-
...అయినప్పటికీ చెరగని ముద్ర
సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యా యానికి తెర లేచిన చీకటి రోజులు నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి. 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదనీ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా 1975 జూన్ 12న చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్ష ణమే రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు ముక్త కంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాంగాన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బం ధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత – సమైక్య తలకు తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, 1975 జూన్ 25, అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాలరాసింది. అంత ర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాదిమందిని జైల్లో పెట్టించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు అంటూ... జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. ‘మీసా’ వంటి చట్టాలను కాంగ్రెస్ అధిష్ఠానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది. ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్ గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చి వేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికి వాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్. హఠాత్తుగా, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగ తాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాశ్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’ అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకూ చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిర అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీకి వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్లోని ‘యంగ్ టర్క్స్’ కూడా వారితో జత కట్టారు. 1977 మార్చ్ 20న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనూ, ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశం లోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అవిశ్వాస తీర్మానం కారణంగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టడం, రాజీనామా చేయడం; దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిన విషయమే. ఆ లోక్సభ ఎన్నికలలో 529 స్థానాలకుగాను 351 స్థానాలు గెలుచుకుని తన సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్– హర్మందిర్ సాహిబ్పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధీ హత్యకు గురై 38 సంవత్సరాలు నిండాయి. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న దనడంలో మాత్రం సందేహం లేదు. వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 (నేడు ఇందిరాగాంధీ 38వ వర్ధంతి) -
నెరవేరిన చిరకాల స్వప్నం
ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్ / పెట్రోలు ఇంజిన్ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్ వార్మింగ్లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ విద్యుత్ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్ లేదా డీజిల్ డ్రైవింగ్ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్ స్టేషన్ (ఛార్జింగ్ స్టేషన్) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్ బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ విద్యుత్ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్ చేసే విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్ మోడల్తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది. సీహెచ్ ద్వారకా తిరుమల రావు వ్యాసకర్త ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
Yadadri Temple: గుట్ట కష్టాలకు ముగింపు ఎప్పుడు?
యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్ చిత్రాలు (రిలీఫ్ ఫిగర్స్) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్ను తొలగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. పగుడాకుల బాలస్వామి వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్: 99129 75753 -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది. భారత్లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది. పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు. నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా. జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్లకు మార్చడమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి. దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’ ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’ జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్ను సింగిల్ మార్కెట్ని చేసింది.’ నిర్మలా సీతారామన్ (జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు) వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement