కరీంనగర్:జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తనవద్ద బస్చార్జీలు లేవని, తనను మల్యాల వద్ద దింపాలని అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడిని కోరాడు. అతను నిరాకరించడంతో తన వద్దనున్న మత్తుమందు చల్లాడు. దీంతో సదరు ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన సునీల్ కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక తిరుగుతున్నాడు. మంగళవారం రాత్రి జగిత్యాలకు చేరుకున్న అతడు.. అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడిపై మత్తుమందు చల్లాడు. అస్వస్థతకు గురైన సదరు ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సునిల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి వద్ద చిన్నచిన్ని మారణాయుధాలు కూడా లభించాయి. బుధవారం అతని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. యువకుడిని ఇలా వదిలిపెట్టవద్దని సూచించారు.