
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
బీబీనగర్: వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం రావిపహాడ్ తండాలో మంగళవారం జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ తండాకు చెందిన రైతు బానోతు నరేష్(25) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు,
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని యాదాద్రి టౌన్షిప్లో ముళ్ల పొదల్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మఠంపల్లి ఎస్ఐ పి. బాబు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి సుమారు 35ఏళ్లు ఉంటాయని, అతడు మఠంపల్లిలో భిక్షాటన చేస్తుండేవాడని స్థానికుల ద్వారా తెలిసిందని ఎస్ఐ పేర్కొన్నారు. అతడు రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మాధవరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఫ 11మంది బైండోవర్
మునగాల: మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో సోమవారం రాత్రి పీర్ల పండుగ సందర్భంగా ముస్లింలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇరువర్గాలకు చెందిన 11మందిని మంగళవారం మండల తహసీల్దార్ బి. రామకృష్ణారెడ్డి ఎదుట హాజరుపర్చగా వారిని బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి, యాకూబ్ పాషా, షేక్ చాంద్పాషా, షేక్ ఇయ్మాల్, షేక్ నాగుల్జానీ, షేక్ సైదా, షేక్ మన్సూర్, షేక్ జానీపాషా, మహ్మద్ అలీ, షేక్ రహీం, షేక్ షఫీ ఉన్నారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
● ఆలేరు పట్టణంలో ఘటన
ఆలేరు: రైలు పట్టాలు దాటుతున్న వృద్ధుడు ప్రమాదవశాత్తు పట్టాలపై కింద పడిపోగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలేరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్(70) మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే గేట్ సమీపంలోని మెయిన్రోడ్డు వద్దకు పని మీద వచ్చాడు. కాసేపటికి ఇంటికి తిరిగి వెళ్తూ రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా.. పట్టాల మధ్య పడిపోయాడు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వైపు రైలు వేగంగా వస్తోంది. ఇది గమనించిన వృద్ధుడు కేకలు వేయడంతో స్థానికులు కొందరు గమనించి పట్టాల పైనుంచి వృద్ధుడిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. అప్పటికే రైలు సమీపించడంతో స్థానికులు పక్కకు తప్పుకోవడంతో రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న భువనగిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మహత్యా.. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపారు.

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి