పదేళ్లు సహజీవనం.. చివరకు డబ్బుల కోసం
సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేటలో శనివారం జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పదేళ్లు సహజీవనం చేసిన ఓ మహిళ కొడుకు, కూతురు, అల్లుడుతో కలిసి తన ప్రియుణ్ని అతి కిరాతంగా హత్యచేసింది. వాళ్లను కేసు నుంచి తప్పించడానికి పోలీసులకు దృశ్యం సినిమా కథ చెప్పడానికి యత్నించింది. చివరకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఇంట్లో వంట చేసినంత సులువుగా.. తన ప్రియుడి ప్రాణాలు ఎలా తీసిందో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది.
వివరాలు.. కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు. జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధపై మనసు పారేసుకున్నాడు. మొదటి భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో కష్టాలు పడుతున్న రాధ విజయ్తో సహజీవనం చేయసాగింది. అతని సహకారంతో పిల్లల్ని పెద్దచేసింది. ఈక్రమంలో రాధ కొడుకు ఇంటర్ పూర్తి చేసి ఓ మెకానిక్ షాప్లో పనిచేస్తుండగా.. కూతురికి పెళ్లి చేసింది. విజయ్ సంపాదనతో రాధ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసింది.
అయితే, కొద్ది రోజుల క్రితం రాధ కూతురు, అల్లుడు విజయ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకొన్నారు. వారు డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో రాధ-విజయ్ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం కూడా మరోమారు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో రాధ విజయ్ని గడ్డపలుగుతో కొట్టి దారుణంగా హత్య చేసింది. తన కూతరు, కొడుకు, అల్లుడిని ఈ కేసు నుంచి తప్పించడానికి మృతదేహంపై ఎక్కడా రక్తపు మరకలు, వేలిముద్రలు చిక్కకుండా ఇల్లంతా కడిగేసింది. చివరకు.. అంతా తానే చేశానంటూ ఏ మాత్రం పచ్చాత్తాపం లేకుండా రాధ తన నేరాన్ని అంగీకరించింది. కూతురు, అల్లుడుపై విజయ్ దాడి చేస్తుంటే.. వాళ్ళని రక్షించేందుకు గడ్డపారతో కొట్టి చంపేశానని చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు