
లక్కీ డ్రా స్కీం కేసులో ముగ్గురి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: లక్కీ డ్రా స్కీం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ముగ్గురు నిందితులను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరులకు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంలో నివాసముంటున్న అడవిదేవులపల్లి మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, కొమ్ము కోటేశ్వర్రావు, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన బచ్చలకూరి శ్రీను కలిసి ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను స్థాపించారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని నెలకు రూ.1000 చొప్పున 15నెలలు కడితే ప్రతి నెల డ్రా తీసి డ్రాలో వచ్చిన పది మందికి రూ.15వేల విలువైన వస్తువులు ఇస్తామని ఆశ చూపారు. 15నెలల్లో డ్రా లో పేరు రాకున్నా.. చివరకు కట్టిన మొత్తానికి అంత విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. వారు కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారికి కమీషన్ ఆశచూపి వారి ద్వారా 2143 మందిని లక్కీ డ్రా స్కీంలో చేర్పించుకున్నారు. వారి నుంచిరూ.1.85 కోట్లు వసూలు చేసి అందులోంచి రూ.50 లక్షల వరకు డ్రాలో గెలిచిన సభ్యులకు గిఫ్టుల రూపంలో అందజేశారు. స్కీం పూర్తయిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ.1.36 కోట్లతో నిందితులు ప్లాట్లు, విలువైన ఇంటి సామగ్రి కొనుగోలు చేసి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.6,55,500 నగదు, రెండు ఓపెన్ ప్లాట్ల, ఇంటి దస్తావేజులు, ముదిమానిక్యం గ్రామంలో లీజుకు తీసుకుని నిర్మిస్తున్న ఫంక్షన్హాల్ దస్తావేజు, ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆఫీస్లో ఫర్నీచర్, రెండు ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషిన్, వాటర్ ఫ్యూరీఫయర్, లాప్ట్యాప్, కంప్యూటర్, బాధితులకు ఇవ్వడానికి తయారు చేసిన బ్రోచర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె. రాజశేఖర రాజు, సీఐ మోతీరాం, ఎస్ఐ సైదిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.