-
బొప్పి కట్టిన తెలుగు పెద్దతలలు
మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తల దూర్చారు. ఇద్దరి తలలూ బొప్పి కట్టాయి. పైకి నొప్పి లేనట్టు నటిస్తున్నా ఇద్దరూ ఎవరూ చూడకుండా అద్దం ముందు నిలబడి బొప్పి తడుముకుని బావురుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిగ్గానే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారికి పిలుపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు ఎక్కువగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో లేదా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డారు. బెంగళూరులో స్థిరపడ్డ తెలుగువారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారు. చంద్రబాబు పిలుపును వాళ్లెవరూ లెక్క చెయ్యలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి బీజేపీకి ఓట్లు పడకుండా చేయాలన్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కర్ణాటకలో బీజేపీ సీట్లు 2013 కంటే ఈసారి గణనీ యంగా పెరిగాయి. ఎవరి ప్రయోజనాలు వారివి! చంద్రబాబునాయుడు తిరుపతి నుంచే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటక తెలుగు వారికి పిలుపు ఇస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఒక ప్రత్యేక విమానంలో మందీమార్బలంతో వెళ్లి మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడను ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆయన ఆలోచన అక్కడ కాంగ్రెస్ గెలవకూడదని! అయితే ఇటీవలే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడుపుతానని బయలుదేరిన చంద్రశేఖరరావు బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను దుయ్యబడుతున్న కారణంగా కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని బహిరంగంగా ప్రకటించలేకపోయారు. అయితే ఆయన రహస్య ఎజెండా మాత్రం బీజేపీకి మేలు చేయడమే అని రాజకీయ పండితుల వాదన. అందుకు కారణం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో తన ప్రథమ శత్రువుగా ఉన్న కాంగ్రెస్లో కొత్త ఊపు వస్తుంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంటుంది, జేడీ(ఎస్) పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ అస్తిత్వంతోనే కొనసాగుతున్నందున ఎక్కువ స్థానాలు వచ్చేటట్టు చేస్తే అది బీజేపీకి లాభించి అధికారంలోకి రావడానికి పనికొస్తుందన్నది కేసీఆర్ రహస్య ఎజెండా. అయితే ఆయన పిలుపును అందుకోవాల్సిన తెలుగువారు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగువారు. వాళ్లలో ఎక్కువ మంది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడ్డవారు. బెంగళూరులో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు చంద్రబాబు పిలుపును లెక్క చేయనట్టే, హైదరాబాద్ కర్ణాటక ప్రాంత తెలుగువారు చంద్రశేఖరరావు పిలుపును పట్టించుకోలేదు. అక్కడ జేడీ (ఎస్) కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు లభించాయి. పైగా కేసీఆర్ బహిరంగంగా మద్దతు తెలిపిన జేడీ(ఎస్)కు మొన్నటి ఎన్నికలలో 2013 ఎన్నికల కంటే తక్కువ స్థానాలు లభిం చాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. జేడీ (ఎస్) తెలంగాణలో తన ప్రథమ శత్రువు కాంగ్రెస్ గూట్లో చేరిపోయింది. మింగలేక కక్కలేక అన్నట్టు తయారయింది ఆయన పరిస్థితి. దానికి తోడు బీజేపీ నుంచి తమ ఎంఎల్ఏలను రక్షించుకోవడం కోసం శిబిరం ఏర్పాటుకు కేరళ వెళ్లాల్సిన కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులు హైదరాబాద్ బయలుదేరి రావడం కూడా కేసీఆర్కు మింగుడుపడని విషయమే. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమా అని హైదరాబాద్ శిబిరం ఒక్కరోజుతో ముగిసిపోయింది కానీ, ఏ పదిహేను రోజులో కొనసాగి ఉంటే జేడీ (ఎస్) బహిరంగ మిత్రుడిగా తన ఇలాఖాలో ఉన్నారు కాబట్టి కాపాడే చర్యలు గట్టిగా చేయవలసి వచ్చేది. అట్లా చేస్తే తన రహస్యమిత్రులు అమిత్ షా, మోదీల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ సీఎం వ్యూహం వేరు ఎన్డీఏను వీడి వచ్చాక తన మీద కేసులు పెడతారని చంద్రబాబునాయుడు చాలా భయపడుతున్నారు. అది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ బలహీనపడాలనీ, కర్ణాటకలో ఓడిపోతే బీజేపీ ముఖ్యంగా షా, మోదీ ద్వయం దూకుడుకు కళ్లెం పడుతుందనీ, దానితో తన జోలికి రాకుండా ఉంటారనీ చంద్రబాబు ఆశించారు. కానీ ఆయన ఆశ నెరవేరలేదు. కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు పొందిన ఏకైక పార్టీగా అవతరించింది. చంద్రబాబు ఆశల మీద కర్ణాటక ప్రజలు ఆ విధంగా నీళ్లు జల్లి, చంద్రశేఖరరావుకు కూడా నిరాశే మిగిల్చారు. కాంగ్రెస్ స్థానాలు తగ్గాయి కానీ, అక్కడ అధికారంలో భాగస్వామిగా ఉండబోతున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ అత్యంత వేగంగా పావులు కదిపి జేడీ (ఎస్)ను బీజేపీ వైపు పోకుండా నిలువరించగలిగారు. తగిన సంఖ్యలో ఎంఎల్ఏలు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడంలో దిట్టలని పేరుగాంచిన అమిత్ షా, మోదీలకే చెక్ పెట్టిన సోనియా రాజకీయ చతురతను అందరూ పొగుడుతున్నారు. చంద్రబాబు గవర్నర్ను విమర్శించడమా!? మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబునాయుడు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. కర్ణాటక తాజా పరిస్థితి మీద ఆయన అక్కడి గవర్నర్ పాత్రను తీవ్రంగా విమర్శించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. వజూ భాయ్ వాలా రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే కృష్ణకాంత్, నరసింహన్ల చేత తాను చేయించింది ఏమిటి? రాజ్యాంగ పరిరక్షణా? రాజ కీయాల్లో అధికారమే పరమావధి అయినప్పుడు మర్యాద, హుందాతనం వంటివి లుప్తమయిపోతుంటాయి. ఒకప్పుడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందుకు దేవత అని ప్రస్తుతించిన చంద్రశేఖరరావు ఈ రోజు బెంగళూరులో జరగనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం అక్కడికి సోనియా, రాహుల్ తదితర కాంగ్రెస్ పెద్దలు వస్తున్నందునే. జేడీ (ఎస్), కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటులో తానూ పాల్గొంటే తెలంగాణలో కాంగ్రెస్ నైతిక స్థయిర్యం పెరుగుతుందనే దుగ్ధతో బాటు సోనియాగాంధీని ముఖాముఖి ఎదుర్కోలేక పోవడమూ, బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకూడదన్న వెరపూ కారణం కావచ్చు. అందుకే ఆయన మంగళవారం సాయంత్రమే బెంగళూరు వెళ్లి కుమారస్వామికి అభినందనలు తెలిపి వచ్చేశారు. అవతలి వైపు సోనియాగాంధీని దెయ్యం అనీ, ఇటలీ దేశీయురాలనీ నానా తిట్లూ తిట్టిన చంద్రబాబునాయుడుకుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరు బయలుదేరారు. సోనియా గాంధీ సరసన కూర్చోడానికి, కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త కూటమి గూట్లో చేరిపోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారాయన. భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు కాంగ్రెస్ నుంచి బయలుదేరిన చంద్రబాబు చివరికి అదే కాంగ్రెస్ పంచన చేరక తప్పని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్లో మథనం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాడి కింద పారేసింది కానీ తెలంగాణలో 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశ పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రం కొత్త గుబులు పట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక ఫలితం పునరావృతం అయితే ఎట్లా అన్న సందేహం వాళ్లనువెంటాడుతున్నది.తెలంగాణలో కర్ణాటక మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు కాంగ్రెస్కు లభించకపోతే, జేడీ (ఎస్) లాగా కోదండరాం నాయకత్వంలోని టీజేఎస్కో, టీటీడీపీకో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందేమో అన్నది వాళ్ల ఆందోళన. బీజేపీని నిలువరించడానికి కర్ణాటక మోడల్ను 2019 దాకా కొనసాగిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెస్తానని చెపుతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం అటకెక్కినట్టే. కొత్త, పాత మిత్రులతో మరో యూపీఏ ఏర్పాటయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ ఎన్డీఏలో చేరడమో, ఒంటరిగా మిగిలిపోవడమో జరుగుతుంది. దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
‘చంద్రుల’ నోట చైనా పాట
డేట్లైన్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్పింగ్కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. చైనా మోడల్ దేనికి నిదర్శనం? అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్పింగ్ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే! రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు. ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్లో ధర్నా చౌక్ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్ మంతర్కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్ల పెంపు డిమాండ్ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే! శాసనసభలో గవర్నర్ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్ మార్చ్ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్ బండ్ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!! దేవులపల్లి అమర్ ఈమెయిల్ : datelinehyderabad@gmail.com -
గోదాలోకి దింపుతున్న‘హోదా’
డేట్లైన్ హైదరాబాద్ రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు? కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహచరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. బీజేపీ, తెలుగుదేశం కూటములు ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో అధికారంలో ఉండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్పష్టమై పోయింది. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్య పెట్టకుండా ఆ రెండు పార్టీల బాధ్యులూ, ముఖ్యంగా నాయుడు ద్వయం ఒక పత్రికా గోష్టి నిర్వహించి ఆ విషయం స్పష్టంగా ప్రకటించి ఈ మూడేళ్లూ ఎవరి పనులు వాళ్లు చక్క బెట్టుకుంటే మంచిది. ఆ తరువాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో అన్నీ అనుభవించి తెలుగుదేశానికి వలసపోయి, పార్లమెంట్ సభ్యుడ యిన జేసీ దివాక రరెడ్డి చెప్పినా, రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి పార్లమెంట్ ఆవరణ నుంచి ఇంత మట్టి, కొన్ని కలుషిత యమునా జలాలు తెచ్చి ఇచ్చినా, రాజ్యసభలో కేంద్రమంత్రి చౌదరి ప్రకటించినా, టీడీపీ లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాసరావుకు మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసినా, వాటన్నిటి సారాంశం - ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రభుత్వాల హయాంలో ప్రత్యేక హోదా రాదనే. హోదా పాటను మరిచారు! ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం శాసనసభ లోపలా వెలుపలా ఒంటరి పోరాటం చేస్తోంది. శాసనసభలోకి ప్రవేశం దొరకని ఇతర పార్టీలూ, ప్రజాసంఘాలూ, మేధావులూ వారూవీరూ అని తేడా లేకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడడం కనిపిస్తోంది. అయితే రెండు అధికార పక్షాలకూ చీమ కుట్టినట్టు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల యువ భేరి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక హోదా అవసరం మీద యువతను జాగృతం చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోరుతూ ఏకగ్రీవ తీర్మానానికి దోహదం చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారు. మంగళవారం నాడు రాష్ర్ట మంతటా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆ పార్టీ ధర్ణాలు నిర్వహించింది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వారి వారి స్థాయిల్లో ఉద్యమాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లు ఈవారం చర్చకు రానుంది. మరి తెలుగుదేశం తదితర పక్షాలు ఏం చేస్తాయో చూడాలి. రాష్ర్ట విభజనలో తన వంతు పాత్ర కూడా నిర్వహించిన బీజేపీ, రాష్ర్ట విభజనను సమర్థిస్తూ కేంద్రానికి లేఖలు ఇచ్చిన తెలుగుదేశం మాత్రం ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడానికి కూడా సిద్ధంగా లేవు. ఈ రెండు పార్టీలూ మొదటి నుంచీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అయితే, ఏనాడూ హోదా గురించి మాట్లాడకపోయుంటే వాళ్లను విమర్శించడం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ పోటీలు పడి ప్రత్యేక హోదా కాల పరిమితిని వేలం పాట మాదిరిగా ఐదు, పది, పదిహేను సంవత్స రాలంటూ పెంచుకుంటూ పోయింది ఆ రెండు పార్టీల పెద్దలే, అందునా ఆ ఇద్దరు నాయుళ్లే. ఆ మధ్య తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణ మనాయుడు ఒక ప్రకటన చే శారు- వెంకయ్యనాయుడు భావి రాష్ర్టపతి, చంద్రబాబునాయుడు భావి ప్రధానమంత్రి అని. నిన్నకాక మొన్న అదే నోటితో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ముద్దుకృష్ణమనాయుడు. మంత్రులూ, పాత విధేయులూ కొత్తగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాగం అందుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా తాజా విధేయుడు జలీల్ ఖాన్ రెండు రోజులలో మా పార్టీ కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేస్తారు చూడండి అని ప్రకటించేశారు. ఆయన చెప్పి పది రోజులయినా ఆ సూచనలేవీ లేవు. ఆమధ్య కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్రత్యేక హోదా త్వరలో వస్తుందని ప్రకటించి కూర్చున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో ఆయనకే తెలియాలి. మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు, అధికారపక్షంలోని ఛోటా బడా నాయకులందరూ ఎవరి తోచినట్టు వారు మాట్లాడి ప్రత్యేక హోదా విషయంలో గందర గోళం సృష్టిస్తున్నారు. అసలు వారి నాయకుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎంత గందరగోళంలో ఉన్నారో, జనాన్ని ఎంత గందరగోళంలోకి నెడుతున్నారో ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధమయిన ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. హోదా కోసం ఏదీ కృషి? రాష్ర్ట విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆనాటి ప్రతిపక్షం బీజేపీ తరఫున ముప్పవరపు వెంకయ్యనాయుడు, కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారు. చంద్ర బాబు అది పదిహేను సంవత్సరాలకు పెంచేశారు. పరిశ్రమలు రావ డానికే మూడేళ్లు పడితే, ప్రత్యేక హోదా ఐదేళ్లకు సరిపెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న చంద్రబాబు, మరి ఆ దిశగా చేసిన కృషి ఏమిటి అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ గందరగోళ పడిపోవడమే. ఒకసారి ప్రత్యేక హోదా సంజీవని కాదంటారాయన. హోదా కంటే ఎక్కువ నిధులొస్తే వద్దంటామా అనే అర్థంలో కోడలు కొడుకును కంటా నంటే వద్దు అనే అత్త ఉంటుందా అని తన పురుషాహంకారాన్ని ప్రద ర్శించుకుంటారు. ఒకసారి రాజధాని నిర్మాణానికి ఐదులక్షల కోట్లు అడుగుతారు. మరోసారి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వండి చాలంటారు. వీటన్నిటికీ పరాకాష్ట కొత్త రాజధాని శంకుస్థాపన ఉత్సవంలో చంద్రబాబు చేసిన ప్రకటన, ఆ వెంటనే సవరించుకున్న తీరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులంతా ఉన్న వేదిక మీద చంద్ర బాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోండి అన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నాలిక కరుచుకుని మీడియా వారిని పిలిచి, ప్రత్యేక హోదా అనబోయి, తొందరలో ప్రత్యేక ప్యాకేజీ అన్నానని సవరించుకున్నారు. కోట్లాది మంది రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్య మీద సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధోరణి ఇది. ప్రత్యేక హోదా పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక నాయుడు కోరినట్టు పదేళ్లో, ఇంకో నాయుడు కోరి నట్టు పదిహేనేళ్లో లభించే ప్రత్యేక హోదాను మించి రాష్ట్రానికి ఎక్కువ లాభం ఒనగూడే రీతిలో ఎక్కువ నిధులు ప్యాకేజీల ద్వారా లభించేటట్టు ఉంటే అదే తీసుకురావచ్చు. కానీ అదీ జరగడం లేదేమిటి? మోదీ అంటే భయమా? రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు, కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహ చరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. తెలంగాణలో తొలి రోజులలోనే ఓటుకు కోట్లు నిర్వాకంలో ఇరుక్కున్న కేసులకు భయపడో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరే అవినీతి కార్యక్రమాలు బయటికొస్తాయన్న భయంతోనో కానీ మొత్తానికి ఆయన ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేరని తేలిపోయింది. మాతో ఉండాలనుకుంటే మేం చెప్పినట్టు నడవండి అని కేంద్రం ఇప్పటికే రాష్ర్ట ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు రేపో మాపో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏం చేయబోతున్నదో స్పష్టమయిన ఒక ప్రకటన రాబోతున్నదనీ, దానికోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతున్నదని సమాచారం. ప్రతిపక్షనేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రోడ్డెక్కితే, కనీవినీ ఎరుగని ఎండలకు గొంతు తడుపుకోవడానికి కూడా కూడా నీరందక రాష్ర్ట ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి అమెరికా విహారయాత్రకు వెళ్లారు. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నారు వినండి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తుని తగువుతో నగుబాటు
డేట్లైన్ హైదరాబాద్ తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత కనిపించాడు, పులివెందుల కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గడిచిన గురువారం తెలంగాణ భవన్లో పత్రికల వారితో మాట్లాడారు. ఈ పత్రికా గోష్టి, రెండురోజులకు పెరేడ్ గ్రౌండ్స్లో ఒక బహిరంగ సభలో ప్రసంగం వరకే ఆయన తన ప్రచారాన్ని పరిమితం చేశారు. ముఖ్యమంత్రి బదులు ఆయన కుమారుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రచార బాధ్యత మొత్తం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదే. ఆయన నగరంలో తిరిగి ప్రచారం చేస్తే జనానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. భద్రతా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమంత్రి పత్రికాగోష్టిలో పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఏం పని? హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా ఊడ్చాల్సిన నగరాలు బోలెడున్నాయి’ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖర్రావు అన్నారు. ఈ ఆక్షేపణను చాలామంది తప్పు పట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్కు పరిమితమయిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయిన ఇద్దరు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని, అందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చిన చంద్రశేఖర్రావు తోటి తెలుగు ముఖ్య మంత్రికి ఇక్కడేం పని అనడం బాగా లేదన్నారు కొందరు. హైదరాబాద్లోనే ఉంటారా? ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో వస్తేతప్పేంటి అన్నారు మరికొందరు విమర్శకులు. నిజమే, ఎవరయినా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ కోణం నుంచేచంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూడాలి. అప్పటికే ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్బాబు, ఇతర నాయకులు హైదరాబాద్ ప్రచారంలో ఉన్నారు. లోకేశ్ తన ప్రచారంలో కొన్నిచోట్ల, ‘నేను హైదరాబాద్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, కాబట్టి ఇక్కడి వాడినే!’ అని చెప్పారు. ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు. నిజానికి ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ వాసే. 2014 ఎన్నికలలో ఆయన హైదరాబాద్(తెలంగాణ)లో ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద్రబాబు, నేనెక్కడికీ పోలేదు, ఇక్కడే ఉన్నా, ఉంటాను అని కూడా అన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉంటా నంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడయినా స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ప్రసాదించింది. మరి, ఆయన ఇక్కడే ఉంటానని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? నేనున్నానని ఆయన ఎవరికి భరోసా కలిగించాలని అనుకుంటున్నారు, హైదరాబాద్లో? ఇక్కడ ఆయన లేనప్పుడు ఎవరికయినా ఇబ్బంది కలిగితే, అప్పుడు అలాంటి భరోసా కలిగిస్తే అర్థం ఉంది. అటువంటి వాతావరణం హైదరాబాద్లో ఎక్కడా కనిపించలేదు ఈ 20 మాసాల్లో. ఇక్కడ లేకుండా పోవాల్సిన పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. సరిగా ఉంటే పదేళ్లపాటు (2019లో ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే గిస్తే ) ఆయన ప్రభుత్వాన్ని హాయిగా హైదరాబాద్ నుంచే నడుపుకుని ఉండేవారు. అట్లా కాకుండా అర్ధంతరంగా మూటా ముల్లే సర్దు కుని విజయవాడలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చెయ్యాల్సి రావ డానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ జూన్ మాసం నాటికి అంతా విజయవాడ వచ్చెయ్యాల్సిందేనని ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేసి, ఇంకో పక్క నేనెక్కడికీ పోను ఇక్కడే ఉంటానని చంద్రబాబు చెప్ప డంలో అర్థం ఉందా? మరి ఇలా మాట్లాడతారెందుకు? ఎందుకంటే, నగ రంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతవాసులు ఈ భరోసాతో జీహెచ్ఎంసీ ఎన్నిక లలో టీఆర్ఎస్కు కాకుండా, తమకు ఓట్లేస్తారన్న ఆశ. పోలింగ్ కూడా పూర్త యింది. ఇక్కడి ఆంధ్రుల ఓటు ఎవరిదో రెండురోజుల్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ పరనిందే ఇక తెలంగాణ సీఎం పత్రికా గోష్టిలో చేసిన వ్యాఖ్య గురించి- ఆయన చెప్పిన హిందూపురం, ఇచ్ఛాపురాల మధ్యలోనే తుని అనే పట్టణం ఉంది. హిందూ పురానికీ ఇచ్ఛాపురానికీ మధ్య చంద్రబాబునాయుడు ఊడ్చాల్సింది చాలా ఉందన్నమాట అక్షరసత్యమని మొన్ననే తుని చెప్పేసింది. వెనుకబడిన వర్గాల జాబితాలో తమను చేర్చాలని కాపు సామాజికవర్గం కొన్ని దశా బ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విషయం అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహి స్తున్న ముద్రగడ పద్మనాభం పట్టుదల, కార్యాచరణ శైలి కూడా చంద్ర బాబుకు సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్యమంలో ముద్రగడ దగ్గరికి వెళ్లి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెగని సమస్యగా ఉందనీ, పూర్తిగా తమ చేతుల్లో ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం కూడా కలసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్లో కాపులను బీసీల జాబితాలో చేర్చితే ఇంకోచోట గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు తలనొప్పిగా తయారవుతారు కాబట్టి కేంద్రం ఈ అంశంలో కలసిరాదనీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? ఆయనకు అన్నీ తెలుసు. రైతు రుణ మాఫీ తమ వల్ల కాదని తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేననీ తెలుసు. కాపులను బీసీలలో చేర్చలేననీ తెలుసు. అయినా అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి ఆయన చేసిన ఒకానొక వాగ్దానం ఇవ్వాళ తుని సంఘటన రూపంలో మెడకు చుట్టుకున్నది. తన మెడకు చుట్టుకున్న పామును ప్రతిపక్షాల మెళ్లో, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి మెడలో వెయ్యడానికి ఆయన రెండు రోజులుగా అవస్థపడుతున్నారు. విపక్షనేతపై అసహనం కాపులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చుతామని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1,000 కోట్లు సమకూరుస్తామని ఎన్నికల సమ యంలో వాగ్దానం చేసి, మాట తప్పినందుకు ఆ సామాజికవర్గం ఆందోళనకు దిగబోతున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ చాలా ముందే తెలుసు. తునిలో జరగబోయే కాపు గర్జనను అడ్డుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న ఆ సామాజికవర్గం వారు చిన్నా పెద్దా తుని చేరుకున్నారు. ఆందోళన అదుపు తప్పింది. ఒక రైలు మొత్తం దగ్ధం చేశారు. పోలీస్స్టేషన్ల మీద దాడి చేశారు. పోలీసులను కొట్టారు. దీనినం తటినీ అన్ని న్యూస్ చానళ్లూ ప్రసారం చేశాయి. కానీ, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ మరీ ముఖ్యంగా నిఘా విభాగానికీ సమాచారం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎంత అదుపు తప్పి సాగుతున్నదో అర్థం చేసు కోవచ్చు. ఒక పక్క తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే సీఎం విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు మాత్రం మొత్తం జరిగిందంతా కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించాడు, పులివెందుల పట్టణం కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘ టన జరిగితే సంయమనం పాటించి, వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ (ద్వేష ప్రసంగం) యథేచ్ఛగా చేసేశారు. ఆందోళన అదుపు తప్పి విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం సేకరించి తనకు అందించలేకపోయిన నిఘా వ్యవస్థను నిలదీయాల్సింది పోయి, ఆరు న్యూస్ చానళ్ల ఓబీ వ్యాన్లు అక్కడికి ఎలా వెళ్లాయి? వాళ్లకు ముందే ఇదంతా జరుగుతుందని తెలుసు అని ఒక సీఎం మాట్లాడటం హాస్యాస్పదం. ప్రచార ప్రసార మాధ్యమాలు ఎట్లా పనిచేస్తాయో ఆయనకూ, ఆయన సమాచార వ్యవస్థను నిర్వహిస్తున్న భజనపరులకూ తెలియని కారణంగానే చంద్రబాబు మీడియాను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్లో ఏం పని అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఆక్షేపించిన వాళ్లే ఇప్పుడు అవును, అక్కడ తుని తగలబడుతుంటే చంద్రబాబు హైదరాబాద్లో ఫిడేల్ వాయించడం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగిపోవడం లేదు. శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఆమరణ నిరాహార దీక్షకు కూర్చో బోతున్నారు. ముద్రగడ దీక్షలు ఎట్లా ఉంటాయో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకుడినీ, మీడియానూ తిడుతూ కూర్చో కుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన నిఘా వ్యవస్థను చక్క దిద్దుకుని, కాపుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది. కేరళలో షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్ను హుటాహుటిన రప్పించి మీడియా ముందు హాజరుపరిస్తే సమసిపోయే అంత సులువయిన సమస్య కాదిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు
(డేట్లైన్ హైదరాబాద్) మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లారనే వార్త విని సంతోషం పట్టలేకపోయానని ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక మీద పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సఖ్యంగా ఉంటే ప్రధాని నిజంగా సంతోషించవలసిందే. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ విభేదాలను, అహాన్ని పక్కన పెట్టి ప్రజోప యోగం కోసం కలసి పని చెయ్యాలనుకుంటే ప్రధానమంత్రే కాదు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలూ సంతోషిస్తారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ భుజం భుజం కలిపి నడిస్తే తెలుగు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారవుతారని ప్రధాని కూడా చెప్పారు. చంద్రబాబు ఆహ్వానించడంతో కేసీఆర్ సహచరులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారట, శంకుస్థాపనకు తాను స్వయంగా వెళ్లడమా లేక మంత్రుల బృందాన్ని పంపడమా అని. ఆయనే హాజరైతే బాగుంటుందని అందరూ సూచించాక, అందుకు సిద్ధమై, తెలంగాణ నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకుని బయలు దేరారట. అయితే రాజధాని నిర్మాణానికి నిధులను గురించిన ప్రస్తావన ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కానీ, అటు ప్రధాని నుంచి కానీ రాకపోవ డంతో తెలంగాణ ముఖ్యమంత్రి తానెందుకు ఆ చొరవ చూపాలని మిన్న కుండిపోయారనీ, లాంఛనంగా అభినందనలతో ముగించారనీ టీఆర్ఎస్ ముఖ్యవర్గాలే చెబుతున్నాయి. నిజమే, నిర్మాణ భారం వహించవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ఇచ్చిన మాట మేరకు ఇతోధిక సాయం ప్రకటిం చాల్సిన కేంద్ర ప్రభుత్వానికీ పట్టనప్పుడు చంద్రశేఖర్రావు ఎందుకు అత్యు త్సాహం చూపించడం? ఇదే ప్రధాని చూపిన స్వర్గం గత సార్వత్రిక ఎన్నికలలో మోదీ, బాబు జోడీ కలసి పోటీ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత రాజధానిని నిర్మించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందలం ఎక్కిస్తామని వాగ్దానాలు చేశారు. కానీ అమరావతి శంకుస్థాపన నాడు ఆ అంశం జోలికి ఎందుకు వెళ్లలేదు? అంతకు ముందు దాదాపు రెండుమాసాల నుంచి టీడీపీ, బీజేపీ నాయకులు మీడియాలో ఊదరగొట్టారు, ‘ప్రధాని వస్త్తున్నారు, చూసు కోండి, ఏమేం తెస్తున్నారో!’ అని. ఓ జన్నత్ దిఖాయేగా (ఆయన స్వర్గం చూపిస్తాడు) అని. అవును, ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే స్వర్గం చూపించారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయం నుంచి స్వయంగా మట్టి తెచ్చారు. అది స్వర్గం నుంచి వచ్చినట్టే! మరో స్వర్గతుల్య మయిన యమునా పుణ్యజలాలను కూడా రాజధాని నిర్మాణంలో తమ వాటాగా అందించారు ప్రధాని. ఓ జన్నత్ ది ఖాయా అవుర్ జహాన్నూం మే పహుంచాయా (అరచేతిలో స్వర్గం చూపించి అడవిలో వదిలి వెళ్లాడు). శంకు స్థాపన ముగిశాక లెక్కకు మించిన హెలికాప్టర్లు ప్రముఖులను తీసుకుని గాలిలోకి ఎగరడంతో దుమ్ము పడ్డ కళ్లు నులుముకుంటూ ఇంటి దారి పట్టిన ఆ ప్రాంత రైతులు ఇదే గొణుక్కున్నారు. కార్యక్రమం ముగిశాక మామూలు మనుషులు కావడానికి టీడీపీ, బీజేపీ కూటమికి రెండు మూడురోజులే పట్టింది. చంద్రబాబు ఇరవై నాలుగు గంటల తరువాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రత్యేక హోదా అనబోయి, పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఇంత ముఖ్యమైన విషయంలో ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? ఎన్నో చేశారు అని ముఖ్యమంత్రి, అన్నీ చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం తప్ప బోలెడు ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత అట్టహాసంగా, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం నుంచి భవిష్యత్లోనయినా ఎలాంటి సాయం వస్తుంది అన్న అంశం మీద ఎవరికీ స్పష్టత రాలేదు. ఆత్మార్పణల సంగతి తెలియదా? ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన విషయం ప్రధాని దృష్టికి వచ్చింది కానీ, కేంద్రమే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుకు జరుగుతున్న ఆందోళనలు మాత్రం ఆయన దృష్టికి రాలేదు. ప్రత్యేక హోదా రాదేమో అన్న నిస్పృహతో కొందరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేయగల ఉద్యమం ఒకటి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్నదన్న విషయం, దాని కోసం ఆ అమరావతికి కూతవేటు దూరంలోనే ఒక పక్షం రోజుల ముందు ప్రతిపక్ష నేత నిరవధిక దీక్ష చేసిన విషయం ప్రధాని దృష్టికి రాష్ర్ట ప్రభుత్వం కానీ, కేంద్ర నిఘావర్గాలు కానీ, ఆయన పార్టీ యంత్రాంగం కానీ తీసుకుపోకపోవడం చిత్రమే. కనీసం మీడియా ద్వారానైనా తెలిసి ఉండదా అంటే జాతీయ మీడియాకు ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ర్టం ఉన్నట్టు కానీ, అక్కడ ప్రత్యేక హోదా కోసం జీవన్మరణ పోరాటం జరుగుతున్నట్టు కానీ తెలిసినట్టే లేదు. తెలంగాణలో కవితమ్మ ఆధ్వర్యంలో ఆడించే బతుకమ్మలను చూడటానికీ, అమరావతిలో రాజధాని శంకుస్థాపన వేడుకలు చూడటానికీ పొలోమని రావడానికి తీరిక ఉన్న ఢిల్లీగత జీవులయిన జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్లో హోదా కోసం సాగుతున్న ఉద్యమం ఊసే పట్టకపోవడం విచారకరం. మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించి సెంటిమెంట్తో కొట్టాలన్న పనికిరాని ఆలోచన ఇది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి రాజధాని ప్రాంతం అంతటా సర్వమత సమానత్వం పేరిట చర్చిల నుంచి, గురుద్వారాల నుంచి, మసీదుల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లు చల్లడం, దీనికో పవిత్రతను ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వాధినేతలే చేయడం రాజకీయ జిమ్మిక్కు అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ముందున్నది ముసళ్ల పండుగ ప్రత్యేకహోదా కావాలని ముఖ్యమంత్రి ఈ వేదిక మీద పట్టుపట్టనందుకు ప్రధాన మంత్రి మోదీ, రాజధాని నిర్మాణం ఎవరికి అప్పగించనున్నారు? లెక్కాపత్రం ఏమిటి అని ప్రధాని ప్రశ్నించనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి- ఇద్దరే ఆ ప్రాంగణం నుంచి సంతోషంగా తిరిగి వెళ్లారు. సంతో షంగా తిరిగి వెళ్లిన మూడో వ్యక్తి- తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను చూసి చేసిన హర్షధ్వానాలు, త్వరలో వస్తాయనుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రజల ఓట్లు తన పార్టీకి తెచ్చి పెడతాయనడానికి నిదర్శనమన్న సంబరం ఆయనది. అటు ప్రధానమంత్రికి కానీ, ఇటు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు కానీ ఇందులో సంతోషించాల్సింది ఏమీలేదు. ముందున్నది ముసళ్ల పండుగ. ఆయన పిలిచారు, మీరు వెళ్లారు బాగానే ఉంది. కాని ఓటుకు కోట్లు వ్యవహారం సంగతి ఏమిటి అని చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. అంతేకాదు, మీరు కూర్చున్న వేదిక మీద ప్రధాని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటునే వ్యతిరేకిస్తూ మాట్లాడితే మీరేం చేస్తున్నారు అని కూడా అడుగుతారు తెలంగాణ ప్రజలు. స్వార్థపరులు, రాజ కీయ స్వప్రయోజనాలు ఆశించిన వారూ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ను చీల్చారు అని అమరావతి సాక్షిగా నరేంద్ర మోదీ మరొక్కమారు ప్రకటిం చారు. ఇది తెలంగాణ ఉద్యమ వీరుడు చంద్రశేఖర్రావు చెవులకు సోకలేదా? అమరావతి సందర్శన ప్రధానమంత్రికీ ఆయన పార్టీకీ రెండు రాష్ట్రా ల్లోనూ రెంటికీ చెడ్డ రేవడి అనుభవాన్ని మిగిలించే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన, రాష్ర్ట విభజనను పూర్తిగా సమర్థించిన భారతీయ జనతా పార్టీ విధానమూ, నరేంద్ర మోదీ విధానమూ వేర్వేరా అనే అభిప్రాయం కలుగుతున్నది. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారు అని రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరినే చాటుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తెలంగాణలోనూ, ప్రత్యేక హోదా సహా ఏ ప్రయోజనమూ అందించక ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ నాయకులు, శ్రేణులు ప్రజల్లో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకోవడం మాత్రం తథ్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ ఒత్తిడుల కారణంగా చేస్త్తున్నారో కానీ మొన్న అమరావతి వేదిక మీద మాట్లాడినప్పటి లాగానే కేంద్రాన్ని సమర్థిస్తూ పోతే విపరిణామాలు మరింత తీవ్రం కాకతప్పదు. (వ్యాసకర్త: దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement