీస్ (కాలూర్), వెంకటర మణ, ప్యాడీ ప్రాసెస్ ఇండస్ట్రీస్ (ఖానాపూర్), వంశీ కృష్ణా ఇండస్ట్రీస్(ఖానాపూర్), శుభం ట్రేడింగ్ కంపెనీ (కాలూర్), ధనలక్ష్మీ రైస్ మిల్ (బోధన్), తులసీ ట్రేడర్స్ (ఖానా పూర్), త్రినేత్రా రైస్ ఇండస్ట్రీస్ (ఖానాపూర్), కృష్ణా ఆగ్రో ఇండస్ట్రీస్ (గుండారం), ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఖానాపూర్), ఆనంద్ రైస్మిల్, అరుణోదయ రైస్మిల్, బాలాగణపతి ఇండ స్ట్రీస్, శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్, శ్రీరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, మహేశ్వరి బిన్నీ రైస్మిల్, సాయి సుధా ఇండస్ట్రీస్, సూర్యా ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీనివాసా రైస్మిల్, శ్రీచక్ర ఇండస్ట్రీస్, శ్రీగురుకృపా ఇండస్ట్రీస్, జై గణేష్ ఫ్యాడీ ప్రాసెసింగ్, రుద్రా ఇండస్ట్రీస్, తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీరాధాకృష్ణా ఆగ్రో ఇండస్ట్రీస్, మంజునాథా ట్రేడర్, తిరుమల రైస్ ఇండస్ట్రీస్, ద్వారాకామయి ఇండస్ట్రీస్, నీల కంఠ ఇండస్ట్రీస్, వాసవి బిన్నీ రైస్మిల్, తిరు మల బిన్నీ రైస్మిల్, శ్రీపాండురంగా రైస్ మిల్, కొలావర్ బిన్నీ రైస్మిల్, హనుమాన్ ట్రేడర్స్, సాయిస్వరూపా ఇండస్ట్రీస్, ఆదిలక్ష్మీ రైస్మిల్
ఆస్తుల విలువ 300 కోట్లపైనే..
శివరాజు, అతడి కుమారుడు సునీల్ అక్రమాస్తులకు లెక్కే లేదని సీఐడీ స్పష్టం చేసింది. శ్రీకృష్ణా ఎంటర్ ప్రైజెస్ అనే పేరుతో కంపెనీ స్థాపించి ఆ కంపెనీ ద్వారా బ్లాక్మనీ మొత్తం వైట్ చేసి నట్టు సీఐడీ గుర్తించింది. గుజరాత్లో రూ.50 లక్షలతో సిమెంట్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశారు. కర్నూల్లో రూ.30 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. బ్లూమీ థెరపిటిక్ పేరిట ఫార్మా కంపెనీ స్థాపించారు. విశ్వమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమి టెడ్, సాయి తిప్పారాజు ఇన్ఫ్రా వెంచర్స్తో కన్స్ట్రక్షన్ అండ్ రియల్టర్ కంపెనీలు పెట్టారు. తన తల్లి సూర్యకళ పేరుతో సునీల్ జీకే సీడ్స్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ లన్నింటినీ తమ ఇంటి ఎదురుగా ఉన్న వారి భవనంలో ఏర్పాటు చేశారు. ఇదే భవనంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ నివాసం ఉంటున్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లో రూ.25 లక్షలతో కేబుల్ నెట్వర్క్, నిజామాబాద్ మాధవ నగర్లో ఫాంహౌజ్, కొంపల్లిలో 2 గృహాలు, చైన్నైలో ఇల్లు, బంజారాహిల్స్లో ఇల్లు, పారడైజ్ వద్ద మరో ఇల్లు, డిచ్పల్లిలో 20 ఎకరాల భూమి ఉన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈ ఆస్తి రూ.300 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
కేసును తొక్కేసేందుకు టీడీపీ నేత
► రంగంలోకి దిగిన కర్నూలుకు చెందిన తిరుమలనాయుడు
► డీఎస్పీ విజయ్కుమార్తో రూ.20 లక్షల ఒప్పందం
► బెయిల్ కోసం అడ్వొకేట్తో రూ.30 లక్షలకు అగ్రిమెంట్
కర్నూలులో శివరాజు రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీలు స్థాపించాడు. దీంతో అక్కడ రాజకీయ నాయకులతో అతడి కుమారుడు సునీల్ సన్నిహితంగా మెదిలారు. బోధన్ స్కాం బయటపడటంతోనే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత తిరుమలనాయుడు రంగంలోకి దిగారు. శివరాజు కుమారుడు సునీల్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, కేసును లోతుగా దర్యాప్తు చేయనీయకుండా దర్యాప్తు అధికారులను ప్రలోభపెట్టారు. ‘‘నీకేం ఇబ్బంది లేదు.. నేను డీల్ సెట్ చేస్తా..’’అని సునీల్కు చెప్పిన తిరుమలనాయుడు హైదరాబాద్లోని హైకోర్టు అడ్వొకేట్ నరేశ్కుమార్తో చర్చించాడు. వీరిద్దరు కలసి దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్కుమార్ను ఎల్బీనగర్లోని సితార హోటల్కు రప్పించుకున్నారు. అప్పటికే తిరుమలనాయుడు, సునీల్.. విజయ్కుమార్తో డీల్ మాట్లాడుకున్నారు. ఒప్పందంలో భాగంగా కలవాలని భావించిన వీరు సితారలో ఏప్రిల్ 17న కలుసుకున్నారు. అక్కడే రూ.20 లక్షలకు డీఎస్పీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రిల్ 24న ఈ సొమ్ము ఇస్తామని డీఎస్పీకి హామీ ఇచ్చారు. అలాగే బెయిల్ కోసం లాయర్ నరేశ్ మరో అడ్వొకేట్ రఫత్ అహ్మద్ఖాన్ను పరిచయం చేశాడు.
బెయిల్కు రూ.30 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇదంతా సెట్ చేసినందుకు టీడీపీ నేత తిరుమలనాయుడికి రూ.5 లక్షలు ఇస్తానని సునీల్ మాటిచ్చాడు. ఏప్రిల్ 24న సునీల్ తన మనుషులతో బంజారాహిల్స్ రోడ్ నంబర్–10లోని ఓ ఆస్పత్రి వద్ద రూ.20 లక్షలు ఇచ్చేందుకు వచ్చాడు. అక్కడికి చేరుకునేందుకు డీఎస్పీ విజయ్కుమార్ కూడా బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు, టాస్క్ఫోర్స్ సాయంతో సునీల్ అండ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. తర్వాత రెండ్రోజులకు డీఎస్పీ విజయ్కుమార్ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నించిన తిరుమలనాయుడు, అడ్వొకేట్పై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
క్రమంగా ట్యాక్స్ చెల్లించినవారు..
ఎంబీ ఆగ్రో ఇండస్ట్రీస్, ధర్మారం
లక్ష్మీబాలాజీ రైస్ ఇండస్ట్రీస్, కాపూర్
అయ్యప్ప ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలూర్
శ్రీరామా ఇండస్ట్రీస్, సారంగపూర్
ఆర్కే మోడ్రన్ రైస్ మిల్, ఖానాపూర్
శ్రీబాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్, బోధన్
శ్రీవినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, బోధన్
ప్రకాశ్ ఆటోమోటివ్, నిజామాబాద్
నిజామాబాద్ ఆగ్రో ప్రై.లి., ఖానాపూర్
శ్రీరామా పారాబాయిల్డ్ రైస్మిల్, ఖానాపూర్