-
Telangana: మొన్న బాలింత.. నిన్న పసికందు.. నేడు మరొకరు
సాక్షి, నల్గొండ: మొన్న బాలింత, నిన్న నాలుగు రోజుల పసికందు, నేడు మరో వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మరణాలపై ఇటీవల డీఎంఈ రమేష్రెడ్డి విచారణ జరిపినా కూడా వైద్యుల తీరులో మార్పు కనిపించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందలేదని.. నల్లగొండ పట్టణానికి చెందిన కంది బుచ్చిరాములు (50) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది అతడిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. నిమిషాల వ్యవధిలోనే బుచ్చిరాములు మృతిచెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సకాలంలో వైద్యం అందకనే బుచ్చిరాములు మృతిచెందాడంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీనాథ్తో వాగ్వాదం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్పై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. విధులు బహిష్కరించి డాక్టర్ల ఆందోళన సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నా తమపై రోగుల బంధువులు దాడి చేస్తున్నారంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనాథ్పై దాడి చేసిన ఓ వ్యక్తి అక్కడికి రాగా, పోలీసుల సమక్షంలోనే అతడిపై వైద్య సిబ్బంది ప్రతిదాడి చేశారు. అతడి వెంట ఉన్న మహిళలు కాళ్లు పట్టుకుంటామని వేడుకున్నా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిదాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనితారాణి, కోశాధికారి డాక్టర్ రమేష్, ఇతర వైద్యులు.. ఎస్పీ రెమా రాజేశ్వరిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. -
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది. టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు జీజీహెచ్లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వేధింపులు జీజీహెచ్లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
తండ్రితో కలిసి తల్లిని నరికి చంపాడు
నల్లగొండ క్రైం: ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో గంగయ్య, యాదగిరి కలిసి గొడ్డలితో యాదమ్మ తలపై వేటువేశారు. కొనఊపిరితో ఉన్న ఆమెను బంధువులు రాత్రి 11 గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. వివాదానికి కారణమిదీ... సుంకరబోయిన గంగయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె కళావతిని యాదమ్మ తన సోదరుడైన అన్నెపర్తికి చెం దిన పొగాకు శ్రీనుకు ఇచ్చి వివాహం చేసింది. కుమారుడు యాదగిరికి వివాహం కాగా, అతని కుటుంబంలో శ్రీను కారణంగా వివాదాలు తలెత్తి భార్యాభర్తలు విడిపోయారు. యాదగిరికి మరోసారి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా.. శ్రీను వాటిని చెడగొట్టేవాడు. దీంతోపాటు వ్యవసాయ భూమిలో వాటా కోసం శ్రీను కోర్టులో కేసు వేశాడు. తర్వాత వాటా కు అంగీకారం కుదరడంతో కేసు విరమించుకున్నాడు. నల్లగొండలో ఉన్న ప్లాట్ను యాదమ్మ తన పెద్ద కుమార్తె కుటుంబసభ్యులకు ఇచ్చింది. తర్వాత ఆమె భర్త వద్ద ఉండకుండా పెద్ద కుమార్తె అత్తగారితో కలసి ఉంటోంది. కుమారుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడ టం.. సోదరుడివైపే ఒత్తాసు పలుకుతుండటంతో కుటుంబం కలహాలు తలెత్తాయి. ఈక్రమంలో భూమిని అమ్మే విషయమై వివాదం చెలరేగడంతో భర్త, కుమారుడు కలిసి యాదమ్మను చంపేశారు. తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారని చిన్న కుమార్తె రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరు చేసిన మెడికల్ కళా శాలలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళాశాల భవన ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులను పూర్తి చేసిన అధికారులు పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 237 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాలలో 32 విభాగాలు.. మెడికల్ కళాశాలలో 32 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో అటానమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్ఎం, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్హెచ్టీసీ, యూహెచ్టీసీ, సైకియాట్రి, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఓపీటీహెచ్, ఓబీజీ, రేడియో డయాగ్నొస్టిస్, అనస్తీషియా, బ్లడ్బ్యాంక్, సెంట్రల్ రికార్డ్, సెంట్రల్లైబ్రరీ, మెడికల్ ఎడ్యుకేషన్,సెంట్రల్ ఫొటోగ్రఫిక్ కమ్ ఆడియో విజువల్, సీఎస్ఎస్డీ, లాండ్రీ, సెంట్రల్ వర్క్షాప్, హాస్పిటల్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ఈఎండీ, మార్చురి, ప్రిన్సిపాల్ ఆఫీస్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీసుల్లో పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు భర్తీ చేయడానికి జీఎఎంఎస్ నం.77ను ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. దీనికి అవసరమైన అన్ని అనుమతులను ఆర్థికశాఖ నుంచి పొందింది. ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయనున్న పోస్టులు ఔట్సోర్సింగ్ పద్ధతిని నియమించే పోస్టుల్లో ముఖ్యంగా డిసెక్షన్ ఆల్ అటెండెన్స్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెన్స్, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, రికార్డు కీపర్, ఆఫీస్ సబార్డినేట్, వ్యాన్ డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్, డార్క్రూం అసిస్టెంట్స్, బ్లడ్బ్యాంక్ టెక్నీషియన్స్, స్టోర్ కీపర్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్, బుక్ బేరర్, హెడ్ దోబీ, దోబీ, ప్యాకర్, కార్పెంటర్స్, బ్లాక్స్మిత్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్ ఫోర్మన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, ఏసీమెకానిక్, మాలి, మానిఫోల్డ్ సూపర్వైజర్, టెలిఫోన్ ఆపరేటర్స్, గ్యాస్ ఆపరేటర్స్, స్ట్రెచర్ బేరర్స్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, వార్డు బాయ్స్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి భర్తీకి త్వరలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు టెండర్లకు కాల్ ఫర్చేసి ఫోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టుల భర్తీకి జరిగే టెండర్లలో పాల్గొనడానికి అనేక ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జూన్లో పోస్టుల భర్తీకి అవకాశం.. జూన్లో ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు మెడికల్ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభించే అవకాశం ఉండడంతో అంతకు ముందుగానే పోస్టులు భర్తీ చేయనున్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. -
ఆరుబయట నరకయాతన
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రాస్పత్రిలో రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించారు. కానీ రోగులవెంట వచ్చే సహాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా నివారించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సకల సదుపాయాలతో 150 పడకల సామర్థ్యంగల ఎంసీహెచ్ను నిర్మించారు. రోజూ 300 నుంచి 500 వరకు గర్భిణులు ఓపి సేవలు పొందుతున్నారు. ప్రసవాల కోసం జిల్లా నలుమూలలనుంచి సమారు 100 నుంచి 150 మంది గర్భిణులు ఇన్పేషంట్లుగా చేరుతున్నారు. ఇంతటి తాకిడి ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రోగులవెంట వచ్చే సహాయకులకు కనీస సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సహాయకుల కోసం గతంలో తడకలతో షెడ్డును నిర్మించారు. ఆది కాస్త గాలికి కూలిపోవడంతో ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. ఎంసీహెచ్లో గర్భిణుల సహాయం కోసం ఒక్కరిని మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారంతా ఉదయం, రాత్రి పూట ఆరుబయట ఎండకు, చలికి ఇబ్బందులు పడాల్సిందే. కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడం వలన నేలపై, బెంచీలపై నిద్రించాల్సి వస్తుందని పలువురు సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుబయటే ఎండకు కూర్చుని భోజనం చేయాల్సి వస్తుందని, కనీసం తాగడానికి తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కోనుక్కుంటున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నీటిట్యాంకు చిన్నది కావడంతో సహయకుల వాడకానికే సరిపోతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంసీహెచ్ను నిర్మించిన పాలకులకు కనీసం సహాయకుల కోసం విశ్రాంతి షెడ్డును నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే షెడ్డును నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. చలికి వణికి పోతున్నాం లోపల పడుకోనివ్వకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నాం. చలికి వణికిపోతున్నాం,. కనీసం ఉండడానికి షెడ్డు కూడా లేకపోవడం అన్యాయం. గర్భిణులకు సహాయంగా వచ్చిన వారు ఎక్కడ ఉండాలి. – పుల్లమ్మ, నార్కట్పల్లి తాగునీరు కొనాల్సి వస్తుంది కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం దారునం. రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కొనుక్కుంటున్నాం. పడుకోవడానికి, కూర్చోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – యాదమ్మ, రాములబండ
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement