-
35 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది!
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కాలరెగరేసింది. మరోసారి టాలీవుడ్ కాలరెగరేసింది. వరల్డ్ సినిమాతో పోటీపడి మరీ ‘రక్తం’ అనే తెలుగు సిన్మా 22వ ‘ఇండీ గేదరింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (అమెరికన్)లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది. ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక–నిర్మాతలు సునీతాకృష్ణన్, రాజేశ్ టచ్రివర్ ఈ సినిమా తీశారు. ఫీచర్ ఫిల్మ్–నిర్మాత సునీతాకృష్ణన్, డైరెక్టర్–రాజేశ్ టచ్రివర్, లీడ్ యాక్టర్–బెనర్జీ, లీడ్ యాక్ట్రెస్–మధుశాలిని, సినిమాటోగ్రాఫర్–రామతులసిలకు నామినేషన్లు దక్కాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్ టచ్రివర్, నటుడు బెనర్జీలతో ఇంటర్వ్యూలు.... ♦ కంగ్రాట్స్ బెనర్జీగారు.... ఎలా అనిపిస్తోంది? థ్యాంక్స్! అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో తెలుగు నటుడికి నామినేషన్ రావడం అరుదైన విషయం. అదీ మన దేశం నుంచి నామినేషన్ దక్కించుకుని హాలీవుడ్ నటులతో పోటీపడుతున్నది నేనొక్కడినే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు, కళామతల్లికి కృతజ్ఞతలు. అలాగే, మా దర్శకుడు రాజేశ్ టచ్రివర్, నిర్మాత సునీతాకృష్ణన్, సహనిర్మాత మున్షీ రియాజ్ అహ్మద్, ‘రక్తం’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ♦ రాజేశ్ టచ్రివర్ ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాలు తీశారు. ఆయన మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరేమైనా ఆలోచించారా? రాజేశ్తో నాకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. నన్ను, నా నటనను నమ్మి ‘రక్తం’లో లీడ్ రోల్కి సంప్రదించారు. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశా. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించి 35 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లూ ఇటువంటి సినిమా చేయాలని, ఇటువంటి పాత్రలో నటించాలని ఎదురుచూశా. నా 35 ఏళ్ల ఆకాంక్ష ‘రక్తం’తో తీరింది. ♦ మీరు కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంటారు. ఓ ఆఫ్–బీట్ సినిమా చేయడం రిస్కేమో అనుకున్నారా? నటులెప్పుడూ మంచి క్యారెక్టర్స్ వస్తే ఎగ్జయిటవుతారు. తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. నేనూ అంతే. ఎవరూ డబ్బు గురించి ఆలోచించరు. ముఖ్యంగా నేను! 30 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఎన్నో పాత్రలు చేశా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి నామినేషన్ వచ్చేంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ వస్తే ఎందుకు వదులుకుంటాను? నన్ను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లే పాత్ర ఇది. కెరీర్పై ఎఫెక్ట్ చూపిస్తుందేమో? రిస్కేమో! అనుకోలేదు. ‘రక్తం’ చూశాక దర్శక–రచయితలు నా కోసం మరిన్ని మంచి పాత్రలు రాస్తారని నమ్ముతున్నా! ♦ ∙‘ప్రాణాలు తీయడం ద్వారా విప్లవం తీసుకురాలేం’ అనే కథాంశంతో ‘రక్తం’ తీశానని రాజేశ్ టచ్రివర్ చెప్పారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఓ దళానికి నాయకుడిగా కనిపిస్తా. అందులో యువతీయువకులు, వయసైనవారు, బాగా చదువుకుని మంచి భావాలతో వచ్చినవారు... ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. మధ్య ఎవరైనా మరణిస్తే ‘అయ్యో పాపం’ అని కొందరు అంటే... ఏది ఏమైనా హైకమాండ్ అప్పగించిన పనిని పూర్తి చేయాలని మరికొందరు అంటారు. వాళ్లకు పరిస్థితులు అర్థమయ్యేలా వివరిస్తూ, అందర్నీ సమన్వయం చేసే పాత్ర. ఈ క్రమంలో మన విప్లవాన్ని ప్రజలు వ్యతిరేకించేలా, అసహ్యించుకునేలా ఉండకుండా చూసుకునే పాత్ర. ♦ మీరు ఎంతో అనుభవమున్న నటుడు... రాజేశ్ టచ్రివర్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాదు. సెట్లో మీ ఇద్దరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆయన ప్రతి సీన్ డిస్కస్ చేసి, నటించి చూపించమనేవారు. నచ్చితే బాగుందనే వారు. ఒకవేళ చిన్న చిన్న మార్పులుంటే చెప్పేవారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా నుంచి ‘ది బెస్ట్ యాక్టింగ్’ తీసుకున్నారు. దర్శకుల్లో కమర్షియల్, ఆఫ్ బీట్ తేడాలు ఉండవు. నటీనటుల ప్రతిభను తెరపైకి తీసుకొచ్చేది వాళ్లే. ‘అంతా నాకే వచ్చు’ అనుకుంటే నా నటనలో మొనాటనీ వచ్చేస్తుంది. దర్శకులు చెప్పింది చేశాను కాబట్టే.. ఇన్నేళ్లుగా వైవిధ్యమైన పాత్రలు చేయగలిగాను. ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు సినిమా రంగంలో కొత్త మార్పులొస్తున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? ♦ కంగ్రాట్స్ రాజేశ్గారు... ఐయామ్ హ్యాపీ! ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడుతూ ఓ తెలుగు సినిమాకు అవార్డు రావడం, నటీనటులకు నామినేషన్స్ రావడం పెద్ద విషయమే కదా. ఆనందంగా ఉంది. ♦ ‘రక్తం’ కథేంటి? ఈ సినిమాలో మీరు ఏం చెబుతున్నారు? ఫ్రెంచ్ తత్వవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆల్బర్ట్ కామ్స్ 1949లో రాసిన ‘లెస్ జస్టిస్’ నాటకం స్ఫూర్తితో ‘రక్తం’ తీశా. అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదనిపించింది. చత్తీస్ఘడ్లో గతేడాది కొందరు పోలీసులను మావోయిస్టులు చంపేశారు. విప్లవం పేరుతో పలు దేశాల్లో ఇటువంటి మారణహోమాలు జరుగుతున్నాయి. ఓ మనిషిని చంపడం ద్వారా విప్లవం తీసుకురాలేరనే సందేశంతో ‘రక్తం’ రూపొందించా. చంపకుండా కూడా విప్లవం తీసుకురావొచ్చు. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? అనేది నా ప్రశ్న. ♦ ‘నా బంగారు తల్లి’, ఇప్పుడీ ‘రక్తం’... ఓ సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలే తీస్తున్నారెందుకు? నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంది. గద్దర్గారు పాట ద్వారా, జర్నలిస్టులు వార్తల ద్వారా, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పద్ధతుల ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఓ దర్శకుడిగా నా సినిమాల ద్వారా ప్రజలకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ, సెన్సిబిల్ సిన్మాలు తీయాలనేది నా నిర్ణయం! ♦ ‘నా బంగారు తల్లి’కి వచ్చిన అవార్డులు–రివార్డులు పక్కన పెడితే, ప్రేక్షకుల స్పందన పట్ల మీరు హ్యాపీనా? మూడు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు, పదిహేను అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. థియేటర్లలో 25 రోజులు ఆడింది. టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్కో నెల్లో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేశారు. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి! ♦ ‘రక్తం’ సిన్మాను ఎప్పుడు విడుదల చేస్తారు? మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఇంకా బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కు సిన్మాను పంపించాలనుకుంటున్నా. -
'నాబార్డ్ నుంచి రాయితీలు రావడం కష్టమే'
ఒంగోలు: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కాబ్కు నాబార్డు నుంచి రాయితీలు రావటం కష్టంగా మారిందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం సదస్సులో పిన్నమనేని మాట్లాడుతూ... ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఆప్కాబ్కు ఉంటే నాబార్డు నుంచి రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రూ.7 వేల కోట్లు, తెలంగాణలో రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు నాబార్డు నుంచి రాయితీలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారు. -
'నా బంగారు తల్లి'కి వినోద పన్ను మినహాయింపు
హైదరాబాద్: నా బంగారు తల్లి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవమైన కథను ఆధారంగా చేసుకుని హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ ద్వారా వచ్చిన 'నా బంగారు తల్లి' సినిమా ప్రేక్షుకులను ఎంతో ఆకట్టుకుంది. వ్యభిచార ముఠా చేతిలో చిక్కిన యువతి కష్టాలు పడటం, అలాగే అక్కడినుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించే సన్నివేశాలను దర్శకులు బాగా తెరకెక్కించారు. ఈ సినిమా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అదే నా లక్ష్యం : రాజేశ్ టచ్రివర్
తెలుగు సినిమాలపై అభిమానంతో హైదరాబాద్లో స్థిరపడ్డ మలయాళీ... రాజేశ్ టచ్రివర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. రీసెంట్గా ఆయన తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రం మూడు జాతీయ అవార్డులను, అయిదు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్న రాజేశ్ టచ్ రివర్తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ‘నా బంగారు తల్లి’ ఆలోచన ఎవరిది? తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యథార్థ గాథ ఇది. వ్యభిచార వృత్తిలో నలిగిపోతున్న స్త్రీలకు విముక్తిని కల్పించడమే లక్ష్యంగా నా భార్య సునీత కృష్ణన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి 20 వేల మంది స్త్రీలకు విముక్తిని అందించడం జరిగింది. ఈ 20వేల మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో మా ఇద్దరి మనసుల్ని కదిలించింది ఓ కథ. దాన్ని అందరికీ చెప్పాలనిపించింది. నిజానికి ఈ కథను సినిమాగా చేస్తే... కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీయాలి. కానీ... ఎలాంటి అసభ్యత లేకుండా, అందరూ చూసేలా సినిమా తీయాలని నా భార్య సూచించింది. తను చెప్పినట్లే... ఆ కథను ‘నా బంగారు తల్లి’గా తీశాను. సమాజానికి పెను ప్రమాదంగా సంభవించిన అక్రమ రవాణా అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. సామాజిక సంస్కరణలో మార్పు మన నుంచే మొదలవ్వాలని ఇందులో చెప్పాను. సినీ ప్రముఖులందరూ ఈ సినిమా చూసి అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే తీస్తారా? అలాంటిదేం లేదు. యువతరం కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నా. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. వచ్చే నెలలో ఆ సినిమా మొదలవుతుంది. దర్శకునిగా నా లక్ష్యం ఒక్కటే. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తా. ప్రేమ, యాక్షన్.. ఈ రెండిటి చుట్టే తెలుగు సినిమా తిరుగుతుంటే... మీరు అందుకు భిన్నంగా సామాజిక విలువలతో కూడిన సినిమా తీశారు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి సినిమాలొస్తుంటాయి. మీరు మలయాళీ కావడం వల్లే ఇలా ఆలోచించారని అనొచ్చా? అలాంటిదేం లేదండీ... ఇది తెలుగు నేలపై జరిగిన కథ. అసలు నేను దర్శకుణ్ణి అయ్యింది తెలుగు సినిమాలు చూసి. చిరంజీవి, కె.రాఘవేంద్రరావుల చిత్రాలు కేరళలో అనువాదమయ్యేవి. అవి చూసే.. సినిమాలపై నాకు ఇష్టం పెరిగింది. లండన్లో డెరైక్షన్పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాలోని ప్రతిభ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత 1996లో యానిమేషన్ మేకింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నా. కేరళ నా మాతృభూమి అయితే... తెలుగునేల నా కర్మభూమి. తెలుగు సినిమాతో మీ అనుబంధం? కళా దర్శకుడు అశోక్కుమార్గారి వద్ద సహాయకునిగా ఇక్కడ నా కెరీర్ మొదలైంది. చిరంజీవిగారి ‘మాస్టర్’కి తొలిసారి అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్గా చేశా. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు చిత్రాలకు కూడా పనిచేశాను. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ఆర్ట్ డెరైక్టర్గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్రానికి కూడా నేనే ఆర్ట్ డెరైక్టర్ని. చివరి ప్రశ్న... మీ మెడలో ఆ వెరైటీ హారం ఏంటి? ఆ హారం వయసు 460 సంవత్సరాలు. అది నా మెడలో గమ్మత్తుగా చేరింది. కొనేళ్ల క్రితం మధ్యప్రదేశ్లో భవానీమాత ఆలయానికి వెళ్లాను. అక్కడ గుంపుగా వెళుతున్న పదిహేనుమంది సాధువులు... నన్ను చూసి ఆగి ‘ఇది అతి పురాతనమైన అమ్మవారి నగ. ధరించు.. నీకు శుభం జరుగుతుంది’ అని నా మెడలో వేసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇది నా శరీరంలో భాగమైంది. నన్ను కలిసిన చిన్న పరిచయస్తులు కూడా... మొదట అడిగే ప్రశ్న... ‘మీ మెడలో అదేంటండీ?’ అని. ఇప్పటివరకూ ఎంతోమందికి చెప్పినా... మొత్తానికి మీ ద్వారా అది ప్రపంచానికి తెలుస్తున్నందుకు సంతోషం. -
సిగ్గుగా ఉంది!
‘‘ఇదొక కళాఖండం. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు సమాజానికి చాలా అవసరం’’ అని కథానాయిక సమంత అన్నారు. ఆమె చెబుతున్నది ‘నా బంగారు తల్లి’ చిత్రం గురించి. రాజేశ్ టచ్రివర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సమంత ‘ఇప్పటివరకు ఇలాంటి చిత్రంలో నటించనందుకు సిగ్గుగా ఉంది’ అని పేర్కొనడంతో పాటు, ఇది అందరూ చూడదగ్గ చిత్రం అని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెరరూపం ఇస్తే, ఆర్ట్ సినిమాలా ఉంటుందేమో అని ఎక్కువమంది చూడరు. అందరికీ ఈ సందేశం చేరాలనే నా వంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నా. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. అయితే ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిటైర్ అయ్యేలోపు ఇలాంటిది ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది’’ అన్నారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement