-
రేవంత్ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్తో మోసం చేసినట్లా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
మోదీకేనా అమిత్ షా పరోక్ష సంకేతం: చిదంబరం
ఢిల్లీ: వయసు ఎక్కువైంది కాబట్టి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రిటైర్ కావాలని అంటున్న కేంద్ర హోం మంత్రి... ప్రధాని నరేంద్ర మోడీకి పరోక్షంగా అదే సూచన చేస్తున్నారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రధాని నరేంద్ర మోదీకి వయసు విషయంలో ఓ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. మోదీ పీఎం కుర్చిని అమిత్ షా లాక్కునే ఆలోచనలో ఉన్నారని ‘ఎక్స్’వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘అధిక వయసు (77 ఏళ్లు) కారణంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను అమిత్ షా రిటైర్ కావాలంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. అధిక వయసుకు సంబంధించి ముందుగానే ప్రధాని మోదీ (73 ఏళ్ల ఏడు నెలలు)కి అమిత్ షా ఒక సంకేతం ఇచ్చారా?. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్ షా. ఎందుకు కంటే వయసు రీత్యా మోదీ కాకుండా ప్రతిపక్ష నేతగా అమిత్ షా కూర్చుంటాని తెలుస్తోంది!’’ అని చిదంబరం మండిపడ్డారు.When Mr Amit Shah said that Mr Naveen Patnaik should retire because of "advanced age" (77 years) was he throwing a hint to Mr Narendra Modi (73 years, 7 months) -- in case the BJP formed the government? It seems that Mr Amit Shah will be the happiest person if the BJP did not…— P. Chidambaram (@PChidambaram_IN) May 22, 2024 ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా సీఎం నవీన్ పట్నాయక్పై ధ్వజమెత్తారు. ‘‘నవీన్ పట్నాయక్ 77 ఏళ్లు ఉంటారు. అధిక వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రిటైర్ కావాలి. ఇక.. ఒడియా భాష స్పష్టంగా మాట్లాడే భూమి పుత్రుడిని ఒడిశాకు సీఎం చేస్తామని బీజేపీ వాగ్ధానం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఐదు విడుతల్లోబీజేపీ 310 స్థానాల్లో గెలస్తుంది. అన్ని విడతల్లో మొత్త 400 స్థానాలను కౌవసం చేసుకుంటుంది’’ అని అమిత్ షా అన్నారు. -
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
ఏపీలో రాబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు: తిరుమలలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో భాగంగా బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తన మనవడు పుట్టు వెంట్రుకలు సమర్పించి మెక్కు చెల్లించుకొన్నారు. ఇక, ఆలయం ముందు మనవడిని భుజంపై ఎత్తుకొని ఫోటోలు దిగారు సీఎం రేవంత్.దర్శనానంతరం ఆలయం ముందు సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీ సీఎంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలసికట్టుగా నడుస్తామన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకుని దేశ సంపదను పెంచాలని తమ ఆలోచన అని తెలియజేశారు. #WATCH | Tirupati: Telangana CM Revanth Reddy alongwith his family members visits Tirumala Venkateswara Temple to offer prayers to Lord Balaji. pic.twitter.com/byzWZxL3EB— ANI (@ANI) May 22, 2024 -
‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో కరెంట్ కోతలు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితిని చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నంట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నంచుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నంపాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నంరైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నంతడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాంపదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నంచివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు..క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం..!కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!జై కిసాన్జై తెలంగాణఅంటూ కామెంట్స్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024 -
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వానాకాలం నుంచి అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వరి ధాన్యానికి బోనస్ చెల్లింపు అంశంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాందీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా హామీ ఇచి్చన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం మోసానికి పరాకాష్టగా పేర్కొన్నారు. యాసంగిలో సాగు చేయని సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో 20 శాతం మాత్రమే సన్నరకం సాగు చేస్తారని, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు సాగు చేస్తారన్నారు. ‘భరోసా’రూ.5 వేలేనా? రాష్ట్రంలో దిగుబడి వచ్చే 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని హరీశ్రావు పేర్కొన్నారు. అయితే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇచ్చేందుకు రూ.500 కోట్లు సరిపోతాయని, దీనితో రూ.5,500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, గతంలో మాదిరిగా తొలి విడతలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయి పడిన రూ.2,500తో పాటు వానాకాలం సాయం రూ.7,500 కూడా కలుపుకుని జూన్ నెలాఖరులోగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు మీడియా సమావేశంలోనే మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్రెడ్డితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. -
బోనస్ అంటే తెలియనోళ్లు మొరుగుతున్నారు
ఖమ్మం వన్టౌన్: కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోసగాళ్ల కూటమి
మహారాజ్గంజ్/మోతిహరీ/ప్రయాగ్రాజ్: సార్వ త్రిక సమరంలో విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మంగళవారం బిహార్లోని మహారాజ్గంజ్, పూర్వీ చంపారన్ నియోజకవర్గాల్లో, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో ప్రసంగించారు. ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తప్పదు‘‘ సనాతన ధర్మ వ్యతిరేక భావనలు ఆ కూటమిలో నిండిపోయాయి. అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన విపక్షాల కూటమికి జూన్ 4న ఫలితాల సందర్భంగా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. వారసత్వంపై నాకు నమ్మకం లేదు. నాకు వారసులు అంటూ ఒకవేళ ఉంటే అది ప్రజలే. గతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ను అస్తవ్యస్తంగా పాలించి తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పుట్టిన నేలకు అపకీర్తి తెచ్చారు. 1990లలో బిహార్లో బెదిరింపు పన్ను వ్యవస్థ రాజ్యమేలింది.దీంతో పరిశ్రమలు, ఉపాధిలేక వేలాదిగా బిహారీలు వలస బాటపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వాలు వలస సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఎంతో కృషిచేశాయి. పంజాబ్, తెలంగాణ, తమిళనాడులో బిహార్ కూలీలపై స్థానిక కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ రాజకుటుంబం మౌనంగా ఉండిపోయింది’’దశలు దాటే కొద్దీ దిగజారిపోయారు‘‘లోక్సభ ఎన్నికల తొలి దశలోనే విపక్షాల కూటమి డీలాపడింది. రెండో, మూడో, నాలుగో, ఐదో దశకొచ్చేసరికి మొత్తం నీరుగారిపోయారు. మిగిలిన రెండు దశల్లోనూ ఇదే వరస. జూన్ 4 వచ్చే ఫలితాలతో ఆ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అసలు ఆ కూట మికి ఒక రాజకీయ కూటమి లక్షణాలే ఉండవు. అందులో ని అన్ని పార్టీల నేతలంతా కలిసి రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు. వందశాతం మోసగాళ్ల కూటమి అది. కూటమికి మూడు పెద్ద అవలక్షణాలున్నాయి. అది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి’’. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
అలహాబాద్ టు అంబేడ్కర్నగర్... యూపీలో రసవత్తర పోరు!
ఉత్తరప్రదేశ్ సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలోకి చేరిపోయాయి. ఆరో విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా బీఎస్పీ 4, ఒకటి ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరో విడతలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్అలహాబాద్... త్రివేణి సంగమంలో హోరాహోరీ ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి అలహాబాద్లో గెలుపొందారు. తర్వాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం రెండుసార్లు సమాజ్వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టుబిగించారు.2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కనపెట్టి మాజీ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెటిచ్చింది. ఇండియా కూటమి తరఫున ఎస్పీ సీనియర్ నేత కున్వర్ రియోతీ రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వవైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.సుల్తాన్పూర్... త్రిముఖ పోరు గోమతి నదీ తీరంలో కొలువుదీరిన ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే. తర్వాత కమలనాథులు పాగా వేశారు. బీజేపీ నుంచి 2014లో వరుణ్ గాంధీ గెలిచారు. 2019లో వరుణ్ పిలిభిత్కు మారగా ఇక్కడ ఆయన తల్లి మేనకా గాంధీ పోటీ చేశారు. కానీ బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ ఆమెను ఓడించినంత పని చేశారు. కేవలం 14,500 ఓట్లతో మేనక గట్టెక్కారు. ఈసారి కూడా బీజేపీ నుంచి మేనకే రేసులో ఉన్నారు.ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్ వర్మకు టెకెటిచి్చంది. బీఎస్పీ ఇక్కడ 1999, 2004ల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. అంబేడ్కర్నగర్... బీఎస్పీకి ప్రతిష్టాత్మకం! సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా జన్మస్థలమిది. 2004 దాకా అక్బర్పూర్గా ఉండేది. బీఎస్పీ కంచుకోట అయిన ఈ స్థానం నుంచి పార్టీ చీఫ్ మాయవతి మూడుసార్లు గెలిచారు. 2008లో పునర్విభజన తర్వాత అంబేద్కర్నగర్గా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రితేశ్ పాండే గెలిచారు. ఇక్కడ దళిత, కుర్మి, బ్రాహ్మణ, ముస్లిం ఓటర్లు కీలకం. బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ రితేశ్ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్నారు. దాంతో బీఎస్పీ కవార్ హయత్ అన్సారీకి టికెటిచ్చింది. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరులో బీఎస్పీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.ప్రతాప్గఢ్... కుర్మి, బ్రాహ్మణ ఓట్లు కీలకం బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్.పి.సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. ఇక్కడ కురి్మ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. కుర్మి ఓటర్లు 11%, బ్రాహ్మణ ఓటర్లు 16 శాతం ఉంటారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ కూడా ప్రభావం చూపుతారు. జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ పేరుతో కొత్త పార్టీ పెట్టి తనతో పాటు మరో ఎమ్మెల్యేనూ గెలిపించుకున్న రాజా భయ్యా మద్దతు ఈసారి ఎవరికన్నది ఆసక్తికరం.ఆజంగఢ్... ఎస్పీకి సవాల్ యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్ ఒకటి. ఓటర్లలో 21 శాతం యాదవులు, 17 శాతం ముస్లింలు, 19 శాతం దళితులున్నారు. భూమిహార్, ఠాకూర్, బ్రాహ్మణ, కాయస్థ ఓటర్లూ ప్రభావం చూపుతారు. 2014లో ములాయం సింగ్ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేశ్ ఈ సీటును ఖాళీ చేయడంతో వచి్చన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్పురీ నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్ రాజ్భర్ బరిలో ఉన్నారు.ఫూల్పూర్.. నెహ్రూ కోట ప్రయాగ్రాజ్ జిల్లాలో చరిత్రాత్మక నియోజకవర్గమిది. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యట్రిక్ కొట్టారాయన. 1962 ఎన్నికల్లో సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా గట్టి పోటీ ఇచ్చినా విజయం నెహ్రూనే వరించింది. ఆయన మరణానంతరం సోదరి విజయలక్ష్మీ పండింట్ ఇక్కడ గెలిచారు. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్ చివరిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి చాన్సే లేకుండా పోయింది! ఏళ్లుగా ఇక్కడ సమాజ్వాదీ పాగా వేసింది.2004లో మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ సమాజ్వాదీ తరఫున గెలుపొందడం విశేషం. 2014లో కేశవ్ ప్రసాద్ మౌర్య తొలిసారి ఇక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి మారడంతో వచి్చన ఉప ఎన్నికలో మళ్లీ ఎస్పీ గెలిచింది. 2019లో బీజేపీ నేత కేసరీదేవి పటేల్ విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, ఎస్పీ నుంచి అమర్నాథ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. ముగ్గురూ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తుండటం విశేషం! -
కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్
-
‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తేమ పేరుతో క్వింటాల్కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎ వరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ (U) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదని.. 500 బోనస్ సన్నబియ్యంతో మొదలు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని.. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు.‘‘మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.. రైతుల దగ్గర తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం.. తరుగు లేకుండానే ధాన్యం కొంటున్నాం.. కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం.. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటాం.. పదేళ్లలో ఏం చేయలేని వారికి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’‘ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, గత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు.మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి బోనస్ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. -
కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా నిలదీశారు మాజీమంత్రి హరీశ్రావు.‘‘ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.. వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు‘‘ అని హరీశ్రావు ట్వీట్ చేశారు.‘‘ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని హరీశ్రావు అన్నారు. -
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
దేశరాజధాని ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్యట్రిక్పై కన్నేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై, యువనాయకుడు కన్హయ్య కుమార్ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బెగుసరాయ్లో ఓడిపోయిన కన్హయ్యకుమార్ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింపడం చర్చనీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల సమీకరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్రయోగానికి దిగిందనే చర్చ జరుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్కు చెందినవారే. ఈ లోక్సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్సభ స్థానంలో భజన్పురా, బురారీ, తిమర్పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకల్పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గతంలో 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయకేతనం ఎగరేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొందగా, 2019లో 53.86 శాతం రెండోసారి విజయకేతనం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్యూ స్టూడెంట్ లీడర్గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్డేతుక్డే గ్యాంగ్ నాయకుడని బీజేపీ.. కన్హయ్య కుమార్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మనోజ్ తివారీకి కీలకంగా మారనుంది. ఇప్పటికే రెండుసార్లు గెలిచి సత్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయకుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సారథ్యం వహించడానికి ఇదొక అవకాశమనే అంచనాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడర్ కరువయ్యారు. కన్హయ్య కుమార్ గనుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయన కూడా ఢిల్లీ కాంగ్రెస్కు ఫ్యూచర్ సీఎం లీడర్గా ఎదిగే అవకాశముంది. మరి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో కమలం ఉదయిస్తుందా? హస్త రేఖలు మారతాయా? అన్నది ఓటరు చేతిలో ఉంది. -
కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురూ.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..’’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ?? అంటూ మండిపడ్డారు.‘‘ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా??. ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు’’ అని నిప్పులు చెరిగారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే.. రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం’’ అంటూ దుయ్యబట్టారు.‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు. ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు.. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్పై సమరశంఖం పూరిస్తారు.. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురూ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ??ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??ఇది ప్రజా పాలన కాదు..… pic.twitter.com/9GZoIIFJyz— KTR (@KTRBRS) May 21, 2024 -
Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్లరేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంటగ్యాస్ ధర భారంగా తయారైంది. మూడు నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రారంభమైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబి్ధదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పథకాలకు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహా నగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్లరేషన్కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. రూ.500కు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.855కు సిలిండర్.. మహా నగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం‡ ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమచేస్తూ వస్తోంది. తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికి వర్తిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది. కేంద్రం సబ్సిడీ రూ. 40.71 మాత్రమేకేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ.40.71లు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. పదేళ్ల క్రితం వరకు సబ్సిడీపై రూ.414కు మాత్రమే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్కు నగదు బదిలీ పథకం వర్తింపుజేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్ను మార్కెట్ ధర ప్రకారం రూ. 697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65 నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా.. సబ్సిడీ మాత్రం ఒక స్లాబ్కు పరిమితమైంది.వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్ జిల్లా 13.22లక్షలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 15.96 లక్షలు -
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
సాక్షి, హైదరాబాద్ /దేవరకొండ: ఎన్నికల హామీ లను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిందన్నారు. అదే తరహాలో వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలోనూ కాంగ్రెస్ పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తుండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పదిశాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుంది. కానీ దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే’ అని హరీశ్రావు పేర్కొన్నారు. 5నెలల్లోనే కుప్పకూలిన డయాగ్నొస్టిక్ వ్యవస్థతెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంపై ‘ఎక్స్’లో హరీశ్ స్పందించారు. నాణ్యమైన వైద్య పరీక్ష లను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రస్తు తం నిర్వహణలోపంతో కొట్టుమిట్టాడుతున్నా యని చెప్పారు. బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు ఝూటా హామీలు‘రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవు లకు ఝూటా హామీలు.. ఇది రేవంత్ పాలన’ అని హరీశ్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనీలాల్ ఇటీవల మరణించారు. ఆయనకు నివాళి అర్పించడానికి హరీశ్ రావు దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. -
ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలి
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్రెడ్డి గోల్డ్మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైన వేళ ‘ఎక్స్’లో ఆయన ..‘ఈరోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. బీజేపీని ఓడించి, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నట్లు మొదటి నాలుగు విడతల పోలింగ్లో స్పష్టమైంది. విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. యువత ఉద్యోగాలు, రైతులు రుణ మాఫీ, కనీస మద్ధతు ధర, మహిళలు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, కార్మికులు రోజువారీ వేతనాలు వంటి అంశాలపైనే నేటి పోలింగ్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. అమేథీ, రాయబరేలతోపాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, ఐదో దశలో పోలింగ్ జరుగుతున్న రాయ్బరేలీలో పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. రాయ్బరేలీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అయితే, మీడియాతో మాట్లాడలేదు. -
అప్పుడు జరిగినట్టే... ఇప్పుడవుతుందా?
2014లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2019లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా జరిగిన సర్టికల్ స్ట్రయిక్స్తో ఓటర్లలో బీజేపీ జాతీయభావన రేకెత్తించింది. ఫలితంగా రెండు పర్యాయాల్లోనూ బీజేపీ అనుకూల వేవ్ కనబడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ చాలా రాష్ట్రాల క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. భారీ మెజారిటీ కాకపోయినా, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది. కాంగ్రెస్ గెలిచిన 2004 లేదా బీజేపీ అఖండ విజయం సాధించిన 2019... ఏ ఫలితాలు వస్తాయన్నది ప్రశ్న!2014లో, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గాలి కనిపించినప్పటికీ, బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని ఎన్నికల నిపుణులు, రాజకీయ పండితులు కచ్చితంగా భావించలేదు. చివరకు కాషాయ పార్టీ కూడా సాధారణ మెజారిటీ మార్కును దాటగలననే నమ్మకంతో లేదు. మరోవైపున కాంగ్రెస్ పార్టీ అంత తక్కువ స్థానాలు సాధిస్తానని అసలు ఊహించలేదు. ప్రధానంగా అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం కారణంగా వచ్చిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో బీజేపీ భారీగా లాభపడింది. దాన్ని తిప్పి కొట్టే ప్రచారం లేకపోవడంతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.పనికి ఆహార పథకం, ఆహార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లక్షలాది మందిని పేదరికం నుండి బయటపడేసిన అధిక ఆర్థిక వృద్ధి వంటి పదేళ్ల యూపీఏ పాలనలో సాధించిన విజయాలను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మీది అవినీతి ఆరోపణలు, అధిక ద్రవ్యోల్బణం అంశాలను మోదీ చక్కగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను గద్దె దించాలంటూ మార్పు, సమగ్ర అభివృద్ధి గురించి ప్రచారం చేశారు. 2014 ఎన్నికలు... మార్పు కోసం జరిగిన ఎన్నికలు, అదే సమయంలో ఆశావహ ఎన్నికలు. 56 అంగుళాల ఛాతీ గల హీరో దేశాన్ని రక్షిస్తారన్న కథనం బాగా ఆకట్టుకుంది.2019లో, బీజేపీకి వ్యతిరేకంగా చాలా విషయాలు ఉన్నాయి... పెద్దనోట్ల రద్దు, హడావుడిగా విధించిన జీఎస్టీ, నెరవేర్చని అనేక వాగ్దానాల వంటివి. కాంగ్రెస్ నుండి గట్టి సవాలును ఎదుర్కొంటున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను కోల్పోతుందన్న అంచనా ఉండేది. 2019 ఫిబ్రవరి మధ్యలో పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ ప్రధాని మోదీ రేకెత్తించిన జాతీయవాద భావన క్షీణిస్తున్న బీజేపీ అదృష్టాన్ని మార్చేసింది. 2014, 2019 రెండూ వేవ్ ఉన్న ఎన్నికలు. అయితే 2024 ఎన్నికలు వేవ్ రహితం మాత్రమే కాదు, పేలవమైనవి కూడా. 2019లో రికార్డు స్థాయిలో ఓటింగ్ బీజేపీకి విపరీతంగా ఉపయోగపడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, ఈ సంవత్సరం ప్రారంభంలో రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఎన్నికల విశ్లేషకులకు ఎన్నికల్లో గెలిచే పార్టీగా ఇప్పటికీ బీజేపీనే ఫేవరేట్గా ఉన్నప్పటికీ, ఆ పార్టీ నాయకులు ఒక విచిత్రమైన భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే, పార్టీ ఊహించిన విధంగా ఎన్నికలు జరగడం లేదు. ఇండియా కూటమి బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సవాలును తటస్థీకరించడం బీజేపీకి చాలా కష్టంగా ఉంది.వాస్తవానికి, తీవ్ర పోరాటం జరుగుతున్న రాష్ట్రాలైన బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుండి వివిధ క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని హిందీ బెల్ట్ రాష్ట్రాల ఎన్నికల డైనమిక్స్ బీజేపీకి వ్యతిరేకంగా మారాయనీ, హిందుత్వ పార్టీకి తగిన మెజారిటీ పొందడం కష్టంగా ఉందనీ సూచిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం నుండి గాభరాగా మారిన మోదీ ప్రవర్తన, ప్రచారాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను, వరుసగా మూడోసారి బీజేపీ మేనిఫెస్టోలో అందించిన హామీలను ప్రచారం చేయడం మానేశారు. కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పట్ల మెజారిటీ వర్గాలను భయపెట్టి, అసహ్యించుకునేలా చేసే దిశగా ప్రచారం మారడానికి ఇదే కారణం. దీనిని భయాందోళనలకు, నిరాశకు చిహ్నంగా రాజకీయ విశ్లేషకులు అర్థం చేసుకుంటున్నారు.గత ఒకటిన్నర నెలల్లో, దేశ రాజకీయ రంగస్థలంలో చాలా జరిగాయి. పోలింగులో తక్కువ ఓటింగ్ శాతం ప్రధానమంత్రిని, ఆయన ప్రచార నిర్వాహకులను కలవరపరిచింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలవగలవా అనే ప్రశ్నను లేవనెత్తింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, రామ మందిర ప్రారంభోత్సవం లాంటిని దృష్టిలో ఉంచుకుని ఒపీనియన్ పోల్స్ అంచనా వేసినట్లుగా, పార్లమెంటులోని 543 సీట్లలో నాలుగింట మూడొంతులు బీజేపీ కైవసం అవుతాయనే భావన ప్రమాదంలో పడింది. తొలి మూడు దశల పోలింగులో ఓటింగ్ ఊపందుకోకపోవడం, ఆ పార్టీకి భారీ మెజారిటీపై ఆశలు సన్నగిల్లేలా చేసినప్పటికీ, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది.ఓటింగ్ శాతం అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపదని రాజకీయ విశ్లేషకులు, కాషాయ పార్టీ పట్ల సానుభూతిపరులైన ఎన్నికల పండితులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, రాజకీయంగా తటస్థులైన విశ్లేషకులు చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. మీడియా పండితులు, రాజకీయ నిపుణుల అభిప్రాయాలు చాలా వరకు ఊహించిన స్థాయిలోనే ఉన్నాయి: వీరి అభిప్రాయం ప్రకారం ‘ఏ విధంగానైనా మోదీ గెలుస్తారు’. అయితే చాలామంది ‘మోదీ గెలుస్తారు, కానీ తక్కువ మెజారిటీతో’ అంటూ తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ అభిప్రాయంతో సమస్య ఏమిటంటే, జీవనోపాధి సమస్యలపై ఓటర్లలో నిశ్శబ్దంగా చెలరేగుతున్న కోపాన్ని ఇది విస్మరిస్తోంది. జాతీయ సమస్యలపై కథనానికి తావు లేనప్పుడు, మోదీ డజన్ల కొద్దీ స్థానిక సమస్యలను, సామాజిక అసంతృప్తిని ఎదుర్కొంటారు. దేశమంతటా ప్రతిధ్వనించే ఒక చుట్టుముట్టే కథనాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో ఎందుకు కనుగొనలేకపోయిందో అది వివరిస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో, ఉద్యోగాలు లేనప్పుడు నిరుద్యోగ సమస్యపై ఎలా స్పందించాలి, స్తబ్ధుగా ఉన్న వేతనాలు, వ్యవసాయ సంక్షోభం గురించి విమర్శలను ఎలా ఎదుర్కోవాలి, ధరలతో సతమతమవుతున్న మహిళా ఓటర్లను ఎలా ఆకర్షించాలి అనేవి మోదీ అతిపెద్ద సమస్యలు. ఒక అంశం నుండి మరో అంశానికి స్థిరత్వం లేకుండా సాగుతున్న ప్రధాని అసంబద్ధ ఎన్నికల ప్రచారం చీకటిలో కాల్పులు జరిపే కసరత్తుగా మారిపోయింది. ఏడు దశల ఎన్నికలలో ఐదు దశలలో, చాలా సంప్రదాయ అంచనాలు తలకిందులు అయినాయి. పైగా ఓటరు సెంటిమెంటును అర్థం చేసుకుంటే, విషయాలు బీజేపీకి అనుకూలంగా లేవని తెలుస్తుంది.ఏమైనప్పటికీ, ఈ ఎన్నికలు పోటాపోటీగానే ఉన్నాయి. మోదీ ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేక సెంటిమెంట్, ఓటర్ల నిరాసక్తత వంటివి ఇండియా కూటమి మెజారిటీ మార్కును చేరుకోవడానికి కారణం అవుతాయో లేదో అంచనా వేయడం కష్టం. ఎన్నికల ఫలితాలపై రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీకి దాదాపు 300 సీట్లు వచ్చే అవకాశం ఉంది. రెండు, బీజేపీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. పైగా మొత్తంగా ఎన్డీయే 272 మార్కుకు చేరుకుంటుందా అనే సందేహాలు ఉన్నాయి. దీనర్థం రెండు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తన 2019 పనితీరును పునరావృతం చేస్తుంది. లేదా 2024లో 2004 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా మారిన రాజకీయ కార్యకర్త ప్రశాంత్ కిశోర్ మాత్రం బీజేపీ గెలుచుకునే సీట్ల సంఖ్యలో అర్థవంతమైన క్షీణతను చూడటం లేదు. మరోవైపు, రాజకీయ కార్యకర్తగా మారిన సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ బీజేపీకి కనీసం 50 నుండి 60 సీట్లు తగ్గుముఖం పట్టనున్నట్లు చెబుతున్నారు. యాదవ్ అభిప్రాయం సరైనదే కావచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయానికి రావడానికి ఆయన హిందీ బెల్టులో విస్తృతంగా ప్రయాణించారు మరి!అలీ చౌగులే వ్యాసకర్త సీనియర్ స్వతంత్ర పాత్రికేయుడు(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
జూన్ 2న సోనియాతో సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజాలు లేవని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్కు ప్రయతి్నస్తాం.. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ధర్నాల పేరుతో డ్రామాలు.. ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్ వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు. -
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీశ్రావు మండిపడ్డారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని హరీశ్రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం.కెసిఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను… pic.twitter.com/CwnErdltSu— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
అమ్మ మరణం... ఆమె ఆఖరి కోరిక నెరవేర్చిన ప్రముఖ నటి
సిట్ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్
పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్..వాఘుల్ గురించి తెలుసా..?
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
నాడు అడ్డుకుని అరెస్ట్.. నేడు ప్రత్యర్థిగా తొడగొడుతున్నాడు!
Virat Kohli: రాజస్తాన్తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
తప్పక చదవండి
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
Advertisement