వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి
కడప అగ్రికల్చర్ : దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి వారి తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సీఈ సూచించారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు.రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో, మాఢవీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయయోగీ స్వామి పాల్గొన్నారు.
సీపీఐఎంఎల్ సభలు జయప్రదం చేయాలి
బద్వేలు అర్బన్ : ఈ నెల 6, 7వ తేదీల్లో కడప నగరంలో జరగనున్న సీపీఐఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక భగత్సింగ్నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధితోపాటు సీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. అసలే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాలుగు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. 17 నెలల పాలనలో ప్రతిపక్ష పార్టీలపైన కక్షసాధింపు చర్యలు తీసుకోవడానికే సమయం కేటాయించారని అన్నారు. కడప నగరంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను కడప, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో అజెండా రూపొందించి భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. సమావేశంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు జకరయ్య, ఏరియా కమిటీ సభ్యులు బాబు, విజయరావు, నారాయణ, చంద్రపాల్, మహబూబ్బాష, శివరాం పాల్గొన్నారు.
నష్టపోయినరైతులను ఆదుకోవాలి
చాపాడు : గత నెల రెండు వారాల క్రితం నుంచి కురుస్తున్న తుపాన్ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ కోరారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ రమాకుమారికి ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 22, 23వ తేదీ నుంచి తుపాన్ వల్ల మండలంలో మడూరు, అన్నవరం, బుక్కాయపల్లె, అయ్యవారిపల్లె పంచాయతీల పరిధిలో వరి పంట నేలకొరిగి పెద్ద ఎత్తున దెబ్బతిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులను గుర్తించలేదన్నారు. ఇప్పటికై నా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించి, వారికి ప్రభుత్వ సాయం అందించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరెడ్డి, రామాంజనేయులు, మైదుకూరు పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్, సభ్యులు చంద్ర, లక్ష్మీనారాయణ, మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి


