పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం

Jul 10 2025 8:18 AM | Updated on Jul 10 2025 8:18 AM

పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం

పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం

ఏ దశలో, ఏ సమయంలో

ఎరువులు వాడాలంటే..

పంటలకు నత్రజని అవసరం చివరి దశ వరకు ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో రెండు మూడు కీలక దశల్లో వాడుకోవాలి. ఏపుగా పెరిగేందుకు, పూత, మొగ్గ దశ, పంట దిగుబడి పెరిగే దశల్లో ప్రధానంగా వాడుకోవాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో చివరి దుక్కిలో వేసుకోవాలి. దీంతో ఎరువు భూమిలో నిల్వ ఉండి కొద్దికొద్దిగా పంటకు అందుతుంది. పొటాష్‌ ఎరువులు మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తి వచ్చేలా చేస్తాయి.

పెద్దవూర: పంటల సాగులో ఎరువుల వాడకం కీలకమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌ పేర్కొన్నారు. ఏయే దశల్లో ఎంత మోతాదులో ఏయే ఎరువులు వాడాలనే దానిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎరువుల వినయోగానికి సంబంధించి రైతులు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు.

రసాయనిక ఎరువులతో నష్టం

రసాయనిక ఎరువుల వాడకం శ్రేయస్కరం కాదు. దీనివల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూసారంలో మార్పులు సంభవిస్తాయి. మరోవైపు పంట ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మిగిలి ఉండి మార్కెట్లో దాని ప్రభావంతో డిమాండ్‌ తగ్గి ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. విరివిగా, విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలి.

సేంద్రియ ఎరువులతో ఎంతో మేలు

సేంద్రియ ఎరువుల వాడకం మూలంగా అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువుతో అన్ని రకాల పంటలకు పోషకాలు అందుతాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సొంతంగా వాటిని తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్‌ మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వాడకం, జీవన ఎరువుల వాడకం ప్రాధాన్యతను గుర్తించాలి.

ఎరువుల వాడకంలో పాటించాల్సిన పద్ధతులు

● లోతు దుక్కుల వల్ల భూమి పొరలు గుల్లబారి తేమను బాగా నిల్వ ఉంచుకుంటాయి. వేసిన ఎరువును ఎక్కువ శాతం మొక్కలు తీసుకుంటాయి.

● పంటలో ఉన్న కలుపును పూర్తిగా తొలగించిన అనంతరం తేమ ఉన్న దశలోనే ఎరువులు చల్లుకోవాలి.

● సమస్యాత్మక భూముల్లో ముందుగా ఉన్న సమస్యను సరిచేసుకుని ఆ తర్వాత ఎరువులు వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

● అన్ని పోషకాల్లో నత్రజని పోషకం వృథా ఎక్కువగా ఉంటుంది. యూరియాను వేప పిండితో కలిపిగానీ, యూరియా ఎరువుతో వేప నూనె కలుపుకుని గానీ వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలవుతూ వృథా తగ్గుతుంది.

● కోల్‌థార్‌తో 2 లీటర్ల కిరోసిన్‌తో మిశ్రమం చేసి రెండు బస్తాల యూరియాలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడి, పొడి మట్టితో కలిపి 24గంటలు నీడలో ఉంచి తర్వాత నేలకు అందిస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

ఎరువుల ధరలపై అవగాహన అవసరం

ఎరువుల వాడకం ఎంత ముఖ్యమో.. వాటి ధరలపై అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఏయే ఎరువుల్లో ఏ శాతం ఎంత ఉంటుంది. నాణ్యత, ధరలు, నకిలీలు వంటి వాటిని గమనించాలి. దీనికి వ్యవసాయ అధికారులు, అవగాహన ఉన్న రైతుల సలహాలు తీసుకోవాలి.

వెదజల్లే పద్ధతి.. ప్రయోజనాలు

సాధారణంగా ఎరువులను రెండు పద్ధతుల్లో వేస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే మేలు జరుగుతుంది. వరుస క్రమంలో లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుపోయే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. వరికి కూడా ఈ పద్ధతి మేలు చేస్తుంది.

పాదుల్లో ఎరువు వేసే పద్ధతి

మొక్కల దగ్గర ఎరువులు వేసే పద్ధతి ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా కూడా తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు పొలాన్ని 2 అంగుళాల మేర లోతు చేసుకుని తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు పడేలా వేయాలి. చిన్నపాటి గుంతలు తీసి ఎరువులు వేసిన సమయంలో దానిని మట్టితో కప్పేలా చేసుకోవాలి.

06 హెచ్‌ఎల్‌ఏ 205

పెద్దవూరలో పత్తి చేనులో ఎరువులు వేస్తున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement