-
ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరము కాలే!
వెల్గటూరు(ధర్మపురి): ఓ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం చిన్నారి ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన దాసరి హరీశ్(7) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమ్కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి పోచయ్య–సత్తమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హరీశ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. స్కూలు లేక పోవటం వల్ల హరీశ్ అతడి పెద్దనాన్న కొడుకు ఇద్దరూ తాతతో కలిసి గ్రామ శివారులో మేకల వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎండ బాగా కొడుతుందని, ఇంటికి వెళ్లండని తాత చెప్పడంతో ఇద్దరూ ఇంటికి బయలు దేరారు. గ్రామంలోని వరంగల్–రాయపట్నం హైవే రోడ్డుదాటే క్రమంలో ధర్మారం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న ఏపీ01ఎక్స్3483 నంబర్ గల తూఫాన్ వాహనం హరీశ్ను వేగంగా ఢీకొట్టంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రాంక్ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన -
పొగిడితే పోయేదేముంది డ్యూడ్..
పొగడ్త అగడ్త అని గిట్టనివారు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, నిజానికి పొగడ్తలను ఇష్టపడనివారు లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. పొగడుపూలవాన కురిపిస్తే, ఎంతటి ధీరగంభీరవదనులైనా పెదవులపై చిరునవ్వులొలికించక మానరు. పొగడ్తల శక్తి అలాంటిది మరి! మామూలు భాషలో పొగడ్త. పొగడ్తను కాస్త నాజూకుగా ప్రశంస అని, ఆధ్యాత్మిక పరిభాషలో స్తుతి అని కూడా అంటారు. పొగడ్తకు మన తెలుగు భాషలోనే దాదాపు అరవై వరకు పర్యాయపదాలు ఉన్నాయి. పొగడ్తనే ఇంగ్లిష్లో ‘కాంప్లిమెంట్’ అంటారు. ఈ మాటకు ఇంగ్లిష్లో నలభైకి పైగా పర్యాయపదాలు ఉన్నాయి. అంటే, పొగడ్తల్లో మన తెలుగువాళ్లదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు. ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేన’ని కొందరి ప్రగాఢ విశ్వాసం. ఎంతటి అపర దుర్వాసులనైనా పొగడ్తలతో అవలీలగా పడగొట్టవచ్చనేది వారి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’లో గిరీశం ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి అగ్నిహో్రత్రావధానుల్లాంటి ప్రథమకోపిని చులాగ్గా బురిడీ కొట్టించగలిగాడు. అకాలంలో ఈ పొగడుపూల వానేంటని అయోమయం చెందుతున్నారా? మరేమీ లేదు– రేపు ‘వరల్డ్ కాంప్లిమెంట్ డే’– అనగా, ప్రపంచ ప్రశంసా దినోత్సవం. అందువల్లనే ఈ పొగడ్తల కథా కమామీషూ... పొగడ్త పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన జాడ చరిత్రలో ఎక్కడా కనిపించదు గాని, బహుశ మాటలు పుట్టినప్పుడే పొగడ్తలు కూడా పుట్టి ఉంటాయని భావించవచ్చు. ‘ఆదియందు అక్షరము ఉన్నది. అక్షరము దైవము వద్ద ఉన్నది. అక్షరమే దైవమై ఉన్నది’ అని బైబిల్ చెబుతోంది. కాలక్రమమున దైవమై ఉన్న అక్షరమే దైవమును పొగడనేర్చినది. ఇది ఒక సృష్టి వైచిత్రి. పొగడ్తలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు దైవానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి మనుషులకూ విస్తరించాయి. జీవాత్ములైన మనుషులందరూ సమానులేనని అటు ఆధ్యాత్మికవాదులు, మనుషులంతా ఒక్కటేనని ఇటు సామ్యవాదులు ఏదో మాటవరసకు అంటుంటారు గాని, మనుషుల్లో కొందరు ఎక్కువ సమానులు ఉంటారు. సమాజంలో ఆస్తులూ అంతస్తులూ అధికారాలూ ఈ ఎక్కువ సమానుల సొంతం. ఎక్కువ సమానులను ప్రసన్నం చేసుకుని, వారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందడానికి తక్కువ సమానులు ఎప్పటికప్పుడు ‘పొగడు’పూల మాలలను అల్లుతుంటారు. పురాతన కళ పొగడ్త ఒక పురాతన కళ. వాంగ్మయారంభం నుంచే ఇది ఉనికిలో ఉంది. వేదపురాణాది పురాతన వాంగ్మయమంతా దైవాన్ని వేనోళ్ల పొగడటంతోనే వ్యాప్తిలోకి వచ్చాయి. రాచరికాలు ఏర్పడిన తర్వాత కవిపండితులు దైవంతో పాటు రాజులను కూడా పొగడటాన్ని అలవాటు చేసుకున్నారు. దైవాన్ని పొగిడితే చాలదా? మానవమాత్రులైన రాజులనెందుకు పొగడాలనే ధర్మసందేహం కొందరికి కలగవచ్చు. అలాంటి సందేహానికి ఆనాటి బతకనేర్చిన కవిపండితులు ‘నా విష్ణుః పృథ్వీపతిః’ అని సమర్థించుకున్నారు. అంటే, భూమినేలే రాజు సాక్షాత్తు మహావిష్ణువుతో సమానుడు. అందువల్ల రాజును పొగడటం తప్పుకాదనేది వారి వాదన. ఈ వాదనతో ఏకీభవించి, రాజులను పొగడనేర్చిన కవిపండితులు, వాగ్గేయకారులు, విదూషకులు వంటి వారందరూ సునాయాసంగా సుభిక్షంగా సువిలాసంగా బతుకుతూ, సమాజంలో ఎక్కువ సమానులుగా చలామణీ అయ్యేవారు. పొగడటానికి ఇంతమంది ఉన్నా, తనివితీరని రాజులు కేవలం తమను పొగడటానికే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని, వారిని పెంచి పోషించేవారు. రాజులు ఎలాంటి వారైనా వారిని పొగడక తప్పని దుస్థితి ఆ రాజోద్యోగులది. ఎక్కడో తెనాలి రామకృష్ణుడిలాంటి తెలివైన కవులు రాజులను పొగుడుతున్నట్లే అనిపించే పద్యాలు చెబుతూ చురకలంటించేవారూ చరిత్రలో లేకపోలేదు. అలాంటి పద్యాల్లోని శ్లేషాలంకార మర్మాన్నెరుగని తెలివితక్కువ మారాజులు వారికి ఘనసన్మానాలూ చేసేవారు. పొగుడుతున్నట్లే చురకలంటించే ఆనాటి కవుల నైపుణ్యానికి ఒక ఉదాహరణ: శ్రీకృష్ణదేవరాయల చిన్నల్లుడు తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడితో పొగిడించుకోవాలనే కోరిక పుట్టింది. రామకృష్ణుడికి కబురు పంపి సభకు పిలిపించుకుని, తనను పొగుడుతూ పద్యం చెప్పమన్నాడు. తిరుమలరాయడు ఏకాక్షి. శ్లాఘించవలసిన లక్షణాలేవీ పెద్దగా లేనివాడు. పొగడనని మొండికేస్తే తిక్క మారాజు ఎలాంటి శిక్ష విధించడానికైనా వెనుకాడడు. సమయస్ఫూర్తిమంతుడైన తెనాలి రామకృష్ణుడు కాసేపు ఆలోచించి, ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం: అన్నాతిగూడ హరుడవె అన్నాతి గూడకున్న నసురగురుడవె అన్నా తిరుమలరాయా! కన్నొక్కటి మిగిలెగాని కౌరవపతివే! తిరుమలరాయడు భార్యతో కలసి సభలో కొలువుదీరాడు. భార్యతో కలసి ఉంటే, ఆమె రెండు కన్నులూ అతడి ఒంటికన్నూ కలసి మూడు కన్నులు. అందువల్ల ‘ఆమెతో కలసి ఉన్నప్పుడు సాక్షాత్తు ముక్కంటి అయిన పరమశివుడివేనని పొగిడాడు. పక్కన ఆమె లేనప్పుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడంతటి వాడివన్నాడు. వామనావతారంలో శ్రీమహావిష్ణువు దర్భపుల్లతో గుచ్చడంతో శుక్రాచార్యుడు ఒంటికంటితో మిగిలాడనే పురాణం అందరికీ తెలిసినదే. చివరి పాదంలో చెప్పినది వీటన్నింటినీ మించిన చమత్కారం. కన్నొక్కటి మిగిలిపోయింది గాని, లేకుంటే సాక్షాత్తు ధృతరాష్ట్రుడివేనన్నాడు. మహాభారతంలో గుడ్డిమారాజైన ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడి శ్లేష అర్థంకాలేదు కాబట్టి సరిపోయింది. రామకృష్ణుడు తనను నిజంగా పొగిడాడనే భ్రమలో మురిసిపోయాడా పిచ్చిమారాజు. తిరుమలరాయడికి అసలు విషయం అర్థమై ఉంటే రామకృష్ణుడి కథ వేరేలా ఉండేది. అధికార పీఠాలపై ఉన్నవారిని తప్పనిసరిగా పొగడాల్సిన పరిస్థితులు తటిస్థిస్తే తెనాలి రామకృష్ణుడి మార్గమే సురక్షితమైనది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నమయ్య అనుసరించిన మార్గం అత్యంత ప్రమాదకరం. పెనుగొండ పాలకుడు సాళువ నరసింహరాయలు తన ఆస్థానంలో అన్నమయ్యకు ఆశ్రయం కల్పించాడు. అన్నమయ్య ఎంతసేపూ శ్రీనివాసుడిపైన కీర్తనలను గానం చేయడమే తప్ప ఏనాడూ తనకు ఆశ్రయం ఇచ్చిన రాజును పొగిడిన పాపాన పోలేదు. ఒకసారి సాళువ నరసింహరాయలకు ఎందుకో అన్నమయ్య చేత తనను పొగిడించుకోవాలనే దుగ్ధ కలిగింది. తనను పొగుడుతూ కీర్తనలను గానం చేయాలంటూ హుకుం జారీ చేశాడు. తిరుమలేశుని పరమభక్త శిఖామణి అయిన అన్నమయ్య అందుకు నిరాకరించాడు. ‘నరహరి పొగడగ నానిన జిహ్వ.... నరుల నుతింపగ నోపదు జిహ్వ’ అంటూ కరాఖండిగా మొండికేశాడు. ఈ నిరాకరణకు రాజైన సాళువ నరసింహరాయడి అహం దెబ్బతిన్నది. అన్నమయ్యను గొలుసులతో బంధించి, చెరసాలలో పెట్టించాడు. దైవకృప వల్లనో, మరెందు వల్లనో అన్నమయ్య ఆ తర్వాత సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది. అందువల్ల అధికారపీఠాన్ని అధిష్ఠించినవారిని పొగడక తప్పని పరిస్థితే ఏర్పడితే అన్నమయ్య మార్గం కంటే తెనాలి రామకృష్ణుడి మార్గమే మేలని వారి తర్వాతి తరాల బతకనేర్పరులందరూ ఏనాడో గ్రహించారు. అలాంటి బతకనేర్పరులు ఆనాటి రాచరిక కాలంలోనే కాదు, నేటి కార్పొరేట్ కాలంలోనూ ఉన్నారు. ఏ బాసుకు తగిన తాళాలను ఆ బాసు దగ్గర వాయిస్తూ ఇంచక్కా పబ్బం గడిపేసుకునే గడసరులు వారు. పొగడ్తలతో పనులు చక్కబెట్టుకోవడం కూడా ఒక కళ. ముఖస్తుతి కళలో ఆరితేరినవారిని మిగిలినవారంతా తప్పక ప్రశంసించి తీరాల్సిందే! సామాజిక బహుమతి ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి అర్ధసత్యం మాత్రమే! డబ్బును, డబ్బుతో కొనగలిగే వస్తువులను బహుమతులుగా ఇచ్చే ఆనవాయితీ చిరకాలంగా ఉన్నదే. ఇవన్నీ భౌతిక బహుమతులు. సామాజిక సామరస్యానికి ప్రశంసలే సోపానాలు. ప్రశంసకు డబ్బుతో పనిలేదు. ఎదుటివారిలోని సుగుణాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించగలిగే సహృదయం ఉంటే చాలు. మనిషి సామాజిక జీవి. ప్రశంస ఒక సామాజిక కానుక. డబ్బుతో ముడిపడిన భౌతిక కానుకలు ఇవ్వలేని సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి మంచి ప్రశంసకు మాత్రమే ఉంది. ఒకవేళ భౌతిక కానుకలు ఇచ్చినా, వాటికి కొన్ని ప్రశంసలను జతచేరిస్తే కానుకలు ఇచ్చేవారికి తృప్తి, పుచ్చుకునేవారికి ఆనందం కలిగిస్తాయి. ‘అదిగో వినరా ఆ చప్పట్లు– ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన’– సృజనాత్మక రంగంలోని కళాకారుల్లో మోతాదుకు మించి ఉండే గుర్తింపు కాంక్షకు అద్దంపట్టే డైలాగు ఇది– భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలోనిది. ప్రశంసలంటే మాటలే కాదు, చప్పట్లు కూడా. రసజ్ఞుల ఆమోదాన్ని వ్యక్తం చేసే కరతాళ ధ్వనులు కడుపు నింపవుగాని, కళాజీవుల మనసులు ఉప్పొంగేలా చేస్తాయి. ఎవరినైనా పొగడాలంటే భాషలో మాటలకు కరువులేదు. మరి పొగడటానికి మొహమాటమెందుకు? ఎదుటివారిలోని మంచిని గుర్తించి, మనసారా పొగడండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే హుందాగా స్వీకరించండి. ప్రశంసలూ ప్రయోజనాలూ... ప్రశంసలు విన్నప్పుడు ప్రశంసలు పొందినవారికి సంతోషం కలుగుతుంది. వారిలో తమను ప్రశంసించిన వారిపై సానుకూల భావనలు కలుగుతాయి. ఒకే చోట చదువుకునే సహాధ్యాయులు, ఒకే చోట పనిచేసే సహోద్యోగులు– అంతెందుకు, ఒకే ఇంట కాపురం చేసే భార్యాభర్తలు సందర్భోచితంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉన్నట్లయితే, వారి మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వారి పనితీరు కూడా మెరుగుపడుతుంది. పొగడ్తలకు జ్ఞాపకశక్తిని మెరుగుపరచే శక్తి ఉన్నట్లు జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన మనస్తత్వశాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొత్తగా కళలు, శాస్త్ర విషయాలు నేర్చుకునే వారికి తొలి దశలో పొగడ్తలు టానిక్లా పనిచేస్తాయని, మెదడులో అవి కలిగించే జీవరసాయన చర్యలు వారి జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రశంసల వల్ల మనుషుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. మనుషుల్లో పరస్పర సహకార ధోరణి అలవడుతుంది. ‘ఒక మంచి ప్రశంస చాలు, నేను రెండు నెలలు బతికేస్తాను’ అన్నాడు మార్క్ ట్వేన్. ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే గొప్పగా మరెవరూ చెప్పలేరు. తోటివారిని ప్రశంసించే సంస్కృతి సమాజంలో శాంతి సామరస్యాలకు దోహదపడుతుంది. ప్రశంసలు చిన్నపిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఏదైనా కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు, ఏదైనా మంచిపని చేసినందుకు పిల్లలను ప్రశంసించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రశంసలు పొందిన వారికి సంతోషం కలగడం సహజమే అయినా, ప్రశంసలు పొందిన వారి కంటే ప్రశంసలు కురిపించిన వారికే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగిడితే పోయేదేమీ లేదు... పొరపొచ్చాలు తప్ప! పొగడ్తలు పొందడాన్ని దాదాపు అందరూ ఆస్వాదిస్తారు గాని, ఇతరులను పొగడటానికి మాత్రం కొందరు తెగ ఇబ్బందిపడిపోతుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా, లేకున్నా ఎదుటివారిపై ఎడాపెడా పొగడ్తలు కురిపించేస్తుంటారు. అనవసరంగా పొగిడే అలవాటు ఉన్నవారు ఎక్కువగా అధికారంలో ఉన్నవారి చుట్టూ, అందగత్తెల చుట్టూ, అపర కుబేరుల చుట్టూ చేరుతుంటారు. పొద్దస్తమానం జోరీగల్లా వారి చెవుల్లో పొగడ్తల రొద పెడుతుంటారు. పొగడ్తలకు అలవాటు పడిన వారు ఒక్క పొగడ్త అయినా వినిపించని రోజున నిద్ర పట్టక, తిన్న తిండి సయించక నానా యాతన పడతారు. శ్రుతిమించితే పొగడ్త అగడ్తే అవుతుంది. అలాగని పొగడ్తలను తీసిపారేయడానికి లేదు. పొగడ్తలకు గల ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పొగిడితే పోయేదేమీ లేదు... మనుషుల మధ్య పొరపొచ్చాలు తప్ప. పొగడ్తలు మనుషుల మధ్య సఖ్యతను, సామరస్యాన్ని, పరస్పర సహకార ధోరణిని పెంచుతాయి. పిల్లలూ పెద్దలూ... మహిళలూ పురుషులూ... ఎలాంటి వారైనా పొగడ్తల ప్రభావానికి అతీతులు కారు. ప్రశంసలను ఎందుకు కోరుకుంటారు? సామాజిక జీవి అయిన మనిషి సమాజంలో ఒకరిగా మనుగడ సాగిస్తున్నా, తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటాడు. తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి, తన ప్రత్యేకతకు తగిన గుర్తింపును ప్రశంసల ద్వారా పొందడానికి అహరహం ప్రయత్నిస్తుంటాడు. మనిషి స్వభావమే అంత. గుర్తింపు కాంక్ష కొందరిలో కాస్త మోతాదుకు మించి ఉంటుంది. మోతాదుకు మించిన గుర్తింపుకాంక్ష ఉన్నవారే ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారు తిండి లేకపోయినా, పెద్దగా బాధపడరు గాని, ప్రశంసలు లేకపోతే తెగ కుంగిపోతారు. -
పొగడ్త పాడు చేస్తుంది
ఒకప్పుడు పదో తరగతి ఫైనల్ పరీక్షలకు ముందు ఒక టాలెంట్ పరీక్షలాంటిది పెట్టేవారు. అలా ఒక పాఠశాల వాళ్లు టాలెంట్ పరీక్ష పెట్టి విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి నన్ను పిలిచారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉన్న వారిని గుర్తించేవారు. దీనిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థి మొత్తం బంధుగణాన్ని అంతటినీ ఏకంగా ఒక బస్సులో తీసుకువచ్చాడు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఆ పిల్లవాడిని ఆ బంధువులు ఏ స్థితిలో చూసారంటే... వాడు జీవితంలో ఇక చేరవలసిన పై స్థానాన్ని చేరినట్లుగా భావించారు. చిన్న పిల్లవాడు కదూ... వాడు కూడా తను ఇక చదవ వలసిందేమీ లేదనీ, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరానని అనుకునే స్థితికి వెళ్లిపోయాడు. వాడికి ప్రైజ్ ఇస్తున్నప్పుడైతే వాడిలోని అమితమైన ఉత్సాహాన్ని చూస్తే వీడికొక మంచిమాట చెప్పకపోతే తప్పుచేసిన వాడినవుతాననిపించి ‘‘బాబూ! నీతో ఒక్కమాట మాట్లాడవచ్చా’’ అన్నాను. వాడు ‘‘చెప్పండి’’ అన్నాడు. ‘‘నీ జీవితానికి ఇది చిట్టచివరి పరీక్ష కాదు, కానీ ఈ పరీక్షలో పొందిన విజయం తర్వాతి పరీక్షలో బాధకు కారణం కాకుండా చూసుకో’’ అన్నాను. నేను చెప్పిన మాట వాడికేమేరకు అర్థమైందో నాకు తెలియదు. ఈలోగా రెండో బహుమతి పొందిన విద్యార్థి ఎంతో బాధగా వచ్చి నిలబడ్డాడు. ‘‘ఎందుకలా ఉన్నావు’’ అని అడిగితే వాడన్నాడు కదా... ‘‘నాకు రెండే మార్కులు తక్కువ వచ్చాయి. ఫస్ట్ రావాలని ఎంతో ప్రయత్నం చేశా’’ అని తలవంచుకుని చాలా బాధగా చెప్పాడు. నేనన్నానూ... ‘‘ఇదేం ఫైనల్ పరీక్ష కాదు కదా, ఒక ప్రయత్నం చేశావు. అంతే. రేపటి పరీక్షకు బాగా చదివి పేపర్లో నీ ఫొటో పడేటట్లు ఇక నుంచి బాగా ప్రిపేర్కా’’ అన్నాను. మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి బహుశా తర్వాత పుస్తకం పట్టుకున్నాడని నేననుకోవడం లేదు. కారణం ఫైనల్ ఫలితాల్లో మొదటి వేల ర్యాంక్స్లో లేడు. రెండో బహుమతి అందుకున్న విద్యార్థి స్టేట్ఫస్ట్ వచ్చాడు. ఇది నేను సంతోషంతోనో, బాధతోనో చెప్పడంలేదు. ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. - (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలనుంచి) -
పొగడ్త...ప్రోత్సహించేలా ఉండాలి
ఆత్మీయం ఈ ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఎవరైనా సరే, తాము చేసిన పనిని ఇతరులు మెచ్చుకుంటే ఆనందించాలని కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. చేసిన మంచి పని లేదా మంచి రాత లేదా సృజనాత్మకతను మెచ్చుకోవడం వల్ల వారిలో మరల ఆ పనిని చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనిపిస్తుంది. అందుకే మంచిమాటను మందిలో చెప్పు, చెడ్డమాటను చెవిలో చెప్పు అన్నారు పెద్దలు. అయితే పొగడ్త అనేది సత్యంగా ఉండాలి. అందులో ఎటువంటి మొహమాటమూ ఉండకూడదు. ప్రతి మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మంచిని మెచ్చుకోవడం మాని, చెడునే ఎత్తి చూపడం సరి కాదు. దానివల్ల వారిలో చెడే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మంచినే చూడటం వల్ల తమకు తెలియకుండానే మంచి పనులు చేయడానికి అలవాటు పడతారు. మన పొగడ్త అవతలి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. భుజం తట్టి ప్రోత్సహించేలా, మరిన్ని విజయాలను సాధించే లా ఉండాలి. హనుమంతుడు తాను అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటగలనా? అన్న నిరాశలో కూరుకుపోయినప్పుడు జాంబవంతుడు, సుగ్రీవుడు, ఇతర వానర వీరులు ఆయనతో ‘‘నువ్వు అందరిలా సాధారణమైన వానరానివి కాదు. మహాబలశాలివి, బుద్ధిశాలివి కాబట్టే కదా, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఆయన నుంచి విద్యలన్నీ నేర్చుకోగలిగావు. ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటటం నీకో లెక్క కాదు... ప్రయత్నం చేయి’’ అంటూ పొగుడుతూనే ఆయన శక్తిసామర్థ్యాలను గుర్తు చేశారు. ఆ తర్వాత హనుమ సాధించిన విజయం అందరికీ తెలిసిందే! -
అనుకరించటమే గొప్ప పొగడ్త!
ఏ పనినైనా అందంగా చేస్తారు కొంతమంది. ఎవరినైనా పొగడాలనుకుంటే ఆ విషయాన్ని నోటితో చెప్పనక్కరలేదు. ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెపితే అలాగా! అని అనిపిస్తుంది. అది చాలా పేలవమైన పద్ధతి. అది ఎవైరనా చెయ్యగలిగింది. దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చు. అది అతి మామూలు ఇష్టం. మీరింతటి గొప్ప వారు, అంతటి గొప్పవారు. మీరంటే నాకెంతో ఇష్టం. మీరంటే నాకు చచ్చేంత అభిమానం. మీకోసం ప్రాణాలనైనా ఆర్పిస్తాను. ఇటువంటి మాటలను తరచుగా వింటూ ఉంటాం. అవి పెదిమల నుండి వచ్చినవని తెలిసి పోతూనే ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉంటే తన్మయులమై పోతామండీ. మీ అభిరుచి చాలా గొప్పదండి! ఇలా పొగడే వారు కనపడుతూనే ఉంటారు. ఇవి నిజమైన పొగడ్తలేనా? ఇది తన ఇష్టాన్ని, గొప్పతనాన్ని ప్రకటించటం మాత్రమే. నాకు లడ్డు అంటే ఇష్టం, నాకు మల్లెపూలు అంటే ఇష్టం, నాకు తెలుపంటే ఇష్టం అని చెప్పిన దానికి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పిన దానికి పెద్ద తేడా లేదు. ఆ విధంగా చెప్పటం మనుషుల విషయంలో సరిపోదు. పసిపిల్లలని అనునయించేప్పుడు అప్రయత్నంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళలాగానే ముద్దుమాటలు మాట్లాడుతూ ఉంటారు. దానితో వాళ్ళు తమతో సమశ్రుతికి రావటం జరుగుతుంది. తనలాగా ప్రవర్తించే పిల్లలన్నా, మనవలు మనవరాళ్లన్నా తాతలకి, నాయనమ్మలకి ఇష్టం ఎక్కువ ఉండటం గమనించవచ్చు. దానికి కారణం వాళ్ళు తమని అనుకరిస్తూ ఉండటమే. అతి సన్నిహితత్వం గాని, ఇష్టం గాని ఉంటేనే కదా అనుకరించేది. తనలాగా ప్రవర్తిస్తున్నారంటే తనంటే ఇష్టం ఉందని, లేదా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని అర్థం. కారణం ఇది అని సరిగా అర్థం కాకపోయినా అంతరాంతరాల్లో సహజాతంగా అందరికి తెలుస్తుంది. ఒకప్పుడు జాతికి ఆదర్శప్రాయులు హీరోలు ఇటువంటి వారు ఉండేవారు. తరువాతి కాలంలో చలనచిత్ర నటులు తెర మీదనే కాక నిజజీవితంలో కూడా హీరోలయి పోయారు. వాళ్ళు ఎటువంటి వస్త్రాలు, నగలు ధరిస్తే అటువంటివే ధరించటం, కేశాలంకరణ కూడా అదే విధంగా చేసుకోవటం వాళ్ళు ఉపయోగించిన ఊతపదాలనే ఉపయోగించటం ... ఒకటేమిటి అన్ని విధాలా వాళ్ళ లాగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది, ముఖ్యంగా యువతరం. దీనికి కారణం ఆ వ్యక్తి అంటే ఉన్న అభిమానం. ఒక్క చెవికి కుండలం, మెడలో పెద్దపెద్ద పూసలు, పూలచొక్కాలు, పిలకలు, పోనీ టైల్స్తో తమలో ఆ ప్రతిభ లేకపోయినా ఆ వ్యక్తుల పట్ల ఉన్న ఇష్టాన్ని ప్రకటించే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. చీరలకి, గాజులకి, నగలకి ఆ చిత్రం పేరో, నటి పేరో పెట్టటం ఒక వ్యాపార రహస్యం. చిన్నతనంలో బడికి వెళ్ళటం మొదలు పెట్టిన కొత్తల్లో, ఇల్లు దాటి బయటికి అడుగుపెట్టి, కొత్తలోకం చూడటం మొదలవుతుంది. టీచర్ ఆదర్శంగా కనపడుతుంది. ఆ టీచర్ లాగా మాట్లాడటం, నడవటం, ప్రవర్తించటం మొదలు పెడతారు. ఆ టీచర్ పట్ల ఉన్న ఇష్టం లేదా గౌరవం వాళ్ళని ఆ విధంగా అనుకరించేట్టు చేస్తోంది. ఆ వయసులో పిల్లలవి స్వచ్ఛమైన మనసులు కనుక ఆ విధంగా వెంటనే ప్రకటిస్తారు. నెహ్రూ గారు కోటుకి గులాబీ పువ్వు పెట్టుకునే వారని ఆయన అభిమానులందరు ఆ రోజుల్లో కోటుకి గులాబీ పువ్వుని పెట్టుకునేవారు. భావకవిత్వాభిమానులందరూ కృష్ణశాస్త్రిగారి లాగా జులపాలు, లాల్చీ, బెంగాలీ పంచెకట్టుతో కనపడేవారు. చూడగానే చెప్పేయచ్చు వాళ్ళు భావకవులని. లాల్ బహదుర్ శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది సోమవారం రాత్రి భోజనం మానేశారు. అది ఆయన పట్ల ఉన్న అభిమానం లేక గౌరవం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ పక్కన పెట్టి వాళ్ళ తాతగారు కూర్చునే కుర్చీలో కూర్చుని ఆయన చేతికర్రని చేత పుచ్చుకుని అందరినీ అదమాయిస్తూ, గదమాయించటం మొదలు పెట్టింది చిట్టి. అప్పటివరకు గట్టిగా మాట్లాడేది కూడా కాదు. బళ్ళో వేస్తే నోరు విప్పక పోతే ఎట్లా అని భయపడ్డారు కూడా. మొదట్లో అట్లాగే ఉండేది. కానీ రెండోక్లాసులోకి వచ్చాక విపరీతంగా మారింది. మాట్లాడటం కాదు, వాగటం ఎక్కువయింది. ప్రతి మాటకి ముందు వెనక అండర్ స్టాండ్ అనటం, తను మాట్లాడేప్పుడు ఇంకెవరైనా మాట్లాడుతుంటే సెలైన్స్ అని గట్టిగా అనటం అందరికీ వింతగా అనిపించింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటానికి స్కూల్కి వెళ్లినప్పుడు సీతకి అంటే చిట్టితల్లికి అర్థమయ్యింది కారణం, మాట్లాడుతూ కళ్ళు చికిలించటం, ముక్కు ఎగపీల్చటం, మాటిమాటికి జుట్టు సరిచేసుకోవటం ... అన్నీ క్లాస్ టీచర్ లక్షణాలే. ఆవిడంటే తన కిష్టమని ఎన్నో మారులు చెప్పింది కూడా. అందుకే అప్రయత్నంగా అలా ఉండాలని ప్రయత్నం చేసింది. చిన్నతనంలో ప్రతివారికి అమ్మ, నాన్న ఆదర్శం. వాళ్ళు చేసే పనులన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ఎప్పటికైనా వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. అందుకని వాళ్ళని అనుకరిస్తారు. పెద్దల చెప్పులు వేసుకోవటం, వాళ్ళ బట్టలు కట్టుకోవటం వాళ్ళ లాగా మాట్లాడటం, నటించటం అందులో భాగాలే. తాము ఏ విధంగా అవాలనుకుంటారో దానినే అనుకరిస్తూ ఉంటారు. అందుకనే పిల్లల ఆటలని గమనిస్తే వాళ్ళ అభిరుచులు, ఆదర్శాలు అర్థమవుతాయి. కొంతమంది తోటివారిని చేర్చి నేను టీచర్, మీరు నేను చెప్పినట్టు వినాలి అంటూ అంటారు. వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో రాణించ గలుగుతారు. మరి కొంతమంది మీకు ఇంజెక్షన్ ఇస్తాను రా, అంటూంటారు. వీళ్ళు వైద్యవృత్తి పట్ల మక్కువ ఉన్న వాళ్ళు అని గుర్తించవచ్చు. అభిమానం ఉందని నోటితో చెప్పనక్కర లేదు. అనుకరిస్తే అదే బాగా అర్థమవుతుంది. వాస్తవానికి అదే అసలైన అభిమానం, నిజమైన పొగడ్త. ప్రవర్తన వల్ల ఫలానావారి అభిమానులు అని అర్థం అవుతుంది. - డా. ఎన్. అనంతలక్ష్మి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement