-
దాసీపై మాస్పతాస్త్రం
దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్. కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు. ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి. తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది. కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి. చెరవీడినవారికి.... దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ స్వయం ఉపాధి కూడా... ‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. - సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి -
పరుగులు నిలబెట్టాయి
లత. పుణె. వయసు అరవై పైనే! సుధ... హైదరాబాద్. వయసు? వయసిక్కడ పాయింట్ కాదు. సుధ యాక్సిడెంట్ అయిన మనిషి. వెన్నుపూసలకు గాయాలు! కాలి చీలమండల్లో రాడ్లు! లత ఎవరో, సుధ ఎవరో. కామన్ పాయింట్ మాత్రం ‘పరుగులు’. మామూలు పరుగులు కావు. జీవితం పెట్టించిన పరుగులు. భర్త ప్రాణాలు దక్కించుకోడానికి లత... అరైవె ఏళ్ల మహిళలిచ్చిన స్ఫూర్తితో సుధ... ‘మారథాన్’ బరుల్లోకి దిగారు. విజేతలుగా నిలబడ్డారు. ‘ఐదునెలల దాకా మంచం దిగకూడదు. నడవడానికి ఏడాది పైనే పడుతుంది. ఆ తర్వాత కూడా బరువులు ఎత్తకూడదు. పరుగెత్తకూడదు’ డాక్టర్లు చెప్పిన మాటలు చెవిలో పడగానే మరోసారి రెండంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడిపోయినట్లు అనిపించింది సుధకు. మామూలు మనిషి అవ్వడం గగనం అంటున్న డాక్టర్ మాటల్ని లెక్కచేయకుండా ఆమె సాధించిన విజయాల్ని చూస్తుంటే మనిషికి మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదనిపిస్తుంది. గత పదిహేనేళ్ల సుధ జీవితంలోకి చూస్తే ప్రమాదాలకు భయపడాల్సిన పని లేదనిపిస్తుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్నేహితురాలు కొనుక్కున్న ఫ్లాట్ చూడ్డానికి నేను, నా భర్త చంద్రశేఖర్ వెంగళరావునగర్ వెళ్లాం. నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు. రెండోఅంతస్తు దాకా ఎక్కి, వెనక్కి తిరిగి చూస్తూ కింది మెట్టు మీదకు అడుగేశాను. మెట్లకు రెయిలింగ్ లేకపోవడం వల్ల కిందకు పడిపోయాను. రెండురోజులదాకా స్పృహ లేదు. తెలివి వచ్చాక డాక్టర్లు చెప్పిన మాటలు వింటే మళ్లీ నిద్ర పట్టలేదు. కానీ ధైర్యం కూడగట్టుకున్నాను. ఐదు నెలలు గడిచాక మెల్లగా నడవడం మొదలుపెట్టాను. వెన్ను చివర (ఎల్2, ఎల్2, ఎల్3, ఎల్5 డిస్క్లు) వీపుమీద చెయ్యిపెట్టి తడుముతుంటే బయటికి వచ్చినట్టు తగిలాయి. కాలు చీలమండ దగ్గర రాడ్స్ వేశారు. జాగ్రత్తగా ఉండాలన్నారు డాక్టర్లు. మరోపక్క అధికంగా బరువు పెరిగా. గాయాల సంగతి పక్కన పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుని వాకింగ్ మొదలుపెట్టాను. క్రమంగా బరువు తగ్గాను. అయినా వాకింగ్ మానలేదు. అదే నా కొత్తజీవితానికి పునాది వేసింది. స్వచ్ఛంద సేవకు వెళ్లి... నాకు ప్రమాదం జరిగిన తర్వాత మేం దక్షిణాఫ్రికా వెళ్లి తొమ్మిదేళ్లు ఉండి వచ్చాం. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2009లో హైదరాబాద్ వచ్చేశాక, వాకింగ్పై దృష్టి పెట్టాను. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్ రన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మారథాన్ పోటీలు చూడ్డానికి వెళ్లా. ఆ మారథాన్లో యాభై అరవై ఏళ్ల వయసున్న మహిళల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలో ఎయిర్టెల్వారు మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిసి అందులో పాల్గొన్నాను. ఆఫ్ మారథాన్ అంటే ఇరవై ఒకటిన్నర కిలోమీటర్లు రెండున్నర గంటల్లో పరిగెట్టాను. మధ్యలో నాలుగైదుసార్లు వెన్ను నొప్పి వచ్చింది. కాలు కూడా నొప్పి పెట్టింది. రెండు నిమిషాలు పరుగు ఆపి నడకలోకి వచ్చి మళ్లీ మొదలెట్టి మెడల్ సంపాదించాను. ఇది జరిగింది 2011లో. ఆ తర్వాత మరో మారథాన్లో కూడా పాల్గొన్నాను. మారథాన్ వల్ల నా ఒంట్లో గాయాలు ఎక్కువవుతాయని డాక్టర్లు చెబుతుంటే...నేను మాత్రం ఆ గాయాలకు అదే మందని నమ్మాను. పద్దెనిమెది మెడల్స్తో... మారథాన్కంటే ముందు హైదరాబాద్ రన్నర్ క్లబ్లో సభ్యురాలిగా చేరాను. దాంతో దేశంలో ఎక్కడెక్కడ మారథాన్లు జరుగుతున్నాయో సభ్యుల ద్వారా తెలిసేది. అప్పుడప్పుడు వారితో కలిసి ఎక్కడ మారథాన్ ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని. ఆ తర్వాత దేశంలో ఎక్కడెక్కడ మారథాన్ పోటీలు జరుగుతున్నాయో తెలుసుకుని ఒంటరిగా వెళ్లడం కూడా మొదలుపెట్టాను. పునె, భువనేశ్వర్, సతార, పాండిచ్చేరి, హిమాలయ, చెన్నై, గోవా, తంజావూర్, కోయంబత్తూర్...ఇలా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్లో పాల్గొని 18 మెడల్స్ మెడలో వేయించుకున్నాను. ఇల్లు... వాకిలి గత ఏడాది పన్నెండు మారథాన్లలో పాల్గొన్నాను. నా భర్త, నా పిల్లలు నా గెలుపుని బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్దమ్మాయి స్నిగ్ద కరాటే బ్లాక్ బెల్టర్. చిన్నమ్మాయి సమీర మూడోతరగతి చదువుతోంది. మారథాన్ నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా కొత్త లక్ష్యం సైక్లింగ్. అందులో కూడా ఊహించని విజయాలు చూడాలన్నది నా కోరిక. ఒక పక్క గాయాలు నన్ను వేధిస్తున్నా...వాటిని అధిగమించడానికి వైద్యుల సలహాలకంటే ఈ పరుగుపందాలే ఎక్కువ ఉపశమనం ఇస్తున్నాయి. ఈ పదిహేనేళ్లలో జీవితం నాకు నేర్పింది పడడం, లేవడం ఒక్కటే కాదు. గాయాన్ని లెక్కచేయకపోవడం. అది మనసుకైనా, శరీరానికైనా. మరో ముఖ్యమైన విషయం మహిళ జీవితంలో తనకంటూ కొంత చోటు ఏర్పాటుచేసుకోవాలి. అందులో తల్లితండ్రులు, పిల్లలు, భర్త, సమాజం... అంటూ ఏమీ ఉండకూడదు. అందులో జీవిత లక్ష్యాలు, ఇష్టాలు, అవసరాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రోజులో ఒక పది నిమిషాలు అలా ఉండగలిగినా ఆమెలోని శక్తి పూర్తిస్థాయిలో బయటికొస్తుంది’’ అని ముగించారు సుధ. కష్టాల్లోనూ కుంగిపోక ధైర్యంగా ముందడుగు వేసిన ఆమె అడుగుల వేగం ఇంకా పెరగాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి; ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ ఒకసారి ఏమైందంటే... హిమాలయాలకు వెళ్లినపుడు అనుకోకుండా ఒక కొండదగ్గర దారి తప్పాను. వారిని వెతికే ప్రయత్నంలో కాలు జారి లోయలో పడిపోయాను. నా ఫోన్ సిగ్నల్ సరిగా లేదక్కడ. ఎంత అరిచినా ఎవరూ రావడం లేదు. నా గ్రూప్వారంతా నాకోసం వెతుకుతున్నారు. ఇంతలో సిగ్నల్ దొరికింది. నా తోటివారికి ఫోన్చేశాను. వాళ్లొచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. ఆ దెబ్బతో మారథాన్కి బ్రేక్ పడుతుందనుకున్నారంతా. నేను మాత్రం థ్రిల్లింగ్గా ఫీలయ్యాను. మారథానక్ ఆపలేదు సరికదా, ఈ మధ్యనే సైక్లింగ్ కూడా చేయాలనిపించి ప్రాక్టీస్ మొదలెట్టాను. రోజూ ఉదయం ఎనిమిది కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాను. *************** కూలినాలి చేసుకునే ఆమెకు మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియదు. భర్త ఆరోగ్య పరీక్షలకు కావలసిన ఖర్చులే కళ్లముందున్నాయి. పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. అడుగులు వడివడిగా పడేలా చూసింది. భర్తపై ఉన్న అనురాగమే అరవై ఏళ్ల ఆమెను మారథాన్లో గెలిపించింది. ఆమే పుణేకు చెందిన లతా కారే. ఓ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది. కట్టుకున్న భర్త కోసం మారథాన్లో తీసిన పరుగు, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సాహసం మహిళలకు ఆదర్శంగా నిలబెట్టేలా చేసింది. భర్త మీద ఉన్న అనురాగం, ఆరు పదులు దాటిన వయసులో పరుగెత్తేలా చేసింది. మారథాన్ అంటేనే తెలియని ‘లతా కారే’ పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తకు వైద్యపరీక్షలు చేయించేందుకు 5000 రూపాయల కోసం పరుగెత్తిన ఆమెను ఆదుకునేందుకు అనేక ఆపన్నహస్తాలు ముందుకువ చ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్థానిక పాత్రికేయులు ఆమె పేరుపై బ్యాంకు అకౌంట్ ప్రారంభించారు. వారం తిరగకుండానే మూడు లక్షల రూపాయలకు పైగా ఆమె ఖాతాలో జమయ్యింది. ఇంకా జమ అవుతూనే ఉంది. బుల్డానా నుంచి దాంపత్య జీవనం ప్రారంభం... వాషీంజిల్లాకి చెందిన లతాకు భగవాన్తో వివాహం జరిగింది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ పథకం పనులతో సహా ఏ పని లభిస్తే ఆ పనిచేస్తూ వీరు జీవితం గడపసాగారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిల్లలకు చదువు చెప్పించాలనుకున్నారు. కాని వచ్చే కూలి డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ... ఎలాగైతేనేం... పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఆ తర్వాత పనులు దొరకడం కష్టమైంది. బారామతికి... బారామతిలో పని లభిస్తుందని తెలిసి, నాలుగేళ్ల కిందటే పొట్ట చేత పట్టుకుని అక్కడికి మకాం మార్చారు. కుటుంబమంతా కూలి చేస్తున్నప్పటికీ వీరి సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేదికాదు. ఇంతలో లతాభర్త భగవాన్కు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఆమె భర్తకు ఎంఆర్ఐ తదితర పరీక్షలు చేయాలని, ఇందుకోసం మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆదర్శంగా నిలబడింది... పుట్టెడు కష్టంలో ఉన్న లతాకు... శరద్పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ల కోసం 2013 డిసెంబరు 16న ‘శరద్ మారథాన్’ పేరుతో, బారామతిలో 3 కిలోమీటర్ల పరుగుపందెం ఏర్పాటుచేశారని, తాము కూడా ఆ పోటీలో పాల్గొంటున్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో పరుగుపందెంలో పాల్గొంటే 5000 రూపాయలు గెలవచ్చన్న ఆశ కలిగింది. ప్రేమ, పట్టుదలలే గెలిపించాయి... కూలినాలి చేసుకునే ఆమెకు, మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా, పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. కాని కుటుంబసభ్యులు ‘ఈ వయసులో పరుగెత్తడం ఏమిటి’ అని వారించారు. మారథాన్ మరో రెండురోజుల్లో ఉందనగా ఆమెకు జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ వెళ్లవద్దని ఆమెపై ఒత్తిడి పెంచడంతో, సరే అంది. ఆ రాత్రికి ఊరుకుని, మరుసటి రోజు ఉదయం, జ్వరానికి మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి, సరాసరి మారథాన్ జరిగే స్థలానికి వె ళ్లింది. మారథాన్లో అందరూ ఒక్కసారిగా పరుగు ప్రారంభించారు. లతా కూడా పరుగు తీయడం ప్రారంభించింది. కాళ్లకు చెప్పులు లేకుండా తొమ్మిది గజాల చీరతో మారథాన్ రేసులో పరుగెత్తుతున్న ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ఇవేవీ పట్టించుకోకుండా తన భర్త వైద్యపరీక్షలను తలుచుకుంటూ నెత్తిపై కొంగుకప్పుకుని ఎలాగైనా ఈ రేసులో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లసాగింది. అంతలోనే ‘మారథాన్ విజేత లతా కారే’ అనే ప్రకటన వెలువడింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. భర్త వైద్య పరీక్షల కోసం మారథాన్లో పాల్గొని, విజేతగా నిలవడంతో మీడియాతోపాటు ప్రజలు కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. నిర్వాహకులు ఐదు వేల రూపాయల నగదును బహుమతిగా ఆమెకు అందించారు. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంైబె మారిన జీవన శైలి... మారథాన్ రేసు లతాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థానికంగా ఉన్న ప్రదీప్ గురవ్ (దివ్య మరాఠి), జితేంద్ర జాదవ్ (ఐబిఎన్ లోకమత్) అనే ఇద్దరు పాత్రికేయులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారామతి శాఖ అధికారి కులకర్ణి సహకారంతో ఆమె పేరుపై అకౌంట్ ప్రారంభించారు. దీంతో అనేక ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి. వారం తిరగకుండానే సుమారు మూడువందల మందికిపైగా సుమారు రూ. మూడు లక్షల వరకు జమ చేశారు. తనకు, తన కుటుంబానికి సహకారం అందించి ఆదుకున్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
మాట మందుగుండు పాట మహిళాదండు
వీధి మొహం చూడకుండా... ఎన్నాళ్లు బతుకులీడుస్తారు?! ఎంత మందుగుండు సామగ్రి ఉందీ మాటలో! దబదబా ఇల్లూవాకిలి ఊడ్చేసి గబగబా వంటావార్పూ చేసేసి చకచకా పిల్లల్ని బళ్లోకి తోలేసి ఉన్న కోకనే శుభ్రంగా చుట్టేసుకుని ‘ఏమయ్యో! క్యాంపుకెళ్లొస్తా’ అని పరుగులు పెట్టించేంత మందుగుండు! నర్సమ్మ మాట, పాట కూడా ఇలాగే... దట్టించిన శతఘు్నల్లా ఉంటాయి. ‘‘ప్రపంచం మారాలీ అంటే, మహిళను బయటి ప్రపంచాన్ని చూడనివ్వాలి’’ అంటున్న నర్సమ్మ... మొదట ఎలాంటి జీవితాన్ని చూశారు? గరళాన్ని వదిలి, ఎలా తన గళాన్ని సవరించుకున్నారు? చదవండి... ఈవారం ‘జనహితం’లో. పాతికేళ్ల క్రితం... నర్సమ్మ పాడే పాటలు వింటుంటే... పల్లెలలో పేదరికంతో కాపురం చేస్తున్న మహిళలు గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆ పాటలలో పల్లె పడుచుల జీవన విధానం నిండి ఉండేది. నర్సమ్మ ఇప్పుడు కూడా పాడుతోంది. కాని వాటిలో మునుపటి భావాలు లేవు. ఆమె గొంతులో ఒక చైతన్యం ఉంది. ఒక ఆశయం ఉంది. ప్రతి మహిళ చదువుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తన గళంలో పలుకుతోంది. నర్సమ్మది మెదక్ జిల్లా పుల్కల్ మండలం బసపూర్ గ్రామం. ఆటపాటలతో గడపవలసిన వయసులోనే అత్తింటిలో అడుగుపెట్టింది. అక్కడ వేధింపులు తట్టుకోలేక పుట్టిల్లు చేరింది. నర్సమ్మది నిరుపేద కుటుంబం. పని చేసినరోజు పొట్ట నిండుతుంది. లేదంటే పస్తులుండాల్సిందే. అటువంటి నేపథ్యంలో నుంచి, ఏం జరిగిందో ఏమో కాని ఆమె కల్లు కాంపౌండ్ పంచన చేరింది. అక్కడే పని చేస్తూ, కడుపునిండా కల్లు తాగుతూ, ఆశలు చిగర్చని మోడులా మిగిలింది నర్సమ్మ. అంతటి వెనుకబాటుగా ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉన్న ఆమె, ఈరోజు తోటి మహిళలకు అండగా నిలుస్తోంది. వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడానికి తన వంతు కృషి చేస్తోంది. నర్సమ్మ తల్లిదండ్రులు కూలిపని చేసి జీవించేవారు. ఆమెకు ముగ్గురు అన్నలు, ఒక చెల్లి. వీరంతా రోజు కూలీలే. కల్లు కాంపౌండ్ దగ్గర, టీ కొట్టు దగ్గర పనిచేసుకుంటూ బతికే నర్సమ్మ కల్లుకి బానిసైపోయింది. వద్దని తల్లి ఎంత చెప్పినా, ఆమె మాటను కూడా లెక్కచేసేది కాదు. పెళ్లికి ముందు నర్సమ్మ గేదెల్ని తోలుకెళ్లి, గడ్డి మేపేది. నెత్తికి ఒక వస్త్రం చుట్టుకుని, చేతిలో కర్రను భుజాన వేసుకుని ఆమె పాటలు పాడుతుంటే వ్యవసాయ కూలీలు ఎంతో ఆసక్తిగా వినేవారు. నర్సమ్మ స్వరం మాత్రమే కాదు, అప్పటికప్పుడు కల్పించుకుని పాడే సాహిత్యం కూడా అందరికీ బాగా నచ్చేది. అప్పటికి నర్సమ్మకున్న ఏకైక ఆస్తి ఆమె పాటలే. పెళ్లి తర్వాత ఛిద్రమైపోయిన సంసారం, కల్లు కాంపౌండ్తో జతకట్టడంతో... అందరూ నర్సమ్మ జీవితం నాశనమైపోయిందనుకున్నారు. ఇక తల్లిదండ్రుల బాధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సమయంలో మహిళలల్లో చైతన్యం తేవడానికి ఆ ఊళ్లోకి మహిళా సమతా సొసైటీవారొచ్చారు. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని నర్సమ్మతోపాటు ఆ గ్రామంలోని మహిళలంతా వ్యతిరేకించారు. ‘మాకు చదువెందుకు? మేం చదువుకుని ఏం చేయాలి? ఏదన్నా పనుంటే ఇప్పించండి. అంతేగాని చదువు, చైతన్యం ఇవేమీ మాకొద్దు’ అని తిప్పికొట్టారు. అయినా పట్టువిడవకుండా సమతా సొసైటీ వారు అక్కడి మహిళలందరికీ నచ్చజెప్పారు. అలా ఆరుగురు సభ్యులతో సమతాసొసైటీని ఏర్పాటుచేశారు. నర్సమ్మ పాటలు, ఉన్నదున్నట్లు ధైర్యంగా మాట్లాడే తీరుచూసి ఆ సొసైటీకి నర్సమ్మనే లీడర్ని చేశారు. అంతే! అక్కడి నుంచి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అక్షరాస్యత శిబిరాలు... విద్య, ఆరోగ్యం, పంచాయితీ, వ్యవసాయం, సామాజిక సమస్యలు...అంటూ ఐదు అంశాలపై పోరాడే సమతా సొసైటీలో చదువు నేర్చుకున్న నర్సమ్మ ఆ గ్రామానికి సంస్థ తరఫున నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. దాంతో ఆమె రూపురేఖలు, హావభావాలు, ఆలోచనలు అన్నీ మారిపోయాయి. విమానమెక్కిన వేళ... గ్రామ, మండల, జిల్లా స్థాయి దాటి రాష్ర్టస్థాయి మహిళా సొసైటీ మీటింగ్లకు హాజరవ్వడం మొదలయ్యాక నర్సమ్మలో ఉద్యమలక్షణాలు బయటపడ్డాయి. ‘వీధి మొహం చూడకుండా ఎన్నాళ్లిలా బతుకులీడుస్తారు’ అని తన పాటల ద్వారా పల్లె మహిళల్ని నిలదీయడం మొదలుపెట్టింది. పేద బతుకులకు తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ జీవితం బరువు తెలియదు. అందుకే పంచాయితీలు తీర్చే బాధ్యతను ఎంచుకుంది. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ మహిళలకు కౌన్సెలింగ్ చేసింది. తన జీవితాన్ని సాక్ష్యంగా చూపి మరీ వారిని ఓదార్చింది. నర్సమ్మ పాటలకు, పాఠాలకు మహిళలెక్కువగా ఆకర్షితులవుతున్న విషయం గమనించిన ‘మహిళా సమతా’ నిర్వహకులు... నర్సమ్మను ఢిల్లీ పర్యటనకు కూడా పంపారు. ‘‘మీది మోటారును (విమానాన్ని) చూడడం అదే మొదటిసారి. దానిపై ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్కి వెళ్లినపుడు నాకు చాలా ఆనందం వేసింది. దానిలో కూర్చున్నంతసేపు చిన్నప్పుడు బర్రెలు మేపుతున్నప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించిన మోటార్లే గుర్తుకొచ్చాయి. ఈ సొసైటీ పుణ్యమాని అది ఎక్కే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్లో మన రాష్ర్టంలో మహిళలకు సంబంధించిన సామాజికాంశాలపై పావుగంటసేపు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటి ఉపరాష్ర్టపతి కృష్ణకాంత్ భార్య సుమన్ కృష్ణకాంత్ పక్కనే కూర్చోవడం నాకు సంతోషం కలిగించింది’’ అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పారు నర్సమ్మ. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. కాని వాటి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, బతుకుల్ని బాగుచేసుకునే పేదమహిళలే చాలా అరుదు. నర్సమ్మలో ఉన్న పట్టుదల అందరిలోనూ కనిపించదు. నెలకు రెండు జిల్లాలు చొప్పున 14 జిల్లాల్లో నర్సమ్మ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అక్కడ మాటలకంటే ఎక్కువగా ఆమె పాటలే వినిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, మహిళల ఆలోచన తీరుని బట్టి, క్షణాల్లో పదాలు కట్టి, పాటలు పాడి, తోటిమహిళల్ని తన చైతన్య రథంలోకి ఎక్కించుకుంటున్న నర్సమ్మకు హ్యాట్సాఫ్ చెబుదాం. - భువనేశ్వరి, ఫొటోలు: పి.గురివిరెడ్డి సమత వారు నన్ను మెచ్చుకుంటున్న ప్రతిసారీ, ఇరవైఏళ్ల కిందటి నా గతం గుర్తుకొస్తుంటుంది. కల్లు తప్ప నాకు వేరే లోకం ఉండేది కాదు. మహిళా సమతా సొసైటీలో చేరాక తోటిసభ్యులు. నా చేత కల్లు మాన్పించి, ఉపాధి, ఇల్లు, చదువు, మీటింగ్లు... అంటూ నన్ను ఒక జీవితంలోకి తోసేశారు. అప్పటికి నాకు తెలిసింది... పాటలు పాడటాన్నే ఆయుధంగా మలిచి మహిళా సమతకు పేరు తేవాలని. మహిళా చైతన్యం, మహిళలపై వేధింపులు, కష్టాలు...అన్ని అంశాలకు సంబంధించి జానపద గీతాలను సేకరించేదాన్ని. చాలావరకూ నేను సొంతంగా పాటలు రాసుకునేదాన్ని. ఎక్కడ సమతా మీటింగ్లు పెట్టినా నా గళం వినిపించేదాన్ని. - నర్సమ్మ -
ఒక చేత వెన్నముద్ద ఒక చేత యుద్ధవిద్య
నిరుడు ఇదే సమయానికి - ఈ కొయ్యబారిన చలిరోజుల్లో... యావద్దేశం సలసల మరిగిపోతున్న రక్తంతో ‘నిర్భయ’ కోసం నినదిస్తూ ఉంది. ఆమె బతకాలని క్షణం విరామం లేకుండా ప్రార్థిస్తూనే ఉంది! ఇప్పుడు నిర్భయ లేదు. నిర్భయ చట్టం ఉంది. చట్టం ఉంది. కానీ నిశ్చింత లేదు! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఘటన! పార్లమెంటు చట్టం చేస్తుంది కానీ... పాఠశాల వరకూ తోడు రాలేదు. పోలీస్స్టేషన్లు ఉంటాయి కానీ... ఆఫీస్లో పక్కనే వచ్చి కూర్చోవు. ఎలా మరి? చదువు కోసం, కొలువుల కోసం ఆడపిల్లలు బయటికి వెళ్లిరావడం ఎలా? ఏ కవచాలు వారిని కాపాడతాయి? కవచాలు అక్కర్లేదు... కరములు చాలు అంటోంది బాలల హక్కుల సంఘం. అనడం మాత్రమే కాదు... స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతోంది. అంతకన్నా ముందు... ధైర్యమే మీ తొలి ఆయుధం అని నూరిపోస్తోంది. కనీసం వెయ్యి విద్యాలయాలలో బాలికలకు, యువతులకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలని కంకణం కట్టుకున్న ఈ హక్కుల సంఘం బృహత్తర ప్రయత్నమే ఈవారం ‘జనహితం’. ఆడపిల్ల బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయంభయంగా ఎదురుచూసే రోజులివి. వారి భయం ‘ఆమె’ను మరింత బలహీనురాలిగా మారుస్తుంది. అదే ఆత్మరక్షణ విద్య నేర్పితే ‘ఆమె’ ధైర్యంగా ఎదుగుతుంది. ఇంటిల్లిపాదీ నిబ్బరంగా ఉంటారు. ఈ ఆలోచన తో రాష్ట్ర బాలల హక్కుల సంఘం ‘అమ్మాయిలకు ఆత్మరక్షణ’ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందుకు గాను ఐఎమ్ఎఫ్ కరాటే మాస్టర్ నరేందర్తో కలిసి 1000 స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లోని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ప్రతి అమ్మాయి బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి చిన్ననాటినుంచే నేర్పించాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలను సాధన చేయించాలి. ఎవరైనా తమపై దాడి జరపగలరన్న అనుమానం వచ్చిన వెంటనే అలెర్ట్ అవగలిగే అవగాహన వారిలో పెంచాలి. తమ దగ్గర ఉండే సాధారణమైన సాధనాలతోనే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి..’ అంటూ ఈ సూచనలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆత్మరక్షణ పద్ధతుల్లో చెప్పే ప్రధాన అంశాలు మార్షల్ ఆర్ట్స్ అనేది చిట్టచివరి అధ్యాయం. ముందు కనీస జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకోవడం అవసరం. పెద్దలూ వారికి ఇవి సూచించాలి... ఇంట్లో నుంచి అమ్మాయి బయటకెళ్లేటప్పుడు వెంట మొబైల్ తీసుకెళ్లాలి. అందులో ఇంటి నెంబర్లు, పోలీసుస్టేషన్ నెంబర్లు ఉంచుకోవాలి, అమ్మాయిలు చాలావరకు రోడ్లపై మొబైల్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, కబుర్లు చెబుతూ వెళుతుంటారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దాడికి గురిచేసే అవకాశం ఉండవచ్చు. అందుకని రోడ్లమీద ఫోన్ కబుర్లకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. వెంట విజిల్ తీసుకువెళ్లడం, కీ చెయిన్కు ఒక చిన్న కత్తిలాంటివి తగిలించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగంతకులు తమ నోరు మూస్తే వారి చేతి పైన పిన్తో గాని, కీతో గాని గుచ్చడం... వంటివి చే సి దాడి నుంచి తప్పించుకోవచ్చు. కొందరు బస్సులలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో శరీర భాగాలను తగులుతుంటారు. అలాంటప్పుడు తమ వెంట ఉండే వస్తువులతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో తెలుసుకోవచ్చు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. కరాటే నేర్చుకున్న అమ్మాయిలు కూడా కొంత అమాయకంగా ఆలోచిస్తుంటారు. తమపై దాడి చేసిన వారిని గట్టిగా కొడితే చచ్చిపోతారేమో అని భయపడుతుంటారు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెనుకంజ వేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైనా తమపై దాడికి దిగినప్పుడు వారిని తరమవచ్చు అని ‘నిర్భయ చట్టం’ చెబుతోంది. ఆడపిల్లలు చిన్నప్పటినుంచే ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పట్ల అవగాహన పెంచుకోవాలి. టీచర్లు, దగ్గరి బంధువులు మెచ్చుకోలు కోసం భుజాలు తట్టడం, నొక్కడం చేస్తుంటారు. వీటిలో ఆ ‘టచ్’ పట్ల ఆలోచన చేసే జ్ఞానం అలవర్చుకోవాలి. ‘తేడా’గా అనిపిస్తే ప్రిన్సిపాల్కు చెప్పడం లేదా నలుగురిలో నిలదీయడం, ఇంట్లో వారికి చెప్పడం చేయాలి. లేదంటే వారు మరింత చనువు తీసుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లల శారీరక అవయవాల గురించి చెబుతూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు ఆడపిల్లలు సిగ్గుపడుతూ గుంభనంగా ఉండిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సదరు వ్యక్తి మరింత అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారి గురించి నలుగురికీ తెలియజేయడం అవసరం. ఆగంతకులు ఎవరైనా వెనక నుంచి పట్టుకుంటే ముఖంపై కొట్టాలి, ముక్కుపై గుద్దాలి, విడిపించుకునే క్రమంలో ఎలా ఉండాలో కనీస అవగాహన పెంపొందించాలి. నెగిటివ్, పాజిటివ్ అంశాలకు తేడా తెలుసుకోవాలి. నిలదీసే ధైర్యం పెంచుకోవాలి. చదువుతోపాటు చిన్ననాటి నుంచి అబ్బాయిలకూ సంస్కారం నేర్పాలి. ఈ ముందు జాగ్రత్తలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలకు ఎంతవరకు అవసరమో తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివమల్లాల భయం పోయింది కరాటే నేర్చుకోకముందు ఓ సారి బస్లో నా మెడలో చైన్ను లాగారెవరో! ఆ సమయంలో అరవడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల వరకు ఆ భయం పోలేదు. ఆ సంఘటన తర్వాత కరాటే నేర్చుకున్నాను. కిందటేడాది కాలేజీ నుంచి వస్తుంటే దారిలో ఆగంతుకులు దాడి చేయబోయారు. వారిని ధైర్యంగా ఎదుర్కోగలిగాను. - పి.శాలిని, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత -
ప్రజలకోసం ఫస్టొచ్చారు!
ముందుండాలని ఫస్ట్ వస్తారు ఎవరైనా. వెనకుండడం కోసం ఫస్ట్ తెచ్చుకున్నారు వేణుగోపాల్! టెన్త్లో స్కూల్ ఫస్ట్... డిగ్రీలో కాలేజ్ ఫస్ట్... ఎమ్మెస్సీలో యూనివర్శిటీ ఫస్ట్... గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్... ఈ ఫస్ట్లన్నీ - ప్రజల కోసం, ప్రజల వెనుక వుండడం కోసం కాలే కడుపుతో, నిద్ర లేని కళ్లతో సాధించారాయన! ఫస్ట్ అటెంప్ట్లోనే వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైనా... గ్రూప్ 1 మళ్లీ రాసి రెవిన్యూ సర్వీసును ఎంచుకున్నది కూడా... ఆ ప్రజల కోసమే! పగిలిన పలక ముక్కపై అక్షరాలు దిద్దుకుని... స్నేహితుల పుస్తకాలు అరువు తెచ్చుకుని... ఆశల్ని చంపుకుని, ఆశయాల్ని నింపుకుని... ప్రజాసేవకుడినై తీరాలని ప్రతిన పూనిన వేణుగోపాల్ను అంతగా ప్రేరేపించిన పరిస్థితులేమిటి? చదవండి... ఈవారం ‘జనహితం’లో... ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఓసారి వేణుగోపాల్ రెడ్డి జీవితంలోకి తొంగి చూడాల్సిందే... తన జీవితంలో పేదరికం ఉంది. అడుగడుగునా కష్టాలు వెన్నాడుతున్నాయి. ఆఖరికి బడిలో.. చదువుల ఒడిలో అన్నీ సమస్యలే.. అయినా అమ్మానాన్నల ఆశీస్సులే పెట్టుబడిగా.. అన్నదమ్ముల ఆలంబనే ఆశీర్వాదాలుగా బతుకు చిత్రంలో ఒదిగి.. సర్కారీ బడిలోనే కష్టపడి చదివి... అధికారి అయ్యారు. కడప జిల్లా బద్వేలు మండలం జాఫర్సాహెబ్ పల్లి అనే ఓ చిన్ని గ్రామానికి చెందిన ఆయనే గ్రూప్-1 సర్వీసులో 2006 బ్యాచ్ స్టేట్ టాపర్గా నిలిచి, ప్రస్తుతం రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న మట్లి వేణుగోపాల రెడ్డి. నిండా నలభై గడపలు కూడా లేని ఒక కుగ్రామంలో, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో సంతానం ఈయన. సర్కారీబడులు తప్ప చదువుకోవడానికి మరో మార్గం లేని ఆ గ్రామంలో పట్టుదలే ముందుకు నడిపిందంటూ తన జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘అడిగితే ఇంకొంత కష్టం చేసి అన్నీ కొనిస్తాడు నాయన. కానీ అది ఆయనకు ఎంత భారమో నాకు తెలుసు. పలక విరిగిపోతే, రెండు ముక్కలను ఇద్దరు అన్నదమ్ములం తీసుకునేవాళ్ళం. పుస్తకాలు కొనడానికి కూడా ఆలోచించవలసిన రోజులు అవి. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకుని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవాడిని. ఇలా పడిన కష్టం ఫలించింది. పదోతరగతిలో స్కూల్ టాపర్గా నిలిచాను. ఇంటర్లో కాలేజీలో రెండవస్థానంతో సరిపుచ్చుకున్నా, డిగ్రీలో మాత్రం మళ్లీ కాలేజీ టాపర్నే అయ్యా. ఎమ్మెస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్టు నేనే.. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడదంతా ఓ అనుభూతిలా మిగిలింది.’ అంటున్నారాయన. నిబద్ధతతో జీవితాన్ని చిన్ననాటి నుంచి కొనసాగిస్తూ వస్తే ‘సాధ్యం’ ముంగిట ‘అసాధ్యం’ చిన్నదై పోతుందని చెబుతున్న వేణుగోపాలరెడ్డి తన జీవిత పుస్తకాన్ని నేటి యువతకు మార్గదర్శకం అయ్యేందుకు సాక్షికి ఓసారి తెరిచి చూపించారు. మొదటిసారి 2005లో గ్రూప్-1లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. కానీ అది తన లక్ష్యాలకు తగ్గట్టుగా లేదని ప్రజాసేవకు దగ్గరలో ఉండే బాధ్యతలు నిర్వర్తించాలని మరోసారి ప్రయత్నించి 2006లో స్టేట్ టాపర్గా నిలిచి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఎందుకనుకున్నానంటే... నేను అప్పర్ ప్రైమరీ చదువులో ఉండగా మా కుటుంబానికి ఓ ధృవపత్రం అవసరమైంది. దానికోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నాలాగే ఎందరో రకరకాల సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. ఎవరి బాధలు వారివి. అక్కడ జనం పడిగాపులు చూసి నేను ఇలాంటి ఆఫీసులో సేవకుడు కావాలని బలంగా అనుకున్నాను. అదే స్ఫూర్తి రెవెన్యూ సర్వీసెస్ కోసం నన్ను ముందుకు నడిపించింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యం... ‘మాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండేది. వర్షాధార వ్యవసాయం. నాన్న చిన్నకృష్ణారెడ్డి అయిదో తరగతి వరకు చదివారు. అమ్మ చెన్నమ్మ చదువుకోలేదు. ఆరుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చదువులబాట పడితే, మరో ముగ్గురు వ్యవసాయానికి అంకితమయ్యారు. గ్రామంలో నా పెద్దన్న రాజగోపాల్రెడ్డి ఎం.ఏ పట్టా పుచ్చుకున్న మొదటి వ్యక్తి. మరో అన్నయ్య సూర్యనారాయణరెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదివారు. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, గణితశాస్త్రం చదివాను. చదివిన అన్నలు, మా చదువుల కోసం వ్యవసాయానికి అంకితం అయిన సోదరులు అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను’ అంటున్న వేణుగోపాల్, ఇద్దరు సోదరులు చదువు మీద కాక, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ సోదరులకు తమ వాటాగా వచ్చిన భూమిని ఇచ్చేశారు. ‘నాయన నుంచి వచ్చిన ఆస్తి వాటాను చదువుకోని నా అన్నదమ్ములకే విడిచేశాను. నాకు మంచి ఉద్యోగం ఉంది. అన్నలిద్దరూ కూడా చదువుకుని మంచిగానే బతుకు తున్నారు. అందుకే చదువుకున్న వాళ్లు ముగ్గురం మా ఆస్తులు చదువుకోని సోదరులకు ఇచ్చేశాం’ అని చెప్పుకొచ్చిన వేణుగోపాల్ తన జీవన ప్రస్థానంలో అర్ధాంగి సహకారం మరువలేనిదన్నారు. క్రికెట్ చూడటం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉందంటున్న వేణుగోపాల్కి శ్రీశ్రీ, గురజాడ కన్యాశుల్కం, చలం సాహిత్యం అభిమాన గ్రంథాలట! దిశా నిర్దేశం అవసరం... ‘ఈనాటి యువత చదువులో దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. కళాశాల విద్యలోకి ప్రవేశించాక... నిర్ణీత లక్ష్యాలు ఎంచుకోవాలి. ఆ దిశగా ఎంచుకునే కోర్సులు ఉండాలి. ఏదో చదివాంలే... పట్టభద్రులు అయ్యాంలే.. అనుకుంటే మంచి భవిష్యత్తు పొందలేరు’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యం లేని విద్యకు విలువ లేదంటున్న వేణుగోపాల్ మాటలకు విలువ ఇస్తే, యువత తామనుకున్న మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలెదురైనా వెనుకడుగు వేయరేమో! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement