ఓటింగ్ శాతం ఇలా.. (తుది సమాచారం అందేసరికి..)
ప్రాంతం శాతం
విశాఖ పార్లమెంటు 68.13
అనకాపల్లి జిల్లా 70.37
అల్లూరి జిల్లా 63.09
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఓటు పోటెత్తింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓట్ల ప్రవాహం.. రాత్రి 10 గంటల వరకూ అదే జోరుతో సాగింది. గంటల తరబడి ఓటర్లు క్యూల్లో వేచి ఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి వేళలో కొన్ని ప్రాంతాల్లో జోరువానలోనూ ఓటు సంకల్పం సడలలేదు. యువతరం ఉత్సాహాన్ని మించేలా.. వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఓటర్లు వెల్లువలా తరలివచ్చారు. తమ తలరాతను మార్చే రథసారథులను ఎన్నుకోవడంలో ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ప్రతీ బూత్.. ఓటర్లతో సందడి వాతావరణం కనిపించింది. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో కొత్త ఉత్సాహం కనిపించింది. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగు పడేందుకు.. నిరంతరం ప్రజలతో మమేకమవుతున్న నాయకత్వానికే మరోసారి పట్టం కట్టేందుకు మొగ్గు చూపినట్లు ట్రెండ్ కనిపించింది. పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నా.. పెద్దా పోటీపడ్డారు. పలు బూత్ల వద్ద ఎన్నికల సంఘం సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. మొత్తంగా, విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో 68.13 శాతం, అనకాపల్లిలో 70.37 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.09 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ సరళి కొనసాగిందిలా..
ప్రతీ ఎన్నికల్లో ఉదయం, సాయంత్రం పోలింగ్ శాతం అధికంగా నమోదవుతుంది. మధ్యాహ్నం సమయంలో మందకొడిగా సాగుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం మధ్యాహ్నం కూడా ఎక్కడా ఓటింగ్ శాతం తగ్గిపోలేదు. మండుటెండలోనూ ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోవడం కనిపించింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటలకు 10.24 శాతం, 11 గంటలకు 20.47, ఒంటి గంటకు 34.75, 3 గంటలకు 47.66 శాతం నమోదైంది. అంటే మధ్యాహ్న సమయంలో సుమారు 13 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఇక 5 గంటల సమయానికి 59.39 శాతానికి పెరిగింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 68.13 శాతం నమోదైంది. అల్లూరి జిల్లాలో ఉదయం 9 గంటలకు 6.73 శాతంతో మందకొండిగా మొదలై 11 గంటలకు 18.07 శాతానికి చేరుకుంది. ఒంటి గంటకు 32.75 శాతం, 3 గంటలకు 48.67 శాతం... సాయంత్రం 4 గంటలకు 53.62 శాతంగా నమోదైంది. అప్పటికీ ఇంకా ఓటర్లు క్యూల్లో ఉండటంతో ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. అనకాపల్లి జిల్లాలో ఉదయం 9 గంటలకు 8.47 శాతం పోలింగ్తో నెమ్మదిగా నమోదై.. 11 గంటలకు 19.97 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మారింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా సగానికిపైగా పోలింగ్ పూర్తయి 53.45 శాతం నమోదైంది. తర్వాత 3 గంటలకు 58.11 శాతం, సాయంత్రం 5 గంటలకు 69.3 శాతానికి చేరి.. మొత్తంగా 70.37 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే, అప్పటికే ఓటింగ్ కోసం లైన్లో ఉన్న వారందరికీ అవకాశం ఉండటంతో రాత్రి వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం సైతం ఓటర్ల సంకల్పాన్ని భగ్నం చేయలేకపోయింది. ఒకవైపు వర్షంతో కరెంట్ సరఫరా నిలిచిపోయి.. ఓటింగ్కు ఆలస్యమవుతుందని తెలిసినప్పటికీ.. వేచి ఉండి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు వెనుదిరగకుండా క్యూలో ఉండి మరీ ఓటు వేశారు.
అడుగడుగునా ఉల్లంఘనలు
పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా బరిలో దిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. దౌర్జన్యాలకు దిగి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అనకాపల్లి జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి పోలింగ్ సిబ్బందితో సెల్ఫీలు దిగుతూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఓటమి భయంతో అధికారులపై మాటల దాడికి దిగారు. అనేక నియోజకవర్గాల్లో ఓటరు స్లిప్పులతోపాటు సూపర్ సిక్స్ హామీలతో కూడిన పత్రాలను పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది మంది పోలింగ్ సిబ్బంది కళ్లు కనపడని వారి ఓట్లను తమకిష్టమైన వారికి వేసేందుకు యత్నించారు. విశాఖ ఉత్తరలో బీజేపీ అభ్యర్థి పార్టీ జెండాను పోలింగ్ కేంద్రం సమీపంలో కట్టారు. విశాఖ దక్షిణలో కొద్దిమంది రౌడీ యువకులు ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు.
ఏజెన్సీలో ప్రశాంతంగా..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు బలగాలను మోహరించారు. కొన్ని చోట్ల వర్షం కురిసినా ఓటు వేసేందుకు గెడ్డలు దాటి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మన్యంలో మునుపెన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. మారేడుమిల్లి మండలం గుర్తేడు ప్రాంతంలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను హెలికాప్టర్లో రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. గూడెంకొత్తవీధి మండలం కప్పకొండ గ్రామస్తులు గుర్రాలపై దుప్పలవాడ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కుంకుపూడిలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. బుంగాపుట్టు పంచాయతీ పరిధిలో 19 గ్రామాలకు చెందిన 1,313 మంది ఓటర్లకు లక్ష్మీపురం పోలింగ్ కేంద్రంలో అవకాశం కల్పించారు. వీరందరినీ నాలుగు జీపుల్లో అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలించారు.
స్ఫూర్తివంతం.. వృద్ధులు, దివ్యాంగుల చైతన్యం